Skip to main content

సేవే స్ఫూర్తిగా.. అన్వేషా రెడ్డి

‘‘ఇంజనీరింగ్ చదివే సమయంలో ఒక స్వచ్ఛంద సంస్థలో వలంటీర్‌గా పనిచేయడం మనసుకు సంతృప్తి కలిగించిందని, అదే సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేసేలా స్ఫూర్తినిచ్చింది’’ అంటున్నారు సివిల్స్-2016 ఫలితాల్లో జాతీయ స్థాయిలో 80వ ర్యాంకు సొంతం చేసుకున్న పర్వతరెడ్డి అన్వేషరెడ్డి. ఐఎఎస్‌ఎం-ధన్‌బాద్‌లో మినరల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి, సేవ ద్వారా లభించే సంతృప్తి కోసమే సివిల్స్ సర్వీసెస్ వైపు వచ్చినట్లు చెబుతున్న మహబూబ్‌నగర్‌కు చెందిన అన్వేష రెడ్డి సక్సెస్ స్టోరీ..
మా స్వస్థలం మహబూబ్‌నగర్. నాన్న యుగంధర్ రెడ్డి జెడ్పీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. అమ్మ సుగుణ ప్రస్తుతం సంగారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అమ్మ, నాన్న ఇద్దరూ విద్యావంతులు కావడంతో చిన్ననాటి నుంచే మంచి చదువులు చదివించే దిశగా కుటుంబ వాతావరణం దోహదం చేసింది. పదో తరగతి వరకు మహబూబ్‌నగర్‌లో, ఇంటర్మీడియెట్ హైదరాబాద్‌లో చదివాను.
 
ఇంజనీరింగ్.. ఎన్‌జీఓ వలంటీర్‌గా :
పదో తరగతి పూర్తయ్యాక ఏడాదిపాటు ఐఐటీ-జేఈఈ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నాను. 2009లో ఐఐటీ-జేఈఈ పరీక్షకు హాజరయ్యాను. ఐఐటీకి అర్హత లభించకపోయినా.. ఐఎస్‌ఎం-ధన్‌బాద్‌లో మినరల్ ఇంజనీరింగ్‌లో సీటు లభించింది. ఐఎస్‌ఎం ధన్‌బాద్‌లో ఇంజనీరింగ్ చదివేటప్పుడు.. స్థానికంగా అక్కడ మాజీ ఐఏఎస్ అధికారి అమరేశ్ మిశ్రా నేతృత్వంలో నడుస్తున్న స్వచ్ఛంద సంస్థ నిర్వహించే కార్యకలాపాల్లో పాల్పంచుకునేదాన్ని. ఆ సమయంలో పలు వర్గాల ప్రజలతో మమేకం కావడం, వారి స్థితిగతుల గురించి తెలుసుకోవడంతో సామాజిక పరిస్థితులపై అవగాహన ఏర్పడింది. ఆ సమయంలోనే సేవ ద్వారా ఎంతో సంతృప్తి పొందొచ్చని గుర్తించాను.  అదే సివిల్ సర్వీసెస్‌లో అడుగుపెట్టే దిశగా స్ఫూర్తిని కలిగించింది.
 
టాటా స్టీల్‌లో ఉద్యోగం :
ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ద్వారా టాటా స్టీల్స్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా ఉద్యోగం లభించింది. మంచి వేతనం, సదుపాయాలు ఉండేవి. కానీ.. ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలో ఉన్నప్పుడు మొలకెత్తిన సివిల్ సర్వీసెస్ సాధించాలనే ఆలోచన మరింత పెరిగింది. దీంతో 2014లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయిలో సివిల్స్ ప్రిపరేషన్‌కు సమయం కేటాయించాను. ఒక ఏడాది పాటు అంటే 2014లో పూర్తిగా ప్రిపరేషన్‌కు కేటాయించాను.  సివిల్ సర్వీసెస్ పరీక్ష గురించి పూర్తి అవగాహన వచ్చాకతొలిసారిగా సివిల్స్ 2015కు హాజరయ్యాను. 
 
 తొలి ప్రయత్నంలో నిరాశ :
 తొలి ప్రయత్నం (2015)లో ఇంటర్వ్యూ వరకు వెళ్లగలిగాను. కానీ.. తుది ఫలితాల్లో నిరాశ ఎదురైంది. దాంతో పరాజయానికి కారణాలపై స్వీయ విశ్లేషణ చేసుకున్నాను. రాత పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయి. ముఖ్యంగా ఆప్షనల్ సబ్జెక్ట్ సైకాలజీలో మార్కులు తగ్గాయి. దాంతో సైకాలజీ సబ్జెక్ట్ ఆప్షనల్‌నే కొనసాగిస్తూ అంతకుముందు చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. ఒక వ్యూహం ప్రకారం చదువుతూ 2016 నోటిఫికేషన్‌కు ప్రణాళికాబద్దంగా సన్నద్ధమయ్యాను. ఫలితంగా ఇప్పుడు 80వ ర్యాంకు వచ్చింది.
 
సైకాలజీ ఆప్షనల్.. మెటీరియల్ వెల్ :
ఇంజనీరింగ్ నేపథ్యం ఉండి సైకాలజీ ఆప్షనల్‌గా ఎంచుకున్నప్పటికీ.. మెటీరియల్ పరంగా, బుక్స్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. ఇంట్రడక్షన్ టు సైకాలజీ - మోర్గాన్ అండ్ కింగ్, సోషల్‌సైకాలజీ - బారన్ అండ్ బైర్న్, కమ్యూనిటీ సైకాలజీ - పాండే, వంటి స్టాండర్డ్ మెటీరియల్‌ను చదివాను. జీఎస్ విషయంలో ఇండియన్ కాన్‌స్టిట్యూషన్-లక్ష్మీకాంత్, ఇండియన్ హిస్టరీ - బిపిన్ చంద్ర వంటి స్టాండర్డ్ బుక్స్‌తోపాటు, కరెంట్ అఫైర్స్ కోసం రెగ్యులర్‌గా న్యూస్‌పేపర్ రీడింగ్, ఇతర స్టాండర్డ్ మ్యాగజైన్స్ చదివాను. సివిల్స్ విజయంలో మరో ముఖ్యమైన అంశం.. టైం మేనేజ్‌మెంట్. ఈ విషయంలో ఎంతో ప్రణాళికతో వ్యవహరించడం వల్ల రెండో ప్రయత్నంలోనే విజయం లభించింది. ప్రతి రోజు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు చదివేలా ప్లాన్ చేసుకున్నాను.  
 
ఇంటర్వ్యూలో కరవుపై ప్రశ్నలు :
నా ఇంటర్వ్యూ అజిత్ భోస్లే నేతృత్వంలోని బోర్డ్‌లో సాగింది. దాదాపు 30 నిమిషాలు సాగిన ఇంటర్వ్యూలో వ్యక్తిగత నేపథ్యానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూనే.. కరవు పరిస్థితులు, అందుకు కారణాల గురించి అడిగారు. ఒక విధంగా ఇంటర్వ్యూ ఒక డిస్కషన్ మాదిరిగా జరిగింది. 
 
మహిళా సాధికారతకు కృషి :
ప్రస్తుత ర్యాంకుతో ఐఏఎస్ వస్తుందని భావిస్తున్నాను. ఈ హోదాతో నాకు లభించే అధికారాల పరిధిలో విద్య, మహిళా సాధికారత దిశగా కృషి చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాను. విద్య ద్వారా సమాజాన్ని నిర్మించొచ్చు. మహిళా సాధికారత ఫలితంగా ఒక కుటుంబం మొత్తంలో ప్రగతి కనిపిస్తుంది.
 
హార్డ్‌వర్క్ ఇన్ స్మార్ట్ వే :
సివిల్స్ ఔత్సాహికులు హార్డ్‌వర్క్ చేయాలి. అయితే ఇది స్మార్ట్ వేలో ఉండేలా చూసుకోవాలి. చాలా మంది హార్డ్‌వర్క్ అంటే రోజుకు పదిహేను, పదహారు గంటలు చదవడం అని భావిస్తారు. కానీ ఇది ఏ మాత్రం సరైన దృక్పథం కాదు. తొలి అటెంప్ట్‌లోనే ఫలితం రావాలని భావించడం.. ఫలితం రాకపోతే నిరాశకు లోనై ఇతర అటెంప్ట్‌లకు హాజరుకాకపోవడం సరికాదు.
 
ప్రిపరేషన్ సమయంలోనే ముఖ్యమైన అంశాలకు సంబంధించి సినాస్పిస్‌తో కూడిన సెల్ఫ్ నోట్స్ రూపొందించుకోవాలి. ఫలితంగా రివిజన్ సమయంలో ఉపయుక్తంగా ఉంటుంది.
Published date : 02 Jun 2017 05:23PM

Photo Stories