Skip to main content

ఇంటర్ ప్రాక్టికల్స్‌లో మాల్ ప్రాక్టీసులను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు

గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలలో ఎక్కడైనా తప్పులు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు కమిషనర్ బి. ఉదయలక్ష్మి హెచ్చరించారు. మాల్ ప్రాక్టీసులను ప్రోత్సహిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయన్నారు.
ఫిబ్రవరి 1వతేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్‌పై జనవరి 30న గుంటూరులోని ఏసీ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, శాఖాధికారులు, ఎగ్జామినర్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. మాల్ ప్రాక్టీస్ నిరోధించేందుకు పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. ఇలాంటివి ఎక్కడైనా జరిగితే విధుల్లో ఉన్న ఎగ్జామినర్లను బాధ్యులను చేస్తామని స్పష్టం చేశారు. రెగ్యులర్ అధ్యాపకులైతే సస్పెన్షన్ వేటు, కాంట్రాక్టు అధ్యాపకులైతే పూర్తిగా విధుల నుంచి తొలగిస్తామని తెలిపారు. ప్రాక్టికల్స్‌లో అక్రమాలను అరికట్టేందుకే జంబ్లింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. అధ్యాపకులను సైతం జంబ్లింగ్ ద్వారా వేర్వేరు సెంటర్లకు పంపే విధానాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు.

మాన్యువల్ ప్రశ్నపత్రాలకు స్వస్తి :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రాక్టికల్స్ జరిగే కేంద్రాలలో సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్ బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మి తెలిపారు. ప్రభుత్వ కళాశాలల పరిధిలో ఒక్కో కాలేజీకి రూ. 25 వేలు చొప్సున నిధులు విడుదల చేశామన్నారు. ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత సంబంధిత యాజమాన్యాలపై ఉందని స్పష్టం చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో సెంటర్ కోడ్, పేరు, చిరునామా స్పష్టంగా తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మాన్యువల్ విధానంలో ప్రశ్నపత్రాలను పంపే విధానానికి స్వస్తి పలుకుతున్నట్లు చెప్పారు. అన్ని కేంద్రాలకు అరగంట ముందుగా ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్నాన్ని చేరవేసి చీఫ్ సూపరింటెండెంట్‌కు ఓటీపీ పంపుతామన్నారు. పరీక్షా కేంద్రాల చిరునామా సులువుగా గుర్తించేందుకు వీలుగా జియో ట్యాగింగ్ చేశామని చెప్పారు.
Published date : 31 Jan 2018 01:40PM

Photo Stories