Skip to main content

TSPSC: 10 కొత్త పోస్టులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)ను పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
TSPSC
10 కొత్త పోస్టులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

ఉద్యోగ నియామకాల ప్రక్రియలో కీలకమైన పరీక్షల నిర్వ హణ, ఫలితాల ప్రకటన, అర్హుల ఎంపిక ప్రక్రియ ను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీగా నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేక విభాగాలు, పోస్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా కొత్తగా 10 పోస్టులను మంజూరు చేసింది. ముఖ్యంగా పరీక్షల విభాగంపై దృష్టి పెట్టి కీలక మైన కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ సహా మూడు పోస్టులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏప్రిల్‌ 21న ఉత్తర్వులు జారీ చేశారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

లీకేజీల కలకలంతో..

వివిధ అర్హత పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో టీఎస్‌పీఎస్సీ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఓ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ఇందులో కీలకంగా వ్యవహరించగా, ప్రధాన నిందితుల్లో కమిషన్‌కు చెందిన పలువురు ఉద్యోగులు కూడా ఉండటం సంచలనం సృష్టించింది. కమిషన్‌లో ఉద్యోగులపై అజమాయిషీ తగ్గిందని, నియామకాల్లో పలు స్థాయిలో పారదర్శకత లోపించిందనే విమర్శలు వెల్లువెత్తాయి. లీకేజీలతో ప్రతిష్ట మసకబారడంతో టీఎస్‌పీఎస్సీ నష్టనివారణ చర్యలు మొదలుపెట్టింది. పర్యవేక్షణ కట్టుదిట్టం చేసే దిశలో వివిధ స్థాయిల్లో అధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం, కమిషన్‌ ప్రతిపాదించిన 10 పోస్టులను మంజూరు చేసింది. వీటిల్లో పరీక్షల నిర్వహణ విభాగంలో మూడు పోస్టులు, సమాచార విభాగంలో రెండు పోస్టులు, నెట్‌వర్కింగ్‌ వ్యవస్థలో రెండు పోస్టులు, ప్రోగ్రామింగ్‌ విభాగంలో రెండు పోస్టులున్నాయి. కమిషన్‌లో ప్రత్యేకంగా న్యాయ విభాగం ఏర్పాటు చేస్తూ ఆ విభాగానికి ప్రత్యేక న్యాయ అధికారిని నియమించాలని కోరగా ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలిపింది.

అన్నీ కొత్తగా నియమించాల్సిందే...

ఈ 10 పోస్టులు కొత్తగా నియామకాలు చేపట్టాల్సినవే. ఇతర ప్రభుత్వ శాఖల నుంచి డిప్యుటేషన్‌ పద్ధతిలోనో లేక, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలోనో నియమించేలా కాకుండా శాశ్వత పద్ధతిలో భర్తీ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు పోస్టుల వారీగా స్కేలును సైతం ఖరారు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. పరీక్షల నిర్వహణ ప్రత్యేక విభాగంపై అజమాయిషీకి ముగ్గురు అధికారులు ఉంటారు. సమాచారం గోప్యత తదితరాలకు మరో ఇద్దరు అధికారులు.. కమిషన్‌లో కంప్యూటర్లు, నెట్‌వర్కింగ్‌ వ్యవస్థ, ప్రోగ్రామింగ్‌ వ్యవస్థలో కీలకంగా పనిచేసేందుకు నలుగురు అధికారులు ఉంటారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి స్థాయి అధికారి లా ఆఫీసర్‌గా కొనసాగుతారు. ఈ మేరకు శాశ్వత ప్రాతిపదికన నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 

టీఎస్‌పీఎస్సీకి ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన పోస్టులు

డిజిగ్నేషన్‌

పోస్టు

కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌

1

డిప్యూటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌

1

అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌

1

చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌

1

చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌

1

సీనియర్‌ నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌

1

జూనియర్‌ నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌

1

సీనియర్‌ ప్రోగ్రామర్‌

1

జూనియర్‌ ప్రోగ్రామర్‌

1

లా ఆఫీసర్‌ (జూనియర్‌ సివిల్‌ జడ్జి కేడర్‌)

1

Published date : 22 Apr 2023 02:38PM

Photo Stories