Skip to main content

నీతి ఆయోగ్

గత ఆరు దశాబ్దాల కాలంలో ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంకేతిక, జనాభా పరమైన అంశాల్లో భారత ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదే క్రమంలో దేశాభివృద్ధి కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లోనూ మార్పులు వచ్చాయి. కాలానుగుణంగా సంభవించిన మార్పులను దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆశలను, అవసరాలను తీర్చేందుకు ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటైంది. దేశంలోని అన్ని ప్రాంతాలను దేశాభివృద్ధిలో భాగం చేసేందుకు నీతి ఆయోగ్‌లో రాష్ట్రాలకు సముచిత స్థానం కల్పించారు.
సంస్థలు- మార్పులు
దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు అమలైన 1991లోనే 8వ పంచవర్ష ప్రణాళిక డాక్యుమెంట్‌ను రూపొందించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళిక సంఘాన్ని సంస్కరించాలని ఆ డాక్యుమెంట్ పేర్కొంది. ప్రభుత్వ పాత్రను సమీక్షించడం ద్వారా దాన్ని పునర్నిర్మించాల్సిన ఆవశ్యకతను వెల్లడించింది. డాక్యుమెంట్‌లో ప్రణాళిక సంఘం పాత్ర, విధులకు సంబంధించి చేయాల్సిన మార్పులను వివరించారు.
  • 15వ లోక్‌సభలోని ‘స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్’ 35వ ‘డిమాండ్ ఫర్ గ్రాంట్స్’ నివేదికలో ప్రణాళికల రూపకల్పనలకు సంబంధించి కొన్ని సూచనలు చేసింది. పేదవర్గాలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రణాళిక ప్రక్రియను రూపొందించే క్రమంలో సాంఘిక రంగంపై పెట్టుబడులు పెంచాల్సిన ఆవశ్యకతను కమిటీ గుర్తుచేసింది.
  • ప్రముఖ ఆర్థికవేత్త, దేశానికి ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ 2014, ఏప్రిల్‌లో జరిగిన ప్రణాళిక సంఘం వీడ్కోలు సభలో ప్రసంగిస్తూ.. మారుతున్న ప్రపంచంలో ప్రణాళిక సంఘం పాత్ర ఏ విధంగా ఉండాలి! గత పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన సాధనాలు, దృక్పథాలను ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉందా ! అనే అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వృద్ధి ప్రక్రియను కొనసాగించేందుకు ప్రణాళిక సంఘం తన సామర్థ్యాన్ని పెంచుకోవాలని ఆయన సూచించారు.
  • కేంద్రంలో 2014లో నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్(ఎన్డీఏ) అధికారంలోకి వచ్చింది. తదనంతర పరిణామాలలో ప్రభుత్వం ప్రణాళిక పాత్ర, విధులను పూర్తిగా తగ్గించింది. 2015, జనవరి 1న భారత ప్రభుత్వం ప్రణాళిక సంఘం స్థానంలో భారత జాతీయ పరివర్తన సంస్థ (నీతి ఆయోగ్) ను ఏర్పాటు చేసింది.

భారత ఆర్థిక వ్యవస్థ- మార్పులు
భారత ప్రభుత్వ తీర్మానం ద్వారా 1950, మార్చి 15 ప్రణాళిక సంఘం ఏర్పాటైంది. ప్రణాళిక సంఘం మొత్తం 11 పంచవర్ష ప్రణాళికలను రూపొందించింది.
  • 2015 నాటికి భారత జనాభా 1.271 బిలియన్లకు చేరుకోనుంది. ఈ మొత్తం ప్రపంచ జనాభాలో 1/6 వంతుకంటే ఎక్కువగా ఉంటుంది. డెమోగ్రాఫిక్ డివిడెండ్ గరిష్ట ప్రయోజనాలు పొందేందుకు ప్రజల్లో శిక్షణ, విద్యానైపుణ్యాలను పెంపొందించాలి.
  • మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వ పెట్టుబడి రూ. 2,400 కోట్ల నుంచి పన్నెండో పంచవర్ష ప్రణాళికలో రూ. 43 లక్షల కోట్లకు చేరుకుంది.
  • ఆర్థికాభివృద్ధి వేగవంతమైన క్రమంలో దేశంలో అక్షరాస్యత, సమాచార వ్యవస్థలు అభివృద్ధి చెందడంతో పాటు ప్రజల అవసరాలు కూడా పెరిగాయి. ప్రస్తుత ధరల వద్ద దేశీయోత్పత్తి రూ. 10,000 కోట్ల నుంచి రూ.100 లక్షల కోట్లకు పెరిగింది.
  • జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగ వాటా తగ్గగా పారిశ్రామిక, సేవా రంగాల వాటా పెరిగింది. గత కొన్నేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ స్థితిగతులతో పాటు ప్రభుత్వ పాత్రలోనూ గణనీయమైన మార్పులు వచ్చాయి.
  • భారత్ ఆధునిక రవాణా, సమాచార, మీడియా, అధిక నెట్‌వర్క్ కలిగిన అంతర్జాతీయ విత్త సంస్థలతో అనుసంధానం కలిగిన దేశంగా ఉంది. దీంతో ప్రపంచీకరణ పరిణామాలను గమనిస్తూ ప్రభుత్వ నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉంది.
  • ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ప్రవేశపెట్టారు. గత 68 ఏళ్లలో దేశం సాధించిన అభివృద్ధి అన్ని ప్రాంతాలకు సమానంగా విస్తరించలేదు.
  • అభివృద్ధి విషయంలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. దీంతో విధానాల రూపకల్పనలో ప్రాంతీయ సమతుల్యతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

విధులు
  • సహకార సమాఖ్య భావనను పెంపొందించడం నీతి ఆయోగ్ ప్రధాన విధి. జాతీయ విధానాలను రూపొందించే క్రమంలో రాష్ట్రాలను భాగస్వామ్యులను చేయటం. పరిమాణాత్మక, గుణాత్మక లక్ష్యాలను నిర్ణీత కాలవ్యవధిలో సాధించేందుకు అభివృద్ధి అంశాల అధ్యయనం.
  • కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిర్మాణాత్మక సహకారాన్ని పెంపొందించి నిర్దేశిత లక్ష్యాల సాధనకు వ్యూహాలను సిద్ధం చేయడంతో పాటు వాటి అమలుకు తగిన యంత్రాంగాన్ని ఏర్పరచుకోవడం.
  • జాతీయ అభివృద్ధి ప్రాధాన్యత, వ్యూహాలను రూపొందించి వాటిని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు అమలు చేసేందుకు ‘జాతీయ అజెండా’ రూపకల్పనకు తగిన చేయూత ఇస్తుంది.
  • సవాళ్లను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలకు సహాయపడడం. విధాన ప్రణాళికను కిందిస్థాయి నుంచి పైస్థాయి నమూనాలో రూపకల్పన చేస్తుంది.
  • స్థానిక సంస్థలను పటిష్ట పరచి గ్రామ స్థాయిలో ఉత్తమ ప్రణాళికలు రూపొందించేలా చేయడం. దేశ భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వివిధ పథకాలు, వివిధ రంగాలకు సంబంధించి దీర్ఘ, మధ్య కాలిక వ్యూహాలను సిద్ధం చేస్తుంది.
  • విధానాలు, కార్యక్రమాల రూపకల్పన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అంతర్గత కన్సల్టెన్సీ విధులు నిర్వర్తిస్తుంది.
  • ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా యాజమాన్య, సాంకేతిక పరమైన పరిజ్ఞానాన్ని వివిధ రంగాల్లో పెంపొందించటం. ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాల అమలును సమీక్షించి ఆయా విధానాల ప్రభావాన్ని అంచనా వేయడం.

ఉద్దేశం
  • నిర్దేశిత విధులను నిర్వర్తించే క్రమంలో సమ్మిళిత, సమానత్వం, సుస్థిరత వంటి లక్ష్యాలతో కూడిన అభివృద్ధి విజన్‌ను నీతి ఆయోగ్ పాటిస్తుంది.
  • పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ భావన అయిన ‘అంత్యోదయ’పై దృష్టి సారిస్తుంది. పేద, లక్షిత వర్గాల ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు అవలంబించాల్సిన కార్యక్రమాలను రూపొందిస్తుంది. అణగారిన వర్గాల సాధికారిత పెంపునకు కార్యక్రమాల రూపకల్పన. అవకాశాల లభ్యతలో కులం, మతం, లింగ వివక్షలు లేకుండా చూడడం.
  • అభివృద్ధిలో గ్రామాలను సంఘటిత పరచడం. ఉత్పాదకతతో కూడిన ఉపాధిని కల్పించడం ద్వారా అభివృద్ధిరేటును వేగవంతం చేయడం.
  • అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామాల భాగస్వామ్యం పెంచటం. ప్రభుత్వ రంగ సంస్థల్లో జవాబుదారీతనం, అకౌంటబిలిటీ పెంపు.
  • ప్రణాళిక, అభివృద్ధి ప్రక్రియలో సుస్థిరత.

నిర్మాణం
  • చైర్‌పర్సన్: ప్రధానమంత్రి
  • గవర్నింగ్ కౌన్సిల్: అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు.
  • ప్రాంతీయ కౌన్సిల్స్: ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు, ప్రాంతాలకు సంబంధించిన అంశాలను చర్చిస్తుంది. నీతి ఆయోగ్‌లో ప్రణాళిక, వ్యూహాలు రాష్ర్టస్థాయి నుంచి ప్రారంభమవుతాయి. గుర్తించిన ప్రాధాన్యతాంశాల కోసం ప్రధానమంత్రి ప్రాంతీయ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తారు.
  • ప్రాంతీయ కౌన్సిల్స్‌ను సంబంధిత ఉపగ్రూపులను (భౌగోళిక, ఆర్థిక, సాంఘిక)రాష్ట్రాలు, కేంద్రమంత్రిత్వ శాఖల ఉమ్మడి నాయకత్వంలో ఏర్పాటు చేస్తారు. ప్రాంతీయ కౌన్సిల్స్ నిర్ణీత కాలపరిమితిని కలిగుంటాయి.
  • రొటేషన్ పద్ధతిలో ఆయా ప్రాంతానికి చెందిన ఒక ముఖ్యమంత్రి, సంబంధిత కేంద్ర మంత్రి సమిష్టి నాయకత్వంలో ప్రాంతీయ కౌన్సిల్ పనిచేస్తుంది.
  • ఆయా రంగాలకు చెందిన కేంద్ర మంత్రులు, కార్యదర్శులు, రాష్ట్ర మంత్రులు, కార్యదర్శులు ప్రాంతీయ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉంటారు. ప్రాంతీయ కౌన్సిల్‌తో సంబంధిత రంగంలోని నిపుణులు, అకడమిక్ సంస్థలకు అనుసంధానం ఉంటుంది.
  • నీతి ఆయోగ్ సెక్రటేరియట్ లో ప్రాంతీయ కౌన్సిల్‌కు ప్రత్యేకంగా సపోర్ట్ సెల్ ఏర్పాటు చేస్తారు.

ప్రత్యేక ఆహ్వానితులు
సంబంధిత అంశాల్లో పరిజ్ఞానం ఉన్న ఎక్స్‌పర్ట్స్, స్పెషలిస్ట్స్, ప్రాక్టీషనర్లను ప్రధానమంత్రి ప్రత్యేక ఆహ్వానితులుగా నామినేట్ చేస్తారు.
  • వైస్ చైర్‌పర్సన్‌ను ప్రధానమంత్రి నియమిస్తారు. పూర్తిస్థాయి సభ్యులతో పాటు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల నుంచి గరిష్టంగా ఇద్దరు తాత్కాలిక సభ్యులు నీతి ఆయోగ్‌లో ఉంటారు. వీరిని రొటేషన్ పద్ధతిలో నియమిస్తారు.
  • ప్రధాని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను నిర్ణీత పదవీకాల పరిమితితో ఎంపిక చేస్తారు.
  • చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు కేంద్ర కార్యదర్శి హోదా ఉంటుంది.
  • నీతి ఆయోగ్‌లో రీసెర్చ్, కన్సెల్టెన్సీ, టీం ఇండియా వింగ్‌లు ఉన్నాయి.

టీం-నీతి ఆయోగ్
  • చైర్‌పర్సన్: నరేంద్రమోదీ, భారత ప్రధాని
  • వైస్ చైర్‌పర్సన్: అర్వింద్ పనగారియా
  • శాశ్వత సభ్యులు: బిబేక్ దెబ్రోయ్, వీకే సారస్వత్, ప్రొ. రమేశ్‌చంద్

ప్రత్యేక ఆహ్వానితులు:
  • నితిన్ గడ్కరీ, కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ
  • థావర్ చంద్ గెహ్లాట్, కేంద్ర సామాజిక న్యాయ శాఖ
  • స్మృతి జుబిన్ ఇరానీ, కేంద్ర మానవవనరుల శాఖ
  • చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్: సింధుశ్రీ కుల్లర్.
Published date : 27 Nov 2015 03:14PM

Photo Stories