Skip to main content

జేఈఈ మెయిన్-2018 విజయానికి మార్గాలు...

దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో చదివేందుకు మార్గం.. నిట్, ట్రిపుల్ ఐటీ వంటి ఇన్‌స్టిట్యూట్లలో బీటెక్, ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లోప్రవేశానికి నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష.. జేఈఈ మెయిన్..!
ఐఐటీల్లో చేరికకు ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకూ ఇందులో ఉత్తీర్ణత తప్పనిసరి. దేశవ్యాప్తంగా ఏటా దాదాపు 12 లక్షల మంది పోటీ పడే జేఈఈ మెయిన్-2018 షెడ్యూల్ ఖరారైంది. ఆఫ్‌లైన్ విధానంలో ఏప్రిల్ 8, 2018న సెంట్రల్ బోర్ట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈ పరీక్షను నిర్వహించనుంది. ఆన్‌లైన్ పద్ధతిలో ఏప్రిల్ 14 లేదా 15 తేదీల్లో జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో విజయానికి నిపుణుల సలహాలు..
  • జేఈఈ మెయిన్ ఉత్తీర్ణుల్లో మొత్తం 2.24 లక్షల మంది విద్యార్థులకు ఈ సారి జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసే అవకాశం కల్పించనున్నట్లు ఐఐటీ ఉమ్మడి కౌన్సిల్ నిర్ణయం పేర్కొంది. గతేడాది (జేఈఈ-2017) వరకు ఈ సంఖ్య 2.20 లక్షలుగానే ఉండేది.
  • ‘జేఈఈ మెయిన్’లో మంచి ర్యాంకు వస్తేనే. జాతీయ స్థాయిలోని ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో బీటెక్, బీఆర్క్, ఇంటిగ్రేటెడ్ బీటెక్ వంటి కోర్సుల్లో ప్రవేశించేందుకు ఆస్కారం ఉంటుంది. ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఉత్తీర్ణత అర్హతగా నిర్వహించే ఈ పరీక్షను లక్ష్యంగా చేసుకుని మొదటి సంవత్సరం తొలి రోజు నుంచే విద్యార్థులు సన్నద్ధమవుతుంటారు. అలాంటివారు తమ కసరత్తుకు మరింత పదును పెట్టాల్సిన సమయం వచ్చేసింది.

పరీక్ష విధానం :
జేఈఈ మెయిన్‌లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 బీటెక్, బీఈ కోర్సుల ఔత్సాహికులకు ఉద్దేశించినది. పేపర్-2 మాత్రం ఆయా ఇన్‌స్టిట్యూట్‌లలో ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ (బీఆర్క్) చదవాలనుకునే అభ్యర్థులు రాయాల్సిన పరీక్ష.
  • పేపర్-1లో మూడు సబ్జెక్ట్‌లు.. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలడుగుతారు. నాలుగేళ్లుగా ఒక్కో సబ్జెక్టు నుంచి 30 చొప్పున, మొత్తం 90 ప్రశ్నలను 360 మార్కులకు ఇస్తున్నారు.

ఫిజిక్స్ :
న్యూమరికల్, అప్లికేషన్ అప్రోచ్ ఎక్కువగా ఉండే సబ్జెక్ట్ ఇది. ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే.. ఎలక్ట్రో డైనమిక్స్, హీట్ అండ్ థర్మో డైనమిక్స్, మెకానిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్‌హెచ్‌ఎం అండ్ వేవ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. వీటితోపాటు సెంటర్ ఆఫ్ మాస్, మొమెంటమ్ అండ్ కొలిజన్; సింపుల్ హార్మోనిక్ మోషన్, వేవ్ మోషన్ అండ్ స్ట్రింగ్ వేవ్స్‌పై లోతైన అవగాహన ఏర్పర్చుకుంటే మంచి మార్కులు సొంతం చేసుకునే వీలుంటుంది. ప్రిపరేషన్ పరంగా.. ప్రాథమిక భావనలను వాస్తవ పరిస్థితులతో అన్వయించుకుంటూ సాధన చేయాలి. ప్రాక్టీస్ సమయంలోనే ముఖ్యమైన పాయింట్లు, ఫార్ములాలు నోట్ చేసుకుంటే పునశ్చరణపరంగానూ ఎంతో మేలు చేస్తుంది.

మ్యాథమెటిక్స్ :
ప్రతి చాప్టర్‌ను తప్పనిసరిగా అభ్యసించి, అవగాహన పొందాల్సిన సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే.. అభ్యర్థులు 3-డి జామె ట్రీ; కో ఆర్డినేట్ జామెట్రీ; వెక్టార్ అల్జీబ్రా; ఇంటిగ్రేషన్; కాంప్లెక్స్ నెంబర్స్; పారాబోలా; ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్‌కు కొంచెం అధిక ప్రాధాన్యమివ్వడం ద్వారా స్కోరింగ్‌ను మెరుగుపర్చుకోవచ్చు. వీటితోపాటు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్; పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్, బైనామియల్ థీరమ్, లోకస్ అంశాలను కనీసం ఒక్కసారైనా పూర్తిచేసే విధంగా ప్రిపరేషన్ సాగించాలి.

కెమిస్ట్రీ :
మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లతో పోలిస్తే కాసింత సులభంగా ఉండే సబ్జెక్ట్. ఈ విభాగంలో ప్రశ్నల శైలి కూడా కెమికల్ బాండింగ్, పిరియాడిక్ టేబుల్, బ్రేకింగ్‌ల మూలాలపై నైపుణ్యాలను తెలుసుకునే విధంగా ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మోల్ కాన్సెప్ట్, కో ఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి-బ్లాక్ ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చర్, గ్యాసియస్ స్టేట్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్‌పై పట్టు సాధించాలి.

సమయపాలన.. సమన్వయం
ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతూ.. జేఈఈ మెయిన్‌ను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు ఇప్పటినుంచి కచ్చితమైన సమయ పాలన, ఇతర సబ్జెక్ట్‌లు, ఇంటర్మీడియెట్ సబ్జెక్ట్‌లు, బోర్డ్ పరీక్షలు, ప్రాక్టికల్స్‌ను సమన్వయం చేసుకునే విధంగా కదలాలి.
  • డిసెంబర్ చివరి వరకు జేఈఈ మెయిన్ సిలబస్, ఇంటర్మీడియెట్ రెండు సంవత్సరాల సిలబస్‌లోని ఉమ్మడి అంశాల ప్రిపరేషన్ పూర్తి చేయాలి.
  • జేఈఈ మెయిన్ సిలబస్‌లో మాత్రమే ఉన్న అంశాలపై జనవరిలో దృష్టి పెట్టడం మంచిది.
  • ఫిబ్రవరి నుంచి సమయాన్ని పూర్తిగా ఇంటర్మీడియెట్ పరీక్షల ప్రిపరేషన్‌కు కేటాయించాలి.
  • ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక జేఈఈ మెయిన్‌పై పూర్తిస్థాయిలో నిమగ్నమవ్వాలి.
  • విద్యార్థులు తమ ప్రిపరేషన్ సమయంలో రూపొందించుకున్న సొంత నోట్స్, షార్ట్ కట్ ఫార్ములాల ఆధారంగా పునశ్చరణ చేయాలి.
  • ప్రస్తుతానికి ఇంటర్ పరీక్షలతో పాటు జేఈఈ మెయిన్ ప్రిపరేషన్‌కు సమయం కేటాయించే విధంగా ప్రణాళిక వేసుకోవాలి.
  • కనీసం ఆరు గంటలు మెయిన్, ఇంటర్మీడియెట్ అంశాల ప్రిపరేషన్‌కు కేటాయించాలి.
  • ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే మెయిన్‌లో విజయం తేలికవుతుంది.

ఆన్‌లైన్ విధానంపై...
ఔత్సాహిక విద్యార్థులు పరిగణనలోకి తీసుకోవాల్సిన మరో ముఖ్య అంశం.. జేఈఈ మెయిన్-2018 తర్వాత దశలోని అడ్వాన్స్‌డ్‌ను కేవలం ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవడం. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే అభ్యర్థులు ఆన్‌లైన్ పరీక్ష విధానంపైనా అవగాహన పొందడం ఉపకరిస్తుంది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రెండు పద్ధతుల్లో సాగే జేఈఈ-మెయిన్ విషయంలో ఈ ఏడాదికి తమకు నచ్చిన తీరులో హాజరు కావడమే మేలు.

చివరి రెండు నెలలు కీలకం :
జేఈఈ మెయిన్ విషయంలో విద్యార్థులు చివరి రెండు (ఫిబ్రవరి, మార్చి) నెలలు మరింత కీలకంగా భావించాలి. ఈ సమయంలోనే బోర్డ్ ప్రాక్టికల్స్, పరీక్షల ఒత్తిడి ఉంటుంది. అందుకని మానసిక స్థైర్యంతో వ్యవహరించాలి. ఈ రెండు నెలలు పూర్తిగా బోర్డు పరీక్షల్లో సత్ఫలితాల దిశగా కృషి చేయాలి. జేఈఈ గురించి ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది.

జేఈఈ మెయిన్-2018 సమాచారం...
ఆన్‌లైన్ దరఖాస్తు లభ్యత: డిసెంబర్ మొదటి వారం
పరీక్ష తేదీలు:
పేపర్-1 (ఆఫ్‌లైన్): ఏప్రిల్ 8, 2018
పేపర్-1 (ఆన్‌లైన్): ఏప్రిల్ 14, 15 (దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది)

కాన్సెప్ట్ ఓరియెంటేషన్ ప్రధానం :
ఫిజిక్స్ పరంగా కాన్సెప్ట్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ సాగించడం ముఖ్యం. కేవలం పుస్తకాల్లోని అంశాలను చదవడానికే ప్రాధాన్యం ఇవ్వకుండా.. వాటి బేసిక్ ఫార్ములాను గమనించి పలు కోణాల్లో దాన్ని సాధించే విధంగా కృషి చేయాలి. క్లిష్టమైన టాపిక్స్ విషయంలో ఆందోళనకు గురికాకుండా.. లెక్చరర్ల సహాయంతో నివృత్తి చేసుకోవాలి.
-డాక్టర్. సి.హెచ్.రామకృష్ణ, డాక్టర్ ఆర్‌కే ఫ్రేమ్స్ ఆఫ్ ఫిజిక్స్

ప్రాక్టీస్ కీలకం
మ్యాథమెటిక్స్ విషయంలో విద్యార్థులు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. వీలైనంత మేరకు అన్ని అంశాలపై పరిపూర్ణత సాధించాలి. ‘ఛాయిస్’ ఆలోచనకు స్వస్తి పలకడం మేలు. ముఖ్యంగా పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ అమలవుతుంది. దీనికి తగ్గట్లు వ్యవహరించాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, 3-డి జామెట్రీ తదితర అంశాలు ఎంతో ముఖ్యమైనవి.
-ఎంఎన్ రావు, సబ్జెక్ట్ నిపుణులు
Published date : 31 Oct 2017 05:59PM

Photo Stories