Skip to main content

కాకతీయులపై ఢిల్లీ దండయాత్రలు

‘ప్రతాపరుద్ర చరిత్ర’ ప్రకారం ప్రతాపరుద్రుడికి విశాలాక్షి అనే భార్య ఉంది. లక్ష్మీదేవి అనే భార్య ఉన్నప్పటికీ వారికి సంతానం లేదని ఎలిగేడు శాసనం ద్వారా తెలుస్తోంది. అయితే ప్రతాపరుద్రుడికి వీరభద్రుడు, అన్నమదేవుడు అనే కుమారులు ఉన్నారని, వారు రాజ్యపాలన చేశారని కథనాలున్నాయి. కానీ అవి నిర్ధారణ కాలేదు. అందువల్ల ప్రతాపరుద్రుడితోపాటే కాకతీయ సామ్రాజ్యం, కాకతీయవంశం అంతరించిందని చెప్పవచ్చు.
ప్రతాపరుద్రుడు రాజ్యాన్ని సుస్థిర పరుచుకుంటుండగా ఉత్తర భారతదేశంలో అనేక మార్పులు సంభవించాయి.
ఖిల్జీ వంశం
మాలిక్ ఫిరోజ్.. ఖిల్జీ తెగకు చెందినవాడు. ఇతడి పూర్వీకులు తుర్కిస్తాన్ నుంచి అఫ్గానిస్తాన్ వచ్చారు. అక్కడి నుంచి ఢిల్లీ చేరి తురుష్క సుల్తాన్ల కొలువులో చేరారు. మాలిక్ ఫిరోజ్ (జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ) సుల్తాన్ల వద్ద ఉన్నత పదవులు పొందాడు. సుల్తాన్ వారసుల్ని చంపి క్రీ.శ.1290లో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు. జలాలుద్దీన్ అల్లుడైన గర్షాస్ప్ మాలిక్(అల్లా ఉద్దీన్ ఖిల్జీ) తన మామను చంపి క్రీ.శ.1296లో ఢిల్లీ సుల్తానుగా ప్రకటించుకున్నాడు. తర్వాత దాదాపు ఉత్తర భారతం అంతటినీ జయించాడు. అనంతరం దక్షిణ భారతాన్ని జయించాలని సంకల్పించాడు. అప్పటికి దక్షిణాదిలో దేవగిరి, హోయసాల, కాకతీయ రాజ్యాలు బలంగా ఉండేవి. వింధ్య పర్వతాలను దాటి దక్షిణాపథంపై దండెత్తిన తొలి ముస్లిం పాలకుడు అల్లా ఉద్దీన్ ఖిల్జీ. చక్రవర్తి కాకముందే క్రీ.శ.1294లో దేవగిరి మీద దండెత్తి విజయం సాధించాడు.
 చక్రవర్తి అయ్యాక జరిపిన దండయాత్రల్లో భాగంగా అల్లా ఉద్దీన్ క్రీ.శ.1303లో కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తాడు. మాలిక్ ఫక్రుద్దీన్ జునా, ఝాజా నాయకత్వంలో అల్లా ఉద్దీన్ సైన్యం కాకతీయ రాజ్యంపై దండెత్తింది. ఇది తురుష్కుల మొదటి దండయాత్ర. ఖిల్జీ సైన్యాన్ని కాకతీయ సైన్యం ఉప్పరపల్లి వద్ద ఓడించింది. ఇది అల్లా ఉద్దీన్ తొలి పరాజయం. ముస్లింల ఓటమికి రేచర్ల ప్రసాదిత్యుడి కుమారుడు వెన్నమ కారణమని ‘వెలుగోటి వంశావళి’ తెలుపుతోంది. మనరన్గోదారి రాజు, అయనదేవులు ముస్లింల ఓటమికి కారకులని ఓరుగల్లు కోటలోని స్తంభ శాసనం తెలుపుతోంది. ప్రతీకారేచ్ఛతో అల్లా ఉద్దీన్ ఖిల్జీ రెండోసారి దండెత్తాడు. ఈసారి అతడి సేనలకు మాలిక్ కఫూర్ నాయకత్వం వహించాడు.
 25 రోజుల ముట్టడి తర్వాత ప్రజల కష్ట నష్టాలను చూడలేక ప్రతాపరుద్రుడు మాలిక్ కఫూర్‌కి అపార ధనరాశులు, ఏనుగులు ఇచ్చి సంధి చేసుకున్నాడు. కప్పం చెల్లించి అల్లా ఉద్దీన్ ఖిల్జీని సార్వభౌముడిగా గుర్తించాడు. ఈ దండయాత్రతో దక్షిణ భారతదేశంలోని రాజ్యాలన్నీ ఢిల్లీ సార్వభౌమత్వాన్ని అంగీకరించాయి.
 తిరుగుబాట్ల అణచివేత
 ముస్లింల చేతిలో ప్రతాపరుద్రుడు ఓటమి పొందడంతో ఇదే అదనుగా కొందరు సామంతరాజులు తిరుగుబాటు చేశారు. వారిలో కాయస్థ మల్లిదేవుడు, నెల్లూరు రంగనాథుడు ముఖ్యులు. ప్రతాపరుద్రుడు మల్లిదేవుడిపై జుట్టయలెంక గొంకయరెడ్డి నాయకత్వంలో సేనను పంపాడు. అతడు మల్లిదేవుడిని ఓడించి చంపాడు. గొంకయరెడ్డిని ప్రతాపరుద్రుడు ఆ ప్రాంత పాలకుడిగా నియమించాడు. ఈ యుద్ధాలు, తురుష్కుల దండయాత్రలు (క్రీ.శ.1315 నాటికి) ఢిల్లీ సుల్తాన్‌కు కప్పం చెల్లించాల్సి రావడంతో ఖజానా ఖాళీ అయింది. కోశాగారాన్ని నింపడానికి ప్రతాపరుద్రుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు.  కడప, కర్నూలు, పల్నాడు ప్రాంతాల్లో అడవులను నరికించి భూములను వ్యవసాయ యోగ్యం చేయించాడు. చెరువులు, బావులు తవ్వించాడు. ఫలితంగా అనేక కొత్త గ్రామాలు, నగరాలు ఏర్పడ్డాయి. క్రమంగా రాజ్య ఆర్థిక పరిస్థితి  మెరుగుపడింది.
 క్రీ.శ.1316లో అల్లా ఉద్దీన్ ఖిల్జీ మరణించాడు. ఢిల్లీపై అధికారం కోసం కొంత కాలం అంతఃకలహాలు చేలరేగిన తర్వాత ఖిల్జీ మూడో కుమారుడైన ముబారక్ షా సింహాసనాన్ని అధిష్టించాడు. ఈ అంతఃకలహాలను అవకాశంగా తీసుకొని ప్రతాపరుద్రుడు కప్పం చెల్లించడం  మానేశాడు. దీనికి ఆగ్రహించిన ముబారక్‌షా ఖిల్జీ కాకతీయ ప్రతాపరుద్రునిపై దండెత్తి  కప్పం వసూలు చేశాడు. తెలుగుదేశంపై ఢిల్లీ సామ్రాజ్య అధికారాన్ని  తిరిగి స్థాపించాడు. ఇది తురుష్కుల మూడో దండయాత్ర. ఇంతలో ముబారక్ షాను చంపి నాసిరుద్దీన్ ఖుస్రూ ఖాన్ క్రీ.శ.1320లో  చక్రవర్తి అయ్యాడు.
 తుగ్లక్ వంశం
 ఢిల్లీ సుల్తాన్ల అధికారిగా, పంజాబ్ పాలకుడిగా ఉన్న ఘాజీ మాలిక్ ఖుస్రూ ఖాన్‌ను వధించి ఘియాజుద్దీన్ తుగ్లక్‌షా పేరుతో క్రీ.శ.1320లో ఢిల్లీ సింహాసనం అధిష్టించాడు. తన పెద్ద కుమారుడు ఫక్రుద్దీన్ మహ్మద్ (ఉలూఘ్ ఖాన్ /మహమ్మద్ బిన్ తుగ్లక్)ను క్రీ.శ. 1321లో ఓరుగల్లుపై దండయాత్రకు పంపాడు. ఉలూఘ్ ఖాన్ స్వయంగా ఓరుగల్లు కోటను ఆరు నెలలపాటు ముట్టడించాడు. కానీ కోట స్వాధీనం కాలేదు. సుల్తాన్ మరణించాడని ఉబైద్ దుష్ప్రచారం చేయడంతో ముస్లిం సేనలో కలకలం రేగింది. సైన్యంలో చాలాభాగం పారిపోయింది. దీంతో ఉలూఘ్ ఖాన్ ముట్టడి ఆపివేశాడు. పారిపోతున్న ముస్లిం సైన్యంపై కాకతీయ సైనికులు దాడిచేసి కోటగిరి దాకా తరిమివేశారు. ఇది తురుష్కుల నాలుగో దండయాత్ర.
ఓడిపోయి దేవగిరికి చేరిన ఉలూఘ్ ఖాన్ ఢిల్లీ నుంచి వచ్చిన కొత్త సైన్యంతో క్రీ.శ.1323లో తిరిగి ఓరుగల్లుపై  దండెత్తాడు. ఉలూఘ్ ఖాన్ అంత తొందరగా తిరిగి దాడి చేస్తాడని ఊహించని ప్రతాపరుద్రుడు తగిన యుద్ధ సన్నాహాలు చేయలేదు. అయినప్పటికీ అయిదునెలలపాటు కోటను కాపాడగలిగాడు. ఇది తురుష్కుల అయిదో దండయాత్ర. లొంగిపోయిన ప్రతాపరుద్రుడిని ఖాదిర్‌ఖాన్, ఖ్వాజీహాజీ అనే సేనానుల రక్షణలో ఉలూఘ్ ఖాన్ ఢిల్లీకి పంపాడు. కానీ ప్రతాపరుద్రుడు ముస్లిం సైనికుల అవమానాలను భరించలేక నర్మదానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రతాపరుద్రుడి మరణంతో కాకతీయ వంశం అంతమైంది. ఈ ప్రాంతం ఢిల్లీ సుల్తానుల రాజ్యంలో 23వ రాష్ర్టమైంది. క్రీ.శ.1325లో ఉలూఘ్ ఖాన్ మహ్మద్ బిన్ తుగ్లక్ పేరుతో ఢిల్లీ సింహాసనం అధిష్టించి ప్రతినిధుల ద్వారా తెలంగాణను  పాలించాడు.
Published date : 05 Oct 2015 04:57PM

Photo Stories