Engineering College Annual Day: ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా 47వ వార్షికోత్సవ వేడుకలు..
![Professor Bidyadar Subuddhi presenting gold medal to student](/sites/default/files/images/2024/04/07/professor-bidyadar-subuddhi-1712470704.jpg)
పెనమలూరు: విద్యార్థులు ఆధునిక విద్యపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని వరంగల్ ఎన్ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాదర్ సుబుద్ధి అన్నారు. కానూరులో శనివారం వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ 47వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రొఫెసర్ సుబుద్ధి మాట్లాడుతూ విద్యార్థులు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యను అభ్యసించాలన్నారు. ప్రధానంగా పరిశోధనలపై దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులు సాంకేతిక విద్యపై పట్టు సాధిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి మంచి ఉద్యోగాలు పొందుతారని చెప్పారు. సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు మాట్లాడుతూ యూజీసీ వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీని సిద్ధార్థ అకాడమీ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ డీమ్డ్టుబీ యూనివర్సిటీగా గుర్తించిందని తెలిపారు.
Model School Entrance Exam: నేడు మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష నిర్వహణ
ఈ సందర్భంగా కాలేజీ అధ్యాపకులను ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏవీ రత్నప్రసాద్ మాట్లాడుతూ తమ కాలేజీలో చదివిన విద్యార్థులు నేడు దేశ విదేశాల్లో రాణించి ఉన్నత హోదాల్లో ఉన్నారని చెప్పారు. నాణ్యమైన బోధనతో విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దుతామన్నారు. ఈ సందర్భంగా ఉన్నత ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను, ప్రతిభ చాటిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. అకాడమీ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.