Skip to main content

భారత స్వాతంత్య్రోద్యమంలో మహిళల పాత్ర

స్త్రీవాద సంస్థలు మహిళల ఆర్థిక, రాజకీయ హక్కుల కోసం ఒకవైపు పోరాటం చేస్తూనే సంస్కరణలు, విద్య ద్వారా స్త్రీల స్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నించాయి. విదేశీ పాలనను అంతమొందించాలనే లక్ష్యంతో ఈ సంస్థలు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నాయి. 1905లో జరిగిన స్వదేశీ ఉద్యమంలో, 1916 ఉద్యమంలోనూ మహిళలు పాల్గొన్నారు. కానీ గాంధీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాక స్వాతంత్య్ర పోరాటంలో స్త్రీల భాగస్వామ్యం పెరిగిందని చెప్పవచ్చు. గాంధీ చేపట్టిన మొదటి జాతీయ స్థాయి ఉద్యమం సహాయ నిరాకరణ. ఇందులో స్త్రీలకు ప్రత్యేక పాత్ర కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన సత్యాగ్రహాల్లో ముఖ్యంగా బోర్సాదే, బార్దోలి సత్యాగ్రహాల్లో రైతు కుటుంబాలకు చెందిన స్త్రీల పాత్ర మరువలేనిది.
ఉప్పు సత్యాగ్రహం
గాంధీ నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహంలో ఎంతోమంది స్త్రీలు పాల్గొన్నారు. ఈ సమయంలో సుమారు 17 వేల మంది స్త్రీలు నిర్భంధానికి గురయ్యారు. దీన్ని బట్టి స్వాతంత్రోద్యమంలో మహిళల భాగస్వామ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. సరోజినీ నాయుడు, రాణి గైడిన్ల్యు, కమలానెహ్రూ, హన్సా మెహతా, సత్యవతి, పార్వతీభాయ్, రుక్మిణీ లక్ష్మీపతి, దుర్గాబాయి, కమలాదేవి ఛటోపాధ్యాయ తదితరులు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు.
దేవిదేవికా సంఘ్, నారీ సత్యాగ్రహ సమితి, మహిళా రాష్ట్రీయ సంఘ్, లేడిస్ పికెటింగ్ బోర్‌‌డ, స్త్రీ స్వరాజ్య సంఘ్, స్వయం సేవికా సంఘ్ తదితర ఎన్నో మహిళా సంఘాలు స్వాతంత్రోద్యమ సమయంలో విదేశీ వస్తువుల బహిష్కరణ, సారా వ్యతిరేక ఉద్యమం మొదలైన కార్యక్రమాలు చేపట్టాయి.
 
క్విట్ ఇండియా ఉద్యమం
క్విట్ ఇండియా ఉద్యమంలో స్త్రీల పాత్ర మరువలేనిది. జాతీయ నాయకులను ముందుగానే నిర్బంధించడంతో అరుణా అసఫ్‌అలీ లాంటి స్త్రీ నాయకులు ఈ ఉద్యమాన్ని నడిపారు. శాంతి, సునీతి, బీనాదాస్, కల్పనాజోషి, ప్రీతి లతా మొదలైనవారు విప్లవ మార్గాన్ని ఎంచుకొన్నారు. నేతాజీ నేతృత్వంలోని భారత జాతీయ సైన్యంలో మహిళా విభాగం ఝూన్సీ లక్ష్మీ రెజిమెంట్‌కు కెప్టెన్ లక్ష్మీసెహగల్  సారథ్యం వహించారు.
స్వాతంత్య్ర పోరాటంలో స్త్రీలు పాల్గొన్నప్పటికీ, స్వాతంత్య్రానంతరం వారి పరిస్థితి అంతగా మెరుగుపడలేదు. వలస పాలనకు వ్యతిరేకంగా వీరు పోరాటం చేశారు. కానీ స్త్రీ సాధికారత కోసం ప్రయత్నించలేదు. భారత సమాజంలో పితృస్వామిక ఆధిపత్యాన్ని స్త్రీలు ప్రశ్నించలేదు. స్వాతంత్య్ర సాధన అనే లక్ష్యాన్ని చేరుకున్నాక కొంత మంది స్త్రీలు గృహ జీవితానికి మరలగా, మరి కొంతమంది  ప్రజాసేవను కొనసాగించారు.
 
శ్రామిక ఉద్యమాల్లో స్త్రీలు
1918లో అనసూయ సారాబాయి నేతృత్వంలో నేతృత్వంలో అహ్మదాబాద్ టెక్స్‌టైల్స్ కార్మికులు సమ్మె చేశారు. 1920లో మజ్దూర్ మహాజన్ నాయకత్వంలో అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సంఘం ఏర్పాటైంది. దీని ఆధ్వర్యంలో అనేక ధర్నాలు చేశారు. మణి బెన్‌కేరా రైల్వే కార్మికుల నాయకురాలిగా అవతరించారు. ఉషాబాయి దాంగే, పార్వతి భోరీ నేతమిల్లు కార్మికుల నాయకులుగా ఎదిగారు.
 భారత జాతీయ కాంగ్రెస్ 1938లో నెహ్రూ అధ్యక్షతన జాతీయ ప్రణాళికా సంఘాన్ని స్థాపించింది. దీని 29 ఉపసంఘాల్లో ‘ప్రణాళిక ఆర్థిక వ్యవస్థలో స్త్రీ పాత్ర’ ఒక ఉపసంఘం.
 ఈ కమిటీలో ఎంతో మంది ప్రముఖ స్త్రీలు సభ్యులుగా ఉన్నారు. స్త్రీ జీవితం-పని అనే అంశంపై విస్తృత ప్రతిపాదనలు వచ్చాయి. ఈ అంశం గురించి భారీ స్థాయిలో సమాచారం స్వీకరించారు.
 
మొదటి దశ స్త్రీవాదఉద్యమాలు - అంచనా
మొదటి దశ స్త్రీవాద ఉద్యమాన్ని పరిశీలిస్తే.. పరదా, సతీ, స్త్రీవిద్య, బాల్య వివాహాలు, వితంతు వివాహాలు తదితర అంశాల గురించి పోరాటాలు జరిగాయి. స్త్రీలను జాతీయ పోరాటంలో పాల్గొనమని ఆహ్వానించినప్పుడు తల్లిగా, గృహిణిగా వారి బాధ్యతలను ప్రశ్నించలేదు. స్త్రీ చదువుకుంటే కుటుంబం, సమాజం బాగుపడతాయని భావించారు. ఈ దశలో  రాజకీయ హక్కులు, సంప్రదాయ చట్టాల్లో మార్పులే స్త్రీవాద ఉద్యమాల లక్ష్యం. జాతీయోద్యమంలో ఉన్నత వర్గాల స్త్రీలు, విద్యావంతులు మాత్రమే కాకుండా గ్రామీణ, పేద, చదువుకోని స్త్రీలు కూడా పాల్గొన్నారు. మూఢాచారాల నిర్మూలన, రాజకీయ హక్కుల సాధన, స్వాతంత్య్ర సముపార్జన లక్ష్యంగా ఈ కాలం స్త్రీలు పోరాడారు. స్వాతంత్య్ర పోరాటంలో మహిళల భాగస్వామ్యం.. స్వతంత్ర భారత ప్రభుత్వ పాలనలో, నిర్ణయాల్లో భాగస్వామ్యాన్ని కోరుకునే అవకాశం కల్పించింది. స్వాతంత్య్ర పూర్వ స్త్రీవాద ఈ ఉద్యమాన్ని మహిళల పోరాటాల్లో మొదటి దశ అని చెప్పవచ్చు. ఈ దశలో తమ దుస్థితికి సంప్రదాయాలు, మతం కారణమని స్త్రీలు భావించారు. విద్య, న్యాయవ్యవస్థల్లో మార్పుల ద్వారా తమ స్థితి మెరుగుపడుతుందని వారు ఆశించారు.
Published date : 26 Dec 2015 05:38PM

Photo Stories