Skip to main content

వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్!

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సుల ప్రవేశానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పటికే ఇందుకు సంబంధించిన అన్ని చర్యలను ఉన్నత విద్యామండలి దాదాపు పూర్తిచేసింది.
ఈ కోర్సుల గుర్తింపునకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి ప్రతిపాదనలు కూడా పంపింది. అక్కడ నుంచి అనుమతులు రాగానే ప్రస్తుతమున్న మూడేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల స్థానే నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సులు ప్రారంభమవుతాయి ఎంచుకున్న నిర్దేశిత కోర్సులో మూడేళ్లపాటు చదివిన విద్యార్థులు.. నాలుగో ఏడాదిలో సంబంధిత నైపుణ్యాంశంలో అనుభవాన్ని కూడా గడించేలా ఇంటర్న్‌షిప్‌ను విధిగా పూర్తిచేయాల్సి ఉంటుంది.

ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పనే లక్ష్యం
రాష్ట్రంలో ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న విద్యార్థుల్లో ఎలాంటి నైపుణ్యాలు లేకపోవడమే కాకుండా ఆయా సబ్జెక్టు అంశాలకు సంబంధించిన పరిజ్ఞానం కూడా అంతంతమాత్రంగానే ఉంటోంది. ఫలితంగా డిగ్రీ పూర్తిచేసిన లక్షలాది మంది విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సులను తలపెట్టారు. గతంలో నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సులను యూజీసీ ప్రవేశపెట్టినా వాటిని మధ్యలో నిలిపివేసి మూడేళ్ల డిగ్రీ కోర్సులతో పాటు మూడేళ్ల ఆనర్స్ కోర్సులను అనుమతించింది. ఇలా రాష్ట్రంలో కొన్ని అటానమస్ డిగ్రీ కాలేజీల్లో 12 సబ్జెక్టుల్లో మూడేళ్ల ఆనర్స్ డిగ్రీని నిర్వహిస్తున్నారు. కానీ, దీనివల్ల పెద్దగా నైపుణ్యాలు అలవడకపోవడంతో తాజాగా ఇంటర్న్‌షిప్‌తో కూడిన నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సులకు శ్రీకారం చుడుతున్నారు. అలాగే, కోర్సులు సింగిల్ సబ్జెక్టులో కాకుండా ప్రస్తుతం ఉన్న మల్టిపుల్ కాంబినేషన్‌తో కూడిన సబ్జెక్టుల సిలబస్‌తోనే బీఏ, బీఎస్సీ, బీకాం తదితర డొమైన్లలో ఆనర్స్ డిగ్రీ కోర్సులను ప్రారంభించనున్నారు. కాగా, డిగ్రీ కోర్సును ఏ సబ్జెక్టులో చేస్తున్నా, ఉదాహరణకు సైన్సు విద్యార్థి తన ఆరో సెమిస్టర్‌లో పుట్టగొడుగుల తయారీ, లేదా డెయిరీ ఫారం నిర్వహణ, అకౌంటింగ్, ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్‌మెంటు వంటి ఇతర అంశాల్లో ఏదైనా స్కిల్ కోర్సును నేర్చుకోవచ్చు. కానీ, చివరి ఏడాదిలో మాత్రం తాను నేర్చుకున్న స్కిల్ కోర్సుపై ఇంటర్న్‌షిప్ తప్పనిసరిగా చేయాలి.

నిపుణులతో సిలబస్ రూపకల్పన
  • 12 అంశాల్లో ఆనర్స్ సిలబస్‌ను రూపొందించేందుకు ఉన్నత విద్యామండలి 25 మంది సబ్జెక్టు నిపుణులతో కూడిన కమిటీ ద్వారా కసరత్తు చేయించింది.
  • ఒక్కో సబ్జెక్టుకు యూనివర్సిటీ నుంచి ఒకరు, డిగ్రీ కాలేజీ నుంచి ఒకరిని సిలబస్ కమిటీలో నియమించింది.
  • వీరు రూపొందించిన సిలబస్‌ను మరో యూనివర్సిటీకి చెందిన సబ్జెక్టు నిపుణులు కూడా పరిశీలించారు.
  • ఈనెల 25నాటికి మొత్తం సిలబస్ తుది ముసాయిదాను రప్పించి రాష్ట్రస్థాయిలో ఏడుగురితో కూడిన కరికులమ్ రివిజన్ కమిటీ పరిశీలించనుంది.
అన్ని ఏర్పాట్లు చేపట్టాం
రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. చివరి ఏడాది ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ శాఖలు, అనుబంధ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు వర్తక, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల్లో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఫిబ్రవరి మొదటి వారానికల్లా యూజీసీ నుంచి అనుమతులు రావొచ్చు. రాష్ట్రస్థాయిలో చేపట్టాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. - ప్రొ.హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్
Published date : 21 Jan 2020 02:30PM

Photo Stories