Skip to main content

గ్రామజ్యోతి పథకం

గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు.. గ్రామీణాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం! దీన్ని దృష్టిలో ఉంచుకొని మహాత్మా గాంధీ పటిష్టమైన స్థానిక స్వపరిపాలనను ఆకాంక్షించారు. ఆయన ఆలోచనల మేరకు భారత రాజ్యాంగంలో 40వ అధికరణలో స్థానిక సంస్థలకు సంబంధించిన అంశాలను పొందుపరిచారు. గ్రామీణ ప్రాంతాల్లో సమీకృత అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘గ్రామ జ్యోతి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అన్ని రంగాల్లో గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈ కార్యక్రమాన్ని వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లి గ్రామంలో ప్రారంభించారు.
గ్రామజ్యోతి పథకం ప్రధాన లక్ష్యాలు
  • పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయటం.
  • వివిధ రకాల అభివృద్ధి పథకాల అమల్లో గ్రామ పంచాయతీలు చురుగ్గా పాల్గొనేటట్లు చేయటం.
  • ఏ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలను, ఆ గ్రామమే సొంతంగా రూపొందించుకునేలా చేయటం.
  • షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పన.
  • గ్రామాభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలను రాష్ట్ర స్థాయిలో కాకుండా గ్రామస్థాయిలో తీసుకునేలా విధివిధానాలకు రూపకల్పన.
  • గ్రామజ్యోతి పథకం ద్వారా అధికార వికేంద్రీకరణను విస్తరించి, గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించటం ప్రధాన లక్ష్యం.
  • అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామ పంచాయతీ, స్వయం సహాయక సంఘాలు, శ్రమశక్తి సంఘాలు, యూత్ గ్రూపులు, సామాజిక-స్వచ్ఛంద సంస్థలు, పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, సామాజిక కార్యక్రమాల్లో ఆసక్తి ఉన్న ప్రజలను భాగస్వాములను చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
కమిటీ ఏర్పాటు- విధులు
  • గ్రామజ్యోతి పథకం అమలుకు ప్రతి గ్రామంలో 7 గ్రామాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో కమిటీలో అయిదుగురు సభ్యులుంటారు.
  • కమిటీలు తాము పర్యవేక్షించే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి.
  • ప్రతి అంశానికి సంబంధించి ప్రభుత్వం నుంచి అందుతున్న వివిధ సేవలను సమీక్షిస్తుండాలి.
  • గ్రామ స్థాయిలో ఉన్న పరిస్థితిని అంచనా వేసేందుకు గ్రామంలో కాలినడకన తిరుగుతూ వివిధ అంశాలను అధ్యయనం చేయాలి.
  • గ్రామ పాఠశాలకు సంబంధించి తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధిదీపాలు, కాల్వలు, పచ్చదనం, ఉపాధి కల్పన తదితర అంశాలను మెరుగుపరిచే విధంగా ప్రణాళికలు రూపొందించాలి.
  • ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య, వ్యవసాయం, పశు సంపద తదితరాల అభివృద్ధికి వివిధ వ్యూహాలను రూపొందించాలి.
  • సామాజిక భద్రత, పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాలు, సహజ వనరుల నిర్వహణ వంటి అంశాలను పర్యవేక్షించాలి.
  • షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి.
మన ఊరు- మన ప్రణాళికకు కొనసాగింపు
‘మన ఊరు-మన ప్రణాళిక’కు కొనసాగింపుగా గ్రామజ్యోతి పథకాన్ని పేర్కొంటున్నారు. గ్రామాభివృద్ధి కమిటీలు రూపొందించిన అభివృద్ధి ప్రణాళికల ఆధారంగా వచ్చే 5 ఏళ్లలో ఒక్కో గ్రామానికి రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లు ఖర్చు చేయనున్నారు. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి ఈ పథకం ద్వారా రూ.25 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు.
  • పారదర్శకత, జవాబుదారీతనం ఉండేవిధంగా సాధికారతతో పథకాలను అమలు చేసే విధంగా అవసరమైన ప్రోత్సాహకాలను అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
  • ప్రభుత్వ సేవలు గ్రామాలకు మరింత మెరుగ్గా అందించటం, గ్రామాభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలను రాష్ర్ట స్థాయిలో కాకుండా గ్రామ స్థాయిలో తీసుకునేలా వికేంద్రీకరణ జరపటం గ్రామజ్యోతి ముఖ్య ఉద్దేశాలని ముఖ్యమంత్రి వెల్లడించారు.
రాష్ర్ట సమగ్రాభివృద్ధికి
గ్రామాల అభివృద్ధి ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధించవచ్చు. అధిక జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటున్నారు. వీరిలో అవగాహన, చురుకుదనం పెంచి అభివృద్ధిని ప్రేరేపించవచ్చు. తద్వారా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, బంగారు తెలంగాణగా మారుతుంది. గ్రామ జ్యోతి ద్వారా బంగారు తెలంగాణ కల సాకారమవుతుంది.
‘పంచాయతీరాజ్’కు పూర్వ వైభవం
గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థలను బలోపేతం చేసి, గ్రామీణ స్థాయిలోనే నిర్ణయాలు తీసుకోవాలన్నది పంచాయతీరాజ్ వ్యవస్థలోని ముఖ్యాంశం. ఈ వ్యవస్థ ఒక ఉద్యమంగా ప్రారంభమైనప్పటికీ, తర్వాత ప్రభుత్వాల చర్యల వల్ల పంచాయతీరాజ్ సంస్థలు నిర్వీర్యమయ్యాయి. రాష్ట్ర స్థాయిలోనే నిర్ణయాలు జరిగి, రాష్ట్ర స్థాయిలోనే నిధులు విడుదలై ఖర్చయ్యేవి. స్థానిక ప్రజలు, సంస్థల ప్రమేయం లేకుండానే అంతా జరిగిపోయేది. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చి, ప్రజల భాగస్వామ్యంతో పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం తేవటమే ధ్యేయంగా గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కీలకంగా మారిన గ్రామసభ
గ్రామజ్యోతి కార్యక్రమం అమల్లో గ్రామసభది కీలకపాత్ర. ఇక్కడ చేసిన తీర్మానాలకు ప్రాధాన్యముంటుంది. ఈ తీర్మానాల ప్రకారం పనులు జరగాలి. ఏ గ్రామానికి ఆ గ్రామం అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించుకుంటూనే, 7 ప్రధాన అంశాలపై దృష్టిసారించాలని అధికారులు మార్గదర్శకాలు రూపొందించారు. అవి..
  • పారిశుద్ధ్యం-మంచినీరు
  • ఆరోగ్యం- పోషకాహారం
  • విద్య
  • సామాజిక భద్రత- పేదరిక నిర్మూలన
  • సహజ వనరుల నిర్వహణ
  • వ్యవసాయం
  • మౌలిక వసతులు
మార్పు సాధకులు (Change Agents)
అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధి ఉన్న అధికారులను గ్రామజ్యోతి మార్పు సాధకులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మండలానికి ఒకరు చొప్పున మొత్తం 438 మందిని నియమించింది. వీరు ప్రభుత్వ ఉద్దేశాలను, లక్ష్యాలను గ్రామాల్లో తెలియజేస్తారు. ప్రజలను చైతన్యపరచి, సమష్టి కృషితో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనను రేకెత్తిస్తారు.
వీరి ఇతర విధులు
  • మండల స్థాయిలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కుదర్చటం
  • గ్రామ ప్రణాళికలు సరిగా అమలయ్యేలా చూడటం
  • గ్రామాల ఇంచార్జిలుగా నియమితులైన స్పెషల్ ఆఫీసర్లు, గ్రామాలను దత్తత తీసుకున్న ముఖ్య ప్రజాప్రతినిధులు, ముఖ్య అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి, కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడటం.
గ్రామ దత్తత కార్యక్రమం
గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్‌లు గ్రామాలను దత్తత తీసుకున్నారు. కలెక్టర్, ఎస్పీ స్థాయి అధికారులు కూడా గ్రామాలను దత్తత తీసుకొని, కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిన్నముల్కనూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. వీరు తాము దత్తత తీసుకున్న గ్రామాల్లో ప్రజలను సంఘటితపరచి, చైతన్యవంతులను చేసి, గ్రామాభ్యున్నతిలో భాగస్వాములను చేస్తారు.
తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమం
నిరుపేదల్లో జీవనాభివృద్ధిని పెంపొందించేందుకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ‘తెలంగాణ పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీన్ని 2015, ఆగస్టు 22న పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.టి.రామారావు మెదక్ జిల్లాలోని కౌడిపల్లి గ్రామంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా రూ.642 కోట్లతో 150 మండలాల్లోని నిరుపేదలకు, ఇతరులకు జీవనోపాధి కల్పిస్తారు. గ్రామాల్లో ‘పల్లె సమగ్ర సేవా కేంద్రాలు’ ఏర్పాటు చేసి, వాటి ద్వారా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు.
కార్యక్రమం-ముఖ్యాంశాలు
  • ఎంపిక చేసిన 150 మండలాల్లో 5 ఏళ్లపాటు పథకాన్ని అమలు చేస్తారు.
  • ఈ పథకం ద్వారా తెలంగాణలోని 37.5 లక్షల గ్రామీణ పేదలకు ప్రయోజనం కలుగుతుంది.
  • ఈ పథకంలో భాగంగా వెయ్యి గ్రామ పంచాయతీల్లో ‘పల్లె సమగ్ర సేవా కేంద్రాలు’ ఏర్పాటు చేస్తారు.
  • గ్రామాల్లోని 2.5 లక్షల పేద కుటుంబాలకు ఆరోగ్యం, ఆహార భద్రత కల్పించటం.
  • 150 మండలాల్లో అందరూ మరుగుదొడ్లు ఉపయోగించుకుని, వారి గ్రామాన్ని బహిరంగ విసర్జనలు లేని గ్రామంగా ఎంపిక చేసేందుకు తోడ్పాడు అందించటం.
  • గ్రామీణ ప్రజలకు వ్యవసాయ పద్ధతులు, మార్కెటింగ్ మెళకువల్లో శిక్షణ ఇవ్వటం. పాడిపరిశ్రమ-గొర్రెలు-మేకల పెంపకంతో పాటు వరి, తృణ ధాన్యాల ఉత్పత్తి తదితర అంశాల్లో చేయూత అందించటం ద్వారా అభివృద్ధిని ప్రేరేపించటం.
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తోంది. వీటిద్వారా గ్రామాల అభివృద్ధి ఆపై రాష్ర్ట అభివృద్ధి సాధించటం సులువవుతుంది.
డిజిటల్ లిటరసీ
బంగారు తెలంగాణను సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు గ్రామీణాభివృద్ధి పథకాలను, మరోవైపు ఆధునిక రంగమైన ఐటీకి సంబంధించి వివిధ పథకాలను అమలు చేస్తోంది. ప్రజలందరికీ కంప్యూటర్ పరిజ్ఞానం అందించి, అభివృద్ధిలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ‘డిజిటల్ లిటరసీ’ని రూపొందించింది. నాస్కామ్ సహకారంతో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోషియేషన్ (టీఐటీఏ) ఆధ్వర్యంలో తెలంగాణ డిజిథాన్ పేరిట డిజిటల్ లిటరసీ కార్యక్రమాన్ని రూపొందించింది.
  • ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి 2015, ఆగస్టు 27న జేఎన్‌టీయూలో ప్రారంభించారు. ఈ-మెయిల్‌ను ఉపయోగించటం, ఆన్‌లైన్లో బిల్లుల చెల్లింపులు, సోషల్ మీడియాను, ఎంఎస్ ఆఫీస్‌ను ఉపయోగించటం తదితరాలపై ప్రజల్లో అవగాహన కల్పించటం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ-లిటరసీ పెరగటం వల్ల ప్రపంచ వ్యాప్త సమాచారాన్ని అందుకోవటం తేలికవుతుంది. ఇది పారదర్శకతను, అభివృద్ధిని పెంచుతుంది.
Published date : 25 Sep 2015 04:12PM

Photo Stories