Skip to main content

భూ సేకరణ- పునరావాసం

భూసేకరణ (Land Acquisition)
ప్రజా అవసరాల్లో భాగంగా అభివృద్ధి, పారిశ్రామికీకరణ, అవస్థాపనా సౌకర్యాల కల్పన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు భూములను సేకరించే విధానమే భూసేకరణ. ఇది భూమి కొనుగోలు ప్రక్రియకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. భూమి కొనుగోలు విధానంలో అమ్మకపుదారు అంగీకారంతో భూమిని సేకరిస్తారు. భూ సేకరణ విధానంలో భూ యజమాని అంగీకారం అవసరం లేదు.
  • భూసేకరణ ప్రక్రియకు సంబంధించి ప్రస్తుత ధరల సూచీ ప్రకారం చెల్లించే నష్ట పరిహారం చాలా తక్కువగా ఉంటుంది. మరోవైపు భూమి కోల్పోయిన ప్రజలకు పునరావాసం కల్పించటంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి.
  • జాతీయ పునరావాస విధానం (National Policy For Rehabilitation) ప్రకారం 1951 తర్వాత తరలింపునకు గురైన (Displaced People) ప్రజల్లో 75 శాతం మందికి ఇప్పటికీ పునరావాసం అందలేదు. దీంతో పలు రాష్ట్రాల్లోని ప్రజలు భూ సేకరణకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. ‘భూ సేకరణ చట్టం-2013’కు సవరణలను ప్రతిపాదిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను ఎన్డీఏ ప్రభుత్వం విరమించుకుంది.

భూ సమీకరణ (Land Pooling)
ఈ ప్రక్రియలో అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధిలో భాగంగా భూ యజమానులు ప్రభుత్వానికి భూమిని స్వాధీనం చేస్తారు. అలా తీసుకొన్న భూమికి బదులుగా కొంత శాతం భూమిని రెసిడెన్షియల్ లేదా కమర్షియల్ వినియోగానికి వీలుగా ప్రభుత్వం సదరు యజమానికి ఇస్తుంది.


భారతదేశం-భూ సేకరణ చట్టాలు
1. రెగ్యులేషన్-1, 1824, బెంగాల్ కోడ్:
ఈ కోడ్ ద్వారా ప్రభుత్వ అవసరాల నిమిత్తం భూమి లేదా ఇతర సంపదను సేకరించే అధికారం ప్రభుత్వాధికారులకు లభించింది. ఉప్పు తయారీకి అవసరమైన భూమిని సేకరించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఈ కోడ్‌ను ఉపయోగించింది.
2. బాంబే ప్రెసిడెన్సీ యాక్ట్-1839:
ముంబై, కొలాబా ద్వీపాల్లో భూ సేకరణ కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి అధికారం కల్పించింది.
3. బ్రిటిష్ ఇండియా-1857 చట్టం:
స్థానిక చట్టాలైన రెగ్యులేషన్-1(బెంగాల్ కోడ్), బాంబే ప్రెసిడెన్సీ యాక్ట్-1839 స్థానంలో భూ సేకరణ కోసం బ్రిటిష్ ఇండియా మొత్తం ఒకే చట్టం ఉండాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు.
4. ది ఇండియా యాక్ట్-1885:
బ్రిటిష్ ఇండియాలో గనులు, ఖనిజాలు ఉన్న భూమిని సేకరించేందుకు ఉద్దేశించిన చట్టం.
5. భూ సేకరణ చట్టం-1894:
ప్రస్తుతం భూ సేకరణకు సంబంధించి అమల్లో ఉన్న చ ట్టాలకు ఆధారమైనదిగా ఈ చట్టాన్ని పేర్కొనవచ్చు. భూ సేకరణ చట్టం-1894 వివాదాస్పదం కావడంతో దీన్ని సమీక్షించేందుకు భారత ప్రభుత్వం అనేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఈ చట్టాన్ని పరిశీలించి తగిన సిఫార్సులు చేసేందుకు 1967లో ఆనంద్ ముల్ల అధ్యక్షతన 20 మంది సభ్యులతో కమిటీని నియమించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూ సేకరణ చట్టం-1894ను 17సార్లు సవరించాయి. దీన్లో భాగంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అమెండ్‌మెంట్ అండ్ వాలిడేషన్ యాక్ట్-1967ను తీసుకొచ్చింది. భూ సేకరణ చట్టం-1894 భూ యజమానుల ప్రయోజనాలు, పారిశ్రామిక అభివృద్ధుల మధ్య సమతుల్యతను సాధించటంలో విఫలమైంది. దీంతో భారత ప్రభుత్వం 2007లో సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.

బిల్లు-ప్రతిపాదిత మార్పులు
1. ఏ ఉద్దేశంతో భూమిని సమీకరిస్తున్నారు.
2. చెల్లించాల్సిన నష్టపరిహారం.
3. భూ సేకరణ ప్రక్రియ.
4. భూ సేకరణ ద్వారా సేకరించిన భూ వినియోగం.
5. వివాదాల పరిష్కార యంత్రాంగం.

లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లులు
1. భూ సేకరణ (సవరణ) బిల్లు-2007
2. ది రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్ యాక్ట్-2007
14వ లోక్‌సభ రద్దు కావటంతో ఈ బిల్లులు ఆమోదం పొందలేదు. 2011, సెప్టెంబర్ 7న లోక్‌సభలో ‘ ది లాండ్ అక్విజిషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్ యాక్ట్-2011’ను ప్రవేశపెట్టారు. ఇదే బిల్లును పార్లమెంటు 2013, సెప్టెంబర్ 5న కొన్ని సవరణలతో ‘ది రైట్ టు ఫేర్ కాంపెన్షేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ లాండ్ అక్విజిషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్ యాక్ట్-2013’గా పేరు మార్చి ఆమోదించింది. పునరావాసం, నష్టపరిహారానికి సంబంధించి నూతన నియమావళితో కూడిన భూ సేకరణ చట్టం, 2014, జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది.

భూ సేకరణ చట్టం 2014- ముఖ్యాంశాలు
  1. గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ విలువ కంటే నాలుగు రెట్లు, పట్టణ ప్రాంతాల్లో మార్కెట్ విలువకు రెండు రెట్ల నష్టపరిహారాన్ని చెల్లించాలి.
  2. గ్రామసభ అనుమతి లేకుండా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూమిని సేకరించరాదు.
  3. అన్ని చెల్లింపులను పూర్తి చేసి, పునరావాసానికి సంబంధించిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే భూమి సేకరించాలి.
  4. ఆహార భద్రతను సాధించడానికి వ్యవసాయం కింద ఉన్న భూమి విస్తీర్ణంలో ఎంత సేకరించాలో పరిమితి విధించాలని భూ సేకరణ బిల్లు రాష్ట్రాలకు నిర్దేశించింది.
  5. భూమి సేకరించిన తర్వాత నిరుపయోగంగా ఉంటే ఆ భూములను తిరిగి ఆయా భూ యజమానులకు లేదా రాష్ట్ర ల్యాండ్ పూలింగ్ బ్యాంకులకు తిరిగిచ్చే అధికారం రాష్ట్రాలకు కల్పించటం.
  6. భూ సేకరణ ప్రక్రియలో వ్యక్తికి చెల్లించే మొత్తంపై ఎలాంటి ఆదాయపన్ను లేదా స్టాంప్ డ్యూటీలు ఉండవు.
  7. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టుల కోసం చేసే భూ సేకరణకు 70 శాతం మంది భూ యజమానుల అనుమతి ఉండాలి.
  8. ప్రైవేటు కంపెనీల కోసం చేసే భూ సేకరణకు ఆయా భూముల యజమానుల్లో 80 శాంతి మంది అంగీకారం తప్పనిసరి.
  9. రాష్ట్ర ప్రభుత్వం ఆరు కమిటీలను ఏర్పాటు చేయాలి.
  10. రాష్ట్రం/ఏజెన్సీలు భూ సేకరణ చేసేటప్పుడు తలెత్తే వివాదాలను పరిష్కరించేందుకు రాష్ట్రస్థాయిలో ‘భూ సేకరణ, పునరావాస అథారటీ’ని ఏర్పాటు చేయాలి. ఈ అథారిటీ కమిటీల్లో భాగంగా పనిచేస్తుంది.
  11. భూ సేకరణకు ముందు దాని వల్ల ఆ ప్రాంతంలో కలిగే పరిణామాలపై ‘సామాజిక ప్రభావ అధ్యయనం’ చేయాలి.
  12. ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో ఏడాదికి మూడు పంటలు పండే భూమిని సేకరిస్తే అంతే పంట పండే భూమిని మరో చోట అభివృద్ధి చేయాలి. అలా కానట్లయితే ఆ భూమి విలువకు సమానమైన సొమ్మును ఆహార భద్రత కోసం ఏర్పాటు చేసిన ఖాతాలో జమచేయాలి.

విమర్శలు
  • పబ్లిక్-ప్రైవేటు ప్రాజెక్టుల(పీపీపీ) కోసం 70 శాతం, ప్రైవేటు ప్రాజెక్టుల కోసం 80 శాతం మంది సమ్మతి తప్పనిసరి చేయటంతో పరిహారం కన్నా భూ సేకరణ ప్రక్రియను సంక్లిష్టంగా మార్చటంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందనే విమర్శలు వచ్చాయి.
  • సామాజిక ప్రభావ అధ్యయన నివేదిక తర్వాతే భూములు సేకరించాలనే నిబంధన వల్ల 2013 తర్వాత లక్షల కోట్ల విలువ చేసే 200 ప్రాజెక్టులు నిలిచిపోయాయని పారిశ్రామిక ప్రతినిధుల ఆవేదన.
  • ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు విజయవంతం కావాలంటే భూ సేకరణలోని అడ్డంకులను తొలగించాలి. దీంతో 2014లో అధికారంలోకి వచ్చిన ఏన్డీఏ ప్రభుత్వం కొన్ని సవరణలో భూ సేకరణ, పునరావాస చట్టానికి సంబంధించి 2014, డిసెంబర్‌లో ఆర్డినెన్స్ జారీ చేసింది.

సవరణలు
ఎన్డీఏ ప్రభుత్వం 2015, మార్చిలో భూ సేకరణ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రతి పక్షాలు ఈ సవరణ బిల్లును ‘రైతు, పేదల వ్యతిరేక’ బిల్లుగా అభివర్ణించాయి. బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో ఓటింగ్ జరగకుండానే ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

వివాదాస్పద అంశాలు
  • భూ సేకరణ చట్టం-2013 ప్రకారం ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ప్రాజెక్టులకు 70 శాతం, ప్రైవేటు ప్రాజెక్టులకు సంబంధించి 80 శాతం భూ యజమానుల ఆమోదం తప్పనిసరి. కానీ, ప్రభుత్వం సవరణల ద్వారా పారిశ్రామిక కారిడార్లు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులు, గ్రామీణ అవస్థాపనా సౌకర్యాలు, అఫోర్డబుల్ హౌసింగ్, రక్షణ ప్రాజెక్టులకు సంబంధించి ఈ నిబంధనను తొలగించాలని భావించింది.
  • భూ సేకరణ తర్వాత ఐదేళ్ల వరకు భూమిని వినియోగించనట్లయితే వాటిని తిరిగి భూ యజమానులకు అప్పగించాలి. కానీ, తాజా సవరణలో ఐదేళ్ల కాలవ్యవధిలో మార్పు తీసుకొచ్చారు.
  • భూ సేకరణ చట్టం-2013 ప్రకారం ప్రైవేటు కంపెనీలకు భూ సేకరణ చేసేందుకు అనుమతి లేదు. ప్రతిపాదిత సవరణ ప్రకారం భూ సేకరణ చేసేందుకు ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇచ్చారు.
  • బహుళ పంటలు పండే వ్యవసాయ భూములను పారిశ్రామిక సంస్థలకు బదిలీ చేయటంపై నిషేధం ఉండాలని భూ సేకరణ చట్టం-2013 స్పష్టం చేస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌లో ఈ అంశం అదృశ్యమైంది.
  • భూ బదలాంపు వల్ల రైతులు కేవలం భూమిని మాత్రమే కోల్పోవటం లేదు. జీవనోపాధి, సామాజిక, సాంస్కృతిక ఆచారాలను, కులవృత్తులను కోల్పోతున్నారు. కాబట్టి నష్టపరిహారం విషయంలో పై అంశాలను దృష్టిలో పెట్టుకొని తగిన పునరావాస ప్యాకేజీని మంజూరు చేయాలి. దీని కోసం ముందుగా‘సామాజిక ప్రభావ అంచనా’ను చేపట్టాలని 2013లో తీసుకొచ్చిన చట్టం స్పష్టం చేస్తుంది. కానీ, చాలా సందర్బాల్లో అలాంటి అంచనాలు అవసరం లేదని ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు.
  • ప్రస్తుత సవరణ బిల్లులో కనీసం భూ యజమాని తన వాదనలు, అభ్యర్థనలను వినిపించేందుకు కూడా సరైన వెసులుబాటు లేదు.

పునరావాసం, పునర్వ్యస్థీకరణ
  1. భూ సేకరణ చట్టం 2014 కింద పొందుపరిచిన ప్రయోజనాలతో లబ్ధిపొందేందుకు ఆయా భూములపై ఆధారపడి ఉన్న కాలాన్ని ఐదు నుంచి మూడేళ్లకు తగ్గించారు.
  2. వ్యవసాయ శ్రామికులు, కౌలుదారులు, చేతివృత్తుల వారు భూ సేకరణకు మూడేళ్ల ముందు నుంచి ప్రభావిత ప్రాంతంలో పనిచేస్తున్న వారై ఉండాలి. భూ సేకరణ వల్ల వారి జీవనాధారం దెబ్బతిని ఉండాలి.
  3. ఐదేళ్ల కాలం నుంచి ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను తరలించాల్సి వస్తే ఆయా కుటుంబాలకు ప్రభుత్వం గృహవసతి కల్పిస్తుంది. గృహాన్ని తీసుకోవడానికి ఇష్టపడని వారికి ఆర్థిక సహకారం అందిస్తారు.
  4. ప్రభావిత కుటంబాలకు నగదు లేదా ఉపాధిని పొందే అవకాశాన్ని కల్పిస్తారు. ఉపాధి పొందని ప్రతి కుటుంబానికి ఒకేసారి గ్రాంటుగా రూ.5 లక్షలు అందిస్తారు.
  • ప్రత్యామ్నాయంగా ప్రతి కుటుంబానికి నెలకు 2,000 చొప్పున 20 ఏళ్ల వరకు నగదు చెల్లింపు ఉంటుంది (ఈ మొత్తాన్ని ద్రవ్యోల్బణాకి తగ్గట్లు సవరిస్తారు).
  • భూ సేకరణ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు తరలించినప్పుడు అన్ని ప్రభావిత కుటుంబాలకు ఏడాది పాటు జీవనాధార అలవెన్సుగా నెలకు రూ.3000 అందిస్తారు.
  • ప్రతి కుంటుబానికి రవాణ అలవెన్స్ కింద రూ. 50,000, పునరావాస భత్యంగా రూ. 50,000 చెల్లిస్తారు.
  • చేతివృత్తుల కుటుంబాలు, చిన్న వ్యాపారస్తుడు లేదా స్వయం ఉపాధి పొందిన వ్యక్తి ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం కనిష్టంగా రూ. 25,000 పొందుతారు.

భూ సేకరణ - పరిణామాలు:
ఉపాధి కోల్పోవటం, మార్జినలైజేషన్, ఆహార అభద్రత, గృహాలు కోల్పోవటం, మానవాభివృద్ధి లోపించటం, మరణాల రేటులో పెరుగుదల, సాంఘిక హోదా కోల్పోవటం, భూమి లేకపోవటం.
Published date : 04 Dec 2015 04:07PM

Photo Stories