Skip to main content

జేఈఈ మెయిన్ కౌన్సెలింగ్ విధివిధానాలు...

ఇంజనీరింగ్ విద్యకు ఐఐటీల తర్వాత ప్రాధాన్యతనిచ్చే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లలో ప్రవేశానికి సన్నాహకాలు ప్రారంభమయ్యాయి.. జేఈఈ-మెయిన్ ద్వారా ప్రవేశం కల్పించే ఈ ఇన్‌స్టిట్యూట్‌లలో అడ్మిషన్ల ప్రక్రియ జూలై 1 నుంచి మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ప్రవేశ ప్రక్రియతోపాటు కొన్ని ముఖ్యమైన నిట్‌లలో గతేడాది చివరి ర్యాంకుల వివరాలు...

జేఈఈ-మెయిన్‌లో పాల్గొంటున్న ఇన్‌స్టిట్యూట్‌లు
  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ టెక్నాలజీలు-30
  • ఐఐఐటీ/ఐఐఐటీఎం/ఐఐఐటీడీఎం-13
  • కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు-16
ముందుగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్:
పలు దశల్లో జరిగే ఆన్‌లైన్ కౌన్సెలింగ్ కోసం..ర్యాంకు పొందిన వారు www.ccb.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు పేర్కొని.. చాయిస్ ఫిల్లింగ్ (జేఈఈ మెయిన్ ర్యాంకుతో సీటు కేటాయించే సంస్థలు, బ్రాంచ్‌ల ఆధారంగా ప్రాథమ్యాలను పేర్కొనడం) చేయాలి. తమ ఆప్షన్లను ‘లాక్’ చేయాలి. ఆల్ ఇండియా ర్యాంకు, ప్రాథమ్యాల ఆధారంగా సీట్ ఎలాట్‌మెంట్ జరుగుతుంది. తర్వాత నిర్దేశిత రిపోర్టింగ్ సెంటర్లలో ఫీజు చెల్లించి, సర్టిఫికెట్లను పరిశీలనకోసం చూపించాలి.

ఆల్ ఇండియా వర్సెస్ హోం స్టేట్:
జేఈఈ మెయిన్ ర్యాంకుల్లో ఆల్ ఇండియా ర్యాంకు (జాతీయ స్థాయిలో పొందిన), హోం స్టేట్ ర్యాంకు (సదరు నిట్ ఉన్న రాష్ట్రంలో పోటీ పడిన విద్యార్థులందరిలో పొందిన ర్యాంకు)లను వేర్వేరుగా ప్రకటిస్తారు. ఒక ‘నిట్’ క్యాంపస్ ఏ రాష్ట్రంలో ఉంటే.. ఆ రాష్ట్ర విద్యార్థులకు మొత్తం సీట్లలో 50 శాతం కేటాయిస్తారు.

ఆల్ ఇండియా ర్యాంకుకే తొలి ప్రాధాన్యం:
సీట్ల కేటాయింపులో ముందుగా ఆల్ ఇండియా ర్యాంకుకే ప్రాధాన్యం ఇస్తారు. ఆ తర్వాతే హోం స్టేట్ ర్యాంకు ప్రాతిపదికగా తీసుకుని హోం స్టేట్ కోటాలో సీటు కేటాయిస్తారు.
  • రాష్ర్ట విభజన జరిగినప్పటికీ.. ఈ ఏడాది కూడా గతేడాది విధానాన్నే అనుసరిస్తారు. అంటే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే తేడా ఉండదు. అందరిని ఆంధ్రప్రదేశ్ విద్యార్థులుగా పరిగణించి హోం స్టేట్ ర్యాంక్ కేటాయిస్తారు.
కౌన్సెలింగ్ ప్రక్రియ:
  • అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ జూలై 1న ప్రారంభమవుతుంది.
  • జూలై 9 వరకు (సాయంత్రం 5 గంటలు) ప్రాధాన్యతలను (బ్రాంచ్/ఇన్‌స్టిట్యూట్‌ల వారీగా) పొందుపరుస్తూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
మొదటి దశ:
  • మొదటి దశ సీట్ల కేటాయింపును జూలై 11న ప్రకటిస్తారు.
  • మొదటి దశలో సీటు ఖరారైతే.. ఆన్‌లైన్‌లో నిర్దేశించిన ఫీజు (రూ. 40,000)ను చెల్లించాలి. తర్వాత సంబంధిత కేంద్రంలో జూలై 11 నుంచి 14 మధ్య రిపోర్ట్ చేయడంతోపాటు ఆప్షన్స్ 1, 2, 3 ఇవ్వాలి.
  • ఆప్షన్స్-1, 2 ఇచ్చిన విద్యార్థులు కూడా రెండో దశ సీట్ల కేటాయింపు వరకు వేచి చూడాలి. ఆప్షన్-3 ఎంచుకున్న విద్యార్థులు జూలై 21 నుంచి 24 మధ్య ప్రవేశం పొందిన ఇన్‌స్టిట్యూట్‌లలో రిపోర్ట్ చేసి తరగతులకు హాజరుకావచ్చు.
  • మొదటి దశలో సీటు ఖరారు కాకపోతే.. జూలై 16న వెల్లడించే రెండో దశ సీట్ల కేటాయింపు వరకు వేచి చూడాలి.
రెండో దశ:
  • రెండో దశలో సీటు ఖరారైతే.. ఆన్‌లైన్‌లో నిర్దేశించిన ఫీజు (రూ. 40,000)ను చెల్లించాలి. తర్వాత సంబంధిత కేంద్రంలో జూలై 16 నుంచి 19 మధ్య రిపోర్ట్ చేయడంతోపాటు ఆప్షన్స్-1, 2, 3 ఇవ్వాలి. ఒక వేళ ఇచ్చిన ఆప్షన్స్‌ల్లో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే (ఉదాహరణకు ఆప్షన్-1 నుంచి ఆప్షన్-2కు మారడం) సంబంధిత రిపోర్టింగ్ సెంటర్‌ను సంప్రదించాలి.
  • ఆప్షన్-3 ఇచ్చిన విద్యార్థులు జూలై 21 నుంచి 24 మధ్య ప్రవేశం పొందిన ఇన్‌స్టిట్యూట్‌లలో రిపోర్ట్ చేసి తరగతులకు హాజరుకావచ్చు.
  • రెండో దశలో సీటు ఖరారు కాకపోతే.. జూలై 21న వెల్లడించే మూడో దశ సీట్ల కేటాయింపు వరకు వేచి చూడాలి.
మూడో దశ:
  • మూడో దశలో సీటు ఖరారైతే.. మొదట ఆన్‌లైన్‌లో నిర్దేశించిన ఫీజు (రూ. 40,000)ను చెల్లించాలి. తర్వాత జూలై 21 నుంచి 23 మధ్య సంబంధిత రిపోర్టింగ్ సెంటర్‌ను సంప్రదించాలి. ఈ దశలో కేటాయించిన సీటు సంతృప్తికరంగా ఉంటే.. నిర్దేశిత ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్ట్ చేసి తరగతులకు హాజరుకావచ్చు. ఒక వేళ కేటాయించిన సీటు ఆమోదయోగ్యం కాకుంటే ఆ విషయాన్ని సంబంధిత రిపోర్టింగ్ సెంటర్‌కు తెలియజేసి వారు సూచించిన విధంగా బ్యాంకు ఖాతా వివరాలను వెల్లడించాలి. ఆ మేరకు వారు మీరు చెల్లించిన ఫీజును రిఫండ్ చేస్తారు.
  • మూడో దశ తర్వాత సీటు ఖరారు కాని విద్యార్థుల కోసం.. ఎన్ని సీట్లకు, ఎంత మంది విద్యార్థులు, ఏయే ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందారు? వంటి వివరాలను జూలై 21 నుంచి 23 మధ్య వెబ్‌సైట్‌లో వెల్లడిస్తారు. ఈ వివరాల ఆధారంగా జూలై 21-24 మధ్య ప్రాధాన్యతలను పొందుపరుస్తూ మరోసారి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అర్హత ఉండి మొదట్లో (జూలై 1-9 మధ్య) రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు కూడా కొత్తగా ఈ దశ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
నాలుగో దశ:
  • ఈ మేరకు నాలుగో దశ కేటాయింపులను జూలై 26న వెల్లడిస్తారు. నాలుగో దశలో సీటు ఖారారైతే.. ఆన్‌లైన్‌లో నిర్దేశించిన ఫీజు (రూ. 40,000)ను చెల్లించాలి. తర్వాత జూలై 26 నుంచి 29 మధ్య నిర్దేశిత ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్ట్ చేసి తరగతులకు హాజరుకావచ్చు.
  • నాలుగో దశలో సీటు ఖరారు కానీ విద్యార్థులు, ఖరారైన అడ్మిషన్ పట్ల సంతృప్తిగా లేని విద్యార్థులు స్పాట్ రౌండ్ కోసం వేచి చూడాలి.
  • అన్ని ఇన్‌స్టిట్యూట్‌లకు సంబంధించిన ఖాళీల వివరాలను జూలై 31న వెల్లడిస్తారు.
స్పాట్ రౌండ్:
  • స్పాట్ రౌండ్‌కు హాజరుకావాలనుకునే విద్యార్థులు.. ఆన్‌లైన్‌లో నిర్దేశించిన ఫీజు (రూ. 40,000)ను చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత జూలై 31 నుంచి ఆగస్ట్ 2 మధ్య ఖాళీల ఆధారంగా హెల్ప్ సెంటర్ లేదా తమ దగ్గర్లోని సెంటర్ల ద్వారా తమ ప్రాధాన్యతలను లాక్ చేయాలి.
  • అర్హత ఉండి జూలై 1-9, జూలై 20-24 మధ్య రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు కూడా కొత్తగా ఈ దశ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
  • స్పాట్ రౌండ్ సీట్ల కేటాయింపు ఆగస్ట్ 4న వెల్లడిస్తారు. ఇందులో సీటు ఖరారైన విద్యార్థులు ఆగస్ట్ 4 నుంచి 7 మధ్య నిర్దేశించిన ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్ట్ చేయాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మిగతా ఫీజు చెల్లించిన తర్వాత సంబంధిత ఇన్‌స్టిట్యూట్ సీటును ఖరారు చేస్తుంది.
  • స్పాట్ రౌండ్ తర్వాత మరిన్ని స్పాట్ రౌండ్లు ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ అటువంటి అవకాశం ఉంటే సంబంధిత వివరాలను సీఎస్‌ఏబీ వెబ్‌సైట్ ద్వారా వెల్లడిస్తారు.
ఆప్షన్స్
  • ఆప్షన్-1: సదరు విద్యార్థి ఇన్‌స్టిట్యూట్‌తో నిమిత్తం లేకుండా తన ప్రాధాన్యత మేరకు తర్వాత సీట్ల కేటాయింపు దశను ఎంచుకోవడం.
  • ఆప్షన్-2: సదరు విద్యార్థి ప్రవేశం పొందిన ఇన్‌స్టిట్యూట్‌లోనే తన ప్రాధాన్యత మేరకు తర్వాత సీట్ల కేటాయింపు దశను ఎంచుకోవడం.
  • ఆప్షన్-3: కేటాయించిన అడ్మిషన్ పట్ల సదరు విద్యార్థి సంతృప్తి చెందినట్లు భావించడం. తద్వారా అతడు ఇచ్చిన ప్రాధాన్యతలను (బ్రాంచ్/ఇన్‌స్టిట్యూట్‌ల వారీగా) తర్వాతి దశ కోసం పరిగణించరు.
Bavitha
Published date : 13 Jun 2014 11:15AM

Photo Stories