AP DSC Notification: నిరుద్యోగులకు అదిరే శుభవార్త.. ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను ఫిబ్రవరి 7వ తేదీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం కాగా.. ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు ప్రకటించనున్నారు.
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ వివరాల్ని మంత్రి బొత్స మీడియాకు వివరించారు. రాష్ట్రంలో 2024 డీఎస్సీని ప్రకటిస్తున్నాం. ఏడు మేనేజ్ మెంట్ల పరిధిలో 6100 పోస్టులతో డీఎస్సీని ప్రకటిస్తున్నాం. మెగా డీఎస్సీలో.. మొత్తం పోస్టుల్లో 2,299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 2,280 ఎస్జీటీ పోస్టులు, 1,264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు ఉన్నాయి. ఈ నెల 12వ తేదీ నుంచి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 7వ తేదీతో ముగస్తుంది. విద్య మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత. మా ప్రభుత్వం ఈ అయిదేళ్లలో రూ.73 వేల కోట్లు విద్య పై ఖర్చు చేసింది అని మీడియాకు మంత్రి బొత్స తెలిపారు.
డీఎస్సీ ప్రక్రియ ఇలా..
ఈ నెల 12వ తేదీ నుంచి డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. మార్చి 5వ తేదీ నుంచి హల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రెండు సెషన్స్లో డీఎస్సీ పరీక్షలు ఉంటాయి. మార్చి 31వ తేదీన ప్రాథమిక కీ విడుదల అవుతుందని.. ఏప్రిల్ 1వ తేదీన కీలో అభ్యంతరాలపై స్వీకరణ ఉంటుందని.. ఆ వెంటనే ఏప్రిల్ 2వ తేదీన ఫైనల్ కీ విడుదల చేస్తామని చెప్పారాయన. ఏప్రిల్ 7వ తేదీన డీఎస్సీ ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు.
వేరే రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీకి చెందిన వారి కోసం కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స తెలిపారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://cse.ap.gov.in/loginhome వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
టెట్ ప్రక్రియ ఇలా..
ఫిబ్రవరి 8వ తేదీ నుంచి టెట్ ప్రక్రియ(నోటిఫికేషన్ విడుదల) ప్రారంభం అవుతుంది. 23వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9వ తేదీ లోపు రెండు సెషన్స్లో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాథమిక కీ మార్చి 10వ తేదీన.. కీపై అభ్యంతరాల స్వీకరణ 11వ తేదీ దాకా ఉంటుంది. ఫైనల్కీ మార్చి 13వ తేదీన రిలీజ్ చేస్తారు. మార్చి 14వ తేదీన టెట్ తుదిఫలితాలు వెలువడతాయి.