Skip to main content

తెలంగాణ వైతాళికులు

నిద్రాణమై ఉన్నతెలంగాణ ప్రజలను జాగృతం చేయడానికి; తెలుగు భాషాభివృద్ధి, సాంస్కృతిక వికాసానికి మాడపాటిహనుమంతరావు విశేషంగా కృషి చేశారు. తెలంగాణలో ‘ఆంధ్రమహాసభ’ సంస్థాపక కార్యదర్శిగా సేవలు అందించారు. ఏటా గ్రంథాలయ మహాసభలు నిర్వహించి ప్రజలు స్వీయ సంస్కృతి, స్వీయ భాష పట్ల అభిమానం పెంచుకునేలా చేశారు. తెలంగాణ విముక్తి పోరాటానికి సూత్రధారిగా, ఆంధ్ర పితామహుడిగా చరితార్థులయ్యారు.
హైదరాబాద్ రాష్ట్రం స్వతంత్ర భారతదేశంలో విలీనమయ్యేంత వరకూ నిజాం రాజ్యంలో పౌరహక్కులు అనేక విధాలుగా ఉల్లంఘనకు గురయ్యాయి. జనాభాలో 15 శాతం మాత్రమే ఉన్న ఒక వర్గం 85 శాతం ప్రజలపై ప్రాబల్యం చూపింది. సంస్థానంలో విద్య అంతా ‘ఉర్దూ’ మాధ్యమంలోనే సాగేది. తెలుగు, కన్నడ, మరాఠా మాతృభాషగా ఉన్నవారందరూ తప్పనిసరిగా ఈ మాధ్యమంలోనే అభ్యసించేవారు. 1918లో స్థాపించిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత, వైద్య, సాంకేతిక విద్య కూడా ఉర్దూ మాధ్యమంలోనే ఉండేది. నాటి తెలంగాణలోని ఎనిమిది తెలుగు జిల్లాల్లో కేవలం 18 మాధ్యమిక పాఠశాలలే ఉండేవి. అనేక గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలు లేవు. మాధ్యమిక పాఠశాలల్లోనూ తెలుగును రెండో భాషగా బోధించేవారు. దీంతో అధిక సంఖ్యాక వర్గంలో నూటికి ముగ్గురు కూడా అక్షరాస్యులుగా లేని దయనీయ స్థితి నెలకొంది. మహ్మదీయుల్లో అక్షరాస్యత ఎక్కువగా ఉండేది. చిన్న, పెద్ద ప్రభుత్వ ఉద్యోగాల్లో వారిదే ప్రాబల్యం. సభలు, సమావేశాలు నిర్వహించకుండా ‘గస్తీ 53’ అనే సర్క్యులర్ ద్వారా అడ్డుకునేవారు. సమావేశాల్లో ఇవ్వాలనుకున్న ఉపన్యాస పాఠాన్ని ముందుగా ‘తాలుక్దార్ (జిల్లా కలెక్టర్) ఆమోదించాలి. ఇచ్చిన ‘ప్రతి’ ప్రకారం ఉపన్యాసం సాగాలి. మార్పు చేర్పులకు తావుండదు.
నిజాం రాజుల నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రాంతం పరిసర ప్రాంతాల కంటే చాలా వెనుకబడి ఉండేది. యూరప్‌లో 18వ శతాబ్దంలోనే అంతమైన ‘ఫ్యూడల్ వ్యవస్థ’ హైదరాబాద్ సంస్థానంలో 20వ శతాబ్దం మధ్య వరకూ కొనసాగింది. ఈ దుస్థితిని మందుముల నరసింగరావు ‘ఏబది సంవత్సరాల హైదరాబాద్’ గ్రంథంలో వర్ణించారు. ‘బ్రిటిష్ ఇండియా రాష్ట్రాల్లో 1885లో అమల్లోకి తెచ్చిన స్థానిక స్వపరిపాలనా పద్ధతిని హైదరాబాద్ రాజ్యంలో ప్రవేశపెట్టాలని ఆంధ్రమహాసభ వేదిక ద్వారా 1935లో నిజాం ప్రభుత్వాన్ని వేడుకున్నారంటే.. రాజకీయంగా ఇక్కడి ప్రజలు పరిసర రాష్ట్రాల్లో నివసించేవారి కంటే 50 ఏళ్లు వెనుకబడి ఉన్నట్లు గమనించవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి రాజకీయ అంధకారం నుంచి తెలంగాణ ప్రజలను జాగృతి పరచడానికి, ఆంధ్రమహాసభల ద్వారా సాంఘిక, సాంస్కృతిక, భాషాపరమైన చైతన్యం కలిగించడానికి కొత్వాల్ రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి, మాడపాటి హనుమంతరావు, కొండా వెంకట రంగారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు లాంటి ప్రముఖులు కృషి చేశారు. ఫలితంగా హైదరాబాద్ సంస్థానం నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందింది.

+ మాడపాటి హనుమంతరావు

+ రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి

+ కొండా వెంకట రంగారెడ్డి (1890-1970)

+ బూర్గుల రామకృష్ణారావు (1899-1967)

+ దేవులపల్లి రామానుజరావు

+ మఖ్దూం మొహియుద్దీన్

+ సురవరం ప్రతాపరెడ్డి

+ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు

+ అరిగె రామస్వామి

+ షోయబుల్లాఖాన్

+ పి.వి. నరసింహారావు

+ దాశరథి కృష్ణమాచార్యులు

+ దాశరథి రంగాచార్యులు

+ వెదిరె రామచంద్రారెడ్డి

+ ఖండవల్లి లక్ష్మీ రంజనం

+ ఇల్లిందల సరస్వతీ దేవి

+ ఆంధ్రయువతీ మండలి స్థాపన

+ సరస్వతీ దేవి రచనలు

+ కాళోజీ నారాయణరావు

+ ఆచార్య సి.నారాయణ రెడ్డి

+ ఆరుట్ల రామచంద్రారెడ్డి


మాడపాటి హనుమంతరావు
మాడపాటి హనుమంతరావు 1885 జనవరి 22న కృష్ణా జిల్లా నందిగామ తాలూకా పోకునూరు గ్రామంలో జన్మించారు. తండ్రి వెంకటప్పయ్య, తల్లి వెంకట సుబ్బమ్మ. హనుమంతరావు అయిదేళ్ల వయసులో ఉన్నప్పుడే తండ్రి మరణించారు. దీంతో ఆయన సూర్యాపేటలో తన మేనమామ జమలాపురం వెంకట్రావు పర్యవేక్షణలో విద్యాభ్యాసం చేశారు. వెంకట్రావు తహశీల్దార్ ఆఫీసులో ‘పేష్కారు’గా పనిచేసేవారు. ఉద్యోగరీత్యా ఆయన సూర్యాపేట, జడ్చర్ల, నల్గొండకు బదిలీ కావడంతో.. మాడపాటి ఆయా ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేశారు. హనుమంతరావు 1898లో ఉర్దూ మిడిల్ పరీక్షలో, 1900లో ఇంగ్లిష్ మిడిల్ క్లాసులో, 1903లో వరంగల్ హై స్కూల్ నుంచి మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఇంగ్లిష్, ఉర్దూతో పాటు పారశీకం, తెలుగు, సంస్కృత భాషల్లోనూ పట్టు సాధించారు. 1904లో హన్మకొండలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ‘మీర్ మున్షీ’ ఉద్యోగంలో చేశారు. తర్వాత హైదరాబాద్‌లో ‘లా’ చదివి ‘సిరస్తెదారు’గా విధులు నిర్వహించారు. 1917లో ఉద్యోగానికి రాజీనామా చేసి న్యాయవాద వృత్తి చేపట్టారు. 1941లో తన 56వ ఏట న్యాయవాద వృత్తిని విడిచిపెట్టి పూర్తిగా ప్రజాసేవకు అంకితమయ్యారు.
మాడపాటి సాహిత్య సేవ
హన్మంతరావు ఉత్తమ శ్రేణి రచయిత, కవి, సాహితీవేత్త, పండితుడు, బహు భాషా కోవిదుడు. హనుమంతరావు సహాయంతో బుక్కపట్నం రామానుజాచార్యులు అనే న్యాయవాది ‘తెలంగాణా పత్రిక’ను ప్రారంభించారు. సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన ‘గోలకొండ’, వద్దిరాజు సీతారామచంద్రరావు సంపాదకత్వంలో వచ్చిన ‘తెలుగు పత్రిక’, సబ్నవీసు వెంకట రామనరసింహారావు సంపాదకత్వంలో వచ్చిన ‘నీలగిరి’ మొదలైన పత్రికల్లో హనుమంతరావు అనేక వ్యాసాలు రాశారు. ‘ముషీరె దక్కన్’ అనే ఉర్దూ పత్రికలోనూ వ్యాసాలు రాశారు.
రచనలు: నిజాం రాష్ట్ర ఆంధ్రులు, వర్తక స్వాతంత్య్రం, వెట్టిచాకిరీ, మద్యపానం, గ్రంథాలయాలు, మన వాక్ స్వాతంత్య్రం, రుణబాధ నివారణ, మన విద్యా సమస్యలు, వ్యవసాయకులకు కొన్ని సూచనలు, గస్తీ నిషాన్ 53 వివరణ, జనపరిగణ వృత్తాంతం (1921-1931), నిజాం రాష్ట్ర ఆంధ్రుల అభివృద్ధి మార్గాలు, మొహతర్ఫా, న్యాయస్థానాలు, దేశభాషలు.
మాడపాటి ప్రసిద్ధ ఆంగ్ల గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. మొదట బంకించంద్ర ఛటర్జీ బెంగాలీ నవల ‘ఆనందమఠం’ను అనువాదం చేశారు, కానీ ప్రచురించలేదు. 1911లో ‘గారిబాల్డీ’ జీవిత చరిత్ర రచించారు. ఇది అచ్చవలేదు. 1927లో ‘రోమన్ సామ్రాజ్య చరిత్రం’, ‘క్షేత్ర కాలపు హింద్వార్యులు’ ప్రచురించారు. చింతామణి వైద్య రాసిన ‘మహాభారత సమీక్ష’ అనే గ్రంథంలోని వ్యాసాలను అనువదించారు. ఈ వ్యాసాలను ‘సుజాత’, ‘ఆంధ్రభారతీ’, ‘దేశబంధు’ పత్రికల్లో ప్రచురించారు. హృదయ శల్యం, రాణి సారంధా, ఎవరికి, ముసలిదాని యుసురు, ఆత్మార్పణ, ఎవరి తప్పు, న్యాయమా?, నిజమేనా?, ఇంకా కావలసినదేమిటి? మొదలైన కథలు సుజాత, కృష్ణాపత్రికల్లో ప్రచురించారు. 1911లో ఈయన రచించిన ‘కథాసంపుటి’ అనే ఏడు కథలతో ‘మల్లికా గుచ్ఛము’ పుస్తకాన్ని మచిలీపట్నానికి చెందిన ‘సరస్వతీ నికేతనం’ ప్రచురించింది. హనుమంతరావు ‘నిజాం రాష్ట్రంలో రాజ్యాంగ సంస్కరణలు’ రచించారు. ఇది హైదరాబాద్ ప్రజా పరిషత్ ఏర్పాటు చేసిన ఒక కమిటీ సమర్పించిన నివేదిక. నిజాం ప్రభుత్వం ‘రాజ్యాంగ సంస్కరణలు’ అంశంపై కమిటీని నియమించింది. ఈ కమిటీకి హైదరాబాద్ ప్రజల పక్షాన అభిప్రాయాలు తెలపడానికి ఉద్దేశించిన ఒక సంఘానికి మాడపాటి అధ్యక్షుడిగా వ్యవహరించారు. దీనికి సంబంధించి ఒక నివేదిక సమర్పించారు.
  • 1951లో హైదరాబాద్ నగర పురపాలక సంఘానికి మాడపాటి హనుమంతరావు ‘ప్రథమ మేయరు’గా ఎన్నికయ్యారు. 1954 వరకు ఈ పదవిలో కొనసాగారు.
  • 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థిగా మెదక్ జిల్లా గజ్వేల్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో కమ్యూనిస్టులు గెలిచారు.
  • 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మెజార్టీ లభించింది. బూర్గుల రామకృష్ణారావు నాయకత్వంలో తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది.
  • 1955లో కేంద్ర ప్రభుత్వం హనుమంతరావును పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. ఈ బిరుదు అందుకున్న తెలుగు వారిలో మాడపాటే ప్రథములు.
  • మాడపాటి హనుమంతరావుకు 1956లో ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
  • 1958లో శాసన సభ్యుల నియోజక వర్గం నుంచి లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. శాసన మండలి చైర్మన్‌గా పని చేశారు. 1958 నుంచి 1964 వరకు శాసన మండలి కార్యక్రమాలను హూందాగా, నిష్పక్షపాతంగా నిర్వహించి అందరి మన్నలను పొందారు.
  • హనుమంతరావు రాసిన ప్రాచీనాంధ్ర నగరాలు, రాజకీయ పరిజ్ఞానం, తెలంగాణాలోఆంధ్రోద్యమం (రెండు భాగాలు) గ్రంథాలను ‘ఆంధ్ర చంద్రికా గ్రంథమాల’ ప్రచురించింది.
  • మాడపాటి హనుమంతరావు మేనమామ కూతురు అన్నపూర్ణమ్మను వివాహం చేసుకున్నారు. ఈమె 1917లో మరణించారు. ఆ తర్వాత మాణిక్యమ్మతో వివాహమైంది. ఈమె ‘సిరిసిల్ల’లో జరిగిన ‘ఆంధ్ర మహిసభకు’ అధ్యక్షత వహించారు. మాడపాటి 1970 నవంబర్ 11న హైదరాబాద్‌లో మరణించారు.
గ్రంథాలయ ఉద్యమం
1901లో హైదరాబాద్ నగరంలో ‘శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం’ స్థాపించడం ద్వారా తెలంగాణలో గ్రంథాలయోద్యమానికి నాంది పడింది. ఆ తర్వాత 1904లో హన్మకొండలో ‘శ్రీ రాజరాజనరేంద్ర ఆంధ్రభాషా నిలయం’ స్థాపించారు. ఈ భాషా నిలయం స్థాపనోత్సవంలో మునగాల రాజా నాయని వెంకట రంగారావు, రావిచెట్టు రంగారావు, మైలవరపు నరసింహశాస్త్రి పాల్గొన్నారు. దీని అభివృద్ధికి మాడపాటి విశేషంగా కృషి చేశారు.
తెలంగాణ ప్రాంతంలో 1914 నాటికి 125 గ్రంథాలయాలు స్థాపించారు. వీటి ద్వారా సాహిత్య, సాంస్కృతిక, వైజ్ఞానిక సభలు, సమావేశాలు నిర్వహిస్తూ గ్రామీణ ప్రజల్లో గొప్ప చైతన్యం తీసుకొచ్చారు. ఈ ఉద్యమ నిర్వహణలో మాడపాటి హనుమంతరావుతో పాటు కొమర్రాజు లక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి, ఆదిరాజు వీరభద్రరావు, మునగాల రాజా, బూర్గుల రామకృష్ణారావు, వేలూరి రంగధామనాయుడు మొదలైన వైతాళికుల కృషి ప్రశంసనీయం.
గ్రంథాలయాల స్థాపన వల్ల యువకుల్లో మాతృభాషపై అభిమానం, గౌరవం ఏర్పడ్డాయి. తెలుగు చరిత్ర పరిశోధన పట్ల ఆసక్తి కలిగింది. క్రమంగా తెలంగాణలో ఆంధ్రోద్యమం ప్రారంభమై 1921లో తెలంగాణ అంతటా విస్తరించింది. 1921 నవంబర్ 11, 12 తేదీల్లో ‘గౌలీగూడా’లోని ‘వివేకవర్థినీ’ థియేటర్‌లో ‘నిజాం రాష్ట్ర సంఘ సంస్కరణ సభ’ నిర్వహించారు. దీనికి ప్రముఖ సంఘ సంస్కర్త, పుణే మహిళా విశ్వవిద్యాలయ స్థాపకులైన ‘మహర్షి ధోండే కేశవ కార్వే’ అధ్యక్షత వహించారు. ఆయన తన మాతృభాష మరాఠీలో, ఆ తర్వాత ఇంగ్లిష్‌లో ప్రసంగించారు. ప్రముఖ న్యాయవాది అల్లంపల్లి వెంకట రామారావు తెలుగులో ఉపన్యాసం ప్రారంభించగానే సభలో ఉన్న ఆంధ్రేతరులు అడ్డుపడి గందరగోళం సృష్టించారు. గత్యంతరం లేక అల్లంపల్లి తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించారు. ఈ సంఘటన ఆంధ్ర యువకుల్లో ఆగ్రహావేశాలు కలిగించింది. వెంకట రామారావుకు జరిగిన అవమానం తెలుగు భాషకు, తెలుగు జాతికి జరిగిన అవమానంగా భావించారు. కార్యక్రమం పూర్తి కాకముందే సభలో ఉన్న ఆంధ్ర యువకులంతా అక్కడి నుంచి నిష్ర్కమించారు. అదే రోజు (1921 నవంబర్ 12) అప్పటి హైకోర్టు న్యాయవాది ‘టేకుమాల్ రంగారావు’ ఇంట్లో 11 మంది యువకులు సమావేశమై ‘ఆంధ్ర జన సంఘం’ స్థాపించారు. తెలంగాణలో ఆంధ్రోద్యమానికి ఇదే ఆరంభం. నిజాం రాష్ట్రంలో ఆంధ్రుల మొదటి ప్రజా సంస్థ ఇదే. మొట్టమొదటి ఆంధ్ర జనసంఘం సమావేశంలో మాడపాటి హనుమంతరావును కార్యదర్శిగా ఎన్నుకున్నారు.
తెలుగు భాషాభివృద్ధి, తెలుగు చరిత్ర పరిశోధనకు కృషి చేయాలని; ఆంధ్ర బాలబాలికలకు వసతి గృహాలు, వితంతు శరణాలయాలు ఏర్పాటు చేయాలని; స్త్రీ విద్యావ్యాప్తికి బాలికా పాఠశాలలు స్థాపించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఈ సంఘం తీర్మానం ఆధారంగా 1906లో కొమర్రాజు లక్ష్మణరావు, నాయని వెంకట రంగారావు, గాడిచర్ల హరి సర్వోత్తమరావు, అయ్యదేవర కాళేశ్వరరావు కలిసి ‘విజ్ఞాన చంద్రికా మండలి’ని స్థాపించారు. కొమర్రాజు మరణించిన తర్వాత దీని పేరును ‘లక్ష్మణరాయ పరిశోధన మండలి’గా మార్చారు. ఆదిరాజు వీరభద్రరావు అధ్వర్యంలో ఈ సంస్థ ‘తెలంగాణా శాసనాలు’ అనే గ్రంథం ముద్రించింది.
కొండా వెంకట రంగారెడ్డి, మాడపాటి హనుమంతరావు హైదరాబాద్ - గౌలీగూడాలో ‘బాలసరస్వతీ గ్రంథాలయం’, నాంపల్లిలో ‘వేమనాంధ్ర భాషా నిలయం’ నెలకొల్పారు. హనుమంతరావు వెనుకబడిన వర్గాలు, హరిజనుల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. హరిజనుల్లో విద్యా వ్యాప్తి కోసం రాయ్‌కిషన్ బారిష్టర్ ఏర్పాటు చేసిన సంఘానికి హనుమంతరావు సహాయ కార్యదర్శిగా సేవలందించారు. ‘ఆది హిందూ సాంఘిక సేవా సమితి’ కార్యకర్తగా దీనజనాభ్యుదయానికి సేవ చేశారు. 1921లో ‘పరోపకారిణీ బాలికా పాఠశాల’ ద్వారా తెలంగాణలో మహిళా విద్యాభివృద్ధికి హనుమంతరావు కృషి చేశారు. బాలికలకు వారి మాతృభాషలో ఉన్నత విద్య బోధించడానికి సుల్తాన్ బజార్‌లో తెలుగు, మరాఠీ మాధ్యమాల్లో ‘ఖాన్గీ’ (ప్రైవేట్ పాఠశాల) స్థాపించారు. ఆ రోజుల్లో ప్రైవేట్ పాఠశాలలు నడపడానికి నిజాం నవాబు అనుమతించేవారు కాదు. హనుమంతరావు నిర్విరామ కృషి, రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి సహాయ సహకారాలతో నారాయణగూడలో ప్రస్తుతం ఉన్న ‘ఆంధ్ర బాలికోన్నత పాఠశాల’ అభివృద్ధి చెందింది. మాడపాటి హనుమంతరావు మరణించిన తర్వాత దీనికి ‘మాడపాటి హన్మంతరావు బాలికోన్నత పాఠశాల’ అని పేరు పెట్టారు.

రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి
నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి కొత్వాల్ (పోలీసు కమిషనర్)గా పని చేశారు. హైదరాబాద్ సంస్థానంలో ఉన్నత పదవిని అధిష్టించిన మొదటి హిందువు ఈయనే. ప్రజా సంక్షేమం కోసం, స్వజాతీయ అభ్యుదయానికి, స్వభాషా సంస్కృతీ వికాసానికి పాటుపడే అనేక సంస్థలు, ఎంతో మంది వ్యక్తులకు ఉదారంగా దానాలు చేసి గొప్ప వితరణశీలిగా పేరు పొందారు. పాలకులకు విధేయుడిగా ఉండి పరిపాలనకు విశ్వాసపాత్రుడిగా, రాజకీయ చతురుడిగా ప్రశంసలు పొందారు. నిస్వార్థం, నిరాడంబరత, సర్వమానవ సమాన దృక్పథం ఉన్న రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి ప్రజలు, పాలకుల ప్రేమాభిమానాలు చూరగొన్నారు.
వెంకట్రామారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్ తాలూకాలో 1869 ఆగస్టు 21న జన్మించారు. వీరిది మధ్యతరగతి కుటుంబం. తండ్రి పాశం కేశవరెడ్డి. తల్లి బారమ్మ ఈయన పసికందుగా ఉన్నప్పుడే మరణించారు. ఈయన ఇంటి పేరు ‘పాశం’ అని చాలామందికి తెలియదు. ‘కొత్వాల్ రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి’ పేరుతోనే ప్రసిద్ధి పొందారు. ఈయన తొమ్మిదేళ్ల వయసు వచ్చేవరకు అమ్మమ్మ ఊరైన ‘రాయణిపేట’లో ఉన్నారు. అక్కడే ‘ఖాన్గి’ పాఠశాలలో విద్య అభ్యసించారు. తర్వాత రాయణిపేటకు తొమ్మిది మైళ్ల దూరంలో ఉన్న ‘వనపర్తి’ పాఠశాలలో ఉర్దూ, పారశీకం నాలుగేళ్లపాటు చదివారు. ఈయన మేనమామ విలియం వాహబు రాయచూరులో పోలీసు సదరె మొహతమీం పదవి నిర్వహించేవారు. ఆయన వద్ద కొంత కాలం ఉండి అక్కడి పాఠశాలలో మరాఠీ, కన్నడ భాషలు కూడా అభ్యసించారు. మేనమామ మరణం తర్వాత వెంకట్రామారెడ్డి తిరిగి స్వగ్రామం వచ్చి మిత్రుల సహకారంతో హైదరాబాద్‌లో పోలీసు శాఖలో అమీన్‌గా నియమితులయ్యారు.
వెంకట్రామారెడ్డి మొదటగా 1886లో ముదిగల్లు ఠాణాకు అమీన్‌గా నియమితులయ్యారు. యువకుడైన ఈయనకు ఠాణాలో ఎంతో అనుభవం ఉన్న ‘మొహరీర్’ అన్ని విషయాల్లో సహాయ పడుతూ ఉండేవారు. ఆ తర్వాత యాదగీర్ ఠాణాకు బదిలీ అయ్యారు. అక్కడ జరిగిన మత కలహాలను అదుపు చేసి వెంకట్రామారెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఎలగందల (నేటి కరీంనగర్) జిల్లా పోలీసు ‘మొహితమీం’గా పని చేసి 1942లో గుల్బర్గా జిల్లాకు పోలీసు అధికారిగా నియమితులయ్యారు.
హైదరాబాద్ నగరానికి ‘కొత్వాల్’ను నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్వయంగా నియమించేవారు. నాటి కమిషనర్ ఇమాద్ జంగ్ మరణించడంతో నిజాం నవాబు ఆ పదవికి వెంకట్రామారెడ్డిని నియమించారు. గ్రామ పటేల్, పట్వారీ వతన్‌ల మాదిరిగా నగర కొత్వాల్ పదవి వంశపారంపర్యంగా ఉండేది. వెంకట్రామారెడ్డి కంటే ముందు తాలిబుద్దౌలా, గాలిబుద్దౌలా, నవాబ్ జొరావర్‌జంగ్, నవాబ్ అక్బర్ జంగ్, నవాబ్ ఇమాద్ జంగ్ ‘కొత్వాల్’ కొలువు నిర్వహించినవారిగా ప్రసిద్ధిగాంచారు.
వెంకట్రామారెడ్డి పోలీసు శాఖలో అనేక మార్పులు తీసుకొచ్చారు. నాటి సమాజంలో ఉన్నత వర్గాల వారికే కొత్వాల్‌ను కలిసే అవకాశం ఉండేది. సామాన్య ప్రజలు పోలీసు అధికారుల వద్దకు వెళ్లడమనేది అంత తేలికైన విషయం కాదు. వెంకట్రామారెడ్డి ఈ విధానానికి స్వస్తి పలికి అన్ని వర్గాల ప్రజలకు సహాయ సహకారాలు అందించారు.
ప్రజోపయోగ కార్యక్రమాలు
నాడు ‘నగర కొత్వాల్’ పురపాలక, అనేక ప్రభుత్వేతర, ప్రజా సంఘాల్లో సభ్యులుగా ఉండేవారు. వెంకట్రామారెడ్డి హైదరాబాద్ నగర డ్రైనేజీ స్కీం కమిటీ కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. ప్లేగు నివారణ సంఘం, విక్టోరియా మెమోరియల్ అర్బనేజ్, నగరాభివృద్ధి సమితి (ఆరాయి షేబల్దా), సర్ఫేఖాస్ గౌరవ కమిటీ, కోపరేటివ్ సొసైటీ లాంటి సంస్థల్లో గౌరవ సభ్యులుగా కొత్వాల్‌కు స్థానం ఉండేది. దీంతో పాటు ఉస్మానియా వైద్యశాల, కుష్టు నివారణాశ్రమం, అనాథ పిల్లల (లావారిస్) విచారణ సంఘం, న్యాయవ్యవస్థ, రెవెన్యూ, మున్సిపల్ తదితర సంస్థల్లో సభ్యులుగా కొత్వాల్ సేవలందించారు.
వైస్రాయ్ వేల్స్ యువరాజు హైదరాబాద్ సందర్శించిన సమయంలో వెంకట్రామారెడ్డి నగరంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. 1921లో నిజాం నవాబు జన్మదినం సందర్భంలో ఈయనకు ‘రాజా బహద్దూర్’ బిరుదు ప్రదానం చేశారు. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్’ (ఓబీఈ) బిరుదును ఇచ్చి గౌరవించింది. హైదరాబాద్ నగరంలో ఈయన నెలకొల్పిన ప్రజా సంస్థలు గొప్ప సేవలు అందించాయి. నగరంలోని సాంఘిక సేవా సంస్థలకు ఈయన అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించారు.
వెంకట్రామారెడ్డి 1933లో పదవీ విరమణ చేశారు. దాదాపు 48 ఏళ్లు ఉద్యోగం చేశారు. తర్వాత నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈయనను ‘సర్ఫేఖాస్’ (నిజాం నవాబు సొంత భూములు) ప్రత్యేక అధికారిగా నియమించారు.
రెడ్డి హాస్టల్ స్థాపన
వెంకట్రామారెడ్డి కొత్వాల్‌గా ఉన్నప్పుడు నగరంలోని హిందూ విద్యార్థులు సరైన భోజన, వసతి సౌకర్యాలు లేక అనేక బాధలు పడుతున్నట్లు ఆయన దృష్టికి వచ్చింది. వనపర్తి రాజా రెండో కుమార్తె వివాహానికి అనేక మంది దేశ్‌ముఖ్‌లు, ధనవంతులు, సంస్థానాధీశులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల వసతి - భోజనాలపై చర్చ జరిగింది. వెంకట్రామారెడ్డి హాస్టల్ వసతి నిర్మాణ బాధ్యతలు స్వీకరిస్తే ఆర్థిక సహాయం అందిస్తామని ప్రముఖులు ముందుకొచ్చారు. అప్పటికప్పుడే రూ. 80 వేలు విరాళంగా ప్రకటించారు. ‘రెడ్డి హాస్టల్’కు కార్యదర్శిగా ఉండి వెంకట్రామారెడ్డి ఒక శాశ్వత భవనాన్ని నిర్మించారు. రెడ్డి వసతి గృహం అనే పేరున్నప్పటికీ దీని ద్వారా ఇతర కులాల విద్యార్థులు కూడా సౌకర్యాలు పొందారు.
స్త్రీ విద్య
హైదరాబాద్ సంస్థానంలో స్త్రీలు విద్యాభ్యాసం చేసే పరిస్థితులు లేవు. మాడపాటి హనుమంతరావు స్థాపించిన ఆంధ్ర బాలిక పాఠశాలకు వెంకట్రామారెడ్డి అనేక విధాలుగా సహకారం అందించారు. పరోపకారిణీ పాఠశాల, రెడ్డి బాలికా వసతి గృహం, రిఫాయె ఆం - పాఠశాల, లేడీసు క్లబ్బు, గొల్లఖిడ్కీ బాలికా పాఠశాల, సికింద్రాబాద్ బాలికా పాఠశాలల అభివృద్ధికి ఈయన చేసిన కృషి అమోఘం. వీటితో పాటు నగరంలో శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం, వేమనాంధ్ర భాషా నిలయం, బాలసరస్వతీ గ్రంథాలయం లాంటి సంస్థల పురోగతికి ఈయన ఎంతగానో తోడ్పడ్డారు.
వెంకట్రామారెడ్డి తెలంగాణ ఆంధ్ర మహాసభలో అతివాదులు - మితవాదుల మధ్య అభిప్రాయ భేదాలు పరిష్కరించారు. సురవరం ప్రతాపరెడ్డి స్థాపించిన ‘గోలకొండ’ పత్రికకు సహకారం అందించారు. 1926 నుంచి 1946 వరకు అది దినపత్రికగా రూపొందే వరకూ వెంకట్రామిరెడ్డి ప్రోత్సాహం ఉంది.
1953లో వెంకట్రామారెడ్డి రూ. 25 వేల విలువైన తన భవనాల ఆస్తిని ట్రస్టుగా నమోదు చేశారు. దీనిపై వచ్చే ఆదాయాన్ని రెడ్డి విద్యార్థి వసతి గృహం, ఆంధ్ర బాలికా పాఠశాల, ఆంధ్ర విద్యాలయం, మహిళా కళాశాల.. ఈ నాలుగు సంస్థలు సమానంగా అనుభవించేవిధంగా ఏర్పాటు చేశారు.
రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి బాల్య వివాహాలకు వ్యతిరేకి. పురుషులతోపాటు స్త్రీలకు సమాన హక్కులుండాలని కోరుకునేవారు. అస్పృశ్యతా నివారణ, హరిజనోద్ధరణకు కృషి చేశారు. అనాథ బాలుర ఆశ్రమం, కుష్టు నివారణ సంఘం, జీవ హింస నివారణ సమితి లాంటి సంఘాల్లో సభ్యులుగా ఉండి సహాయం అందించారు.
భాషా సేవ
వెంకట్రామారెడ్డికి తెలుగు, పార్శీ, మరాఠీ, ఉర్దూ, కన్నడ భాషల్లో పరిజ్ఞానం ఉంది. ఆంగ్లంలోనూ కొంత పరిజ్ఞానం ఉంది. ఈయన కళాప్రియులు. లలిత కళలు, భాషా సారస్వతాలు, క్రీడలు, కవులు, గాయకులను ఆదరించేవారు. ఆయన 1953 జనవరి 25న తన 84వ ఏట మరణించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగర ప్రజల పక్షాన నాటి రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి అధ్యక్షతన నారాయణగూడ కూడలిలో వెంకట్రామారెడ్డి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించారు.

కొండా వెంకట రంగారెడ్డి (1890-1970)

కొండా వెంకట రంగారెడ్డి ‘అత్రాపు బల్దా’ (హైదరాబాద్) జిల్లాలోని ‘మంగళారం’ గ్రామంలో 1890లో జన్మించారు. తండ్రి చెన్నారెడ్డి, తల్లి బుచ్చమ్మ. చెన్నారెడ్డి గ్రామ పోలీసు పటేల్‌గా పనిచేశారు. నాడు అత్రాపు బల్దా జిల్లాలోని భూములన్నీ నిజాం నవాబు సర్ఫేఖాస్‌గా ఉండేవి. ఈ భూముల నుంచి వచ్చే ఆదాయాన్ని నవాబు సొంత ఖర్చుల కోసం (సర్ఫేఖాస్) వినియోగించేవారు. ఇలాంటి గ్రామాల్లో ప్రజా సంక్షేమాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వ పాఠశాలలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నారెడ్డి సొంత ఖర్చులతో ఒక వీధి బడిని ఏర్పాటు చేసి విద్యాభ్యాసం చేసే అవకాశం కల్పించారు. తండ్రి స్థాపించిన వీధిబడిలోనే కొండా వెంకటరంగారెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు.
మిడిల్ స్కూల్ విద్యాభ్యాసం తర్వాత 1909లో ‘వకాలత్’ (న్యాయశాస్త్రం)లో పట్టా పొందారు. తర్వాత న్యాయశాస్త్రంలో ‘దర్జెదువ్వం’, ‘దర్జె అవ్వల్’ సర్టిఫికెట్లు పొందారు. హైకోర్టులో ‘దర్జె అవ్వల్’ వకీల్‌గా శిక్షణ పొందారు. తెలంగాణ ప్రాంతంలో న్యాయవాద వృత్తికి సంబంధించిన పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ‘లా ఇన్‌స్టిట్యూట్’ను ఏర్పాటు చేసి 1911 నుంచి 1923 వరకు సేవలు అందించారు. కొండా వెంకటరంగారెడ్డి 1910 నుంచి 1920 వరకు అనేక రెవెన్యూ, సివిల్, క్రిమినల్ కేసుల్లో విజయం సాధించారు. 1935 నుంచి 1940 వరకు హైకోర్టులో ‘వకాలత్’ చేశారు.
వెంకట రంగారెడ్డి ప్రజాసేవ
నిజాం పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు ప్రజలపై జరిపే అత్యాచారాలు, అన్యాయాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, రైతుల న్యాయమైన హక్కుల కోసం వెంకటరంగారెడ్డి ధైర్యంగా పోరాడారు. ఈయనకు భూస్వాములు, జాగీర్దార్ల కేసులు వచ్చేవి కాదు. పేద రైతుల పక్షాన న్యాయ పోరాటం చేసి అనతికాలంలోనే తెలంగాణ ప్రజల ‘దీనజన బాంధవుడు’, ‘పేదల పెన్నిధి’, ‘రైతు బాంధవుడు’గా పేరు పొందారు.
నిజాం ప్రభుత్వం నెలకొల్పిన శాసన పరిషత్‌కు కొండా వెంకటరంగారెడ్డి 1939లో న్యాయవాదుల స్థానం నుంచి ఎన్నికయ్యారు. శాసన పరిషత్‌లో ప్రజాభ్యుదయం, సామాజిక న్యాయానికి దోహదం చేసే అనేక బిల్లులు ప్రవేశపెట్టారు. ఈయన ప్రవేశపెట్టిన బిల్లుల్లో ముఖ్యమైనవి.. స్త్రీలకు వారసత్వ హక్కు, బాల్య వివాహాల నిషేధం, వితంతు వివాహాలు చట్ట సమ్మతం, అంటరానితనం నిర్మూలన, జాగీర్దారీ విధానం రద్దు, సంస్థానంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పాటు, బావుల కింద వ్యవసాయం చేసే భూములపై నీటి పన్ను రద్దు చేయడం. వీటిని నిజాం నవాబు అనుమతితో శాసనసభలో ప్రవేశపెట్టాల్సి ఉండేది. అత్యధిక మంది ప్రజలు ఈ సంస్కరణలకు వ్యతిరేకమనే కారణంతో నిజాం నవాబు ఈ బిల్లులను తిరస్కరించారు. ఒక్క బాల్య వివాహాలకు సంబంధించిన బిల్లును మాత్రమే ప్రజాభిప్రాయ సేకరణకు నవాబు అంగీకరించారు. దీని కోసం హైకోర్టు న్యాయమూర్తిని నియమించారు. అయినప్పటికీ ఈ అభ్యుదయకరమైన, విప్లవాత్మక బిల్లులు ఇతర ప్రాంతాల సాంఘికోద్యమాలపై ప్రభావం చూపాయి.
కొండా వెంకటరంగారెడ్డి 1886 నుంచి 1917 వరకు హైదరాబాద్ హైకోర్టు జ్యుడీషియల్ కమిటీ వెలువరించిన తీర్పులన్నింటినీ క్రోఢీకరించి రెండు సంపుటాలుగా ప్రచురించారు. ఇది న్యాయవాదులకు ఎంతో ఉపయోగకరమైన గ్రంథంగా గుర్తింపు పొందింది.
కొండా వెంకటరంగారెడ్డి తదితరుల ప్రోత్సాహంతో 1918లో రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి ‘రెడ్డి హాస్టల్’ స్థాపించారు. దీనికి వెంకటరంగారెడ్డి కార్యదర్శిగా పదేళ్లు సేవలందించారు. రెడ్డి హాస్టల్‌ను మొదట ‘రెడ్డి బోర్డింగ్’గా వ్యవహరించేవారు. తర్వాత ఇది రెడ్డి హాస్టల్‌గా రూపాంతరం చెందింది. కొండా వెంకటరంగారెడ్డి దీనికి కార్యదర్శిగా, కోశాధికారిగా, అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేశారు.
ముఖ్యమైన అంశాలు
  • రెడ్డి జనసంఘం పక్షాన తెలుగు బోధనాభాషగా జాంబాగ్‌లో మాధ్యమిక పాఠశాలను ఏర్పాటు చేయడంలో వెంకటరంగారెడ్డి విశేషమైన కృషి చేశారు.
  • షా అలీబండాలో ఉన్నత పాఠశాల, ఫీల్ఖానాలోని ఆంధ్ర సరస్వతీ బాలికా పాఠశాలను ఈయన అభివృద్ధి చేశారు.
  • నారాయణగూడలోని బాలికోన్నత పాఠశాల, లాల్ దర్వాజలోని వెంకట్రావు స్మారక నిధి ఉన్నత పాఠశాల, ఆర్.బి.వి.ఆర్. మహిళా కళాశాల, గగన్‌మహల్‌లోని ఆంధ్ర విద్యాలయ కళాశాల (ప్రస్తుత ఏవీ కాలేజ్), చిక్కడపల్లిలోని ఆంధ్ర విద్యాలయం మొదలైనవన్నీ నేటికీ ఉత్తమ విద్యా సంస్థలుగా సేవలందిస్తున్నాయి. వీటి అభివృద్ధిలో వెంకటరంగారెడ్డి కృషి ఉంది.
  • కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, వేమనాంధ్ర భాషా నిలయం, బాల సరస్వతీ గ్రంథాలయం, ఆంధ్ర సారస్వత పరిషత్, దక్షిణ భారత హిందీ ప్రచార సభ, ఇందిరా సేవా సదన్, గ్రంథాలయాల స్థాపనలోనూ కొండా వెంకటరంగారెడ్డి విశేష కృషి చేశారు.
  • కొండా వెంకటరంగారెడ్డి 70వ జన్మదినం సందర్భంగా 1960లో ఆయన పేరు మీద ఆర్.బి.వి.ఆర్. మహిళా కళాశాల ఆవరణలో ‘రెడ్డి బాలికా వసతి గృహం’ నిర్మించారు.
  • 1921లో ‘ఆంధ్ర జన సంఘం’ స్థాపించడంలో ఈయణ్ని మూల పురుషుడిగా పేర్కొంటారు.
  • జోగిపేటలో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన ఆంధ్ర మహాసభ మొదటి సమావేశం జరిగింది. ఇందులో రంగారెడ్డి కీలకపాత్ర పోషించారు.
  • 1936లో షాద్‌నగర్‌లో నిర్వహించిన 5వ, 1943లో హైదరాబాద్‌లో నిర్వహించిన 7వ ఆంధ్ర మహాసభలకు కొండా వెంకటరంగారెడ్డి అధ్యక్షుడిగా వ్యవహరించారు.
  • హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో కలవాలని 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొండా వెంకటరంగారెడ్డి తెలంగాణ జిల్లాల్లో పర్యటించి ప్రజలను ఉత్తేజపరిచారు.
  • తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రజాకార్ల దురాగతాలు.. ముఖ్యంగా దోపిడీలు, గృహ దహనాలు నిత్యకృత్యమవడం వల్ల భారత ప్రభుత్వం కె.ఎం. మున్షీని హైదరాబాద్ ఏజెంట్ జనరల్‌గా నియమించింది. వెంకటరంగారెడ్డి ఆయనకు తెలంగాణ ప్రజల బాధలను వివరించారు.
  • భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 13న హైదరాబాద్ సంస్థానంపై ‘పోలీసు చర్య’ జరిపింది. రజాకార్ల నాయకుడైన సయ్యద్ కాశిం రజ్వీ బందీ అయ్యాడు. మేజర్ జనరల్ చౌదరీ మిలటరీ గవర్నర్‌గా నియమితుడయ్యాడు.
  • 1950లో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రంలో మిలటరీ ప్రభుత్వాన్ని రద్దుచేసి సీనియర్ ఐసీఎస్ అధికారి ఎం.కె. వెల్లోడిని ముఖ్యమంత్రిగా నియమించింది.
  • భారత పార్లమెంట్‌కు హైదరాబాద్ సంస్థానం నుంచి 25 మంది సభ్యులను నియమించారు. వీరిలో కొండా వెంకటరంగారెడ్డి ఒకరు.
  • 1952లో హైదరాబాద్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది.
  • హైదరాబాద్ సంస్థానంలో బూర్గుల రామకృష్ణారావు నాయకత్వంలో 1952లో మొదటి ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. ఈయన మంత్రివర్గంలో వెంకటరంగారెడ్డి ఎక్సైజ్, కస్టమ్స్, అటవీశాఖలు నిర్వహించారు.
  • కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం ‘ఫజల్ అలీ’ అధ్యక్షతన కమిటీ నియమించింది. హైదరాబాద్ విభజన జరగాలని ఈ కమిటీ పేర్కొంది. తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా రూపొందించాలని పేర్కొంది.
  • రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ (ఎస్‌ఆర్‌సీ) నివేదిక తర్వాత అనేక తర్జనభర్జనలు జరిగాయి.
  • కొండా వెంకటరంగారెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని వాదించారు. ఈయన నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది.
  • నాటి హైదరాబాద్ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి మర్రి చెన్నారెడ్డి తెలంగాణ జిల్లాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయం సేకరించారు. అత్యధిక ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కోరుతున్నట్లు ఆయన ప్రకటించారు.
  • ఇదే సమయంలో కొంత మంది విశాలాంధ్ర ఏర్పాటు కోసం ఉద్యమించారు.
  • ఆంధ్రా - తెలంగాణ నాయకుల మధ్య పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది.
  • ఈ ఒప్పందం ప్రకారం 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. దీనికి నీలం సంజీవరెడ్డి ప్రథమ ముఖ్యమంత్రి అయ్యారు.
  • కొండా వెంకటరంగారెడ్డి పేరు మీదే రంగారెడ్డి జిల్లా పేరు వచ్చింది.
  • 1957లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో రంగారెడ్డి శాసనసభకు తిరిగి ఎన్నికయ్యారు.
  • దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలోనూ కొండా వెంకటరంగారెడ్డి పనిచేశారు.
  • 1962లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఠా తగదాల ఫలితంగా రంగారెడ్డి ఓడిపోయారు.
  • 1969లో తెలంగాణాను తిరిగి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే ఉద్యమానికి రంగారెడ్డి నాయకత్వం వహించారు.
1970 జూలై 24న కొండా వెంకట రంగారెడ్డి మరణించారు. తెలంగాణ ప్రజల హక్కులు, విద్యాభివృద్ధి, రైతులు, పేద ప్రజల అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ప్రశంసనీయమైంది.

బూర్గుల రామకృష్ణారావు (1899-1967)

హైదరాబాద్ సంస్థాన జాతీయోద్యమ చరిత్రలో బూర్గుల రామకృష్ణారావు నిర్వహించిన పాత్ర, తెలంగాణా విజ్ఞాన, వికాసాలకు ఆయన చే సిన కృషి మరువరానిది. విలీనానికి పూర్వం స్వతంత్ర భారత ప్రభుత్వం తరఫున హైదరాబాద్‌లో ఏజెంట్ జనరల్‌గా ఉన్న కె.ఎమ్. మున్షీ.. ‘హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడంలో బూర్గుల ముందుచూపు, విజ్ఞత, రాజనీతిజ్ఞత, విచక్షణ, మేధావితనం నాకు ఎంతగానో ఉపకరించాయి’ అని ప్రశంసించారు. బూర్గుల గొప్ప న్యాయవాదిగా పేరు పొందారు. ఆయన బహుభాషా కోవిదుడు, పరిపాలనాదక్షుడు, కవి, పండితుడు, విమర్శకుడు.

మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో 1899 మార్చి 13న నరసింగరావు, రంగనాయకమ్మ దంపతులకు బూర్గుల జన్మించారు. బూర్గుల ఇంటిపేరు పుల్లంరాజు. ఆయన స్వస్థలం బూర్గుల కావడంతో అదే ఆయన ఇంటిపేరుగా మారింది.
బూర్గుల 12 ఏళ్ల వయసులో హైదరాబాద్ వచ్చి ధర్మవంత్ పాఠశాలలో ఏడో తరగతిలో చేరారు. నిజాం కళాశాల నుంచి ఇంటర్మీడియెట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 1920లో పుణేలోని ఫెర్గూసన్ కళాశాల నుంచి బీఏ ఆనర్స్ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత బొంబాయిలో ఎల్.ఎల్.బి. పట్టా పొందారు. అక్కడే కొంతకాలం అంజుమనె ఇస్లామియా హైస్కూల్లో పారశీక భాష బోధించారు. హైదరాబాద్ సంస్థానం సమస్యల గురించి పత్రికల్లో వ్యాసాలు రాశారు.
బూర్గుల విద్యార్థి దశలోనే ప్రజాహిత కార్యక్రమాల్లో ఆసక్తి చూపేవారు. 1916లో కొంతమంది సహాధ్యాయులతో కలసి వామన నాయక్ అధ్యక్షతన ‘హైదరాబాద్ యంగ్ మెన్స్ యూనియన్’ సంస్థ స్థాపించారు. దీనికి రామకృష్ణారావు కార్యదర్శిగా పనిచేశారు. ఈయనపై పుణే రాజకీయాలు, అక్కడి జాతీయవాదుల ప్రభావం ఉంది. ఈ స్ఫూర్తితో తెలంగాణాలో జాతీయోద్యమానికి కృషి చేశారు. 1921లో మాడపాటి హనుమంతరావుతో కలిసి ఆంధ్ర జనసంఘం స్థాపించారు. ఇది తెలంగాణాలో రాజకీయ, సాంఘిక చైతన్యం కలిగించడానికి విశేషంగా కృషి చేసింది. జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌ల అన్యాయాలను ఎదిరించడం; వెట్టిచాకిరి నిర్మూలన కోసం ఈ సంస్థ కృషి చేసింది. గ్రామాల్లో గ్రంథాలయాలు స్థాపించి వాటి ద్వారా రాత్రి పాఠశాలలు నిర్వహించి విద్యా వికాసానికి ఈ సంస్థ తోడ్పడింది.
1931లో నల్లగొండ జిల్లాలోని ‘దేవరకొండ’లో నిర్వహించిన రెండో ఆంధ్ర మహాసభకు బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ సభ చరిత్రాత్మకమైంది. ఇందులో ‘గస్తీ నిషాన్ తిర్పన్’ సర్క్యులర్ నంబర్ 53ని ఉపసంహరించాల్సిందిగా నిజాం ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. ఈ మహాసభ నిర్వహించుకోవడానికి నిజాం ప్రభుత్వం కొన్ని షరతులతో అనుమతి ఇచ్చింది. అవి.. సభాధ్యక్షుడు రాష్ట్ర నివాసి అయుండాలి. మహాసభలో జరిగే చర్చలన్నీ రాజకీయేతర అంశాలై ఉండాలి. ఏదైనా విషయం ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఉంటే భవిష్యత్తులో ఇలాంటి సభలకు అనుమతి ఇవ్వరు. ఇలాంటి నిబంధనలు పెట్టినప్పటికీ రెండో మహాసభ విజయవంతమైంది. ఈ సభకు ‘హైదరాబాద్ బులిటెన్’ పత్రికా సంపాదకుడు బుక్కపట్నం రామానుజాచారి (బి.ఆర్.చారి); ‘ప్రజామిత్ర’ సంపాదకుడు, సుప్రసిద్ధ చలన చిత్ర దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం; దేశభక్త బిరుదాంకితులైన వామన నాయక్; సుప్రసిద్ధ సంఘసంస్కర్త బాజీ కిషన్‌రావు; బారిష్టర్ శ్రీనివాస శర్మ తదితరులు హాజరయ్యారు. తెలంగాణాలో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశాలన్నింటిలో రామకృష్ణారావు నిర్వహించిన పాత్ర శ్లాఘనీయమైంది. బూర్గుల రామకృష్ణారావు 1927లో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయానికి కార్యదర్శిగా పనిచేశారు.
1923లో మౌలానా మహమ్మద్ అలీ అధ్యక్షతన కాకినాడలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభ జరిగింది. హైదరాబాద్ నుంచి వామన్ నాయక్ నాయకత్వంలో వెళ్లిన ప్రతినిధుల్లో రామకృష్ణారావు ముఖ్యులు. ఆ సభలో ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన నాయకుల ఉపన్యాసాలను రామకృష్ణారావు హిందీ నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. ఈ అనువాద తీరును సరోజినీ నాయుడు ప్రశంసించారు.

హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్
1936లో సిద్ధనహళ్లి కృష్ణశర్మ, బూర్గుల రామకృష్ణారావు, రామాచారి, రామకృష్ణధూత్, స్వామి రామానంద తీర్థ, గోవిందరావు నానల్ కలిసి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపనకు కృషి చేశారు. దీంతో కృష్ణశర్మను హైదరాబాద్ రాజ్యం నుంచి బహిష్కరించారు. దీనికి నిరసనగా కొంత మంది నాయకులు సత్యాగ్రహం చేశారు. సోషలిస్టు నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ హైదరాబాద్‌లో అడుగు పెట్టకూడదని నిజాం ప్రభుత్వం నిషేధం విధించింది. దీన్ని ధిక్కరించిన రామకృష్ణారావు తొలిసారిగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. సంస్థానంలోని ప్రజల్లో రోజురోజుకీ రాజకీయ చైతన్యం అధికమవుతోందని నిజాం నవాబు దివాన్ బహద్దూర్ అరవముద్ అయ్యంగార్ అధ్యక్షతన రాజకీయ సంస్కరణల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘం ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేసింది. ఇదే సమయంలో మాడపాటి హనుమంతరావు అధ్యక్షతన ‘హైదరాబాద్ పీపుల్స్ కన్వెన్షన్’ ఏర్పాటైంది. రామకృష్ణారావు దీనికి కార్యదర్శిగా వ్యవహరించారు. ఈ కన్వెన్షన్ హైదరాబాద్‌లో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తీర్మానించింది. దీన్ని నిజాం నవాబు పట్టించుకోలేదు. అయ్యంగార్ కమిటీ సిఫారసులు అమలు కాలేదు. ఆ తర్వాత 1938 జూలైలో స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు, కాశీనాథరావు వైద్య, రామకృష్ణదూత్, జె.రామాచారి, డి.జి. బిందూ మొదలైన ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక నాయకులు ‘హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్’ను స్థాపించారు. 1938 సెప్టెంబర్‌లో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో నిజాం ప్రభుత్వం ఆందోళన చెంది సెప్టెంబర్ 9న స్టేట్ కాంగ్రెస్‌ను నిషేధించింది. స్టేట్ కాంగ్రెస్ నిషేధం తర్వాత ఢిల్లీ వెళ్లిన రాయబార వర్గంలో తెలంగాణ నుంచి ఏకైక ప్రతినిధి రామకృష్ణారావు. హైదరాబాద్ ప్రభుత్వం రామకృష్ణారావుకు హైకోర్టు జడ్జీ పదవిని ఆశ చూపగా ఆయన దానికి సమ్మతించలేదు.

పోలీసు చర్య

1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనమైంది. మేజర్ జనరల్ చౌధురి హైదరాబాద్ రాష్ట్ర మిలటరీ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈయన 1949 వరకు అధికారంలో ఉన్నారు. 1950లో ఎం.కె. వెల్లోడి ముఖ్యమంత్రిగా ‘పౌర ప్రభుత్వం’ ఏర్పడింది. ఇందులో బూర్గుల రామకృష్ణారావు రెవెన్యూ, ఎక్సైజ్, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్‌ను భారత ప్రభుత్వం ‘హైదరాబాద్ రాష్ట్ర రాజ్ ప్రముఖ్’గా నియమించింది.
బూర్గుల రామకృష్ణారావు 1952 మార్చిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా శాసనసభకు ఎన్నికయ్యారు. ఈయన ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. 1956 నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడేంత వరకూ బూర్గుల ముఖ్యమంత్రిగా కొనసాగారు.

బూర్గుల సంస్కరణలు

హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు అమలు చేశారు. ఏళ్ల తరబడి భూములు సేద్యం చేస్తున్న కౌలుదార్లను ‘రక్షిత కౌలుదార్లు’గా ప్రకటించి వారికి భూమిపై యాజమాన్య హక్కులు కల్పించారు. దీంతో దున్నేవారికి భూమిపై యాజమాన్య హక్కు లభించింది.
హైదరాబాద్‌లో ‘జాగీర్దార్’ వ్యవస్థను రద్దు చేసి జాగీర్దార్లకు నష్ట పరిహారం చెల్లించే ఏర్పాటు చేశారు. వీరి రుణాల పరిష్కారానికి ‘జాగీరు రుణ పరిష్కార సంస్థ’ను నెలకొల్పారు.
నాడు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి ఒక ఇంటర్మీడియెట్ కాలేజీ మాత్రమే వరంగల్లులో ఉండేది. మిగతావన్నీ నగరంలోనే ఉండేవి. రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా తెలంగాణాలోని ప్రతి జిల్లాలో ఒక డిగ్రీ కళాశాల నెలకొల్పి విద్యాభివృద్ధికి కృషి చేశారు. హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల స్వల్ప కాలంలోనే వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించింది.
భారత ప్రభుత్వం భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించి ‘ఫజల్ అలీ’ అధ్యక్షతన ఎస్.ఆర్.సి. నియమించింది. ఫజల్ అలీ రిపోర్టు హైదరాబాద్‌ను విభజించాలని, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని సిఫారసు చేసింది. లేకపోతే 1962 సాధారణ ఎన్నికల వరకు ప్రత్యేకంగా ఉంచి, తర్వాత ఎన్నికైన శాసన సభ్యులు కోరితే ఆంధ్రా ప్రాంతంతో కలపవచ్చని పేర్కొంది. రామకృష్ణారావు ఈ విషయంలో చాలా కాలం మౌనంగా ఉన్నారు. ప్రజలందరూ ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్నే కోరుకుంటునట్లు భావించారు. కానీ ఆయన విశాలాంధ్ర ఏర్పడాలని ప్రకటించారు. ఫలితంగా విశాలాంధ్ర ఉద్యమానికి బలం చేకూరింది.

బూర్గుల-సాహిత్య సేవ
  1. బూర్గుల రామకృష్ణారావుకు హైదరాబాద్ రాష్ట్రంలో అన్ని భాషా, సాంస్కృతిక సంస్థలతో సన్నిహిత సంబంధాలుండేవి. ఆయనకు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, పార్శీ, సంస్కృతం, హిందీ, కన్నడ, మరాఠీ భాషల్లో మంచి పాండిత్యం ఉంది.
  2. రామకృష్ణారావు ‘ఉమర్ ఖయాం’ రుబాయిలను కొన్నింటిని ఆంధ్రీకరించారు.
  3. బూర్గుల రచించిన ‘ఉర్దూ భాషా సారస్వతములు’ వ్యాసాలు చదివితే ఉర్దూ, పారశీక భాషల్లో ఆయనకు ఉన్న విద్వత్తు గురించి అర్థమవుతుంది.
  4. పండిత రాయల సంస్కృత రచనను ‘పండిత రాజ పంచామృతం’ అనే పేరుతో తెలుగులో రచించారు.
  5. ‘నవీన వాఙ్మయం - ఎంకి పాటలు’ అనే శీర్షికతో ఆయన అనేక విమర్శనాత్మక వ్యాసాలు రచించారు.
  6. రామకృష్ణారావు ‘కాకునూరి అప్పకవి జన్మస్థానం’, ‘రెడ్డి రాజుల కాలపు మత సంస్కృతులు’ అనే పరిశోధనాత్మక చరిత్ర రచనలు చేశారు.
  7. ఆంధ్ర సారస్వత పరిషత్తు (హైదరాబాద్) వివిధ పత్రికల్లో అనేక అంశాలపై ఆయన రాసిన వ్యాసాలను క్రోడీకరించి ‘సారస్వత వ్యాస ముక్తావళి’ పేరుతో ప్రచురించింది.
  8. డాక్టర్ సి.నారాయణ రెడ్డి రచించిన ‘నాగార్జున సాగరం’ కావ్యం రామకృష్ణారావుకు అత్యంత ప్రీతికరమైంది.
  9. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత బూర్గుల 6 సంవత్సరాలు కేరళ, ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా పని చేశారు. కొంతకాలం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
1960లో బూర్గుల షష్టిపూర్తి ఉత్సవం హైదరాబాద్‌లో జరిగింది. భారత సేవా సమాజ్, భారతీయ విద్యా భవన్, దక్షిణ భారత హిందీ ప్రచార సభ, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, తెలంగాణా రచయితల సంఘం మొదలైన సంస్థల ప్రతినిధులు షష్టి పూర్తి మహోత్సవ సభలో పాల్గొని ఆయనను సత్కరించారు.
దేశభక్తుడు, మేధావి, తెలంగాణ జాతీయోద్యమ యోధుడు, పరిపాలనాదక్షుడు, నవ్యాంధ్ర నిర్మాత అయిన బూర్గుల 1967 సెప్టెంబర్ 14న మరణించారు.
 

దేవులపల్లి రామానుజరావు

ఆంధ్ర రాష్ర్టం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉస్మానియా విశ్వవిద్యాలయంపై దృష్టి సారించింది. ఓయూలో బోధనా భాష ఉర్దూ కావడం, అక్కడి పారిభాషిక పద రచనా శాఖ అద్వితీయంగా ఉండటంతో ఉస్మానియా వర్సిటీపై కేంద్రం దృష్టి పెట్టింది. పార్శీ లిపిని దేవనాగరి లిపిగా మార్చి, ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని హిందీ విశ్వవిద్యాలయంగా మార్చడానికి పూనుకుంది. ఈ పరిణామంతో తెలుగు నాట, ముఖ్యంగా తెలంగాణలో ఆందోళన చెలరేగింది. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడితే మాతృభాషయిన తెలుగు అభివృద్ధి చెందుతుందని ఇక్కడి ప్రజలు ఆశిస్తే, ఉన్న సంస్థే చేజారిపోయే పరిస్థితి తలెత్తింది. దీంతో హైదరాబాద్‌లోని ప్రముఖ పౌరులు ప్రతిఘటన సంఘం(సిటిజన్‌‌స కమిటీ) ఏర్పాటు చేశారు. ఈ సంఘానికి దేవులపల్లి రామానుజరావు నాయకత్వం వహించారు. ఆయన అంతకు ఆరేళ్ల ముందు నుంచే హైదరాబాద్ సారస్వత పరిషత్తు కార్యభారం వహించారు. తెలంగాణాలో మారుమూల పల్లెలను సైతం సందర్శించి సారస్వతోద్యమాన్ని వ్యాపింపజేశారు. హైదరాబాద్‌లో ఆంధ్ర సారస్వత పరిషత్తు శాశ్వత భవనాన్ని నిర్మించారు.
దేవులపల్లి రామానుజరావు 1917 ఆగస్టు 24న వరంగల్‌లోని సంపన్న కుటుంబంలో జన్మించారు. మెట్రిక్యులేషన్ వరకూ హనుమకొండలో చదివారు. తర్వాత హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో బి.ఎ. చదివి 1939లో పట్టా పొందారు. తర్వాత రెండేళ్లపాటు గ్రంథాలయోద్యమంలో, మరో రెండేళ్లపాటు యువజన కాంగ్రెస్‌లో పాల్గొన్నారు. దేవులపల్లి నాగపూర్‌లో ఎల్.ఎల్.బి. చదివి, న్యాయవాద వృత్తిలో చేరారు.
నాటి హైదరాబాద్ రాజకీయ వాతావరణం భయానకంగా ఉంది. హైదరాబాద్ స్వాతంత్య్రం(ఆజాద్) నినాదాలు మిన్నంటాయి. వాటికి తోడు రజాకార్ల దురాగతాలను కళ్లారా చూసిన దేవులపల్లి చలించిపోయారు. ఈ దురాగతాలను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. తాను నడుపుతున్న ‘శోభ’ సారస్వత మాస పత్రిక ద్వారా తన భావాలను ప్రకటించారు. అప్పటికే గోలకొండ పత్రిక దినపత్రికగా మారింది. దేవులపల్లి 1947 నుంచి నాలుగేళ్లపాటు దానికి సంపాదకుడిగా పని చేశారు. 1952-53లో ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్ష, ఉపాధ్యక్ష బాధ్యతలను నిర్వహించారు. నరోత్తమరెడ్డి, పులిజాల హనుమంతరావు, గడియారం రామకృష్ణశర్మ దేవులపల్లికి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించారు.
  • నవ్యకవితా నీరాజనం, సారస్వత నవనీతం, వ్యాసమంజూష లాంటి సాహిత్య విమర్శ గ్రంథాలను; మనదేశం, ఆదిమవాసులు, తెనుగుదేశం, జవహర్‌లాల్ నెహ్రూ, గౌతమ బుద్ధుడు లాంటి బాలసారస్వతం; పచ్చతోరణం లాంటి పద్యకావ్యాలు; తెలుగు సీమలో సాంస్కృతిక పునరుజ్జీవనం లాంటి గ్రంథాలను దేవులపల్లి రామానుజరావు రచించారు.
  • అయ్యదేవర కాళేశ్వరరావుతో కలిసి విశాలాంధ్ర నిర్మాణోద్యమాన్ని నడిపారు.
  • హైదరాబాద్ స్వాతంత్య్రోద్యమం, విశాలాంధ్ర రాష్ర్టం అనే గ్రంథాలను రచించారు. విశాలాంధ్ర వచ్చింది అనే పుస్తకం రాశారు.
  • కొంతకాలం ఉస్మానియా విశ్వవిద్యాలయ సెనెట్‌లో, రాష్ర్ట ప్రభుత్వ విద్యాసలహా సంఘంలో, కేంద్ర పాఠ్యపుస్తక సంఘంలో, ఆలిండియా రేడియో సలహా సంఘంలో సభ్యులుగా పనిచేశారు. ఠాగూర్ శతవార్షిక జయంతి సంఘం కార్యదర్శిగా ఉన్నారు. ‘గురజాడ అప్పారావు శతవార్షిక జయంతి’ సంపుటికి సంపాదకులుగా పనిచేశారు.
  • ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి కార్యదర్శిగా పనిచేశారు.
  • కేంద్ర సాహిత్య అకాడమి కౌన్సిల్ సభ్యులుగా, సాహిత్య ప్రతినిధిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.
  • ఉర్దూలో ‘తెలుగు సాహిత్య చరిత్ర’ను ప్రచురించారు.
  • గాలిబ్, మౌలానా షిబ్లీ, హోలీ లాంటి జాతీయోద్యమ ప్రముఖుల రచనలను తెలుగులో ప్రచురించారు.
  • సృజనాత్మకశక్తి, దాన్ని మించిన దీక్షా దక్షత ఉన్న దేవులపల్లి రామానుజరావు తెలుగు సాహిత్యం, తెలుగువారి గొప్పదనాన్ని ఇతర భాషల వారికి ఒరవడి అయ్యేలా సారస్వత అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మహనీయుడు.

మఖ్దూం మొహియుద్దీన్
నిజాం నిరంకుశ పాలనలో, భూస్వాముల ఆగడాల్లో నలిగిపోతున్న తెలంగాణను జాగృతం చేసేందుకు, నవ తెలంగాణ నిర్మాణం కోసం కృషి చేసిన ప్రజానాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి కామ్రేడ్ మఖ్దూం మొహియుద్దీన్. ఆయన 1908 ఫిబ్రవరి 4న మెదక్ జిల్లా ఆంథోల్‌లో జన్మించారు. వీరి పూర్వీకులు ఉత్తరప్రదేశ్‌లోని ‘ఆజంగఢ్’కు చెందినవారు. ఔరంగజేబు దక్కన్ దండయాత్ర సమయంలో మఖ్దూం పూర్వీకులు ఇక్కడికి వచ్చి మెదక్ జిల్లాలో స్థిరపడ్డారు.

విద్యాభ్యాసం
మఖ్దూం ఆంథోల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం, సంగారెడ్డిలో హైస్కూల్ విద్య పూర్తి చేశారు. ఆయన చదువంతా ఉర్దూ, పార్శీ భాషల్లోనే సాగింది. పార్శీలోని ‘గులిస్తాన్’ ‘బోస్థాన్’ గ్రంథాలను చదివారు. హైదరాబాద్‌లో ఇంటర్ వరకు చదివారు.
బాల్యం నుంచి ఆయన ఎన్నో కష్టాలను అనుభవించారు. పేదరికాన్ని భరించలేక కుటుంబాన్ని విడిచి కొంతకాలం పత్రికలు అమ్మారు, పత్రికల్లో పనిచేశారు. కొంత కాలం ప్రముఖ సినీతారల చిత్రాలు అమ్మి జీవనం సాగించారు. రాత్రిపూట సుల్తాన్ బజారులోని మసీదుల్లో ఉండేవారు. మఖ్దూం ఎన్ని కష్టాలు పడినా, జీవితంలో ఎన్నడూ నిరాశ చెందలేదు. ‘జమాలుద్దీన్’ పేరుతో విద్యార్థి దశలోనే పిట్టకథలు రచించారు. 1933లో తొలిసారిగా పచ్చశాలువ (పీలీ దుశాల్) అనే కవితా ఖండికను వెలువరించారు.
మఖ్దూం 1937లో ఉర్దూ నాటకాల మీద పరిశోధక వ్యాసం రాసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ. పట్టా పొందారు, సిటీ కళాశాలలో ఉర్దూ లె క్చరర్‌గా పనిచేశారు.

జాతీయోద్యమంలో ప్రవేశం
విద్యార్థి దశ నుంచి మఖ్దూంకి జాతీయ ఉద్యమాల పట్ల ఆసక్తి ఎక్కువ. ఆంధ్ర మహాసభల్లో పాల్గొన్నారు. రావి నారాయణరెడ్డి, రాజ్ బహద్దూర్ గౌర్, సర్వదేవభట్ల రామనాథం మొదలైన కమ్యూనిస్టు నాయకులు ఆయనపై ప్రభావం చూపారు. 1939లో నాగపూర్‌లో హైదరాబాద్ విద్యార్థి యూనియన్ ఏర్పాటైంది. 1940లో గౌర్, మఖ్దూం కమ్యూనిస్టు పార్టీలో చేరారు. నాగ్‌పూర్‌లో అఖిల భారత విద్యార్థి మహాసభలు జరిగాయి. ఈ సభలోనే విద్యార్థి ఫెడరేషన్ (కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి అనుబంధ సంస్థ) ఏర్పడింది. ఈ సభలకు మఖ్దూం హాజరయ్యారు. దీంతో ఆయనకు కార్మిక సంఘాలతో సంబంధాలు ఏర్పడ్డాయి. కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల ప్రాతిపదికపై హైదరాబాద్ సంస్థానంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని నిర్మించారు. నిజాం ఫ్యూడల్ విధానంలో గ్రామాల్లో జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు అత్యాచారాలు, అన్యాయాలు, దౌర్జన్యాలకు పాల్పడేవారు. తెలంగాణ గ్రామాల్లో బేగారి, వెట్టిచాకిరీ ఉండేది. మఖ్దూం గ్రామాల్లో పర్యటించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. నిజాం నవాబు విధి విధానాలను ఆయన నిశితంగా విమర్శించేవారు. బహిరంగ సభల్లో బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించడంతో నిజాం నవాబు ఆయన్ను మూడు నెలలపాటు జైల్లో నిర్బంధించాడు. మఖ్దూంతో పాటు స్వామి రామానందతీర్థ, అచ్యుతాభాయి దేశ్‌పాండే, ఆర్.ఎస్.దివాన్, బిర్దీచంద్ చౌదరి తదితర నాయకులను నిర్భంధించారు.
  • 1944-46 మధ్యకాలంలో హైదరాబాద్ సంస్థానంలో అనేక కార్మిక సంఘాలు స్థాపించారు. రైల్వే, విద్యుచ్ఛక్తి, పబ్లిక్ వర్‌‌క్స, చేనేత, సిమెంట్ కార్మికుల సంఘాలకు అధ్యక్షుడిగా మఖ్దూం మొహియుద్దీన్ సేవలందించారు. బెల్లంపల్లి, కొత్తగూడెంలోని బొగ్గు గనుల కార్మికులను సంఘటితం చేశారు. వరంగల్ అజంజాహి మిల్లు కార్మికుల యూనియన్ స్థాపనకు విశేషంగా కృషి చేశారు. ఆయనతోపాటు రాజ్ బహద్దూర్ గౌర్, సర్వదేవభట్ల రామనాథం కమ్యూనిస్టు ట్రేడ్ ఉద్యమానికి తమ జీవితాలను ధారపోశారు.
  • 1946లో హైదరాబాద్‌లో అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏర్పాటైంది. ఎన్.ఎం.జోషి భారత కమ్యూనిస్టు ట్రేడ్ యూనియన్‌ను ప్రారంభించారు.
  • 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ ‘పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్’ను నెలకొల్పింది.
సాహిత్య సేవ
  • మఖ్దూం మహాకవి, రచయిత, సాహితీవేత్త, మానవతావాది. ఇంగ్లిష్, ఉర్దూ, పార్శీ, హిందీ భాషల్లో నిష్ణాతుడు, అనర్గళ వక్త. కళ కళ కోసమే కాదు ‘కళ’ మానవ కల్యాణానికి, అభ్యుదయానికి ఉపయోగపడాలని గట్టిగా విశ్వసించారు.
  • ‘గులేతర్’ పేరుతో ఆయన రాసిన గేయాలన్నీ ప్రచురితమయ్యాయి.
  • 1958లో ‘చాంద్ తారూంకాబన్’ అనే కవితా సంపుటిని ప్రచురించారు.
  • అజాదెవతన్ (మాతృదేశ స్వాతంత్య్రం) అనే గేయంలో భారతదేశ సౌభాగ్యం గురించి రాశారు.
  • ‘హవేలీ’ కవితలో మూఢ విశ్వాసాలు, మూఢాచారాలు దేశాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో తెలిపారు.
  • ‘మృత్యుగీతం’ (మోత్-కా-గీత్) అనే కవితలో సమాజంలోని వికృత దౌర్జన్యాలను నాశనం చేయాలని ప్రబోధించారు.
  • మఖ్దూం రాసిన ‘తెలంగన్’ ఎంతో ప్రసిద్ధి చెందింది.
  • సిపాయి, అంధేరా(చీకటి), రాత్ కె బారాబజే, మార్టిన్ లూథర్ కింగ్, అప్నా షెహర్, ములాఖత్-కా-ములాఖత్, ఏక్ చమేలేకే మండ్వే తలే లాంటి అనేక కావ్య ఖండికలు, గేయాలను మఖ్దూం మొహియుద్దీన్ రచించారు.
  • ఆయన మొదటి కవితా సంపుటి ‘సురఖ్ సవేరా’ 1944లో అచ్చయింది.
  • 1966లో ‘బసాతెరక్స్’ అనే కవితా సంకలనాన్ని మఖ్దూం సన్మాన సంఘం ప్రచురించింది.
  • శ్రమజీవులు, పీడిత వర్గాలు, సామాన్య ప్రజల ఉద్ధరణ కోసం జీవితాన్ని అర్పించిన మఖ్దూం మొహియుద్దీన్ 1969 ఆగస్టు 25న ఢిల్లీలో మరణించారు.

సురవరం ప్రతాపరెడ్డి

గద్వాల సంస్థానానికి రాజధానిగా ఉన్న బోరవెల్లి గ్రామంలో 1896 మే 28న సురవరం ప్రతాపరెడ్డి జన్మించారు. ఆయన స్వగ్రామం ఆలంపురం తాలూకాలోని ఇటికాలపాడు. ప్రతాపరెడ్డి హైదరాబాద్ నిజాం కాలేజిలో ఇంటర్, మద్రాసులో బీఏ, బీఎల్ చేశారు. మద్రాసులో ఉన్న సమయంలో వెల్లాల సదాశివశాస్త్రి, వేదం వెంకట రామశాస్త్రి, మానవల్లి రామకృష్ణ కవి లాంటి పండితులతో ఆయనకు పరిచయం ఏర్పడింది. సురవరం ప్రతాపరెడ్డి సంస్కృతాంధ్ర భాషల్లో ప్రావీణ్యం పొందారు.
హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ ప్రజల పరిస్థితి దయనీయంగా ఉండేది. తెలుగు ప్రజలు కనీసం ప్రాథమిక విద్యను కూడా మాతృభాషలో అభ్యసించడానికి అవకాశం ఉండేది కాదు. తెలంగాణలో తొంభై శాతం మంది ప్రజల మాతృభాష తెలుగే. అయినప్పటికీ ఉర్దూను తెలుగు ప్రజలపై బలవంతంగా రుద్దడాన్ని ప్రతాపరెడ్డి అవమానంగా భావించారు. దీంతో దేశసేవ, ప్రజల సర్వతోముఖాభివృద్ధి, సంఘసంస్కరణ, మాతృ భాషా వికాసం అనే ఉన్నత లక్ష్యాలకు అనువైన మార్గాన్ని నిర్దేశించుకున్నారు. ఫలితంగా కొమర్రాజు వెంకట లక్ష్మణరావు మార్గదర్శకులుగా, రాజాబహద్దూర్ వెంకట్రామారెడ్డి సహాయ సహకారాలతో సురవరం ప్రతాపరెడ్డి 1926 మే 10న గోలకొండ పత్రికను స్థాపించారు. 1947 వరకు నిరాటంకంగా అర్ధవార పత్రికగా నిర్వహించారు. గోలకొండ పత్రిక ద్వారా నిద్రాణమై ఉన్న నాటి తెలంగాణ ప్రజల్లో స్ఫూర్తి నింపారు. గోలకొండ పత్రిక తొలి సంపాదకీయంలో ‘మేము మా పత్రికా స్థాపన కాలం నుంచి రెండు అంశాలు దృష్టిలో ఉంచుకొని దేశసేవ చేస్తున్నాం. మొదటిది ఆంధ్ర భాషా సేవ, రెండోది జాతి, కుల వివక్షత లేకుండా నిష్పక్షపాతంగా ఆంధ్రుల సత్వరాభివృద్ధికి పాటుపడటం’ అని పత్రిక ఆశయాలను వివరించారు. పత్రికా నిర్వహణలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, నిజాం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రతాపరెడ్డి వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. గొలకొండ పత్రిక ద్వారా తన జీవిత సర్వస్వాన్ని తెలంగాణ ప్రజల అభ్యుదయానికి ధారపోశారు.
జాతీయ భావాల స్ఫూర్తితో హైదరాబాద్ రాష్ర్టంలో కూడా జాతీయోద్యమాలు, విమోచనోద్యమాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉద్యమాల్లో ప్రతాపరెడ్డి ముఖ్య పాత్ర పోషించారు. ప్రతాపరెడ్డి సంఘ సంస్కరణాభిలాషి, నిష్కళంక జాతీయవాది. సంస్కృతాంధ్రాలతో పాటు ఇంగ్లిష్, పారశీకం, ఉర్దూ భాషల్లో ఆయన ప్రావీణ్యం సంపాదించారు. మంచి వక్త, విమర్శకుడు, పరిశోధకుడు. అనేక విషయాల గురించి సంపూర్ణ జ్ఞానం సంపాదించిన మేధావి. కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి లక్ష్మీనరసింహం, దేశోద్ధారక నాగేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, గిడుగు, గురజాడ తదితరుల వల్ల ప్రతాపరెడ్డి ప్రభావితమయ్యారు. కొమర్రాజు లక్ష్మణరావు విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి గ్రంథాలు ఆయనపై ప్రభావం చూపాయి.
సురవరం-సాహిత్య సేవ
సురవరం ప్రతాపరెడ్డి సుమారు 40 గ్రంథాలు రచించారు. తెలుగు సాహిత్యంలోని అన్ని నూతన ప్రక్రియలు చేపట్టారు. నవల, నాటకాలు, పద్య, వ్యాస రచనలు, కథలు, చారిత్రక గ్రంథాలు రచించారు. ‘హిందువుల పండగలు’ అనే గ్రంథాన్ని ప్రామాణిక పద్ధతిలో, సరళ శైలిలో రాశారు. పురాణాలు, స్మృతి గ్రంథాలను పరిశీలించి కొత్త విషయాలను ఆ గ్రంథంలో జోడించారు. ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ పుస్తకానికి పీఠిక రాశారు. ఈ వ్యాసాలను చిదిరమఠం వీరభద్ర శర్మ నడిపిన ‘విభూతి’ పత్రికలో తొలిసారిగా ప్రచురించారు. తర్వాత గ్రంథ రూపంలో తీసుకొచ్చారు. చారిత్రక దృక్పథంతో ‘రామాయణ విశేషాలు’ అనే గ్రంథాన్ని ప్రతాపరెడ్డి రచించారు. ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ అనే ప్రామాణిక గ్రంథాన్ని రచించారు. ఇందులో క్రీ.శ.1050 నుంచి సుమారు వందేళ్ల కాలానికి చెందిన ప్రజల జీవన విధానాన్ని వర్ణించారు. కళలు, మతం, వ్యాపారం, వినోదాలు, ఆచార వ్యవహారాలు స్త్రీ-పురుషుల అలంకరణలు లాంటి శీర్షికలతో ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ రచించారు. ఇలాంటి గ్రంథం తెలుగులో రావడం ఇదే మొదటిసారి. ఈ గ్రంథం వేటూరి ప్రభాకర శాస్త్రి, వేలూరి శివరామశాస్త్రి, రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ మొదలైన పండితుల ప్రశంసలు పొందింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తొలి తెలుగు గ్రంథమిది. రామాయణ విశేషాలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండగలు.. ఈ మూడు గ్రంథాలు తెలుగుభాష ఉన్నంత వరకు నిలిచి ఉండే ఉత్తమ శ్రేణి గ్రంథాలు.
ప్రతాపరెడ్డి ఉచ్ఛల విషాదం, భక్తతుకారాం అనే రెండు నాటకాలను రచించారు. ఉచ్ఛల విషాద నాటకం దేశభక్తిని ప్రబోధిస్తుంది. స్వదేశాభిమానంతో పాటు, కులరహిత సమాజ స్థాపన అనే ఆదర్శాలతో రచించిన నాటకమే ‘భక్తతుకారాం’. మద్రాసులో రాజమన్నార్ నడిపిన ‘కళ’ అనే పత్రికలో భక్తతుకారాం నాటకాన్ని ప్రచురించారు. మద్రాసు, గుంటూరు, సికింద్రాబాద్, బెజవాడ తదితర పట్టణాల్లో ఈ నాటకాన్ని ప్రదర్శించారు. ‘చంపకీ భ్రమర విలాసం’ పేరుతో సురవరం ప్రతాపరెడ్డి తొలి కావ్యరచన చేశారు. ప్రేమార్పణం, హంవీర సంభవం, ధర్మాసనం, మద్యపానం లాంటి కావ్యాలను రచించారు.
నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రవేశపెట్టిన కొన్ని సంస్కరణలను తీవ్రంగా విమర్శిస్తూ ‘గోలకొండ’ పత్రికలో ప్రతాపరెడ్డి రాసిన సంపాదకీయాలు తెలుగు ప్రజలను ఎంతగానో ఉత్తేజపరిచాయి.
గోలకొండ కవుల సంచిక
ఓసారి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖుడు తెలంగాణలో కవులు లేరని, తెలుగుభాష అసలే లేదని ఒక వ్యాసం రాశాడు. అది చదివిన ప్రతాపరెడ్డి ఎంతో బాధపడ్డారు. అది తప్పని నిరూపించేందుకు తెలంగాణలోని కవుల రచనలు, వారి జీవిత సంగ్రహ విశేషాలను సేకరించి ‘గోలకొండ కవుల సంచిక’ పేరుతో ఒక గ్రంథం ప్రచురించారు. మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, మందుముల రామచంద్రరావు, మందుముల నరసింగరావు, ఆదిరాజు వీరభద్రరావు, చిదిరెమఠం వీరభద్రశర్మ, రావాడ సత్యనారాయణ, ఆచార్య వెంకటాచారి తదితరులతో వివిధ విషయాలపై గోలకొండ పత్రికలో వ్యాసాలు రాయించారు.
గోలకొండ పత్రికలో ‘జంగములు బ్రాహ్మణులు కారు’ అనే వ్యాసాన్ని ప్రచురించారు. దీనిపై అనేక తర్జన భర్జనలు జరిగాయి. శాకాహారం మంచిదా లేదా మాంసాహారమా, స్త్రీలకు స్వాతంత్య్రం అవసరమా అనే వ్యాసాలను ప్రచురించి పత్రికను చర్చావేదికగా మార్చారు. రాజాబహద్దూర్ వెంకట్రామారెడ్డి సలహాపై 1939లో గోలకొండ పత్రిక సంపాదక, నిర్వహణ బాధ్యతలన్నీ సురవరం ప్రతాపరెడ్డి చేపట్టారు. 1949లో గోలకొండ పత్రిక దినపత్రికగా మారింది. అప్పటి నుంచి నూకల నరోత్తమరెడ్డి సంపాదక బాధ్యతలను స్వీకరించారు. దీంతో ప్రతాపరెడ్డికి గోలకొండ పత్రికతో సంబంధం తెగిపోయింది.
‘ప్రజావాణి’ స్థాపన
1951లో ప్రజావాణి అనే పేరుతో సురవరం ప్రతాపరెడ్డి ద్విదిన (రెండు రోజులకు ఒకసారి వచ్చే) పత్రికను స్థాపించారు. కొంత కాలం నడిచాక ఈ పత్రిక ఆగిపోయింది.
  • ‘నిజాం రాష్ర్ట పరిపాలనం’ అనే చిన్న పుస్తకాన్ని ప్రతాపరెడ్డి రచించారు.
  • ప్రజల హక్కులు, సాధించాల్సిన హక్కుల గురించి వివరించే ‘ప్రాథమిక స్వత్యములు’ అనే గ్రంథాన్ని 1938లో రచించారు. ఇదే గ్రంథం ‘ప్రజాధికారము’ పేరుతో 1950లో ప్రచురితమైంది.
  • యువకుల్లో విజ్ఞానాన్ని పెంపొందించడానికి ‘యువజన విజ్ఞానం’ రచించారు. ఇందులో నీతిపద్యాలు, ప్రాచీన సాహిత్యం, ఆర్యావర్త నాగరికత, మతం, మత ప్రవక్తలు, మన ఆచార-వ్యవహారాలు మొదలైన విషయాలను గురించి రాశారు.
  • ‘హైందవ ధర్మవీరులు’ అనే పేరుతో గోలకొండ పత్రికలో వీర రసాత్మక గాథలను ప్రచురించారు. బాలచంద్రుడు, అబ్దుల్ రజాక్ లారీ, గురు గోవింద్ సింగ్, అమర్ సింగ్, బాజీరావు దేశ పాండ్య తానాజీ లాంటి వీరుల గాథల్ని పత్రికలో ప్రచురించారు తర్వాత అది పుస్తకంగా వచ్చింది.
  • 1925లో ‘సంఘోద్ధరణ’ గ్రంథం రచించారు. ఇందులో మలబారు క్రైస్తవులు, మన పరిశ్రమలు-నాశనం చేసింది ఎవరు, మద్యపానం లాంటి అంశాలను పొందుపర్చారు.
  • వింత విడాకులు, వకీలు వెంకయ్య, నిరీక్షణ, సంఘాల పంతులు, మెహదీ బేగం, బారిష్టర్ గోపాలకిషన్ రావు మొదలైన కథలు రచించారు. ఆయన రాసిన కథలు ప్రతాపరెడ్డి కథలు అనే పేరుతో ప్రచురితమయ్యాయి. ఈ కథల్లో తెలంగాణ గ్రామీణ జీవనం, తెలంగాణ భాష, పలుకుబడులను వివరించారు.
  • మొగలాయి కథలు అనే పేరుతో గోలకొండ పత్రికలో కథలను ప్రచురించారు.
  • మాడపాటి హనుమంతరావు గురించి సురవరం ప్రతాపరెడ్డి రాసిన ‘వ్యక్తిచిత్రణ’ ఒక కళా ఖండమని చెప్పవచ్చు.
  • గోలకొండ పత్రికలో వేయికి పైగా వ్యాసాలు, సంపాదకీయాలను రాశారు. ఆయన సంపాదకీయాల శైలి విశిష్టమైంది. ఒకసారి నిజాం ప్రభుత్వం సంపాదకీయాలపై నిషేధం విధించింది. దీంతో ప్రతాపరెడ్డి సంపాదకీయ కాలమ్‌లో ప్రపంచ మేధావుల సూక్తులను ప్రచురించడం ప్రారంభించారు. ఈ సూక్తులే ప్రభుత్వానికి సూదుల్లా గుచ్చుకున్నాయి.
  • కేవలం భాషాసేవ, పత్రికా రచనలే కాకుండా అనేక సాంఘిక-సాంస్కృతిక సంస్థలతోనూ సురవరం ప్రతాపరెడ్డికి సంబంధం ఉండేది. రెడ్డి వసతి గృహం కార్యదర్శిగా, ఆంధ్ర సారస్వత పరిషత్తు, విజ్ఞాన వర్ధినీ పరిషత్తుల అధ్యక్షుడిగా ఆయన సేవలందించారు.
  • శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం, వేమనాంధ్ర భాషా నిలయం, బాల సరస్వతీ గ్రంథాలయం, హిందీ ప్రచారసభ మొదలైన సంస్థల అభివృద్ధికి తోడ్పడ్డారు.
  • నాటి తెలంగాణను చైతన్యపరిచిన వారిగా కొమర్రాజు లక్ష్మణరావు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డిలకు సమున్నత స్థానముంది.
  • పోలీసు చర్య తర్వాత 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ జిల్లాలోని వనపర్తి నియోజకవర్గం నుంచి హైదరాబాద్ రాష్ర్ట శాసనసభకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతాపరెడ్డి ఎన్నికయ్యారు.
  • తెలంగాణ ప్రజలకు దారి చూపిన, ఆంధ్రభాషాభివృద్ధికి పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త, పండితుడైన సురవరం ప్రతాపరెడ్డి 1954 ఆగస్టు 25న మరణించారు.

కొమర్రాజు వెంకట లక్ష్మణరావు

తెలుగు భాష సాంస్కృతిక, సారస్వత పునరుజ్జీవనానికి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విశేష కృషి చేశారు. తెలుగులో చరిత్ర, పరిశోధనలు, వైజ్ఞానిక గ్రంథాలు లేని కొరతను తీర్చడానికి ఆయన మహోద్యమం నడిపారు. తెలుగు చరిత్ర పరిశోధనా పితామహుడిగా పేరొందిన కొమర్రాజు 1877లో కృష్ణాజిల్లా, నందిగామ తాలూకా పెనుగంచిప్రోలులో జన్మించారు. తండ్రి వెంకటప్పయ్య, తల్లి గంగమ్మ. ఇతడి పూర్వీకులు సాహిత్యాభిమానులు. వీరు మునగాల సంస్థానంలో దివాన్‌గా పనిచేశారు.
కొమర్రాజు లక్ష్మణరావు నాగపూర్‌లో విద్యాభ్యాసం చేశారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టా పొందారు. నాగపూర్‌లో చదివిన రోజుల్లో ఆయన మరాఠీ నేర్చుకున్నారు. తిలక్, అగార్కర్, గోఖలే, రనడే లాంటి జాతీయ నాయకుల ప్రభావం కొమర్రాజుపై పడింది. ‘కేసరి’ అనే మరాఠీ పత్రికలో ఆయన వ్యాసాలు రాసేవారు. ‘మోరోపంత్’ అనే మహారాష్ర్ట కవి రచించిన మహాభారత కర్ణపర్వానికి పరిష్కర్త (ఎడిటర్)గా కొమర్రాజు పనిచేశారు. 1898లో ‘జనానా’ అనే తెలుగు పత్రికలో వ్యాసాలు ప్రచురించారు. 1900లో మునగాల సంస్థానంలో రాజా నాయని వెంకట రంగారావు వద్ద దివాన్‌గా చేరారు. స్వదేశీ ఉద్యమానికి తోడ్పాటు అందించేలా మునగాల రాజును ప్రోత్సహించారు. బెంగాలీ, గుజరాతీ, ప్రాకృతం, సంస్కృతంతోపాటు దక్షిణాది భాషల్లోనూ లక్ష్మణరావుకు ప్రావీణ్యం ఉంది.
భాషా సేవ: గ్రంథాలయోద్యమం తెలంగాణలో తెలుగు జాతిని జాగృతం చేసింది. గ్రంథాలయోద్యమంలో భాగంగా రావిచెట్టు రంగారావు, మునగాల రాజా నాయని వెంకట రంగారావు, ఆదిపూడి సోమనాథరావు లాంటి ప్రముఖుల ప్రోత్సాహంతో కొమర్రాజు లక్ష్మణరావు 1901లో హైదరాబాద్‌లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయాన్ని స్థాపించారు. 1904లో హనుమకొండలో శ్రీ రాజరాజ నరేంద్ర భాషానిలయం, 1905లో సికింద్రాబాద్‌లో ఆంధ్రసంవర్థినీ గ్రంథాలయాన్ని నెలకొల్పారు. 1906లో హైదరాబాద్‌లో ‘విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి’ ముద్రణాలయాన్ని స్థాపించారు. నాయని వెంకట రంగారావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, అయ్యదేవర కాళేశ్వరరావుతో కలిసి కొమర్రాజు ఈ మండలిని స్థాపించారు. ఈ మండలి ఆంధ్రా-తెలంగాణ ప్రాంత ప్రజల మధ్య సాంస్కృతిక వారధిగా పనిచేసింది. సంఘ సంస్కరణ, జాతీయోద్యమం వ్యాప్తి లక్ష్యాలుగా ఈ సంస్థ పనిచేసింది. అందుకే ఈ ముద్రణాలయంలో ప్రపంచ మహాపురుషుల జీవిత చరిత్రలను ప్రచురించారు. 1906-11 మధ్య కాలంలో విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి సుమారు 30 గ్రంథాలను ప్రచురించింది.
  • 12వ శతాబ్దంలో మల్లికార్జున శివాచార్యుడు రచించిన ‘శివతత్వసారం’ శతకానికి లక్ష్మణరావు పీఠిక రాశారు. విష్ణుకుండినుల మూడో రాజైన మాధవ వర్మ శాసనాన్ని 1923లో కలకత్తా జర్నల్ ఆఫ్ ది డిపార్‌‌టమెంట్ ఆఫ్ లెటర్స్ లో ప్రచురించారు.
  • తెలుగు భాషకు విశేషంగా సేవలందించిన కొమర్రాజు లక్ష్మణరావు 46 ఏళ్లకే మరణించారు.

అరిగె రామస్వామి

సమాజంలో ఏళ్ల తరబడి పీడనకు గురి అవుతోన్న నిమ్నజాతుల సముద్ధరణకు నిరంతరం కృషి చేసిన దీనజనోద్ధారకుడు అరిగె రామస్వామి. ఈయన సంఘ సంస్కర్త, దేశభక్తుడు. నిజాం నిరంకుశ పాలనలో వెనుకబడిన వర్గాల ప్రజల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉండేది. అంటరానివారిపై ఉన్నత వర్గాలు, ప్రభుత్వోద్యోగులు, దేశ్‌ముఖ్‌ల దౌర్జన్యాలతో తెలంగాణ గ్రామీణ వ్యవస్థ అల్లాడిపోయింది. అరిగె రామస్వామి, భాగ్యరెడ్డి వర్మ, బి.ఎస్. వెంకట్రావు తదితరులు హైదరాబాద్ రాజ్యంలో ప్రముఖ హరిజన నాయకులుగా పేరొందారు. అరిగె రామస్వామి ఆధ్యాత్మిక చింతనాపరుడు, గాంధేయవాది. ఈయన మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి లాంటి కాంగ్రెసు నాయకులతో కలిసి పనిచేశారు. నిజాం రాష్ట్రాంధ్ర మహాసభ నాయకుడిగా తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు.
అరిగె రామస్వామి 1895లో సికింద్రాబాద్‌లోని నిరుపేద హరిజన కుటుంబంలో జన్మించారు. పెద్దగా చదువుకోలేదు. రైల్వే తనిఖీ కార్యాలయంలో ఆఫీస్ బాయ్‌గా జీవితాన్ని ప్రారంభించారు. కొంతకాలం రైల్వేలో టిక్కెట్ కలెక్టర్‌గా పనిచేశారు. 1912లో సికింద్రాబాద్‌లోని కుమ్మరిగూడలో సునీత బాలసమాజాన్ని స్థాపించారు.
ఈ సమాజం ముఖ్యోద్దేశాలు
మద్యం తాగే దురలవాటును మాన్పించడం, నిరక్షరాస్యతా నిర్మూలన, మాల, మాదిగ, మాల దాసరి మొదలైన హరిజన ఉపతెగలను సమైక్యం చేయడం లక్ష్యాలుగా ఈ సంస్థ పనిచేసింది. మూఢాచారాలు, మూఢ విశ్వాసాలను పోగొట్టడం, సాంఘిక న్యాయ సాధన, జంతు బలుల నిషేధం కోసం ఈ సంస్థ పనిచేసింది. హరిజనులు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఈ సంస్థ కృషి చేసింది. దళిత వర్గాల అభ్యున్నతి కోసం జాతీయోన్నత సభ, ఆదిహిందూ మహాసభ, ఆదిహిందూ సోషల్ సర్వీస్ లీగ్ లాంటి సంస్థలు హైదరాబాద్‌లో ఏర్పడ్డాయి. ఈ సంస్థల కార్యకర్తలైన భాగ్యరెడ్డి వర్మ, ఆర్.లక్ష్మయ్య, ఎం.ఎల్.ఆదయ్య, సి.ఎస్.యతిరాజులు మొదలైన వారితో అరిగె రామస్వామి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1930లో రామస్వామి రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయాన్ని సంఘసేవకే కేటాయించారు. తన ఆధ్యాత్మిక గురువైన భూమానందస్వామి పేరు మీద గురుమండలి స్థాపించి పేదలకు ఉచితంగా సామూహిక వివాహాలు జరిపించారు. నిజాం ప్రభుత్వం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుడిగా దళితుడికి అవకాశం ఇవ్వాలని భావించింది. ఈ పదవిలో నియమితుడైన తొలి హరిజనుడు ఈయనే.
  • 1933లో మహాత్మాగాంధీ హైదరాబాద్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా నగరంలో ఏర్పాటైన ఆహ్వాన సంఘంలో రామస్వామి సభ్యుడు. హైదరాబాద్ సంస్థానంలో హరిజనోద్ధరణకు పూర్తి సమయాన్ని వెచ్చించాలని అరిగె రామస్వామికి గాంధీ సలహా ఇచ్చారు.
  • హైదరాబాద్‌లో తోళ్లపరిశ్రమ కార్ఖానా స్థాపన కోసం రామస్వామి కృషిచేశారు.
  • తెలంగాణ గ్రంథాలయోద్యమానికి విశేష సేవలందించారు.
  • నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలో ఏకైక హరిజన సభ్యుడు రామస్వామి. అసృ్పశ్యతా నివారణ, వెట్టిచాకిరీ నిర్మూలన, హరిజన సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేశారు. 1935లో మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన దళిత జాతుల మహాసభకు అరిగె రామస్వామి అధ్యక్షత వహించారు.
  • ‘అరుంధతీ మహాసభ’ ద్వారా అనాథలు, హరిజన కుటుంబాలను ఆదుకున్నారు. ఈ సభ ద్వారా వారికి ఉద్యోగాలు, జీవన భృతి కల్పించేందుకు కృషి చేశారు.
  • రామస్వామి నిజాం రాష్ట్రాంధ్ర మహాసభ కార్యవర్గ సభ్యులుగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా, నిజాం రాష్ర్ట కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా పనిచేశారు.
  • 1950-52లో ఆంధ్రరాష్ర్ట కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ జిల్లా బోర్టు సభ్యులుగా సేవ చేశారు.
  • పొలీసు చర్య అనంతరం కేంద్ర ప్రభుత్వం రామస్వామిని పార్లమెంట్ సభ్యుడిగా నామినేట్ చేసింది. 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో వికారాబాద్ ద్విసభ్య నియోజకవర్గం నుంచి చెన్నారెడ్డితోపాటు హైదరాబాద్ రాష్ర్ట శాసనసభకు రామస్వామి ఎన్నికయ్యారు.
  • 1954-56 మధ్య బూర్గుల మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు.
  • తిరుమల-తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు.
  • దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసిన రామస్వామి 1973 జనవరి 26న మరణించారు.

షోయబుల్లాఖాన్

షోయబుల్లాఖాన్ 1920 అక్టోబర్ 12న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడై పత్రికా రచయితగా జీవితం ప్రారంభించారు. మొదట తేజ్ వారపత్రికలో చేరి నిజాం నిరంకుశ పాలనను, ఇత్తెహాదుల్ ముసల్మీన్ మత సంస్థ విధి విధానాలను, దాని అధిపతి సయ్యద్ ఖాసీం రజ్వీని ఘాటుగా విమర్శించారు. ఫలితంగా తేజ్ పత్రికను నిజాం ప్రభుత్వం నిషేధించింది. తర్వాత మందుముల నరసింగరావు నిర్వహించిన రయ్యత్ ఉర్దూ పత్రికలో షోయబుల్లాఖాన్ చేరారు. నిజాం ప్రభుత్వ దమననీతిని, పాక్షపాత వైఖరిని విమర్శించినందుకు ఈ పత్రిక కూడా నిషేధానికి గురైంది. దీంతో షోయబుల్లాఖాన్ స్వయంగా ఇమ్రోజ్ అనే ఉర్దూ పత్రికను స్థాపించారు. పత్రిక స్థాపనలో షోయెబ్‌కు బూర్గుల రామకృష్ణారావు సాయం చేశారు.
నిజాం రాష్ర్టంలో నానాటికి దిగజారుతున్న పరిస్థితులను చూసి సహించలేక హైదరాబాద్‌కు చెందిన కొంత మంది మేధావులు నిజాం ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ లేఖలో శాంతిభద్రతల పరిస్థితిని కళ్లకు కట్టినట్లుగా వివరించారు. రజాకార్ల దళాన్ని రద్దుచేయాలని, లాయక్ అలీని ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించాలని, హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయాలని ఆ లేఖలో కోరారు. ఈ మేధావుల సలహాలను నిజాం ఖాతరు చేయలేదు. వీరిలో ఏడుగురు ప్రముఖ ముస్లిం నాయకులున్నారు. వారు.. మంజూర్ జంగ్, బాకర్ అలీ మీర్జా, ఫరీద్ మీర్జా, ముల్లా అబ్దుల్ బాసిత్, మహమ్మద్ మీర్జా, హుసేన్ అబ్దుల్ మునీం, మహ్మద్ హుస్సేన్ జాఫిరి.
వీరు రాసిన లేఖను షోయబుల్లాఖాన్ ‘ఇమ్రోజ్’ పత్రికలో యథాతథంగా ప్రచురించారు. దీంతో పత్రిక సంపాదకుడైన షోయబుల్లాఖాన్ చేతులు నరికివేయాలని ఖాసీం రజ్వీ రజాకార్లను ఆదేశించాడు. 1948 ఆగస్టు 21న అర్ధరాత్రి సమయంలో ‘ఇమ్రోజ్’ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తున్న షోయబుల్లాఖాన్‌పై రజాకార్లు ఆయుధాలతో దాడిచేసి అతడి చేతులు, తలను నరికి హతమార్చారు. షోయబుల్లాఖాన్ బలిదానం హైదరాబాద్ సంస్థాన స్వాతంత్య్ర సమరంలో ఒక మైలురాయి.

దాశరథి కృష్ణమాచార్యులు

దాశరథి కృష్ణమాచార్యులు వరంగల్ జిల్లా, మహబూబాబాద్ తాలుకా చిన్న గూడూరులో 1926లో జన్మించారు. ఆయన నాలుగు దశాబ్దాల పాటు సాహిత్య సేవలు అందించారు. తన గేయాల ద్వారా నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిరంకుశ పాలన అంతం చేయడానికి తెలంగాణ ప్రజల్లో చైతన్యం కలిగించారు. ఆయన కవితా సభలకు ప్రజలు అధిక సంఖ్యలో వచ్చేవారు. నిజాం నిరంకుశ చర్యలను ప్రజావేదికలపై నిర్భయంగా ఖండించారు దాశరథి. ‘తెలంగాణం రైతుదే, తెలంగాణం ముసలి నక్కకు రాచరికంబు దక్కునే’ అనే దాశరథి సింహగర్జన తెలంగాణ అంతటా మార్మోగింది.
‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ సమావేశాల్లో వేలాది గ్రామీణుల ముందు దాశరథి గంభీరంగా ఉపన్యాసమిచ్చేవారు. పోరాట కాలంలోనే ఆయన ‘అగ్నిధార’, ‘రుద్రవీణ’ గేయ సంపుటాలను ప్రచురించారు. నిజాం పోలీసులు ఆయణ్ని అరెస్టు చేయగా వాళ్ల నిర్బంధం నుంచి తప్పించుకున్నారు.
‘ఓ నిజాం పిశాచమా,
కానరాడు నిను బోలిన రాజు మా కెన్నడేని,
తీగలను దెంపి అగ్నిలోన దింపినావు,
నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ గర్జించారు.
దాశరథిని 1947 నవంబర్ నుంచి 1948 జూన్ వరకు వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో డిటెన్యూగా నిర్బంధించారు.
కృష్ణమాచార్యుల రచనలు
దాశరథి పది కాలాలపాటు గుర్తు పెట్టుకునే కవితలు రాశారు. ఆయన వచనం, కవిత్వం భావావేశపూరితంగా ఉంటుంది. అగ్నిధార, రుద్రవీణ కవితలతో జనం చలించిపోయారు. చీకటి, దీపాలను సంకేతాలుగా చేసి ఆయన రచించిన ‘తిమిరంతో సమరం’ కవితా సంపుటి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం గెలుచుకుంది. ఆయన రాసిన ‘మోదుగపూలు’, ‘మహాంధ్రోదయం’ తెలుగు సాహిత్యంలో భావ కవిత్వానికి మచ్చుతునకలుగా నిలిచాయి. ఆయన రాసిన ‘అభినవ దాశరథి శతకం’ కవితలోని ప్రసన్న లాలిత్యానికి ఉదాహరణగా పేర్కొనవచ్చు.
‘తెల్ల కాగితం మీద నల్లక్షరాలు రాస్తుంది సాదా లేఖిని, నల్ల చీకట్ల మీద నవ కాంతి కవితలు రాస్తుంది జ్వాలా లేఖిని’ అని కృష్ణమాచార్యులు దాశరథి శతకంలో పేర్కొన్నారు.
‘మీర్జా గాలిబ్’ పారశీక భాషలో రాసిన గేయాలను దాశరథి తెలుగులోకి ‘రుబాయిలు’ పేరుతో అనువదించారు. ఆయన అనేక గజళ్లు రాశారు. ఒక గజల్ పలికి మెప్పించడం గురించి దాశరథి ‘రవ్వను చెక్కడంలో ఉన్న సొగసు రాతి మేడ కట్టడంలో రాదు’ అని పేర్కొన్నారు. ఆయన ‘జయదేవుడి’ గీత గోవిందానికి ‘శ్రీ జయదేవ మహాకవి జీవిత చరిత్ర’ పేరుతో వచనంలో ఉపోద్ఘాతం, ‘అష్టపదులకు’ వ్యాఖ్యానం రాశారు. ‘వ్యాసపీఠం’ పేరుతో సాహిత్య వ్యాసాల సంపుటి వెలువరించారు. ఇందులో అన్నమయ్య, తెనాలి రామకృష్ణుడి రచనలు; ఉద్బటారాధ్య చరిత్ర, పాండురంగ మాహాత్మ్యం లాంటివాటిపై విమర్శనాత్మకంగా, నూతన విషయాలను చర్చిస్తూ వ్యాసాలు రాశారు. పోతనామాత్యుని కవితా శిల్పం, మహాభారతంలోని ఉపాఖ్యానాలు, ధర్మసూక్ష్మాలు అనే వ్యాసాలు దాశరథి పరిశీలనా ప్రతిభకు, ప్రజ్ఞకు అద్దం పడతాయి.
విదేశాల్లో తెలుగువారు తమ పిల్లలు తెలుగు మర్చిపోకుండా చూడాలని ‘విపులాచ పృథ్వీ’, ‘అమెరికా సందర్శనం’, ‘మలేషియాలో తెలుగు వెలుగు’ అనే వ్యాసాల్లో దాశరథి తన విదేశీ పర్యటనల అనుభవాలను రమణీయంగా రాశారు. ‘మలయా భాష స్వరూప స్వభావాలు’ వ్యాసాన్ని చదివితే భాషాశాస్త్రం, తులనాత్మక భాషాధ్యయనం, ఆధునిక భాషా సాంస్కృతిక ఉద్యమాల గురించి దాశరథి ఎంత నిశితంగా పరిశీలించారో తెలుసుకోవచ్చు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన వాషింగ్టన్‌లోని ‘నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం’ సందర్శించారు. ఆ అనుభూతిని వర్ణిస్తూ దాశరథి ‘అక్కడ చంద్రశిలను ముట్టుకొని మురిసిపోయాను. చంద్రుణ్ని ముట్టుకోవడమంటే మాటలా!’ అని పేర్కొన్నారు.
దాశరథి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ‘ఆస్థాన కవి’గా ఉన్నత స్థానం అలంకరించారు. ఆయణ్ని ఆధునిక తెలుగు సాహిత్యంలో కవిచంద్రుడిగా పేర్కొంటారు. ఆయన 1987 నవంబర్ 5న అస్తమించారు.

దాశరథి రంగాచార్యులు

ఈయన దాశరథి కృష్ణమాచార్యుల సోదరుడు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా గాంధీజీ ఇచ్చిన ‘సాధించు లేదా మరణించు’ నినాదం ఈయనలో స్ఫూర్తినింపింది. ఈ ప్రభావంతో 16 ఏళ్ల వయసులోనే కమ్యూనిస్టు పార్టీలో చేరారు.
1946లో కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది. ఈ ఉద్యమంలో భాగంగా దాశరథి రంగాచార్యులు తుపాకీ పట్టారు. నాటి పోరాటంలో సుమారు 3500 మంది కమ్యూనిస్టులు ప్రాణాలు కోల్పోయారు. నిజాం పాలనను అంతమొందించడంలో ఆయన తన వంతు పాత్ర పోషించారు. బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, కాళోజీ నారాయణరావు, పుచ్చలపల్లి సుందరయ్య, మఖ్దూమ్ మొహియుద్దీన్, కోదాటి నారాయణరావు ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. పేదలకు పది లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశారు.
దాశరథి రంగాచార్యులు తెలంగాణ మాండలికంలో రాసిన ‘చిల్లరదేవుళ్లు’ నవల అత్యంత ప్రజాదరణ పొందింది. ఈయన అనేక చలన చిత్రాలకు పాటలు కూడా రాశారు. రంగాచార్యులు 2015 జూన్ 8న మరణించారు.

వెదిరె రామచంద్రారెడ్డి

భారతదేశ స్వాతంత్య్రానంతరం జాతిపిత గాంధీజీ ప్రవచించిన అహింసాయుత సిద్ధాంతం అనేక ఉద్యమాలకు ఊపిరిపోసింది. గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యత్యాసాలను రూపుమాపడానికి కృషి చేసిన ఆచార్య వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమం కూడా ఈ కోవకు చెందిందే. దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ భూదానోద్యమ స్ఫూర్తి ప్రదాత వెదిరె రామచంద్రారెడ్డి. ఈయన భూమిని దానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నూతన అధ్యాయానికి నాంది పలికారు. భూదాన ఉద్యమానికి బీజం వేసిన తెలంగాణలోని ‘పోచంపల్లి’ గ్రామాన్ని వినోబా భావే తన రెండో జన్మస్థలంగా అభివర్ణించారు.
వెదిరె రామచంద్రారెడ్డి 1905 జూలై 17న తెలంగాణలోని నల్లగొండ జిల్లా, పోచంపల్లి గ్రామంలో జన్మించారు. ఈయన వెదిరె నరసింహారెడ్డి, లక్ష్మీ నర్సమ్మ ప్రథమ పుత్రుడు. రామచంద్రారెడ్డికి అయిదుగురు సోదరులు. ఆయన హైదరాబాద్‌లోని ‘మదర్సా-ఎ-నిజామియా’లో పారశీ, అరబ్బీ భాషల్లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. తర్వాత బొంబాయిలోని ఫెర్గూసన్ కళాశాలలో 1932లో బీఏ, ఎల్‌ఎల్‌బీ పట్టభద్రులయ్యారు. నిజాం రాష్ట్ర ప్రభుత్వంలో కొంతకాలం తహసీల్దార్‌గా, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. వరంగల్ జిల్లా జనగామలో తహసీల్దార్‌గా పని చేస్తున్న కాలంలో రైతుల నుంచి లెవీ ధాన్యాన్ని బలవంతంగా వసూలు చేయాలని నిజాం ప్రభుత్వం రామచంద్రారెడ్డిని ఆదేశించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత నల్లగొండ కోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా చేరారు. ఆ సమయంలో రాజకీయ ఖైదీగా కోర్టులో హాజరైన తన బావ రావి నారాయణరెడ్డి కేసు విచారణకు వచ్చింది. ప్రభుత్వ న్యాయవాదిగా దాన్ని వాదించే బాధ్యత రామచంద్రారెడ్డిపై పడింది. బంధు ప్రీతితో కేసును నిష్పక్షపాతంగా వాదించలేననే సందేహంతో వెంటనే న్యాయవాద వృత్తిని విరమించారు. ఉదార స్వభావుడు, నిష్పక్షపాతి అయిన రామచంద్రారెడ్డి తన స్వగ్రామమైన పోచంపల్లికి వచ్చి దళిత వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారు. సొంత డబ్బుతో ఉపాధ్యాయుడిని నియమించి ఒక పాఠశాలను నడిపించారు. గ్రామంలో ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తూ అందరికీ మార్గదర్శకంగా నిలిచారు.
రామచంద్రారెడ్డి తెలుగు, హిందీ, పారశీ, అరబ్బీ, ఉర్దూతో పాటు ఆంగ్ల భాషలోనూ విశేష ప్రావీణ్యం సంపాదించారు. ఆయన ‘ద డివైన్ లైఫ్’ అనే ఆంగ్ల గ్రంథాన్ని ఉర్దూ భాషలోకి అనువదించారు.
ఆచార్య వినోబా భావే 1951లో పోచంపల్లి గ్రామం సందర్శించారు. ఆయణ్ని గ్రామ పెద్దలైన వెదిరె రామచంద్రారెడ్డి సాదరంగా స్వాగతించారు. ఆ సమయంలో గ్రామ దళితులు తమకు సేద్యానికి భూమి కావాలని వినోబా భావేను అభ్యర్థించారు. ఆయన వెంటనే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూముల వివరాలను ఆరా తీశారు. అయితే ప్రభుత్వ భూములు పొందడం అంత తేలికైన విషయం కాదని తెలుసుకున్న వినోబా భావే అక్కడి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ‘దళితుల ఆకలి తీర్చడానికి మీలో ఎవరైనా భూమిని దానం చేయగలరా?’ అని ప్రశ్నించారు. వెంటనే వెదిరె రామచంద్రారెడ్డి వంద ఎకరాల సేద్యయోగ్యమైన భూమిని దానం చేయడానికి ముందుకు వచ్చారు. ఇందుకు వినోబా భావే ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ‘భాయీసాబ్ మీరు మాట్లాడింది నిజమేనా?’ అని ప్రశ్నించడంతో రామచంద్రారెడ్డి మాట్లాడకుండా స్వహస్తాలతో దానపత్రం రాసిచ్చారు. ఎవరూ ఊహించని విధంగా ఈ సంఘటన ఒక మహా ఉద్యమానికి నాంది పలికింది. తెలంగాణ ప్రాంతానికి దేశవ్యాప్త గుర్తింపు తెచ్చింది.
విశాల హృదయుడైన రామచంద్రారెడ్డి దానపత్రం అందిన వెంటనే వినోబా భావే నలభై దళిత కుటుంబాలకు భూమిని పంపిణీ చేశారు. నాటి నుంచి వెదిరె రామచంద్రారెడ్డి భాయీసాబ్‌గా, పోచంపల్లి భూదాన్ పోచంపల్లిగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. రామచంద్రారెడ్డి భూదానం చేయడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనికి స్పందిస్తూ ఆయన ‘ఇదంతా ఏదో తాత్కాలిక ఆవేశంతో చేసిన పని అని కొందరు భావిస్తారు. కానీ అది వాస్తవం కాదు. మనం మన నైతిక బాధ్యతలను గుర్తించి భూమి లేని వారికి ఇవ్వడం మంచి పని కాదా? పైగా అలా చేయడం వల్ల మనలో చెడు ఆలోచనలు, వైషమ్యాలు తొలగిపోతాయి. మనసు పరిశుభ్రమవుతుంది. ఆలోచనలు స్వేచ్ఛాపూరితమవుతాయి. శతాబ్దాల తరబడి మోస్తున్న బరువు తొలగిపోతుంది’ అని సమాధానం ఇచ్చారు.
1956 ఏప్రిల్ 18న వినోబా భావే రెండోసారి పోచంపల్లి గ్రామం సందర్శించినప్పుడు రామచంద్రారెడ్డి మరికొంత భూమిని దానం చేశారు. రామచంద్రారెడ్డి స్ఫూర్తితో వినోబా దేశ వ్యాప్తంగా లక్షలాది ఎకరాల భూమి దానంగా పొందారు. చాలావరకు భూములను పేదలకు పంచారు. అధికార యంత్రాంగం, రాజకీయ జోక్యం కారణంగా నిర్దేశిత వర్గాలకు పూర్తి స్థాయి న్యాయం చేకూరలేదు. రామచంద్రారెడ్డి జీవితాంతం గాంధేయ సిద్ధాంతాలకు అంకితమై పనిచేశారు. వినోబా సందేశాన్ని ప్రజలకు అందించడానికి నిరంతరం శ్రమించారు. 1976లో జరిగిన భూదాన రజతోత్సవాల్లో జ్యోతిని పట్టుకొని సంవత్సరం పాటు పాదయాత్ర చేస్తూ ‘ఏవనార్’ ఆశ్రమానికి వెళ్లారు.
1979లో గోవధ నిషేధ కార్యక్రమానికి సారథ్యం వహించారు. దీంట్లో భాగంగా ఆరు నెలల పాటు కేరళ వరకూ పాదయాత్ర నిర్వహించారు. భారత మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్, ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ లాంటి అనేక మంది ప్రముఖ నాయకులు తొలి భూదాతను ఘనంగా సత్కరించారు. ఆయన జీవితాంతం వరకు గ్రామ స్వరాజ్య సాధనకు పాటుపడ్డారు. పోచంపల్లి చేనేత పరిశ్రమ పురోభివృద్ధికి తోడ్పాటు అందించారు. రామచంద్రారెడ్డి 1987 డిసెంబర్ 9న తన 82వ ఏట తనువు చాలించారు.
1995లో వినోబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా వినోబా భావే, రామచంద్రారెడ్డి కాంస్య విగ్రహాలను ప్రభుత్వం ఆవిష్కరించింది. భూదానోద్యమంలో ప్రసిద్ధి పొందిన పోచంపల్లి నేడు గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయికి ఎదిగింది. ఇక్కడ స్వామీ రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. వినోబా మందిరం, భూదాన చారిత్రక స్తూపం లాంటి నిర్మాణాలతో పోచంపల్లి పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ గ్రామం పట్టు చీరలకు ప్రసిద్ధి చెందింది.

ఖండవల్లి లక్ష్మీ రంజనం

మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలనా కాలంలో తెలుగు సాహిత్యానికి, చరిత్రకు ఖండవల్లి లక్ష్మీ రంజనం విశేష సేవ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేసిన ఆయన విద్యార్థుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు. కర్తవ్య నిర్వహణలో అనునిత్యం అప్రమత్తంగా ఉండేవారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు భాషకు ప్రముఖ స్థానం లభించడం వెనుక ఆయన విశేష కృషి దాగి ఉంది.
ఖండవల్లి లక్ష్మీ రంజనం 1908లో తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట తాలూకాలోని బెల్లంపూడిలో జన్మించారు. బెల్లంపూడి సమీపంలోని ఊడుమూడులో ప్రాథమిక విద్య, అమలాపురంలో రెండో ఫారంను అభ్యసించారు. ఆయన తండ్రయిన సూర్యనారాయణ శాస్త్రి వరంగల్ మట్టెవాడలోని త్రిలింగాంధ్రాయుర్వేద కళాశాలలో సంస్కృత పండితుడిగా పని చేసేవారు. దీంతో లక్ష్మీ రంజనం కూడా వరంగల్ వచ్చి హన్మకొండ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. 1924లో నిజాం కళాశాలలో బీఏ సంస్కృతం చదివి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత సిటీ కాలేజీలో ఇంగ్లిష్ టీచర్‌గా కొంత కాలం పనిచేశారు. 1936లో ఎంఏ(తెలుగు-సంస్కృతం)లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు లెక్చరర్‌గా చేరారు. రాయప్రోలు సుబ్బారావు పదవీ విరమణ చేశాక ఆచార్య (ప్రొఫెసర్) పీఠాన్ని అధిష్టించారు.
ఖండవల్లికి విద్యార్థి దశ నుంచే ఆదిరాజు వీరభద్రరావు లాంటి పరిశోధకులతో, గోలకొండ పత్రికా సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి లాంటి ప్రజా సాహిత్య సేవకులతో, లోకనంది నారాయణ లాంటి సాహిత్య పోషకులతో పరిచయం ఏర్పడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రెక్టార్ కిషన్ చంద్ లక్ష్మీ రంజనానికి సహాయ సహకారాలు అందజేశారు. కొమర్రాజు లక్ష్మణరాయ గ్రంథాలు ఖండవల్లిని విశేషంగా ప్రభావితం చేశాయి. ఖండవల్లి 1936 నుంచే సాహిత్యసేవ ప్రారంభించారు. ‘తెలుగుదుక్కి’ శీర్షికతో వ్యాసాలు ప్రచురించారు. త్రివేణి లాంటి ఆంగ్ల పత్రికల్లో ఆధునిక కవిత్వం గురించి అనేక వ్యాసాలు రాశారు.
హైదరాబాద్‌లోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం కార్యదర్శిగా రెండేళ్లపాటు పనిచేశారు. పుస్తకాల సేకరణ, చందాల కోసం తెలంగాణ అంతటా పర్యటించారు. వర్థంతులు, జయంతులు ఎన్నో జరిపారు. ఆంధ్ర సారస్వత పరిషత్ సభ్యులుగా పనిచేసి దాని విస్తరణకు విశేష కృషి చేశారు. ‘నిజాం రాష్ర్ట గ్రంథాలయ సంఘం’ కార్యదర్శిగా కూడా పనిచేశారు. కొమర్రాజు వదిలి పెట్టిన ‘విజ్ఞాన సర్వస్వం’ పూర్తి చేయాలనే ఉద్దేశంతో కొందరు మిత్రులతో కలిసి గ్రంథావలోకనం, విషయ సేకరణ ప్రారంభించారు. 1940ల్లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో విద్యుద్దీపాలు లేనందున ఆముదం దీపాల వెలుతురులోనే తన కృషిని కొనసాగించారు. 1944 నాటికి ‘విజ్ఞాన సర్వస్వం’ పూర్తి చేయాలని భావించారు. ఇందుకోసం ‘మహారాష్ర్ట జ్ఞాన కోశ్’ని ఆధారంగా తీసుకున్నారు. నాలుగైదు సంపుటాల విషయ సేకరణ చేశారు. ముద్రణకు సిద్ధమైన ఆ సంపుటాలు చోరికి గురికావడం వల్ల విజ్ఞాన సర్వస్వాన్ని ముద్రించడం సాధ్యపడలేదు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృతి గురించి పాఠాలు బోధించారు. దానికోసం చేసిన అధ్యయన ఫలితంగానే ఆంధ్రుల చరిత్ర -సంస్కృతి, ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహం లాంటి గొప్ప గ్రంథాలను రచించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ‘విజ్ఞాన సర్వస్వం’ ప్రచురణ కోసం ప్రభుత్వం ద్వారా తిరిగి ప్రయత్నించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ వ్యవస్థాపకులు బిరుదు వెంకట శేషయ్య, లోకనంది నారాయణ అంతకు ముందే ప్రయత్నించి విఫలమయ్యారు. మిత్రులు, అభిమానులు సహాయం చేస్తారనే నమ్మకంతో 1953లో బేతన భట్ల విశ్వనాథంతో కలిసి సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశ సమితి సంఘాన్ని స్థాపించారు. దీనికి మిమిడి పూడి వెంకట రంగయ్య చైర్మన్‌గా వ్యవహరించారు. ఈ సంఘం ద్వారా సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశం నాలుగు సంపుటాలను ప్రచురించారు.
ఖండవల్లి ఆంధ్ర రచయితల సంఘానికి అధ్యక్షులుగా పనిచేసి దాని తరఫున సిద్ధేశ్వర చరిత్ర, ప్రసన్న రాఘవ నాట్య ప్రబంధం, సంస్కృతంలో అహోబిల పండితీయం (ఆంధ్ర వ్యాఖ్యా సహితం) ప్రచురించారు. ఓరియంటల్ కాలేజీని స్థాపించి 1958లో బీవోఎల్, డీవోఎల్ లాంటి ప్రాచ్యపట్టాలను విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేశారు. స్వామి వివేకానంద కమిటీ హైస్కూల్‌కు కార్యదర్శిగా పనిచేసి దాని భవనాన్ని నిర్మించారు.
ఖండవల్లి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేసిన సమయంలో తెలుగు భాషకు, తెలుగు ప్రజలకు విశేష సేవలందించారు. ఆయన ఆచార్య పదవిని చేపట్టాక ఎంఏలో సంస్కృతం లేదా ద్రావిడ భాషల్లో ఏదో ఒకటి తప్పకుండా ఎంచుకునేలా ఏర్పాటు చేశారు. తెలుగును ద్వితీయ భాష చేయడం కోసం అకడమిక్ కౌన్సిల్‌తో పోరాడి విజయం సాధించారు. పీహెచ్‌డీని ప్రవేశపెట్టారు. విద్యార్థుల్లో తెలుగంటే మన మాతృభాష అనే భావన కలిగేలా చేశారు. విద్యార్థులతో అనేక మంది కవులపై చర్చాగోష్ఠులు నిర్వహించి, పరిశోధనాభిరుచి పెంపొందించేందుకు కృషి చేశారు. మహాభారతం, నాటకాలు, కవులపై సదస్సులు నిర్వహించి వాటిని గ్రంథ రూపంలో తెచ్చారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం తరఫున ఆంధ్ర మహాభారతాన్ని పునర్ముద్రించారు. తెలంగాణ మాండలికాల అధ్యయనానికి పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆంధ్రదేశ చారిత్రక భూగోళం (ది హిస్టారికల్ జాగ్రఫీ ఆఫ్ ఆంధ్ర) రచనకు ప్రయత్నం చేశారు.

ఇల్లిందల సరస్వతీ దేవి

ఇల్లిందల సరస్వతీ దేవి తల్లిదండ్రులు కామరాజు వెంకట లక్ష్మమ్మ, వెంకటప్పయ్య. ఈమె తండ్రి వెంకటప్పయ్య 1928లో నందిగామ తహసీల్దార్‌గా పని చేశారు. అదే సంవత్సరంలో ఇల్లిందల సీతారామరావుతో పన్నెండేళ్ల వయస్సులో సరస్వతీ దేవికి వివాహం చేశారు. అప్పుడు ఆమె రెండో ఫారం చదువుతున్నారు. ఆమె హైదరాబాద్‌లోని స్టాన్లీ గర్ల్స్ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్ వరకు చదివారు. చిన్న వయస్సులోనే తల్లి కావడంతో పై చదువులు చదవలేకపోయారు. తీరిక వేళల్లో ట్రూ స్టోరీ మేగజీన్ లాంటి కథల పత్రికలను చదివి, జిజ్ఞాసతో వాటిని అధ్యయనం చేశారు. ఆమె భర్త సీతారామరావు ఎం.సి. చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విజ్ఞానశాస్త్ర ఉపన్యాసకులుగా పని చేసేవారు. ఆయన తన భార్యను ఎంతో ప్రోత్సహించారు. సరస్వతీ దేవి తన విజ్ఞానాన్ని మహిళలు, ప్రజల సేవకు వినియోగించింది.

ఆంధ్రయువతీ మండలి స్థాపన

ఆ రోజుల్లో తెలంగాణలో మహిళల పరిస్థితి దయనీయంగా ఉండేది. ముస్లింలు చాలా ముందంజలో ఉండేవారు. కానీ హిందువుల్లోని మధ్యతరగతి మహిళలు ఎంతో వెనుకబడి ఉండేవారు. ఉన్నత తరగతి స్త్రీల సంగతి చెప్పనక్కర్లేదు. సర్వసతీ దేవి విద్యార్థి దశ నుంచే ‘ఆంధ్రమహిళా సభ’ కార్యకలాపాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. మధ్యతరగతికి చెందిన హిందూ స్త్రీల కోసం, ముఖ్యంగా తెలుగువారి ప్రగతి కోసం ప్రత్యేకంగా ఒక సంస్థను నెలకొల్పాలని ఆమె భావించారు. యల్లాప్రగడ సీతాకుమారితో కలిసి 1934లో ‘ఆంధ్రయువతీ మండలి’ని హైదరాబాద్‌లో స్థాపించారు. దీనికి రంగమ్మ ఓబుల్‌రెడ్డి అధ్యక్షురాలిగా వ్యవహరించారు.
ఆంధ్రయువతీ మండలిని స్థాపించాక అందులో సభ్యులను చేర్చడం కష్టమైంది. నాటి కష్టాలను సరస్వతీ దేవి తన మాటల్లో ఇలా చెప్పారు. ‘సభ్యులను చేర్చుకోవడానికి బయల్దేరేవాళ్లం. ఉన్నత కుటుంబాలకు చెందిన స్త్రీలు బయటకు వచ్చేవారు కాదు. సంస్థానాల రాణులు, జాగీర్దారిణీలు మాతో ముఖాముఖిగా మాట్లాడేవారు కాదు. పరదా వెనుక లీలగా కనిపిస్తూ చెలికత్తెల ద్వారా లేదా ఆయాలతో కబురు పంపేవారు. సభ్యత్వ జాబితాలో తమ పేర్లను బిరుదులతో సహా రాయాలని పదే పదే చెప్పేవారు. యువతీ మండలికి సురవరం ప్రతాపరెడ్డి అసతోమా సద్గమయ అనే నినాదాన్ని సూచించారు. నియమావళిని బూర్గుల రామకృష్ణారావు సిద్ధం చేశారు.’
ఆంధ్రయువతీ మండలి కోసం సరస్వతీ దేవి పన్నెండేళ్ల పాటు శ్రమించారు. యువతీ మండలిలో కార్యదర్శి, ఉపాధ్యక్ష పదవులను నిర్వహించారు. బూర్గుల రామకృష్ణారావు భార్య అనంత లక్ష్మీదేవి అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో ‘ఆంధ్రయువతీ మండలి’ కోసం బర్కత్‌పురాలో పెద్ద భవంతిని నిర్మించారు. ఇల్లిందల సరస్వతీ మండలిలో శాశ్వత సభ్యురాలు. ఈమె మండలి అభివృద్ధితోపాటు, భారత సంఘ సంక్షేమాల్లో సభ్యురాలిగా, బందిఖానాలు, ఆసుపత్రుల పర్యవేక్షకురాలిగా, శిశు సంక్షేమ సంఘ సభ్యురాలిగా ఎన్నో నూతన పథకాలను సూచించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వాహక సభ్యురాలిగా, శ్రీకృష్ణదేయరాయాంధ్ర భాషానిలయ నిర్వాహక సభ్యురాలిగా కొంత కాలం పాటు పనిచేశారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ హైదరాబాద్ శాఖకు నిర్వాహక సభ్యురాలిగా, ఉపాధ్యక్షులుగా కేంద్ర గ్రంథాలయ, శిశు శాఖ సభ్యురాలిగా ఆమె విశేష కృషి చేశారు.

సరస్వతీ దేవి రచనలు

ఆమె రచించిన మొదటి కథ, మొదటి వ్యాసం 1933లో ‘గోలకొండ’ పత్రికలో ప్రచురితమయ్యాయి. మహిళా, శిశు జనోద్ధరణ లక్ష్యంగా హైదరాబాద్‌లోని రేడియా కేంద్రానికి వ్యాసాలు, నాటికలు, కథలు రాశారు. జీవన సామరస్యం, నారీ జగత్తు, వెలుగు బాటలు, పండుగ బహుమతి, అక్కరకు వచ్చిన చుట్టం, ముత్యాల మనసు, పండుగ బహుమతి, జాతిరత్నాలు, బాలవీరులు మొదలైనవి ఆమె రచనలు.
సరస్వతీ దేవి తల్లి వెంకట లక్ష్మమ్మ బ్రహ్మ సమాజ నాయకులైన దేశిరాజు పెదబాపయ్య సోదరి. కాబట్టి సరస్వతీ దేవికి చిన్నతనం నుంచే సంస్కరణ భావాలు అలవడ్డాయి. కానీ ఆమె ఇద్దరు పిల్లలు మరణించడంతో సనాతన సంప్రదాయాల పట్ల ఆసక్తి చూపారు. 1958లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఏర్పాటైనప్పుడు ఆమె చేసిన సంఘ సేవకు గుర్తుగా మండలిలో సభ్యత్వం లభించింది.
సరస్వతీ దేవి తన రచనల్లో వర్తమాన సమస్యలను ప్రధానంగా చర్చించేవారు. ‘నీలో చాలా శక్తి దాగి ఉంది. దాన్ని ఉపయోగించి ప్రకాశించడానికి ప్రయత్నించు. మగవారిపై కోపం వద్దు, దేన్నీ యాచించవద్దు. సంపాదించుకోవాలి’ అనే సూచనలు ఆమె రచనల్లో కన్పిస్తాయి. సరస్వతీ దేవి దాదాపు మూడు దశాబ్దాల పాటు రచనలు చేశారు.

కాళోజీ నారాయణరావు

ప్రజాకవి కాళోజీ నారాయణరావు 1914 సెప్టెంబర్ 9న జన్మించారు. ఈయన కుటుంబం కర్ణాటకలోని బీజాపూర్ నుంచి తెలంగాణాలోని వరంగల్ జిల్లాకు వలస వచ్చి మడికొండ గ్రామంలో స్థిరపడింది. కాళోజీ తల్లిదండ్రులు రంగారావు, రమాబాయమ్మ. ఈయన హైదరాబాద్‌లోని చౌమొహల్లా పాఠశాల, సిటీ కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. 1939లో హైదరాబాద్ హైకోర్టుకు అనుబంధంగా ఉన్న న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ భాషల్లో ప్రముఖ కవిగా గుర్తింపు పొందారు.
కాళోజీ జాతీయోద్యమాల్లో చురుగ్గా పాల్గొని అనేక పర్యాయాలు జైలుకు వెళ్లారు. నిజాం ప్రభుత్వ కాలంలో తన రచనల ద్వారా తెలంగాణా ప్రజల్లో దేశభక్తి రేకెత్తించారు. సామాన్య ప్రజలను విశేషంగా ఆకర్షించడం ఈయన కవిత్వానికి ఉన్న ప్రత్యేకత. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండున్నరేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన వందేమాతరం ఉద్యమంలో పాల్గొనడం వల్ల బహిష్కరణకు గురైన విద్యార్థులను నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించారు.

అన్యాయాన్ని ఎదిరిస్తూ కలమెత్తిన ప్రజాకవి..
కాళోజీ 1948 భారత విలీనోద్యమంలో ఏడు నెలల పాటు వరంగల్, గుల్బర్గా జైళ్లలో శిక్ష అనుభవించారు. వరంగల్‌లో నిజాం రజాకార్లు జాతీయవాది అయిన మొగులయ్యను హత్య చేసినప్పుడు కాళోజీ రాసిన గేయం ప్రజలను కదిలించింది. నిజాం ప్రధానమంత్రి మీర్జా ఇస్మాయిల్ వరంగల్ సందర్శించినప్పుడు ‘ఎన్నాళ్ల నుండియో..’ అనే గేయం రాశారు. ‘అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు సకిలించు ఆంధ్రుడా.. చావవెందుకురా’, ‘అతిథివోలె వుండి.. అవని విడిచి వెళ్లుతాను’ లాంటి కాళోజీ కవితా పంక్తులు ప్రసిద్ధి చెందాయి.
విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి కాళోజీ వరంగల్‌లో గణపతి ఉత్సవాలు నిర్వహించారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయణ్ని నగరం నుంచి బహిష్కరించారు. హైదరాబాద్‌లో ‘ఆంధ్ర సారస్వత పరిషత్’ స్థాపకుల్లో ఒకరైన కాళోజీ తెలంగాణా రచయితల సంఘం ఏర్పాటులోనూ ప్రముఖపాత్ర పోషించారు.
కేంద్ర ప్రభుత్వం కాళోజీ సేవలను గుర్తించి 1992లో పద్మవిభూషణ్ బిరుదునిచ్చి సత్కరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు ‘ప్రజాకవి’ బిరుదు ఇచ్చింది. 1992లో వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం కాళోజీకి గౌరవ డాక్టరేట్ బహుకరించింది.

రచనలు
కాళోజీ ‘మనమే నయం’, ‘తెలియక ప్రేమ.. తెలిసి ద్వేషం’, ‘విభూతి లేక ఫేస్ పౌడర్’ తదితర శీర్షికలతో కథలు రాశారు. వ్యంగ్యం, అధిక్షేపాలను కలగలిపి వీటిని రచించారు. సమాజంలో నిరుపేదలు, కష్టజీవుల బతుకులు దుర్భరంగా ఉన్నాయనే వాస్తవికతను కాళోజీ ఈ కథల్లో వ్యంగ్యంగా చిత్రీకరించారు. కె.సి. గుప్తా 1943లో సుల్తాన్ బజార్‌లోని ఆంధ్ర పబ్లిషింగ్ కంపెనీ తరఫున ‘అణా గ్రంథమాల’ ప్రచురణల వరసలో 24వ గ్రంథంగా ‘కాళోజీ కథలు’ పేరుతో పుస్తకాన్ని ముద్రించాడు. అప్పట్లో దీని వెల ఒక కల్దారు అణా మాత్రమే. నాడు హైదరాబాద్ రాష్ట్రంలో హాలీ చిక్కాలు (నాణేలు) అమల్లో ఉన్నప్పటికీ దీని ధరను కల్దారులో ప్రకటించారు. ‘సుభాష్ చంద్రబోస్’ అనే గ్రంథాన్ని ప్రచురించినందుకు ప్రభుత్వం కె.సి. గుప్తాకు ఒక నెల కఠిన శిక్షతో పాటు రూ. 250 జరిమానా, రచయితకు 18 నెలల కఠిన శిక్ష విధించింది. అల్లూరి సీతారామరాజుపై వెలువరించిన గ్రంథాన్ని కూడా నిషేధించింది. ఇలాంటి స్థితిగతులూ, ప్రభుత్వ నిర్బంధ విధానాలు ఉన్నప్పటికీ కాళోజీ ధైర్యంగా తన కలాన్ని కదిలించారు. కాళోజీ 1941లో ‘అణా కథలు’, 1946లో ‘కాళోజీ కథలు’, 1953లో ‘నా గొడవ’ రచించారు. 1969-70లో తెలంగాణా ఉద్యమ కవితలు రచించారు. కాళోజీ ఆత్మకథ ‘ఇది నా గొడవ’. దీన్ని 1995లో రచించారు.
కాళోజీ నారాయణరావు 2002 నవంబర్ 13న మరణించారు. ఆయన తన దేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి దానం చేశారు. తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఈ కళాశాల పేరును కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చారు. రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ నారాయణరావు జయంతిని ‘తెలంగాణా భాషా దినోత్సవం’గా ప్రకటించింది. 2015 సెప్టెంబర్ 9న తొలిసారిగా తెలంగాణా భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ స్మారక పురస్కారం అందించారు. దీన్ని మొదటిసారిగా ప్రముఖ కవి డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్‌కు 2015 సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో ప్రదానం చేశారు.

ఆచార్య సి. నారాయణ రెడ్డి

ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సినారె) ఈ శతాబ్దపు మహాకవుల్లో ప్రముఖులు. దాదాపు ఐదు దశాబ్దాలుగా సినారెకి తెలుగు సాహితీవనంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈయన తెలంగాణలోని కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా హన్మాజీపేటలో 1931 అక్టోబర్ 29న జన్మించారు. ఈయన తల్లిదండ్రులు సింగిరెడ్డి బుచ్చమ్మ, మల్లారెడ్డి. సిరిసిల్ల, కరీంనగర్‌లో సినారె ప్రాథమిక, మాధ్యమిక విద్య అభ్యసించారు. హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ పూర్తిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బి.ఎ., ఎం.ఎ. పట్టాలు పొందారు. 1962లో ‘ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయాలు-ప్రయోగాలు’ అనే సిద్ధాంత వ్యాసానికి పీహెచ్‌డీ పట్టా పొందారు. ఈ గ్రంథాన్ని 20వ శతాబ్ద పూర్వార్ధ ప్రామాణికమైన సాహిత్య చరిత్రగా పేర్కొనవచ్చు. ఆయన కవిత్వాన్నే ఎన్నుకొని ఆయా నవీన కవితారీతులు సమగ్రంగా విశ్లేషించి ఆధునిక సాహిత్య నేపథ్యాన్ని సమన్వయించి చూపారు.
వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంలో కందుకూరి, గురజాడ, గిడుగు కృషి వల్ల నూతన సాహిత్య పోకడలు ఆవిష్కృతమయ్యాయి. సాహిత్యంతోపాటు కళాత్మక విలువలు కూడా పెంపొందాయి. కవితా మాధ్యమం, శిల్పమూ, ఛందమూ నూతన అందాలు సంతరించుకున్నాయి. ఈ శతాబ్దంలో మాత్రా ఛందస్సులు, గీతికలు, గేయాలు, రొమాంటిసిజంతో కాల్పనిక కవులు, రచయితలు ప్రభావితులయ్యారు. వారిలో ఆచార్య సినారె కూడా ఒకరని చెప్పుకోవచ్చు.

సాహిత్యం
ఆచార్య సి. నారాయణ రెడ్డి తెలుగు భాషకు సమగ్రపుష్టి. ప్రధానంగా ఈయన నాదకవి. సినారె రచనల్లో అనేక ప్రక్రియలు కనిపిస్తాయి. గీతికలు, గేయాలు, అభినవ కవితలు హృదయాన్ని హత్తుకుంటాయి. ఈయన రచించిన ‘దివ్వెల మువ్వలు’ లాంటి ముక్తకాల నుంచి ‘నాగార్జున సాగరం’, ‘కర్పూర వసంతరాయలు’ లాంటి కథాకావ్యాలు, ‘నవ్వని పువ్వు’, ‘రామప్ప విశ్వదీపం’ తదితర సంగీత రూపకాల వరకూ ఈయన కవితా రచనలో నాద తరంగిణి వినిపిస్తుంది. ఈయన స్వయంగా కర్పూర వసంతరాయలు కావ్యం గానం చేస్తుంటే హృదయం పులకరిస్తుంది. ఐదు దశాబ్దాలపాటు సినారె కొన్ని వందల గేయాలు, గీతాలు రచించారు. అనేక సినిమా పాటలు కూడా రాశారు. ఆధునిక సాహిత్యంలో గేయరచనకు స్థిరస్థానం కల్పించారు. డా. సి. నారాయణరెడ్డి పేరు వినగానే కర్పూర వసంతరాయలు, నాగార్జున సాగరం, విశ్వంభర మొదలైన గేయ కథాకావ్యాలు గుర్తుకు వస్తాయి. ‘తెలుగు గజళ్లు’, ‘ప్రపంచ పదులు’ లాంటి వినూత్న రచనలు ఆయన ప్రతిభకు తార్కాణాలు. ‘విశ్వంభర’, ‘మట్టీమనిషీ ఆకాశం’ లాంటి దీర్ఘకావ్యాలు సినారె తాత్త్వికతకు నిదర్శనాలు. ‘మట్టీ మనిషీ ఆకాశం’ హిందీ, ఆంగ్ల భాషల్లోకి అనువాదమైంది. పుస్తక సమీక్షలు కూడా వచ్చాయి. డా. ముదిగొండ వీరభద్రయ్య దానిమీద వందపేజీల వ్యాఖ్యా గ్రంథం రాశారని సినారె స్వయంగా చెప్పారు. ఇవే కాకుండా ఎన్నో వచన కవితలు, గీతాలు, గజళ్లు, ప్రపంచ పదులు, ద్విపదలు రచించారు.
సినారె కవిత్వం ఒక నిరంతర ప్రస్థానం. ఎల్లలెరుగని విశ్వమానవీయత ఆయన తత్వం. అనాదిగా మానవజీవితం విశ్వంలో ఏ విధంగా ప్రతిస్పందిస్తుందీ, విశ్వంతర ప్రకృతిలో మానవ మహితాత్మ ఎలా నిరంతర యాత్ర సాగిస్తోందీ.. అనే విషయాలను తన విశ్వంభర సుదీర్ఘ కావ్యంలో ప్రతిపాదించారు. ఈ కావ్యం సినారెను ఆధునిక భారతదేశ సాహిత్య చరిత్రలో మహాకవిగా, ఆధునికాంధ్ర సార్వభౌముడిగా నిలబెట్టింది. 1988లో ‘జ్ఞానపీఠ్ పురస్కారం’ సాధించిపెట్టింది. ఇప్పటివరకు తెలుగు సాహిత్యంలో ముగ్గురికి మాత్రమే ‘జ్ఞానపీఠ్’ పురస్కారం లభించింది. సినారెతో పాటు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ (రామాయణ కల్పవృక్షం - 1970లో), రావూరి భరద్వాజ (పాకుడు రాళ్లు - 2012లో) ఈ పురస్కారం అందుకున్నారు. 1990-91లో యుగోస్లేవియాలో జరిగిన ‘విశ్వకవి’ సమ్మేళనంలో సినారె పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నలభై దేశాలు, నలభై భాషల కవులు పాల్గొన్న సమ్మేళనంలో మనదేశం తరఫున భారతీయ భాషల ప్రతినిధిగా నారాయణరెడ్డిని భారత ప్రభుత్వం పంపించింది. అక్కడ నియమం ప్రకారం ఆ కవి రాసిన భాషలోనే తన కవిత చదవాలి. అలా చదివిన తర్వాత దాని అనువాదం ఉంటుంది. అది విన్న పండితులు, కవులు, హర్షధ్వానాలతో నారాయణ రెడ్డిని స్వాగతించారు. ప్రపంచవ్యాప్తంగా విశేష పాఠకాదరణ ఉన్న ఇరవైమంది భారతీయ సాహితీవేత్తల్లో ఆచార్య నారాయణరెడ్డి ఒకరని ‘దేశ్’ అనే బెంగాలీ పత్రిక తన సర్వేలో తెలిపింది.
ఈ శతాబ్ద సాహిత్యమూర్తుల్లో విలక్షణ వ్యక్తిత్వం నారాయణ రెడ్డిది. కవితా తాత్త్వికుడిగా, కళావేత్తగా, గాన, సాహిత్యవేత్తగా పేరొందారు. తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడిగా, ఆంధ్రసారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఈయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

ఆరుట్ల రామచంద్రారెడ్డి

నిజాం (మీర్ ఉస్మాన్ అలీఖాన్) నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన ప్రముఖుల్లో ఆరుట్ల రామచంద్రారెడ్డి ఒకరు. భువనగిరి ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాటం, గెరిల్లా పోరాటాల్లో ఆరుట్ల రామచంద్రారెడ్డి ప్రముఖపాత్ర వహించారు. ఈయన విద్యార్థి దశలోనే 1930 నాటికి రాజకీయాల్లో ప్రవేశించారు. 1948-1952 మధ్య కాలంలో వివిధ జైళ్లలో దారుణ నిర్బంధాలను అనుభవించారు. అనేక చిత్రహింసలకు గురయ్యారు. స్వాతంత్య్రానంతరం మెదక్ జిల్లా రామాయంపేట నియోజకవర్గం నుంచి 1952, 1957, 1962లలో శాసనసభకు ఎన్నికయ్యారు. కమ్యూనిస్టు అగ్రనాయకులుగా కొనసాగారు. ప్రజాసేవలో ఆయనకు సహధర్మచారిణి కమలాదేవి కూడా సహకరించారు.

బాల్యం - విద్యార్థి దశ
రామచంద్రారెడ్డి 1909లో నల్లగొండ జిల్లాలోని భువనగిరి తాలూకా కొలనుపాకలో జన్మించారు. గ్రామంలో ఒకే ఉపాధ్యాయుడు ఉండే జాగీరు పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. 1926లో భువనగిరిలో మాధ్యమిక పాఠశాలలో ఫస్టు, సెకండ్ ఫారం, 1928లో హైదరాబాద్ గోషామహల్ మిడిల్ స్కూల్లో థర్‌‌డ ఫారం పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని రెడ్డి బాలుర వసతి గృహంలో చేరి, నాంపల్లి హైస్కూల్‌లో 1930లో మెట్రిక్యులేషన్ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.

జాతీయోద్యమ ప్రభావం
1930 ఏప్రిల్‌లో గాంధీజీ దండి సత్యాగ్రహం ప్రారంభించారు. దేశమంతటా జాతీయ ఉద్యమం వాయువేగంతో విస్తరించింది. విప్లవ వీరులైన భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ఉరికంబాలకు ఎక్కి ప్రాణత్యాగం చేశారు. తెలంగాణ ప్రాంతం నుంచి కామ్రేడ్లు.. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి కాకినాడ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. బ్రిటిషర్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నాడు స్వదేశీ లీగ్ పేరుతో హైదరాబాద్‌లోని వికాజీ హోటల్ (అబిదాషాపు) ఆవరణలో బహిరంగ సభలు నిర్వహించేవారు. ఈ జాతీయోద్యమ ప్రభావం రామచంద్రారెడ్డిపై పడింది.
కొత్వాల్ రాజా వెంకట్రామారెడ్డి హైదరాబాద్‌లో ‘రెడ్డి బాలుర వసతి గృహం’ స్థాపించి, ఎంతో అభివృద్ధి చేశారు. ఈయన సహకారంతో రామచంద్రారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు ‘బాలికల వసతి గృహం’ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో ఇదే మొట్టమొదటి బాలికల వసతి గృహం.

ఆంధ్ర మహాసభలు
1931-32లో ఆరుట్ల రామచంద్రారెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరిన కాలంలోనే ఆర్య సమాజం, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఆంధ్ర మహాసభ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1930లో మెదక్ జిల్లా జోగిపేటలో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన ప్రథమాంధ్ర మహాసభ నిర్వహించారు. రావి నారాయణ రెడ్డి నాయకత్వంలో సైకిల్ యాత్రా దళంలో వలంటీరుగా పాల్గొని ఆరుట్ల రామచంద్రారెడ్డి ఈ సభకు హాజరయ్యారు. ఆ తర్వాత 1944లో రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన భువనగిరిలో 11వ ఆంధ్ర మహాసభ జరిగింది. దీనికి రామచంద్రారెడ్డి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించి సభను విజయవంతం చేశారు. ఆంధ్ర మహాసభ మితవాద నాయకులైన కొండా వెంకట రంగారెడ్డి, మందుముల నర్సింగరావు భువనగిరి మహాసభను బహిష్కరించారు. తమదే నిజమైన ఆంధ్ర మహాసభగా పేర్కొంటూ 1945లో వీరు పోటీగా మడికొండలో మరో ఆంధ్ర మహాసభ నిర్వహించారు. 1945లో రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన ఖమ్మంలో 12వ ఆంధ్ర మహాసభ జరిగింది. పాలకుర్తి కుట్ర కేసులో ఏడాది పాటు హైదరాబాద్ సెంట్రల్ జైల్లో నిర్బంధంలో ఉండటం వల్ల రామచంద్రారెడ్డి ఈ సభకు హాజరు కాలేకపోయారు. ఈ సమావేశంలో వెట్టిచాకిరీ రద్దు, రైతులు, హైదరాబాద్ సంస్థానంలో ప్రజారాజ్య స్థాపనకు సంబంధించిన తీర్మానాలు చేశారు. 1946లో నిజాం నవాబు ఆంధ్ర మహాసభలపై నిషేధం విధించాడు. మితవాద నాయకులు జమలాపురం కేశవరావు అధ్యక్షతన 1946లో కందిలో ఆంధ్ర మహాసభ నిర్వహించారు. ఇదే సంవత్సరం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌పై నిజాం నిషేధం ఎత్తేశాడు. తర్వాత మితవాదుల ఆంధ్ర మహాసభ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది.

నవయువకులైన రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, డాక్టర్ రాజబహద్దూర్ గౌర్, ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, సర్వదేవభట్ల రామనాథం, పెరవెళ్లి వెంకటరమణ ఆంధ్ర మహాసభ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. వీరు తమ ఉపన్యాసాల ద్వారా తెలంగాణ ప్రజానీకాన్ని ప్రజా పోరాటాల దిశగా సమీకరించారు. ఆంధ్ర మహాసభలో అతివాద భావాలతో పనిచేస్తున్న యువకులంతా మితవాద నాయకత్వాన్ని దీని నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో 1941లో నల్లగొండ జిల్లా చిలుకూరు (హుజుర్ నగర్)లో రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన 8వ ఆంధ్ర మహాసభ నిర్వహించారు. ఇది పూర్తిగా రాజకీయ స్వరూపాన్ని సంతరించుకుంది. బాధ్యతాయుత ప్రభుత్వ స్థాపనే ఆంధ్ర మహాసభ ఆశయంగా సమావేశ వేదిక నుంచి ప్రకటించారు. చిలుకూరు సభలోనే ఆంధ్రమహాసభ అతివాదులు, మితవాదులుగా చీలిపోయింది.

హరిజనులు - దేవాలయ ప్రవేశ హక్కులు
అస్పృశ్యతా నివారణపై ఆంధ్ర మహాసభ వేదికల నుంచి తీర్మానాలు చేశారు. కొన్ని మహాసభల్లో సహపంక్తి భోజనాలు చేసేవారు. ఆ రోజుల్లో హరిజనులకు దేవాలయ ప్రవేశం ఉండేది కాదు. మూడో ఆంధ్ర మహాసభ పులిజాల వెంకట రంగారావు అధ్యక్షతన 1934లో ఖమ్మంలో నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న ప్రతినిధుల్లో కొందరు సనాతన ధర్మ పారాయణులు ప్రత్యేక వంటలు చేయించుకొని, మడిబట్టలు ధరించి భోజనాలు చేశారు.
ఆరుట్ల రామచంద్రారెడ్డి హరిజనులతో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ప్రవేశం చేయించారు. భువనగిరి తాలూకాలోని పాముకుంట, జాల, కుర్రారం, నమిలె, బేగంపేట, రాజాపేట, నర్సాపురం, రేణుకుంట మొదలైన సుమారు 35 గ్రామాలకు చెందిన 400 మంది హరిజనులను సమీకరించి దీన్ని నిర్వహించారు. కుర్రారం రంగారెడ్డి ఈ విషయంలో రామచంద్రారెడ్డికి విశేషంగా సహకరించారు. ఈ హరిజన సమూహాన్ని చూసి దేవాలయ పూజారులు ఎలాంటి అభ్యంతరం తెలపకుండా వారందరికీ తీర్థ ప్రసాదాలు పంచి పెట్టారు.

నిజాం కుటిల పన్నాగం
హైదరాబాద్ సంస్థానంలో నూటికి 90 మంది హిందూ మతానికి, 10 మంది ముస్లిం మతానికి చెందినవారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో వరసగా ఆంధ్ర మహాసభ, మహారాష్ట్ర పరిషత్తు, కర్ణాటక పరిషత్తు.. ప్రాంతీయ మహాసభల కార్యకలాపాలు, ప్రజా పోరాటాలు నిర్వహించాయి. ఇదే సమయంలో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన నిరంకుశ ప్రభుత్వాన్ని శాశ్వతం చేయాలని భావించాడు. బహదూర్ యార్ జంగ్ ముస్లిం మతతత్వవాది, మంచివక్త. నిజాం ప్రభుత్వానికి ముప్పు ఏర్పడుతుందని గ్రహించి, దీన్ని కాపాడగలిగేది ముస్లిం మతస్థులేనని భావించాడు. ముస్లింలు అల్ప సంఖ్యాకులుగా ఉన్నందువల్ల మత మార్పిడి ద్వారా వారి సంఖ్య పెంచుకొని రాజ్యాన్ని రక్షించుకోవాలని బహదూర్ యార్ జంగ్ సమగ్ర పథకం వేశాడు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన కులాలకు చెందినవారిని, హరిజనులను ఇస్లాం మతంలోకి మార్చడానికి పూనుకున్నాడు. దొరలు, భూస్వాములకు చేస్తున్న వెట్టిచాకిరీ రద్దవుతుందని ప్రజలను మభ్యపెట్టాడు. దీంతో తీవ్ర యాతనలకు గురైన చాకలి, మంగలి, హరిజన తదితర పీడిత ప్రజలు ఇస్లాం మతంలోకి మారారు. జనగాం తాలూకాలో విస్నూరు దేశ్‌ముఖ్ కఠార్ రామచంద్రరావు; నరసింహారావు, పూనుకూరు రాఘవరావు లాంటి వెలమ దొరలు, పేరు మోసిన భూస్వాములు.. ముండ్రాయి, కఠార్, రామాపురం, ముంచుప్పల, ధర్మాపురం, రామన్నగూడెం గ్రామాలపై ఏకచ్ఛత్ర పాలన సాగించేవారు. పథకం ప్రకారం బహదూర్ యార్ జంగ్ ముందుగా ఈ గ్రామాల్లోనే మతమార్పిడిని ఉధృతం చేశాడు.

మతమార్పిడులు ఊపందుకోవడంతో భూస్వాములు, దొరలు, దౌర్జన్యపరులంతా విస్నూరు రామచంద్రారెడ్డి అధ్యక్షతన హిందూ సమితి పేరుతో దొరలతో కూడిన మత సంస్థను స్థాపించారు. హిందూమతం ఉనికి ప్రశ్నార్థకమైందని, మతాన్ని రక్షించే సాకుతో పాతకాలం నాటి బానిస విధానం, దోపిడీ, వెట్టి చాకిరీని యథాప్రకారం కొనసాగించుకోవచ్చనే దుష్ట తలంపుతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో ఆర్యసమాజం నిజాం ప్రభుత్వ విధానాలు, మత మార్పిడికి వ్యతిరేకంగా పోరాడింది. ఇస్లాం మతం స్వీకరించిన వారిని తిరిగి హిందూమతంలో చేర్చుకోవడానికి ఉద్యమం చేసింది. ఆర్య సమాజం నాయకులైన నరేందర్ జీ, శంకర్ రెడ్డి దీని కోసం విశేష కృషి చేశారు. 1944-45 సంవత్సరాల మధ్య జనగామ తాలూకాలో జమీందారీ వ్యతిరేక పోరాటం ఉధృతంగా జరిగింది. 1944లో ఆరుట్ల రామచంద్రారెడ్డిని తన స్వగ్రామం కొలనుపాక విడిచి ఎక్కడికీ వెళ్లకూడదని ప్రభుత్వం గృహనిర్బంధం విధించింది.

వేళ్లూనుకున్న వెట్టి చాకిరీ వ్యవస్థ..
తెలంగాణలోని ప్రతి గ్రామంలో దేశ్‌ముఖ్, దేశ్‌పాండే, బంజర్‌దార్, ఇనాందార్, ముఖ్తాదార్ తదితర అధికారులు ఆయా గ్రామ ప్రజానీకంపై పెత్తనం చెలాయించేవారు. వీరు ప్రజలపై విపరీతమైన దౌర్జన్యకాండ సాగించారు.

నిజాం నవాబు ప్రత్యక్ష పాలన కింద ఉండే గ్రామాలను ‘ఖల్సాలు’గా పేర్కొనేవారు. సంస్థానాధీశులు, జాగీర్దార్ల పాలన కింద ఉండే గ్రామాలను ఖల్సేతర ప్రాంతాలుగా వ్యవహరించేవారు. సాధారణంగా గ్రామాల్లో చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, తమ్మలి, హరిజన, బేగరి (గుర్రాల మాలీష్, పాకీ పని), మసుకూర్, నీరడి (నీరు తెచ్చేవారు) మొదలైన పన్నెండు కులాలవారు ఉండేవారు. పైన పేర్కొన్న రెండు రకాల గ్రామాలకు రెవెన్యూ, పోలీసు, అటవీ, మద్యపాన తదితర శాఖల అధికారులు వచ్చినప్పుడు ఈ కులాలకు చెందినవారు ఉచిత సేవ చేయాలి. ఈ పనులన్నింటినీ ఎలాంటి ప్రతిఫలం ఇవ్వకుండా నిర్బంధంగా చేయించుకునేవారు. అందువల్ల వీటిని ‘వెట్టి పనులు’ అంటారు.

వంతులవారీగా..
చిల్లర దుకాణాలు నిర్వహిస్తూ జీవనం సాగించే కోమట్లు.. గ్రామాలకు ప్రభుత్వ, జాగీరు ఉద్యోగులు వచ్చినప్పుడు ఆ అధికారులకు కావలసిన సన్నబియ్యం, మసాలా, నెయ్యి, నూనె, పప్పు, చింతపండు, పప్పు దినుసులు, సిగరెట్లు, బీడీలు, సబ్బులు మొదలైనవాటిని ఉచితంగా సరఫరా చేయాల్సి ఉండేది. అదేవిధంగా దొరలు ఈ ప్రభుత్వాధికారులకు వంతుల ప్రకారం విందు ఇచ్చేవారు. దీని కోసం మసుకూర్లతో గొర్రె మందల నుంచి బలవంతంగా గొర్రెలు, మేకలను పట్టి తెప్పించేవారు. హరిజనవాడల నుంచి వంతుల ప్రకారం కోళ్లను పట్టి తెచ్చేవారు. గౌడ కులస్థులు ఉచితంగా కల్లు సరఫరా చేసేవారు. ప్రభుత్వాధికారులకు ఎన్ని విన్నపాలు చేసుకున్నా ప్రయోజనం లేదని, తాము వెట్టి చాకిరీ చేయడానికే పుట్టామని, మా బతుకులింతేనని ప్రజలు నిరాశ, నిస్పృహలతో కుమిలిపోయేవారు. దొరల కోపతాపాలకు గురై శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు ఎదుర్కొనేవారు. ఈవిధంగా తెలంగాణ ప్రజానీకం మధ్యయుగం నాటి బానిసత్వాన్ని చాలాకాలం పాటు అనుభవించింది.

గల్లా వసూళ్ల అక్రమాలు
నాటి నిజాం ప్రభుత్వం ప్రతి చిన్నా, పెద్ద రైతుల నుంచి నిర్బంధ లెవీ వసూలు చేసేది. పంట పండినా, ఎండినా ప్రజలు వీటిని కచ్చితంగా చెల్లించాల్సి వచ్చేది. ఆంధ్ర మహాసభల ఉద్యమం ఫలితంగా అతి చిన్న రైతులను లెవీ నుంచి మినహాయించి మిగిలినవారి నుంచి గ్రేడ్ పద్ధతిలో లెవీ వసూలు చేసేవారు. ప్రభుత్వం రైస్‌మిల్లర్లనే ఏజెంట్లుగా నియమించుకునేది. ఈ ఏజెంట్లు ధాన్యం తూకం, డబ్బు చెల్లింపుల్లో అనేక అక్రమాలు చేసి ప్రజలను మోసగించేవారు.


పి.వి. నరసింహారావు
పాములపర్తి వెంకట నరసింహారావు కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో అనేక ఉన్నత పదవులు అలంకరించారు. ఆయన 17 ఏళ్ల ప్రాయంలోనే 1938లో రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. తొలిసారిగా 1952 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి, కమ్యూనిస్ట్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. 1971లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1991 నుంచి 1996 వరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1991 జూన్ 21న ప్రధాని పదవి చేపట్టారు. దేశంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు.

జననం - విద్యాభ్యాసం
పి.వి. నరసింహారావు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా ‘నర్సంపేట’ మండలంలోని ‘లక్నేపల్లి’ గ్రామంలో జన్మించారు. రుక్మాబాయమ్మ, పి.వి. సీతారామారావు దంపతులకు కలిగిన 11 మంది సంతానంలో బతికింది నలుగురు మాత్రమే. వారిలో పి.వి. నరసింహారావు ఒకరు. సీతారామారావు బంధువులైన కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రత్నాబాయమ్మ దంపతులు పీవీని దత్తత తీసుకున్నారు. ఆయన అక్షరాభ్యాసం వంగరలోనే జరిగింది. పీవీ భార్య పేరు సత్యమ్మ. ఆయన ప్రాథమిక విద్యను హన్మకొండలో, ఉన్నత విద్యను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అభ్యసించారు. పుణేలోని ఫెర్గూసన్ కళాశాల నుంచి బీఎస్సీ, నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టాలను పొందారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీవీ ‘సాహిత్య రత్న’ సంపాదించారు. బూర్గుల రామకృష్ణారావు వద్ద కొంతకాలం జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత హైకోర్టులో ఉద్యోగం చేశారు. మరికొంత కాలం గ్రామ పట్వారీగా పని చేశారు. పీవీ తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, అరబిక్, పార్శీ, హిందీ, ఫ్రెంచి, స్పానిష్, కన్నడ, మరాఠీ, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు.

రాజకీయ జీవితం
పీవీ నరసింహారావు 1936లో త్రిపురలో నిర్వహించిన భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు హాజరయ్యారు. 1938లో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించి నిజాం ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు. ఈయన రాజకీయ గురువు స్వామీ రామానంద తీర్థ. స్వామీజీ నిజాం సంస్థానంలో జరిగిన పోరాటంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆయన స్ఫూర్తితో పీవీ 1939లో కాంగ్రెస్‌లో చేరారు. 1942 నాటి ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1935-45 మధ్యకాలంలో జరిగిన సామాజిక, రాజకీయ, సాహిత్య ఉద్యమాలు పీవీపై అధిక ప్రభావం చూపాయి. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూనే పత్రికలకు వ్యాసాలు రాశారు.
హైదరాబాద్ సంస్థాన విమోచనోద్యమంలో భాగంగా పి.వి. నరసింహారావు చందా సరిహద్దు ప్రాంతంలో రహస్య క్యాంపులు నిర్వహించి, సాయుధ పోరాటానికి ఆయుధాలు సరఫరా చేశారు. 1948-1953 కాలంలో ‘కాకతీయ పత్రిక’ను నడిపి, తెలంగాణ కవులకు స్ఫూర్తినిచ్చారు. పీవీ 1951లో అఖిల భారత కాంగ్రెస్ సభ్యుడిగా పనిచేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన మంథని (కరీంనగర్ జిల్లా) నియోజకవర్గ శాసనసభ్యుడిగా 1957, 1962, 1967, 1972 ఎన్నికల్లో వరసగా ఎన్నికయ్యారు. నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో 1962లో తొలిసారిగా న్యాయ, జైళ్లశాఖ మంత్రి పదవి చేపట్టారు. అనేక సంస్కరణలకు నాంది పలికారు. ఆ తర్వాత దేవాదాయ, ధర్మాదాయ శాఖ, ఆరోగ్య, విద్యా శాఖ మంత్రిగానూ పనిచేశారు.
1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తదనంతర పరిస్థితుల ఫలితంగా.. 1971లో కాసు బ్రహ్మానందరెడ్డి స్థానంలో వివాదరహితుడు, అందరికీ ఆమోదయోగ్యుడైన పి.వి.నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఈ సమయంలోనే పీవీ ఆర్థిక, సాంఘిక, భూ సంస్కరణలకు స్వీకారం చుట్టారు. కమతాల గరిష్ట పరిమితి శాసనానికి ప్రాధాన్యమిచ్చి 1972లో భూ సంస్కరణల చట్టం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. తనకు వారసత్వంగా సంక్రమించిన వేయి ఎకరాల భూమిలో 790 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చి అందరికీ మార్గదర్శకుడిగా నిలిచారు. ఫలితంగా ఆయన పార్టీలో, బయట బలమైన వర్గాల ప్రతిఘటనను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రిగా పీవీ పదిహేను నెలల పద్దెనిమిది రోజులు పనిచేశారు. 1973లో తన పదవికి రాజీనామా చేశారు.
1974లో పీవీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1977లో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఘోర పరాజయాన్ని చవిచూసినా హన్మకొండ నియోజకవర్గం నుంచి పీవీ తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. లోక్‌సభలో కీలకమైన ‘పబ్లిక్ అకౌంట్స్’ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. 1978 జనవరిలో ఇందిరాగాంధీ కాంగ్రెస్ (ఐ) పార్టీని ఏర్పాటు చేసినప్పుడు పీవీ ఆమెకు మద్దతు తెలిపారు. 1980లో లోక్‌సభ ఎన్నికల్లో పీవీ ‘కాంగ్రెస్(ఐ)’ అభ్యర్థిగా హన్మకొండ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు. ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ చర్య తర్వాత ఇందిరాగాంధీ 1984 అక్టోబరు 31న అంగరక్షకుల తూటాలకు బలయ్యారు. ఆ తర్వాత రాజీవ్‌గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ వద్ద ఎల్‌టీటీఈ ఆత్మాహుతి దళాల బాంబుదాడిలో రాజీవ్‌గాంధీ హత్యకు గురయ్యారు. ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో 1991 జూన్ 21న భారతదేశ 9వ ప్రధానమంత్రిగా పి.వి. నరసింహారావు బాధ్యతలు చేపట్టారు. ప్రధానిగా పీవీ సరళీకృత ఆర్థిక విధానాలకు రూపకల్పన చేశారు. ఆర్థికవేత్త మన్మోహన్‌సింగ్‌ను ఆర్థిక శాఖ మంత్రిగా నియమించారు. మైనార్టీ ప్రభుత్వాన్ని అయిదేళ్ల పాటు నడిపిన ఘనత పీవీకి ఉంది.

పీవీ సాహిత్య సేవ
పీవీ నరసింహారావు ప్రాచీన, ఆధునిక తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. కాళోజీ నారాయణరావు, పాములపర్తి సదాశివరావుతో వరంగల్‌లో తరచూ సాహితీ చర్చలు చేసేవారు. పీవీ తెలుగు, ఆంగ్ల భాషల్లో కవితలు, కథలు, విమర్శలు రాశారు. ‘భర్షణ’ శీర్షికతో తెలుగు పద్యాలు రాశారు. పీవీ, పాములపర్తి సదాశివరావు.. ఇద్దరూ కలిసి ‘జయ-విజయ’ కలం పేరుతో 1948లో ‘కాకతీయ’ వారపత్రికకు అనేక సంపాదకీయాలు రాశారు. ఇదే పత్రికలో పీవీ రాసిన ‘గొల్ల రామవ్వ కథ’, ‘నీలిరంగు పట్టుచీర’, ‘మంగయ్య అదృష్టం’ (నవలిక), ‘ఆర్త గీతికలు’ (కవితలు), ‘మంత్రిగారు’ (కథ) లాంటివి నాటి తెలంగాణ సామాజిక పరిస్థితులను ప్రతిబింబించాయి.
  • విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో రచించిన సుప్రసిద్ధ ‘వేయిపడగలు’ నవలను పీవీ ‘సహస్రఫణ్’ పేరుతో హిందీలోకి అనువదించారు. 1971లో ‘సహస్రఫణ్’కు కేంద్ర సాహిత్య పురస్కారం లభించింది.
  • మరాఠీ రచయిత హరినారాయణ్ ఆప్టే రాసిన ‘పన్‌లక్షాత్ కోణ్ ఘెతా’ నవలను పీవీ ‘అబలా జీవితం’ పేరుతో తెలుగులోకి అనువదించారు.
  • మరాఠీ రచయిత్రి లలితాశాస్త్రి రాసిన ‘మేరే పతి మేరే దిల్’ ఆత్మకథను తెలుగులోకి అనువదించారు.
  • కె.ఎం. మున్షి ఆంగ్లంలో రాసిన గ్రంథాన్ని ‘భారతీయ సంస్కృతికి పునాదులు’ పేరుతో తెలుగులోకి అనువదించారు.
  • థామస్ గ్రే రాసిన ‘ఎలిజీ’ పుస్తకాన్ని కూడా ఆంధ్రీకరించారు.
  • ‘ఇన్‌సైడర్’ పేరుతో ఆంగ్లంలో రెండు భాగాలుగా పెద్ద నవల రచించారు. దీన్నే పీవీ నరసింహారావు ‘ఆత్మకథ’గా పేర్కొంటారు. ప్రముఖ పాత్రికేయుడు కల్లూరి భాస్కరం దీన్ని ‘లోపలి మనిషి’ పేరుతో తెలుగులోకి అనువదించారు.
  • నందలాల్, సూరదాస్ హిందీలో రాసిన ‘దోహాలను’ పీవీ ఇతర భాషల్లోకి అనువదించారు.
  • పీవీ రాసిన ‘అయోధ్య 1992’ అనే గ్రంథం ఆయన మరణించిన తర్వాత ప్రచురితమైంది.
  • 1968లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హైదరాబాద్ సావనీర్ కమిటీ చైర్మన్‌గా, జ్ఞానపీఠ్ అవార్డు కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
  • పండరీనాథ్ రామాయణ కావ్యానికి పీవీ పీఠిక రాశారు.
  • పీవీ మనోహర్ రాసిన యాత్రాగ్రంథం ‘కైలాస దర్శనం’కు పి.వి. నరసింహారావు ముందుమాట రాశారు.
  • కాళోజీ రాసిన ‘అవనిపై జరిగేటి అవకతవకలు చూసి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు’ గీతాన్ని పీవీ ఆంగ్ల భాషలోకి అనువదించారు.
  • వరంగల్‌కు చెందిన పొట్లపల్లి రామారావు రచించిన కవితలను పీవీ అభిమానించేవారు.
  • వాటిలో కొన్నింటిని ఎన్నికల ప్రచారంలో వినిపించేవారు.
    ఉదా: ‘పూలు చల్లినను మీరే
    ధూళి చల్లినను మీరే
    కరి ఎక్కించిన మీరే
    ఉరి ఎక్కించిన మీరే’
  • 1975లో కౌలాలంపూర్‌లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో పీవీ కీలక పాత్ర పోషించారు.
  • పీవీ సహకారంతో 1982లో వరంగల్ నగరంలో ‘పోతన పంచశతి’ ఉత్సవాలు నిర్వహించారు. ఆయన స్ఫూర్తితో కోవెల సుప్రసన్న, జీ.ఎస్. మాధవరావు ‘వరంగల్‌లో ‘పోతన విజ్ఞాన పీఠం’ అనే పరిశోధనా సంస్థను ఏర్పాటు చేశారు.
  • 1977 జనవరి 13న శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం పీవీకి తులనాత్మక సాహిత్యంలో గౌరవ డాక్టరేట్ అందించింది.
  • 2004లో ‘స్థితప్రజ్ఞ’ బిరుదు ప్రదానం చేశారు.
  • పీవీ ‘స్వామీ రామానంద తీర్థ మెమోరియల్ ట్రస్ట్’ను స్థాపించారు.
  • రామానంద తీర్థ రీసెర్‌‌చ ఇన్‌స్టిట్యూట్ జీవిత కాల చైర్మన్‌గా పీవీ వ్యవహరించారు.
  • ఇందిరాగాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు ఆంగ్లంలో చేసే ప్రసంగాలను పీవీ తెలుగులోకి అనువదించేవారు.

పీవీ ప్రవేశపెట్టిన నూతన కార్యక్రమాలు
  • 1964లో అనంతపురంలో దేశంలోనే తొలిసారిగా ‘ఓపెన్ జైలు’ను ఏర్పాటు చేయడంలో పీవీ విశేష కృషి చేశారు.
  • వరంగల్ జైలు ఖైదీలకు అజంజాహీ మిల్లు కార్మికుల తోడ్పాటుతో చద్దర్లు, తివాచీలు తయారు చేయడంలో శిక్షణ ఇప్పించారు.
  • ఖైదీలకు వయోజన విద్యను ప్రవేశపెట్టారు.
  • పీవీ 1968-71లో రాష్ట్ర విద్యామంత్రిగా ‘తెలుగు అకాడమీ’కి రూపకల్పన చేశారు. తెలుగు అధికార భాష శ్వేత పత్రం రచయిత ఆయనే.
  • భూ సంస్కరణల చట్టం తీసుకువచ్చారు. పేదవారికి భూమిని అందించే ప్రజాహిత కార్యక్రమాన్ని చేపట్టారు.
  • 1972 ఆగస్టులో భూ సంస్కరణల చట్టాన్ని ఆర్డినెన్‌‌స ద్వారా అమలు చేసి ప్రజాస్వామిక విప్లవానికి నాంది పలికారు.
  • దేశ వ్యాప్తంగా జాతీయ సాక్షరతా మిషన్, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు.
  • 1986లో నూతన విద్యావిధానం రూపొందించారు. మారుమూల గ్రామాల్లో ‘జవహర్ నవోదయ’ విద్యా సంస్థలను స్థాపించారు.

అభిరుచులు
  • పీవీ నరసింహారావుకు సంగీతం, సాహిత్యం, నాటకాలు, అధ్యయనం, అభ్యాసం పంచప్రాణాలు. కళారూపాల పట్ల మక్కువ ఎక్కువ.
  • సంస్కృతి, భారతీయ తత్వశాస్త్రం, రాజకీయ వ్యాఖ్యానం, కాల్పనిక సాహిత్యం, భిన్న భాషల అభ్యాసం, హాస్యరస సినిమాలు చూడటం, రచన చేయడం పీవీకి ప్రధాన వ్యాపకాలు.
  • ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ త్యాగరాజ కృతులు ఆయనకు చాలా ఇష్టం. ప్రధాని పదవిలో తీరిక లేకుండా ఉన్నా.. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేవారు.
  • ‘సుప్రసిద్ధ తెలుగు హాస్యనటుడు రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం’ అని పీవీ స్వయంగా చెప్పుకున్నారు. ఆయన ‘ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకునే’ అని సగర్వంగా చెప్పుకునేవారు.

పాములపర్తి వెంకట నరసింహారావు ఉద్యమకారుడిగా, విద్యార్థి నాయకుడిగా, భూ సంస్కరణోద్యమ నేతగా, సంస్కర్తగా, ఆర్థికవేత్తగా, విద్యావేత్తగా, బహుభాషా కోవిదుడిగా ప్రసిద్ధికెక్కారు. భారత రాజకీయాలను ప్రభావితం చేసిన అపర చాణక్యుడు పి.వి. నరసింహారావు 2004 డిసెంబర్ 23న మరణించారు.
Published date : 02 Oct 2015 12:55PM

Photo Stories