Govt Degree College: రాష్ట్రస్థాయికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాజెక్టు
![Students celebrating their success at state-level competition State Level Government Degree College Project Jijnasa competition winners from Kishtampet Government Degree College](/sites/default/files/images/2024/04/08/govt-degree-college-ts-1712572503.jpg)
చెన్నూర్రూరల్: మండలంలోని కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ విద్యార్థులు హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీల్లో ప్రతిభ చాటినట్లు ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు. కళాశాల తరఫున తయారు చేసిన ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపికయిందని పేర్కొన్నారు. చెన్నూర్ చరిత్ర, సాంఘిక జీవన ఆర్ధిక విధానంపై పరిశోధన చేసి మొదటిసారి చెన్నూర్ పట్టణం పూర్వ వైభవాన్ని ప్రస్తుత జీవన విధానాన్ని రాష్ట్రస్థాయి వేదికపై ప్రదర్శించారు. అధ్యయనంలో భాగంగా విద్యార్థులు 30 రోజులుగా వివిధ చారిత్రాత్మక కట్టడాలను సందర్శించారు. వివిధ చేతి వృత్తుల వారిని కలిసి వారి నుంచి సమాచారం సేకరించారు. అలాగే సాహితీవేత్తలు, సంగీత కళాకారులు, వరదాచార్యలు గురించి సమాచారం సేకరించారు. జనాభా, పంటల సమాచారం, ఉద్యోగాల కల్పన, జాతీయస్థాయి అవార్డులు అందుకున్న వారి గురించి ప్రాజెక్టును సమర్పించి, ప్రదర్శించడంతో రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టులో హిస్టరీ అధ్యాపకురాలు శిరీష ఆధ్వర్యంలో విద్యార్థులు మేఘన, అక్షిత, రవికిరణ్, సంపత్, రిమిన్కుమార్ పాల్గొన్నారు.