కొత్తగూడెంటౌన్: కొత్తగూడేన్ని బాలకార్మిక రహిత జిల్లాగా మార్చడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఎస్పీ డాక్టర్ వినీత్ ఆగష్టు 1న ఒక ప్రకటనలో తెలిపారు.
‘ముస్కాన్’తో 35 మందికి రక్షణ
జిల్లా వ్యాప్తంగా జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహించామని, వెట్టిచాకిరీ చేస్తున్న 35 మంది బాలబాలికలకు విముక్తి కలిగించామని పేర్కొన్నారు. ఇందులో 30 మంది బాలురు, ఐదుగురు బాలికలు ఉన్నారని, వ్యాపార సముదాయాలు, పరిశ్రమలు, ఇతర ప్రదేశాల్లో వారితో పని చేయిస్తున్న 28 మందిపై కేసులు నమోదు చేశామని వివరించారు.
చిన్నారుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన 10 మంది బాలురు, ఒక బాలిక కూడా ఉన్నారని తెలిపారు. పనుల నుంచి విముక్తి కల్పించిన వారిలో 33 మంది బాలబాలికలను తల్లిదండ్రులకు అప్పగించామని, ఇద్దరిని బాలుర సంరక్షణ గృహంలో ఉంచామని తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్ బృందంలో పని చేసిన అన్ని శాఖల అధికారులను ఆయన అభినందిచారు.