Skip to main content

సివిల్స్ మెయిన్స్.. పరీక్ష రోజు ఇలా!!

సివిల్స్ అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా భావించే.. సివిల్స్ మెయిన్స్ సంగ్రామానికి మరో మూడు రోజుల్లో తెర లేవనుంది. డిసెంబర్ 2 నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మారిన విధానంలో తొలిసారి నిర్వహించనున్న మెయిన్స్‌లో జనరల్ స్టడీస్ పేపర్లు ఎలా ఉంటాయి? ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీపై ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? పరీక్ష ఎలా రాస్తే విజయం చేరువవుతుంది? అనే అంశాలపై ఇటు పరీక్ష రాసే అభ్యర్థులు, భవిష్యత్ ఆశావహులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మెయిన్స్‌లో విజయానికి సబ్జెక్టు నిపుణులు, గత విజేతలు అందిస్త్తున్న టిప్స్...

సూటిగా.. స్పష్టంగా.. క్లుప్తంగా
సివిల్స్ మెయిన్స్ రాసేవారిలో ఇంతకుముందు ఎప్పుడూ లేనంత ఉత్కంఠ నెలకొని ఉంది. కారణం.. సివిల్స్ మెయిన్స్ పరీక్ష స్వరూపం మారడమే. ఇంతకు ముందు వరకు ఉన్న రెండు ఆప్షనల్ సబ్జెక్టుల స్థానంలో ఒకే ఆప్షనల్ సబ్జెక్టును ప్రవేశపెట్టారు. అంతేకాకుండా రెండు పేపర్లుగా ఉన్న జనరల్ స్టడీస్‌ను నాలుగు పేపర్లుగా మార్చారు. ఇందులోనే ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ పేరిట ప్రత్యేకంగా ఒక పేపర్‌ను ప్రవేశపెట్టారు. నిజానికి ప్రశ్నపత్రంపై ఇప్పటికీ అటు అభ్యర్థులకు, ఇటు సివిల్స్ ఫ్యాకల్టీకి పూర్తిస్థాయిలో అవగాహన లేదనే చెప్పొచ్చు! పరీక్ష రాస్తున్నవారితోపాటు వచ్చే ఏడాది పరీక్ష రాయాలనుకుంటున్నవారిలో కూడా ఉత్కంఠ, ఆందోళన పతాక స్థాయిలో ఉందని చెప్పకతప్పదు. ఆందోళన అనేది మీ ఒక్కరికే కాకుండా అందరికీ ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు. భయాన్ని వీడి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని, సబ్జెక్టుపై పట్టు ఉన్నంతమేర చక్కగా సమాధానాలు రాస్తే విజయానికి చేరువైనట్లే. ముందుగా ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు అభ్యర్థులు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.

అవి..
  • ముందు ప్రశ్నపత్రంలో సూచనలు ఒకటికి రెండుసార్లు క్షుణ్నంగా చదవాలి.
  • ప్రశ్నపత్రం మారింది.. సిలబస్ పెరిగిందనే ఆందోళన అనవసరం.
  • జనరల్ స్టడీస్‌లో ప్రశ్నలన్నీ కూడా వర్తమాన పరిస్థితులకు అన్వయించేలా ఉండొచ్చు.
  • ప్రశ్నపత్రంలో ఇచ్చే ప్రశ్నలకు విస్తృతమైన సమాచారం రాయాల్సిన అవసరం లేదు.
  • ఇచ్చిన ప్రశ్నను ఒకటికి రెండుసార్లు చదువుకుని అవసరమైనంతమేర సమాధానం రాస్తే సరిపోతుంది. అంతేకానీ సంబంధిత అంశంపై ఉన్న సమాచారాన్ని అంతా పేపర్‌పై రాయకూడదు.
  • చదివిన అంశాన్ని, నేర్చుకున్న విషయాలను ప్రస్తుత వర్తమాన పరిస్థితులకు అన్వయిస్తూ సమాధానాలు ఇవ్వాలి.
  • ముఖ్యంగా జనరల్ స్టడీస్ నాలుగు పేపర్లలో ఈ విధానాన్ని తప్పకుండా అనుసరించాలి.
  • బుక్‌లెట్‌లో ఇచ్చిన స్పేస్‌లో ప్రశ్నలను రాయమనే అవకాశం ఉంది. కాబట్టి ఉన్న స్పేస్‌లో ప్రభావవంతంగా సమాధానాలు రాయాలి.
  • సంబంధిత ప్రశ్నకు సమాధానం రాసేటప్పుడు పరీక్ష రోజు వరకు ఆ అంశం/రంగంపై ప్రస్తుతం ఏయే మార్పులు, పరిణామాలు జరిగాయో తెలుసుకోవాలి. వాటిని అప్లికేషన్ ఓరియెంటెడ్ మెథడ్‌లో సమాధానాలకు వర్తింపచేయాలి.
  • సమాధానం సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా రాయాలి. అభ్యర్థులు అందరి దగ్గర ఒకే విధమైన సమాచారం ఉంటుంది. ఎవరైతే సృజనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా,మిగిలినవారికంటే భిన్నం గా రాయగలరో వారే పోటీలో ముందంజలో ఉంటారు.
  • జనరల్ స్టడీస్ ప్రశ్నల్లో మారిన విధానంలో చాయిస్ చాలా తక్కువ ఉంటుంది. దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉండొచ్చు.
  • ఇంతకుముందు ఏదైనా ఒక టాపిక్‌కు సంబంధించి పూర్తిగా అడిగేవారు. ఈసారి ఆ టాపిక్‌ను ఉప విభాగాలుగా విభజించి ప్రశ్నలుగా ఇవ్వొచ్చు. కాబట్టి ప్రిపరేషన్ సూక్ష్మస్థాయి వరకు ఉండాలి.
  • సమయపరిమితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అందుబాటులో ఉన్న సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి.
  • జవాబులు రాసేటప్పుడు ప్రతి ప్రశ్నకు పరిచయం, ముగింపు ఇవేమీ రాయాల్సిన అవసరం లేదు. ప్రశ్నకు అవసరమైన మేర, అడిగినంతవరకు సమాధానాలు రాయాలి.
  • అండర్‌లైన్స్ అవసరం లేదు.
  • ప్రశ్నలన్నీ ఆచరణాత్మకమైనవే ఉంటాయి. ఎలాంటి భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో సమాధానాలు ఇవ్వాలి.
  • ఇంజనీరింగ్, మెడికల్ నేపథ్యం ఉన్న అభ్యర్థులు సోషల్ సెన్సైస్‌వారితో పోల్చుకుని ఆందోళన చెందకూడదు. సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి. సమస్యలు రాజకీయపరమైన వైనా, పరిష్కారాలు సాంకేతికపరంగానే ఉంటాయని తెలుసుకోవాలి.
  • దాదాపు స్వల్ప సమాధాన ప్రశ్నలే ఎక్కువ శాతం ఉంటాయి. వీటికి సమాధానాలను పాయింట్స్ రూపంలో రాయాలి.
  • ఈ మూడు రోజుల్లో అన్నింటినీ రివిజన్ చేయకుండా అన్ని అంశాలు గుర్తుండేలా షార్ట్ సినాప్సిస్ రూపొందించుకుని చదువుకోవాలి.
  • ప్రశ్నలను బాగా తెలిసినవాటిని, అవగాహన ఉన్నవాటిని ఎంచుకోవాలి. వాటిల్లో కూడా ప్రస్తుత సమకాలీన పరిస్థితులకు సంబంధించినవాటిని, విశ్లేషణాత్మకంగా రాయగలవాటిని, సవాల్‌గా నిలిచే ప్రశ్నలను ఎంపిక చేసుకోవాలి.
  • ఇలాంటి ప్రశ్నలకు ఎక్కువమంది సమాధానాలు రాయరు. సులువుగా ఉండే ఇతర ప్రశ్నలను రాస్తారు. కాబట్టి కష్టసాధ్యమైన ప్రశ్నలకు సమాధానాలు రాస్తే ఎక్కువ మార్కులు సాధించొచ్చు.
సైన్స్ అండ్ టెక్నాలజీ/డిజాస్టర్ మేనేజ్‌మెంట్
Bavithaసైన్స్ అండ్ టెక్నాలజీలో నూతన సిలబస్‌పై ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంది. విపత్తు నిర్వహణ సంబంధిత అంశాలు జనరల్ స్టడీస్-3లో ఉన్నాయి. ఈ అంశాలపై 25, 50, 75, 150 పదాల్లో సమాధానం రాయమనే ప్రశ్నలు ఇవ్వొచ్చు. కాబట్టి అందుబాటులో ఉన్న ఈ మూడు, నాలుగు రోజుల్లో రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పటివరకు చదువుకున్న అంశాలతోపాటు కనీసం కొన్నింటిని మాక్ పరీక్ష తరహాలో సాధన చేయడం తప్పనిసరి. దీనిద్వారా పరీక్షలో సమయాభావాన్ని అధిగమించొచ్చు. లేకుంటే ప్రశ్నలకు సమాధానాలు తెలిసినా ఎలా రాయాలో తెలియని పరిస్థితి తలెత్తుతుంది.

ఈసారి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి దైనందిన జీవితంలో శాస్త్ర, సాంకేతిక అనువర్తనాలు అనే అంశంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన కాంబినేషన్ వ్యాక్సిన్, సౌర పరికరాలు, వైద్య విధానాలు, అంతరిక్ష కార్యక్రమంలోని వీఆర్‌సీ (విలేజ్ రిసోర్స్ సెంటర్) సేవలు, వ్యవసాయం, పారిశ్రామిక రంగంలో అణుశక్తి అనువర్తనాలు ముఖ్యమైనవి. అదేవిధంగా ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు శాస్త్ర, సాంకేతిక రంగంలో భారతీయులు సాధించిన విజయాలను ఒకసారి క్లుప్తంగా చదువుకోవాలి. సత్యేంద్రనాథ్ బోస్, లాల్జీ సింఘ్, వెంకటరామన్ రామకృష్ణన్, విక్రం సారాబాయ్, హోమీ జహంగీర్ బాబా, సీఎన్‌ఆర్‌రావు, పీఎం భార్గవ వంటి శాస్త్రవేత్తలు, వారి విజయాల గురించి అధ్యయనం చేయాలి.

జాతీయ సైన్స్ విధానం, దాని లక్ష్యాలకు అనుగుణంగా ఇప్పటివరకు సాధించిన ప్రగతిని పునశ్చరణ చేసుకోవాలి. అంతరిక్ష రంగంలో టెలిమెడిసిన్, టెలిఎడ్యుకేషన్, గ్రామీణాభివృద్ధి, చంద్రయాన్, పీఎస్‌ఎల్‌వీ ప్రాధాన్యత, రీశాట్, మేఘ ట్రాపిక్స్ మొదలైనవి ముఖ్యమైనవి. భారత్‌లో మేధో సంపత్తి హక్కుల రక్షణకు తీసుకున్న చర్యలు, బయోటెక్నాలజీలో బయోఇన్ఫర్మేటిక్స్, జన్యుమార్పిడి పంటలు, బీటీ వంకాయ వివాదం, జన్యుపట ఆవిష్కరణ, జినోమిక్స్, మూలకణాలు, రోబోటిక్స్‌లో రోబోట్ రకాలు - ఉపయోగాలు, ఐటీలో జాతీయ ఈ-గవర్నెన్స్, ప్రణాళిక, డిజిటల్ లైబ్రరీలు, మెడికల్ ఇన్ఫర్మేటిక్స్‌లను కూడా చదవాలి. ఈ క్రమంలో.. భారత్‌కు చెందిన నానో సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్‌ను దృష్టిలో ఉంచుకోవాలి. పర్యావరణ రంగంలో కాలుష్య ప్రభావాలతోపాటు దేశంలో పర్యావరణ ప్రభావ అంచనాలో ఉన్న లోపాలు- సూచనలు, జీవవైవిధ్యానికి ఏర్పడుతున్న ముప్పు - ప్రమాదాలు - పరిరక్షణ చర్యలు, నగొయ ప్రొటోకాల్, కార్టజిన్ ప్రొటోకాల్‌లను పునశ్చరణ చేసుకోవాలి.

దేశంలో ఈ మధ్యకాలంలో ఉధృతమవుతున్న తుపాన్‌లు, వరదలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. దేశంలో విపత్తు నిర్వహణలో లోపాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు సునామీల గురించి చదువుకోవాలి. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌పై ప్రశ్నల్లో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? విపత్తు జరగకుండా ఎలా నివారించాలి? ప్రమాదం సంభవించాక ఎలా స్పందించాలి? సైక్లోన్ ఎలా వస్తుంది? సునామీకి కారణాలు ఏమిటి? విపత్తు ఎదుర్కోవడంలో ఎదురయ్యే సవాళ్లు ఏమిటి? జీవ వైవిధ్యానికి సంబంధించి అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ కనుమలు, హిమాలయాల్లో బయోడైవర్సిటీపై ప్రశ్నలు రావచ్చు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన ప్రశ్నల్లో ఉదాహరణకు ఉత్తరాఖండ్ జల ప్రళయం, పై-లిన్, హెలెన్ వంటి తుఫానులను, విపత్కర పరిస్థితులను నీవైతే ఎలా ఎదుర్కొంటావు? అని అడిగే అవకాశం ఉంది. ఆ పరిస్థితుల్లో అభ్యర్థి తాను అధికారిగా ఉంటే ఆ విపత్తును ఎలా ఎదుర్కొంటాడో రాయాలి.

Bavithaజనరల్ స్టడీస్-4 (ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ)..
అభ్యర్థుల ఆందోళన అంతా ఈ పేపర్ పైనే. ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? వీటికి సమాధానాలు ఎలా రాయాలి? ఈ పేపర్‌లో మంచి మార్కులు పొందడమెలా అనే సంశయాలు వీరిని వేధిస్తున్నాయి. అయితే ఎలాంటి భయం, సందేహాలు లేకుండా అవగాహన ఉన్నంత వరకు ఈ ప్రశ్నలకు సమాధానాలు రాస్తే మంచి మార్కులు పొందొచ్చు. అధికారులు తీసుకునే నిర్ణయాలు నియమనిబంధనలకనుగుణంగా, సమాజానికి మేలు చేసే విధంగా ఉన్నాయా? మహిళలు, చిన్నారులు, బలహీనవర్గాల సంక్షేమానికి కార్యక్రమాల అమలు సరిగా జరుగుతుందా? అనే విషయాలను తెలుసుకోవడం ఈ పేపర్ ఉద్దేశం. వీటితోపాటు సామాజిక, కుటుంబ, వ్యక్తిగత విలువలు ఉద్యోగ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో పరిశీలించడం. నేరపూరిత రాజకీయ వ్యవస్థలో మితిమీరిన రాజకీయ జోక్యం, కుల, మత, ప్రాంతీయ తత్వ ధోరణులు పరిపాలనను భ్రష్టు పట్టిస్తున్నాయి. వీటిని అధిగమించడమెలా? వంటి అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వీటికి సమాధానాలు రాయాలంటే కేస్ స్టడీలను అధ్యయనం చేయాలి. అవి..
  1. ఉదా: నిజాయతీ కలిగిన ఉన్నతాధికారి రవాణా శాఖ కమిషనర్‌గా నియమితులైనప్పుడు రాష్ట్రంలో ఉన్న వివిధ చెక్‌పోస్టుల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టడానికి తాను తీసుకోబోయే చర్యలేంటి? ఈ సందర్భంగా రాజకీయంగా, పాలనపరంగా తలెత్తే సమస్యలేంటి? వీటిని ఎలా అధిగమించొచ్చు?
  2. హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో ఒక పేద విద్యార్థి చలికి వణుకుతూ స్వెట్టర్ కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇది గమనించిన ఒక ఉపాధ్యాయురాలు ఆ విద్యార్థికి స్వెట్టర్ కొనిచ్చింది. మరుసటి రోజు ఆ విద్యార్థి స్వెట్టర్ వేసుకుని వస్తే సహ విద్యార్థులు దీన్ని ఎక్కడ దొంగతనం చేశావని గేలి చేశారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం ఏ రకంగా స్పందించాలి? తోటి విద్యార్థుల నకారాత్మక వైఖరికి సమాజం, కుటుంబ విలువలు బాధ్యత వహిస్తాయా?
ఉద్యోగుల వైఖరిని తెలుసుకోవడానికి అవినీతి, నైతికత, పారదర్శకతలమీద కూడా కేస్ స్టడీలు ఉండే అవకాశం ఉంది. వీటికి సంబంధించి ప్రశ్నలు ఇలా ఉండొచ్చు.
  1. ఉదా: ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసే ఒక ఉన్నతోద్యోగి వద్దకు ఇంతకుముందు అతని సహోద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారి వచ్చాడు. ఇతను ప్రస్తుతం ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. భోజనానికి వెళ్దాం రమ్మని ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగిని ఆహ్వానించాడు. అప్పుడు ప్రైవేటు ఉద్యోగి ఒక ప్రతిపాదన తెచ్చాడు. మా కంపెనీ వస్తువులను తీసుకునేలా మీ పలుకుబడిని ఉపయోగించి కాంట్రాక్టు ఇప్పిస్తే 10 శాతం డిస్కౌంట్ ఇప్పిస్తానన్నాడు. అంతేకాకుండా ఉద్యోగం నుంచి రిటైర్ కాగానే తమ కంపెనీలో ఇంతకంటే మంచి ఉద్యోగం ఇప్పిస్తానని అన్నాడు. దీనికి ఆ ఉన్నతాధికారి ఎలా స్పందించాలి?
    ఎ) ఆ ప్రతిపాదనలు ఆమోదించి ప్రైవేటు సంస్థకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని లబ్ధి పొందాలి.
    బి) ఏదో ప్రతిపాదన చేశాడులే కానీ అది నా వృత్తి ధర్మానికి వ్యతిరేకం అని ఊరుకోవాలి.
    సి) ఈ విషయాన్ని తన డిపార్ట్‌మెంట్‌లో ఇంటెలిజెన్స్‌కు అందించి తిరిగి ఇలాంటివి జరగకుండా చర్యలకు ఉపక్రమించాలి.

ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు అభ్యర్థి ఆ పరిస్థితులు తనకు ఎదురైతే ఎలా స్పందిస్తాడో రాయాలి. దాదాపుగా ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీలో ప్రశ్నలన్నీ కూడా అభ్యర్థి ఆ సమయం/సందర్భంలో ఎలా స్పందిస్తాడో, ఎలాంటి చర్యలు చేపడతాడో తెలుసుకునేలా ఉంటాయి. మీ ఓరియెంటేషన్‌లో సమాధానాలు రాసేటప్పుడు మీరు ఎందుకు అలా భావిస్తున్నారో బలపరుచుకునేలా ఉదాహరణలు రాయాలి. వీటితోపాటు ఎప్పుడు కూడా ‘అవును’ అనో ‘కాదు’ అనో మీ అభిప్రాయాలను చెప్పకూడదు. అలా అనుకోవడానికి లేదా విభేదించడానికి మీరనుకుంటున్న కారణాలేవో తెలిపి, ఈ కారణాలను బట్టి నేను భావిస్తున్నాను లేదా సరైంది కాదనుకోవాల్సి వస్తుంది అనే విధానంలో రాయాలి.

Bavithaపరిచయం, ముగింపులు అవసరం లేదు
  • దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. సమాధానం పాయింట్స్ రూపంలో రాయాలి.
  • జవాబులు రాసేటప్పుడు పరిచయం, ముగింపులు అవసరం లేదు.
  • ఇంటిగ్రిటీ అండ్ ఎథిక్స్ ప్రశ్నలకు కామన్‌సెన్‌‌సతో, నిజాయతీతో సమాధానాలు రాయాలి.
  • ఎగ్జామినర్‌ను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో కాకుండా మీరు ఏమనుకుంటున్నారో, మీ అభిప్రాయాలు ఏమిటో స్పష్టంగా అక్షరీకరించాలి.
  • ఇప్పటికే రెండుమూడుసార్లు మెయిన్‌‌స పరీక్షలు రాసి, ఇంటర్వ్యూ వరకు వెళ్లినవారిని చూసి భయపడాల్సిన అవసరం లేదు.
  • ప్రశ్నపత్రం ఎవరికైనా ఒకటేనన్న సంగతిని గుర్తించాలి.
-గోపాలకృష్ణ. డెరైక్టర్,
బ్రెయిన్ ట్రీ అకాడమీ,
హైదరాబాద్

Bavithaఎథిక్స్ పేపర్‌ను కామన్‌సెన్స్‌తో రాయాలి
చదవని అంశాలపై కంటే చదివినవాటిపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. కొన్ని చాప్టర్లు చదవలేదే.. ఇవి మిగిలిపోయాయనే భావన వీడాలి. బాగా చదివిన అంశాలను మరింత మెరుగ్గా ప్రజెంట్ చేయాలి. నూతనంగా ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టిన ఎథిక్స్ పేపర్‌ను కామన్‌సెన్స్‌ను ఉపయోగించి రాయాలి. సమయపరిమితిలోగా వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. పరీక్ష ముందురోజు ఎలాంటి ప్రిపరేషన్ చేయొద్దనేది నా సలహా. దీనివల్ల చదవని అంశాలు కనిపించి మరింత ఎక్కువ ఆందోళనకు గురవుతారు. బాగా చదివినవాటిని కూడా మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. పరీక్ష రోజు చాలామంది పెద్దగా మాట్లాడుతూ వివిధ అంశాలను చర్చిస్తూ ఉంటారు. లేదంటే పెద్ద గైడ్‌లను చదువుతుంటారు. వీళ్లంతా చదువుతున్నారు.. మనం చదవడం లేదే అనే భావన వదిలిపెట్టాలి. ధైర్యంగా ఉండాలి. నేను చదివినంతవరకు చాలా బాగా చదివాను అని అనుకోవాలి. పరీక్ష రోజు చక్కగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చేసి పరీక్షకు హాజరుకావాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని సానుకూల దృక్పథంతో పరీక్ష రాస్తే విజయం మీదే.
-జె.మేఘనాథ్ రెడ్డి.
సివిల్స్-2012 విజేత

Bavithaఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాయాలి
  • అడిగిన ప్రశ్నలకు విస్తృతమైన సమాచారం రాయాల్సిన అవసరం లేదు.
  • విశ్లేషణాత్మకంగా రాయడంతోపాటు ప్రస్తుత పరిస్థితులకు అన్వయిస్తూ సమాధానాలు రాయాలి.
  • ఛాయిస్ చాలా తక్కువ ఉంటుంది. అసలు ఉండకపోవచ్చు. కాబట్టి వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి.
  • ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీలో అభ్యర్థి భాగ స్వామిని చేసేలా ప్రశ్నలు ఉంటాయి. సంబంధిత సమస్యను అభ్యర్థి ఎలా ఎదుర్కొంటాడో తెలుసుకుంటారు.
  • టైం మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యం.
  • పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌కు చదువుకునే సిలబస్ జనరల్ స్టడీస్‌లో 60 శాతం వరకు ఉపయోగపడుతుంది.
-డా.బి.జె.బి.కృపాదానం, సివిల్స్ ఫ్యాకల్టీ,
ఆర్.సి.రెడ్డి స్టడీ సర్కిల్, హైదరాబాద్

Bavithaమార్పులు అందరికీ ఉన్నవేనని గుర్తించాలి
  • ప్రిపరేషన్ సూక్ష్మ స్థాయిలో ఉండాలి.
  • ఎక్కువ ప్రశ్నలు షార్‌‌ట ఆన్సర్ ప్రశ్నలుగా ఉండొచ్చు.
  • ఇంతకుముందు వరకు పూర్తిగా ఒక టాపిక్‌కు సంబంధించి అడిగేవారు. ఈసారి టాపిక్‌లోని ఒక్కో సబ్ టాపిక్‌ను ఒక్కో ప్రశ్నగా అడిగే అవకాశం ఉంది.
  • ప్రశ్నపత్రంలో ఇచ్చిన సూచనలను క్షుణ్నంగా చదవాలి.
  • ఇచ్చిన ప్రశ్నను అర్థం చేసుకుని అడిగినంతమేరకు మాత్రమే సమాధానం రాయాలి.
  • ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీలో కేస్ స్టడీస్‌కు సంబంధించిన ప్రశ్నలతోపాటు పరిపాలన, విలువలకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఉండొచ్చు.
  • మార్పులు, సమస్యలు మీతోపాటు అందరికీ ఉన్నవేనని గుర్తించాలి.
-గురజాల శ్రీనివాసరావు.
సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్

Bavithaరైటింగ్ ప్రాక్టీస్ చేయాలి
  • ఈసారి బుక్‌లెట్ ఇచ్చి నిర్దేశిత స్పేస్‌లో సమాధానాలు రాయమనే అవకాశం ఉంది.
  • అనవసరమైన విషయాలు రాయకుండా తక్కువ పదాలతో ఎక్కువ అర్థం వచ్చేటట్లు జవాబులు రాయాలి.
  • సబ్జెక్టు అందరివద్ద ఉంటుంది. ఎవరైతే ప్రభావవంతంగా సమాధానాలు రాస్తారో వారు ఎక్కువ మార్కులు సాధించొచ్చు.
  • హిస్టరీ ఆప్షనల్ సిలబస్ 100 శాతం జనరల్ స్టడీస్ హిస్టరీ సిలబస్‌తో సరిపోతుంది.
  • ప్రశ్నలను తక్కువ మార్కుల ప్రశ్నలుగా విభజించి అడిగే అవకాశం ఉంది.
  • అందుబాటులో ఉన్న ఈ మూడు రోజుల్లో వీలైనంత రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి.
-కరీం. సివిల్స్ ఫ్యాకల్టీ,
హైదరాబాద్

Bavithaతుపానులు, అంతరిక్ష ప్రయోగాలు ముఖ్యం
  • విపత్తు నిర్వహణ అంశాలపై 50, 75, 150 పదాల్లో సమాధానం రాయమనే అవకాశం ఉంది.
  • అందుబాటులో ఉన్న ఈ మూడు రోజుల్లో ముఖ్యమైన ప్రశ్నలను మాక్ పరీక్ష తరహాలో సాధన చేయాలి.
  • రైటింగ్ ప్రాక్టీస్ కూడా తప్పనిసరి.
  • దేశంలో విపత్తు నిర్వహణలో లోపాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ముఖ్యంగా చదువుకోవాలి.
  • చంద్రయాన్, పీఎస్‌ఎల్‌వీ ప్రాధాన్యత, రీశాట్, మేఘ ట్రాపిక్స్‌లను ఈ మూడు రోజుల్లో ఒకసారి రివిజన్ చేయాలి.
  • శాస్త్ర, సాంకేతిక రంగంలో భారతీయలు సాధించిన విజయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.
-సి.హరికృష్ణ,
సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్

Bavithaగత విజయాలను గుర్తుకు తెచ్చుకోవాలి
పరీక్ష రాసేవరకు అభ్యర్థుల్లో ఆందోళన సహజం. రేపు పరీక్ష పేపర్ ఎలా ఉంటుందో అని అతిగా ఆలోచించకూడదు. కంటినిండా నిద్రపోవాలి. అతిగా ఆలోచించి నిద్ర పోకుంటే ఆ ప్రభావం రేపటి పరీక్ష పై ఉంటుంది. మీ మీద మీకు ఆత్మవిశ్వాసం పెరగడానికి మీ జీవితంలో అంతకుముందు సాధించిన విజయాలను, సంతోషాన్ని ఇచ్చిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవాలి. పరీక్ష రాసేవారిలో అంతకుముందు మెయిన్స్ రాసినవారు ఉంటారు. వారితో పోల్చుకోకూడదు. మీ ప్రత్యేకతలు మీకు ఉంటాయని గుర్తించాలి. దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. తక్కువ పదాల్లో ఎక్కువ భావం వచ్చేలా, విశ్లేషణాత్మకంగా రాయాలి. నేను తెలుగు మీడియంలో పరీక్షలు రాసి విజయం సాధించాను. తెలుగులో పరీక్ష రాసేవాళ్లు ప్రతి పదాన్ని అనువాదం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని పదాలను తెలుగులో అలాగే రాయొచ్చు. ప్రశ్నను చదువుకుని భావం చెడకుండా సమాధానం రాస్తే చాలు. కొత్తగా ప్రవేశపెట్టిన ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ పేపర్‌కు రాజ్యాంగ ప్రవేశికను వర్తింపు చేసుకోవచ్చు. అందులోని ప్రతిపదాన్ని మనసులోకి ఎక్కించుకుంటే ఎథిక్స్ ప్రశ్నలకు సులువుగా సమాధానాలు రాయొచ్చు.
-చింతం వెంకట అప్పల నాయుడు, ఐపీఎస్
సివిల్స్-2011 విజేత

Published date : 29 Nov 2013 11:43AM

Photo Stories