Skip to main content

మిషన్ కాకతీయ, తెలంగాణ హరితహారం

చెరువులు... పాడి పంటలకు పట్టుకొమ్మలు. కాకతీయుల కృషితో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో గొలుసు కట్టు చెరువులు అభివృద్ధి చెందాయి. అనంతర కాలంలో పాలకుల నిర్లక్ష్యం, పూడిక, ఆక్రమణలు ఫలితంగా చెరువులు తమ ప్రాభవాన్ని కోల్పోయాయి. ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’తో చెరువులు తిరిగి జల సిరులను సంతరించుకుంటున్నాయి. ఇందులో భాగంగా తొలి దశలో రూ. 2,611 కోట్లు ఖర్చు చేసి, 8,217 చెరువులను పునరుద్ధరించారు. 2016, జనవరి నుంచి జూన్ వరకు రెండో దశ మిషన్ కాకతీయ చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కృత్రిమ పద్ధతులను ఉపయోగించి, పంట పొలాలకు నీటి వసతిని కల్పించడాన్ని నీటిపారుదల అంటారు. తెలంగాణలో నీటిపారుదలకు సంబంధించి కాకతీయులు విశేష కృషి చేశారు. కాకతీయ రాజులు 12వ శతాబ్దంలో చిన్న, చిన్న నదులకు ఆనకట్టలు కట్టడం ద్వారా నీటి పారుదల సౌకర్యాలు కల్పించారు. అంతేకాకుండా వారు పెద్ద సంఖ్యలో చెరువులను కూడా తవ్వించారు.
కాకతీయులు రామప్ప చెరువు, పాకాల, లక్నవరం చెరువులు వంటి పెద్ద చెరువులనే కాకుండా చిన్న చెరువులను కూడా తవ్వించారు. కాకతీయుల అనంతరం నిజాం పరిపాలన కాలంలో నిర్మించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, నిజాంసాగర్ వంటి నీటిపారుదల ప్రాజెక్టులు ప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి.

చెరువుల పుట్టిల్లు తెలంగాణ
  • దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణ రాష్ర్టం చెరువుల నిర్మాణానికి అనువైన ప్రాంతం.
  • శాతవాహనుల కంటే ముందే తెలంగాణలో చెరువుల నిర్మాణం ఉందనడానికి చారిత్రక ఆధారాలున్నాయి.
  • కాకతీయుల కాలంలో మాత్రం చెరువుల నిర్మాణం అత్యున్నత ప్రమాణాలతో సాగినట్లు తెలుస్తోంది.
  • కాకతీయులు నిర్మించిన రామప్ప, పాకాల, లక్నవరం, ఘనవరం, బయ్యారం వంటి అనేక పెద్ద చెరువులు నేటికీ సేవలు అందిస్తున్నాయి.
  • కాకతీయుల తర్వాత తెలంగాణను పాలించిన కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు, వివిధ సంస్థానాధీశులు చెరువుల నిర్మాణాన్ని కొనసాగించి, వ్యవసాయ విస్తరణకు తోడ్పడ్డారు.
  • తెలంగాణలో ప్రతీ ఊరికి ఒక చెరువు తప్పనిసరిగా ఉండేది. ఒకటి కంటే ఎక్కువ చెరువులు ఉన్న గ్రామాలు తెలంగాణలో చాలా ఉన్నాయి.
  • ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ర్ట ప్రభుత్వం పునర్నిర్మాణంపై దృష్టి సారించింది.
  • పునర్నిర్మాణం ప్రధానంగా సాగునీటి రంగంపై ఆధారపడి ఉందని భావించిన ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యచరణ ప్రకటించింది.
  • చెరువుల పునరుద్ధరణ జరిగితే తెలంగాణలో వలసలు తగ్గుతాయి. గ్రామాల్లో అనేక కులవృత్తుల ప్రజలకు జీవనోపాధి లభిస్తుంది.
  • చెరువులను పునరుద్ధరించి వాటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వ్యవసాయాభివృద్ధి సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది.
మిషన్ కాకతీయ
  • తెలంగాణలో వేల సంఖ్యలో చెరువులను తవ్వించిన కాకతీయుల స్ఫూర్తిగా రాష్ర్ట ప్రభుత్వం మిషన్ కాకతీయను ప్రారంభించింది.
  • తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 2015, మార్చి 12న నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం పాత చెరువులో ‘మిషన్ కాకతీయ’ పైలాన్‌ను ప్రారంభించారు.
  • ఈ కార్యక్రమం ద్వారా చెరువులను పునరుద్ధరించి కాకతీయుల కాలం నాటి శోభను తిరిగితెచ్చేందుకు ప్రభుత్వం దృఢసంకల్పంతో ముందుకు సాగుతోంది. మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా 46 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించనున్నారు. దీని కోసం ప్రభుత్వం భారీ మొత్తంలో వ్యయం చేయనుంది.
  • 2014-15 నుంచి దశల వారీగా చెరువుల పనరుద్ధరణ జరగనుంది. ఏడాదికి ఐదో వంతు చొప్పున మొత్తం 46,531 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. ఇందులో భాగంగా ‘మిషన్ కాకతీయ’ కోసం 20 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. అన్ని చెరువులను 5 ఏళ్లలో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జిల్లాల వారీగా చెరువుల సంఖ్య
1) మెదక్ 7,941
2) మహబూబ్‌నగర్ 7,480
3) కరీంనగర్ 5,939
4) వరంగల్ 5,839
5) నల్గొండ 4,762
6) ఖమ్మం 4,517
7) ఆదిలాబాద్ 3,951
8) నిజామాబాద్ 3,251
9) రంగారెడ్డి 2,851
మొత్తం 46,531

సంవత్సరం-ప్రతిపాదించిన చెరువులు (2014-19)
1) 2014 - 15 9,305
2) 2015 - 16 9,308
3) 2016 - 17 9,430
4) 2017 - 18 9,480
5) 2018 - 19 9,008
మొత్తం 46,531
అనుకున్న స్థాయిలో చెరువుల పునరుద్ధరణ జరిగితే 10.17 లక్షల హెక్టార్లకు సాగునీటి వసతి లభిస్తుంది.

చేపట్టనున్న కార్యక్రమాలు
  • చెరువులు, కుంటల్లోని పూడికను తొలగించి వాటి నీటి నిల్వ సామర్థ్యం పెంచడం.
  • చెరువు కట్టలను బలోపేతం చేయడం, చెరువు అలుగు, తూములకు మరమ్మత్తులు చేయడం.
  • చెరువుల్లో పెరిగిన తుమ్మచెట్లను నరికివేయడం, గుర్రపు డెక్క లొట్టపీసు మొక్కల తొలగింపు.
  • గొలుసు కట్టు చెరువులను పునరుద్ధరిస్తారు.
  • తొలగించిన పూడికను రైతుల పంట భూముల్లో చల్లుతారు.
  • చెరువు కట్ట బలోపేతానికి సరిపడా పూడికమట్టిని వాడుకోవడం.
  • అవసరమైన చోట్ల ఫీడర్ చానళ్లను రీసెక్షన్ చేయడంతో పాటు పూడిక ను తొలగిస్తారు.
  • చెరువుల శిఖం భూములను కబ్జాల నుంచి కాపాడటం.
  • మిషన్ కాకతీయ మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక పట్టణ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తారు.
చెరువుల పునరుద్ధరణలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కార్యక్రమాలు
చెరువుల పునరుద్ధరణ వల్ల రైతులు, వ్యవసాయ కూలీలు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందనున్నారు. దీంతో పాటు గ్రామాల్లోని అన్ని వర్గాల ప్రజలకు పరోక్షంగా ప్రయోజనం కలగనుంది. చెరువుల మీద ఆధారపడి జీవించే అనేక కులవృత్తులు... రజకులు, కుమ్మరులు, బేస్తవారు, కల్లు గీత కార్మికులు తదితరులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.

చెరువులు - సాంస్కృతిక కేంద్రాలు
తెలంగాణ రాష్ర్టంలో చెరువులు సాంస్కృతిక కేంద్రాలుగా కూడా విలసిల్లుతున్నాయి. తెలంగాణలో వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండగను చెరువు కట్టలపైనే జరుపుకుంటారు.

జిల్లా

ఏడాదికి ప్రతిపాదించిన చెరువులు

మొత్తం చెరువులు
2014-15 2015-16 2016-17 2017-18 2018-19
కరీంనగర్ 1188 1210 1220 1200 1121 5939
ఆదిలాబాద్ 790 800 800 800 761 3951
వరంగల్ 1168 1170 1180 1200 1121 5839
ఖమ్మం 903 910 920 930 854 4517
నిజామాబాద్ 650 650 650 650 651 3251
మెదక్ 1588 1590 1600 1610 1553 7941
రంగారెడ్డి 570 500 570 600 611 2851
మహబూబ్‌నగర్ 1496 1500 1510 1510 1464 7480
నల్గొండ 952 978 980 980 872 4762
మొత్తం 9305 9308 9430 9480 9008 46531

తెలంగాణకు హరితహారం (టీకెహెచ్‌హెచ్)

 

  • తెలంగాణలో అడవుల విస్తీర్ణం 24 శాతంగా ఉంది. రాష్ర్ట భౌగోళిక విస్తర్ణీంలో వృక్షాల విస్తీర్ణ శాతాన్ని 33 శాతానికి పెంచటం లక్ష్యంగా ప్రభుత్వం ‘తెలంగాణకు హరితహారం’ పథకాన్ని ప్రారంభించింది.
  • ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 2015, జూలై 3న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ‘చిలుకూరు బాలాజీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ‘సంపంగి’ మొక్కను నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
  • కార్యక్రమంలో భాగంగా బహుళ రహదారుల పక్కన, నదులు, కాలువలు, చెరువుల గట్టుల మీద, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రాంగణాల్లో, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో, హౌసింగ్ కాలనీల్లో, కమ్యూనిటీ భూముల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచనున్నారు.
  • హరిత హారం కార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చేయనున్నారు.ఇందులో భాగంగా సంబంధిత విధానాలు, చట్టాలు, పాలనాపరమైన అంశాల్లో అవసరమైన మార్పులు చేస్తారు.
  • రానున్న మూడేళ్లలో రాష్ర్ట వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. వీటిలో 130 కోట్ల మొక్కలను నోటిఫైడ్ అటవీ ప్రాంతాలకు వెలుపల నాటాలని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా 10 కోట్ల మొక్కలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిలో, మిగిలిన 120 కోట్ల మొక్కలను రాష్ర్టంలోని మిగిలిన ప్రాంతాల్లో నాటనున్నారు.
  • అడవులను సంరక్షించటం, లైవ్ రూట్ స్టాక్‌ను ప్రోత్సహించడం ద్వారా నోటిఫైడ్ అడవుల లోపల వంద కోట్ల మొక్కలను పునరుజ్జీవింప చేయాలని నిర్ణయించారు.
  • ‘మన ఊరు - మన ప్రణాళిక (ఏంవీఎంపీ)’ కార్యక్రమం ద్వారా వచ్చే సూచనల ఆధారంగా హరితహారం కార్యక్రమంలో నర్సరీలు, మొక్కలను నాటే ప్రదేశాలను గుర్తిస్తారు.
  • ఇలా గుర్తించిన 3,888 నర్సరీల్లో 2015లో 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అటవీశాఖ, వ్యవసాయ, ఉద్యానవన, గిరిజన సంక్షేమం తదితర శాఖలను కూడా కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నారు.
  • 2016లో మరో 40 కోట్ల మొక్కలను నాటేందుకు భవిష్యత్ ప్రణాళికను రూపొందించారు.
  • చైనా, బ్రెజిల్ తర్వాత తెలంగాణలోనే భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Published date : 24 Oct 2015 12:06PM

Photo Stories