Skip to main content

హైదరాబాద్ సంస్థానంలో ఉద్యమకారులు

నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణలో సామాన్యులు సైతం పోరాడారు. ఆ కాలంలో ఎన్నో విప్లవ గీతాలు పుట్టుకొచ్చాయి. ఆఖరి అసఫ్ జాహీ వంశీయుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నడిపిన మేటి నాయకుడు సర్దార్ జమలాపురం కేశవరావు. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు ఆదిరాజు వీరభద్రరావు పంతులు. ‘హైదరాబాద్ సంస్థానంలో స్వాతంత్య్రోద్యమం’ గ్రంథాన్ని వెల్దుర్తి మాణిక్యరావు రాశారు.
అసఫ్ జాహీ వంశంలో ఏడో నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో ఎందరో వీరులు పోరాటం చేశారు. కొందరు ఉద్యోగాలు వదులుకున్నారు. మరికొందరు ప్రాణాలకు తెగించి, నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించారు. అరెస్టులు, లాఠీ చార్జీలు వారిని అడ్డుకోలేకపోయాయి. తెలంగాణ మాగాణంలో సామాన్యులు నిజాంకు వ్యతిరేకంగా విప్లవ జ్వాలలు రగిలించారు. ఈ కాలంలో ఎన్నో విప్లవ గీతాలు పుట్టుకొచ్చాయి. కొందరు నాయకులు గాంధేయ మార్గంలో శాంతియుత ఉద్యమాలు చేపట్టారు. మరికొందరు ఆయుధాలతో విప్లవ పోరాటం చేశారు. వారు ఎంచుకున్న మార్గం ఏదైనా తెలంగాణ విముక్తే ఏకైక లక్ష్యం. ఈ క్రమంలో కొందరు ఉద్యమ వీరులుగా చిరస్మరణీయులయ్యారు.
జమలాపురం కేశవరావు (1908-1953)
హైదరాబాద్ సంస్థాన చివరి పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నడిపిన గొప్ప నాయకుడు సర్దార్ జమలాపురం కేశవరావు. నిజాం రజాకార్ల దురంగతాలకు వ్యతిరేకంగా పండిట్ నరేంద్రజీతో కలిసి తెలంగాణ గ్రామాల్లోని ప్రజలను సమీకరించి పోరాటం చేసిన ధీశాలి.
‘పాశ్చాత్య విద్యతో మానసిక దౌర్భల్యం, సంకుచితత్వం తద్వారా దౌర్జన్య ప్రవృత్తి మన సమాజంలో ప్రబలాయి. ప్రజల మధ్య అంతరాలు ఎక్కువయ్యాయి. వెనుకటి తరాల్లో కనిపించే సరళత్వం, కలివిడితనం, సానుభూతి, నేటి సమాజంలో లోపించాయి. స్వాతంత్య్ర ఫలితంతో గ్రామాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలి. రైతు దేశానికి వెన్నెముక. గ్రామం దేశ సౌభాగ్యానికి పునాది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించుకోవాలి’..ఇలా తన అభిప్రాయాలను తెలంగాణ గ్రామాల్లో ప్రచారం చేసిన సాహసికుడు సర్దార్ జమలాపురం కేశవరావు.
ఉన్నత ఆలోచనలున్న కేశవరావు ఒక గొంగడి భుజాన వేసుకొని, తెలంగాణ గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేయడానికి విస్తృత ప్రచారం చేశారు. ‘అపర సరిహద్దు గాంధీ’గా పేరు పొందారు. జాగీర్‌దార్లు, దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు నిజాం నిరంకుశ ఉద్యోగుల అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. తెలంగాణలోని తండాలు, గూడేలు, హరిజన, గిరిజన వాడలకు వెళ్లి వారి బాగోగులు, స్థితిగతులు తెలుసుకునేవారు.
20వ శతాబ్ద పూర్వార్ధంలో తెలంగాణలో జరిగిన ప్రజాపోరాటాల్లో ప్రజలకు అతి సన్నిహితుడైన గొప్ప కార్యకర్త. 18 ఏళ్ల వయసులోనే రాజకీయ ప్రవేశం చేశారు. 1938నుంచి ఆయన ప్రజా పోరాటాలు చేసి ‘సర్దార్’గా ప్రజలతో గౌరవం పొందారు. రజాకార్ల దురాగతాలను, దాడులను ఎదుర్కోగల ఆత్మస్థైర్యాన్ని నింపుతూ ప్రజలను చైతన్యం చేశారు. హైదరాబాద్ సంస్థానంలో మత సామరస్యం కోసం ఎనలేని కృషి చేశారు.
1938, 1947లో బేడీలు, నడుం పటకాతో జైలు జీవితం గడిపారు. ఆయనకు రామాయణ, మహాభారతాలంటే చాలా ఇష్టం.
కేశవరావు జీవితంలో ముఖ్య సంఘటనలు
  • 1908లో ఆనాటి వరంగల్ జిల్లాలోని మధిర తాలూకా, ఎర్రుపాలెం (ప్రస్తుతం ఖమ్మం జిల్లా)లో కేశవరావు జన్మించారు.
  • ప్రాథమిక విద్య ఖమ్మం, ఉన్నత విద్య హైదరాబాద్‌లో జరిగింది.
  • తల్లిదండ్రులు వెంకటరామారావు, వెంకట నరసమ్మ
  • 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పిలుపు మేరకు సత్యాగ్రహంలో పాల్గొన్నారు.
  • దీంతో రెండేళ్లు కఠిన కారాగార శిక్ష అనుభవించారు.
  • కేశవరావు మధిర తాలూకాలోని రెండు వందల గ్రామాల్లో పాదయాత్ర చేసి ప్రజల్లో పోరాట స్ఫూర్తి నింపారు.
  • 1945 ఆంధ్ర మహాసభకు మందుమల నరసింగరావు అధ్యక్షుడుగా, కేశవరావు ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
  • 1946లో మెదక్ జిల్లా కంది గ్రామంలో జరిగిన పదమూడో ఆంధ్రమహాసభకు కేశవరావు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
  • కేశవరావును కొంతకాలం వరంగల్, నిజామాబాద్ జైల్లో నిజాం నిర్బంధించారు. ఆయనతోపాటు మహాకవి దాశరథి కృష్ణమాచారి, రామ్ హీరాలాల్ మోర్యా, కొలిపాక కిషన్‌రావు, ఊటుకూరి నారాయణరావు, గంధం మాణిక్యం తదితరులు జైలు శిక్ష అనుభవించారు.
  • 1948లో హైదరాబాద్ సంస్థానంపై పోలీసు చర్య అనంతరం వీరందరూ జైలు నుంచి విడుదలయ్యారు.
  • సుమారు 13 నెలలు శిక్ష అనుభవించారు.
  • పోలీసు చర్య అనంతరం వెల్లోడి నాయకత్వంలో మిలటరీ ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పుడు కేశవరావు హైదరాబాద్ సంస్థానంలో రాష్ర్ట కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు.
  • 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పాకాల నియోజకవర్గం నుంచి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ కమ్యూనిస్టు అభ్యర్థి విజయం సాధించారు.
  • 1953 మార్చి 30న జమలాపురం కేశవరావు హైదరాబాద్‌లో మరణించారు.
ఆదిరాజు వీరభద్రరావు (1890-1978)
తెలంగాణలో తెలుగు భాషకు, సంస్కృతికి ఆదరణ లేని రోజుల్లో మాతృభాషాభివృద్ధికి విశేష కృషి చేసిన నిస్వార్థ దేశ భక్తుడు ఆదిరాజు వీరభద్రరావు పంతులు. ఆ రోజుల్లో హైదరాబాద్ సంస్థానంలో అధికార భాష, పాఠశాలల్లో బోధనాభాష ఉర్దూయే. అలాంటి పరిస్థితుల్లో మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకటరంగారెడ్డి తదితరులు మాతృభాషోద్ధరణ ఉద్యమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో తెలుగు సంస్కృతి పునరుజ్జీవనం కోసం తెలుగు చరిత్ర, పరిశోధనలకు ఆదిరాజు వీరభద్రరావు రూపకల్పన చేశారు
1890లో ఖమ్మం జిల్లా మధిర తాలూకా దెందుకూరు గ్రామంలో వీరభద్రరావు జన్మించారు. ఆయన తండ్రి ఆదిరాజు లింగయ్య, తల్లి వెంకమాంబ. ఆమె ఊటుకూరు వారి ఆడపడుచు. లింగయ్య కరోడ్గిరీ నాకా సేగేదార్‌లో ఉద్యోగి. జాగీర్దార్ రావిచెట్టు రంగారావు ఆర్థిక సాయంతో వీరభద్రరావు హైదరాబాద్ చాదర్‌ఘాట్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో ప్రాథమిక విద్యనభ్యసించారు. అనంతరం సుమారు 40 ఏళ్లు ఉపాధ్యాయుడిగా పనిచేశారు.
హైదరాబాద్‌లోని ‘శ్రీకృష్ణదేవరాయ- ఆంధ్ర భాషా నిలయాన్ని 1901 సెప్టెంబర్ 1న స్థాపించారు. అందులో ఉన్న తెలుగు, సంస్కృత గ్రంథాలన్నీ వీరభద్రరావు క్షుణ్నంగా అధ్యయనం చేశారు. భాషా నిలయం గ్రంథ పాలకుడిగా కొంతకాలం పనిచేశారు.
కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు స్థాపించిన ‘విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి’ కార్యాలయాన్ని 1908లో హైదరాబాద్ నుంచి మద్రాసుకు మార్చారు. అప్పటి నుంచి 1914 వరకు మద్రాసులో విజ్ఞాన చంద్రికా గ్రంథం మండలిలో పనిచేశారు. తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఇక్కడ మహబూబ్ కాలేజీ, చాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలో తెలుగు పండితుడిగా విధులు నిర్వహించారు.
మాడపాటి హనుమంతరావు స్థాపించిన నారాయణగూడలోని ఆంధ్ర బాలిక పాఠశాలలో పదహారేళ్లు పనిచేశారు. 1948లో ఉద్యోగ విరమణ పొందారు.
హైదరాబాద్ ‘శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం’ కార్యదర్శిగా ఆయన నగరంలో తెలుగు భాషావృద్ధికి కృషి చేశారు. ప్రాచీనాంధ్ర చరిత్ర, శాసన పరిశోధన, ఆంధ్రనగర చరిత్ర, సాంస్కృతిక చరిత్ర ఆదిరాజు అభిమాన అంశాలు 1921లో ఆంధ్ర జన సంఘాన్ని స్థాపించారు. దానికి అనుబంధంగా ‘ఆంధ్ర పరిశోధక మండలి’ని ప్రారంభించారు. తెలంగాణ సాహితీ సాంస్కృతిక వికాసానికి ఆ సంస్థ కృషి చేసింది. ఆంధ్ర పరిశోధక మండలికి వీరభద్రరావు మూలస్తంభం లాంటి వారు. కొమర్రాజు లక్ష్మణరావు మరణానంతరం 1931లో ‘ఆంధ్ర పరిశోధక మండలి’ని లక్ష్మణరాయ పరిశోధక మండలి’గా మార్చారు.
మునగాల రాజా నాయిని వెంకటరంగారావు దీనికి అధ్యక్షులుగా, వీరభద్రరావు కార్యదర్శిగా పని చేశారు. తెలంగాణలోని శిలాశాసనాలను పరిశోధించడానికి శేషాద్రి రమణ కవులను మండలి పక్షాన నియమించారు. వారు వివిధ ప్రాంతాలను సందర్శించి, శిల్పాలు, శాసనాలు, ప్రాచీన తాళపత్ర గ్రంథాలు సేకరించారు. ప్రసిద్ధ చరిత్రకారులతో వ్యాఖ్యానాలు రాయించి, 129 శాసనాలతో ఒక సంపుటిని ‘తెలంగాణ శాసనాలు’ అనే పేరుతో 1935 లో ప్రచురించారు. ఇందులో కాకతీయుల నాటి 57 శాసనాలు, చాళుక్యుల కాలంనాటివి 42, ఇతర 24 శాసనాలున్నాయి. ఈ సంపుటి రూపకల్పనలో ఆదిరాజు వీరభద్రరావు కృషి ఎనలేనిది.
  • 1960లో 85 శాసనాలతో రెండో సంపుటి ప్రచురితమైంది.
  • 1910లో వీరభద్రరావు ‘జీవిత చరితావళి’ రచించారు.
  • 1912లో ‘దేశ భక్తుల జీవిత చరితావళి’ ప్రచురించారు.
చారిత్రక గ్రంథాలు
 ‘షితాబుఖాన్ (లేక) సీతాపతిరాజు చరిత్ర’ ను లక్ష్మణరాయ పరిశోధక మండలి తరఫున వీరభద్రరావు ప్రకటించారు. లక్ష్మణరాయ పరిశోధక మండలి సేకరించిన అనేక అముద్రిత తాళపత్ర గ్రంథాలను పరిశోధించి, గోల్కొండ, సుజాత, తెలంగాణ పత్రికలకు వ్యాసాలుగా రాశారు.
 వీరభద్రరావు రాసిన ‘ప్రాచీనాంధ్ర నగరాలు’ ప్రసిద్ధ చారిత్రక గ్రంథం. ఇందులో అలంపురం, అనెగొంది, భువనగిరి, రాచకొండ, ఓరుగల్లు, కొలనుపాక, కళ్యాణి, కొండాపురం, గోల్కొండ, పానగల్లు, ప్రతిష్టానపురం, ఖమ్మం మెట్టు, వేల్పుకొండ నగరాల ప్రాశస్థ్యాన్ని వివరించారు. ఈ గ్రంథాన్ని మునగాల రాజా నాయిని వెంకటరంగారావుకు అంకితమిచ్చారు. వీరభద్రరావు రాసిన ‘మన తెలంగాణం’ గ్రంథాన్ని దేశోద్ధారక గ్రంథ మండలి ప్రచురించింది. ఇందులో తెలంగాణలోని 9 జిల్లాల నైసర్గిక, చారిత్రక అంశాలను  వివరించారు.
 ఆయన రచించిన మరో గ్రంథం ‘గ్రీకు పురాణ గాథలు’ ఇందులో గ్రీకు, బాబిలోనియ, రోమ్ నగరాల పురాణ గాథల్ని అభివర్ణించారు.
 వీరభద్రరావు లలిత కథావళి, రత్నప్రభ, నవ్వులు- పువ్వులు, భాగ్యనగరం, మిఠాయి చెట్టు వంటి ఎన్నో కథలు రాశారు. చరిత్ర, బాలుర కోసం బాల వాజ్ఞ్మమయానికి కృషి చేశారు. వీటిని ఆంధ్ర సారస్వత పరిషత్తు (హైదరాబాద్) ప్రచురించింది
 1946లో జరిగిన మాడపాటి హనుమంతరావు షష్టిపూర్తి సంచికను వీరభద్రరావు సంపాదకులుగా తీర్చిదిద్దారు. ‘గోల్కొండ కవుల సంచిక ప్రచురణలో సురవరం ప్రతాపరెడ్డికి వీరభద్రరావు సహాయ సహకారాలు అందించారు.
 నీలగిరి, సుజాత, గోల్కొండ , తెలంగాణ పత్రిక, భాగ్యనర్, ఆంధ్రపత్రిక, ప్రగతి, కాకతీయ, తెలుగుదేశం, మీజాన్, పద్మశాలి మొదలైన పత్రికల్లో ఆదిరాజు వీరభద్రరావు ఎన్నో వ్యాసాలు, కథలు, రాశారు. వీటితో పాటు రేడియా ప్రసంగాలు చేశారు.
1972లో ఆదిరాజు వీరభద్రరావును కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో సన్మానించారు. 1973 అక్టోబర్‌లో ఆదిరాజు వీరభద్రరావు మరణించారు.
పండితుడు, పరిశోధకుడు, బహుభాషా కోవిదుడు, నిస్వార్థపరుడు, తెలుగు భాషా వాజ్ఞ్మయానికి, చరిత్రకు, సంస్కృతికి వీరభద్రరావు అందించిన సేవలు మరువలేనివి.
వెల్దుర్తి మాణిక్యరావు
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు వెల్దుర్తి మాణిక్యరావు మెదక్ జిల్లాలోని వెల్దుర్తి గ్రామంలో 1913లో జన్మించారు. 1935 నుంచి 1948 వరకు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. పలుమార్లు జైలుకు వెళ్లారు. 1935లో ‘ఆంధ్ర మహాసభకు’ కార్యదర్శిగా పనిచేశారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో ‘గోల్కొండ’ పత్రికకు సహాయ సంపాదకుడిగా, ‘మద్యపాన నిరోధం’ తెలుగు మాసపత్రిక, ‘టర్కిముస్కిరాత్’ ఉర్దూ మాస పత్రికకు సంపాదకులుగా పనిచేశారు.
 నిజాం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజకీయ సంస్కరణల విషయంలో ‘అరవముద అయ్యంగార్’ కమిషన్ నివేదికను సవివరంగా వ్యాఖ్యానిస్తూ ఒక పుస్తకాన్ని వెల్దుర్తి మాణిక్యరావు, కె.సి.గుప్తా ఆధ్వర్యంలో ‘అణాగ్రంథమాల’ ప్రచురించింది. ఈ పుస్తకానికి మాడపాటి హనుమంతరావు పీఠిక రాశారు.
 రాజకీయ సంస్కరణల పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించడానికి, అప్పటి హైదరాబాద్ రాష్ర్ట ప్రధానమంత్రి ‘సర్ అక్బర్ హైదరీ’ 1937లో అరవముద అయ్యంగార్ కమిషన్ నియమించారు. ఆ నివేదికను ముస్లింలు, హిందువులూ వ్యతిరేకించారు. వీరు రచించిన ‘రైతు’ అనే పుస్తకాన్ని నిజాం నవాబు నిషేధించాడు. ‘మాణిక్యవీణ’ పేరుతో వీరి కవితలను సంకలనం చేశారు. ‘హైదరాబాద్ రాజ్యాంగ సంస్కరణలు, ‘ఖాదీ’, ‘మాడపాటి వారి జీవితం’, ‘సర్దార్ జమలాపురం కేశవరావు - జ్ఞాపకాలు’ నిరంతర కృషి, తదితర గ్రంథాలు రచించారు.
 హైదరాబాద్ సంస్థానంలో స్వాతంత్య్రోద్యమం అనే గ్రంథాన్ని ఆయన ఆంగ్లంలో రాశారు. ఈ గ్రంథాన్ని తెలుగులో ‘జి. సురమౌళి’తో భారత ప్రభుత్వ పబ్లికేషన్‌‌స డివిజన్ 1992లో ప్రచురించింది. నిజాం వ్యతిరేక పోరాట ఘట్టాలను ఈ పుస్తకంలో మాణిక్యరావు విశదీకరించారు.
Published date : 25 Sep 2015 06:31PM

Photo Stories