Skip to main content

వాయు కాలుష్యం

మానవ మనుగడకు గాలి, నీరు, నేల అత్యంత ప్రధానమైనవి. శాస్త్ర సాంకేతిక అభివృద్ధితో మనకు అనేక సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ మానవ కార్యకలాపాల వల్ల గాలి, నీరు, నేల వాటి సహజత్వాన్ని కోల్పోతున్నాయి. ఈ సహజ వనరులపై మనకెంత అధికారం ఉందో, వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత కూడా అంతే ఉంది.

గాలి - వాతావరణం
భూఉపరితలం నుంచి సుమారు 1000 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉన్న వాయు మండలాన్ని వాతావరణం అంటారు. గాలి వివిధ వాయువుల మిశ్రమం. ఇందులో ప్రధాన అనుఘటకం నైట్రోజన్. తర్వాతి స్థానంలో ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి ఉన్నాయి. వీటితోపాటు ఆర్గాన్, హీలియం, నియాన్ అనే జడవాయువులు ఉన్నాయి.
గాలి సంఘటనం

గాలిలోని వాయువు

సంఘటనం

నైట్రోజన్

78%

ఆక్సిజన్

21%

ఆర్గాన్

0.9%

నీటిఆవిరి

0.04%

కార్బన్ డై ఆక్సైడ్

0.03%

గాలిలోని ఈ వాయువులు వాటి సహజ ధర్మాన్ని కోల్పోకుండా ఉంటాయి. అయితే ఈ సంఘటనం అన్ని వేళలా, అన్ని ప్రదేశాల్లో స్థిరంగా ఉండకపోవచ్చు. పారిశ్రామిక వాడల్లో శిలాజ ఇంధనాలైన బొగ్గు, పెట్రోలియం తదితర పదార్థాలను ఎక్కువగా మండిస్తారు. అందువల్ల కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం పెరుగుతుంది. శ్వాసక్రియలో భాగంగా మానవులు, ఇతర జంతుజాలం ఆక్సిజన్‌ను గ్రహించి కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తాయి. వెంటిలేషన్ సరిగా లేని తరగతి గదిలో శ్వాసించేందుకు సరిపడా ఆక్సిజన్ లభించదు. దీంతో ఆవలింతలు వస్తాయి. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా పిండి పదార్థాలను తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియలో భాగంగా వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను వినియోగించుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. అందుకే వృక్షసంపద అధికంగా ఉన్న ప్రాంతాల్లోని గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ సమతుల్యంగా ఉంటుంది. ‘లెగ్యుమినేసి’ మొక్కలు ఉన్న ప్రాంతాల్లోని గాలిలో నైట్రోజన్ పరిమాణం సాధారణం కంటే తక్కువగా ఉంటుంది. ఈ మొక్కల వేర్ల బుడిపెల్లో బ్యాక్టీరియా ఉంటుంది. ఇది గాలిలోని నైట్రోజన్‌ను గ్రహించి మొక్కలకు ఉపయోగకరమైన నైట్రేట్ ఎరువుల రూపంలోకి మారుస్తుంది.
జంతు, వృక్ష సంబంధ పదార్థాలు బ్యాక్టీరియా వల్ల కుళ్లిపోయి, వాటి ప్రొటీన్ సంబంధిత సంయోగ పదార్థాలు వియోగం చెంది నైట్రోజన్ విడుదలవుతుంది. ఇలా విడుదలైన నైట్రోజన్ గాలిలోకి చేరుతుంది.
గాలిలోని నీటిఆవిరి కూడా అన్ని ప్రదేశాల్లో ఒకేలా ఉండదు. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, సముద్ర తీర ప్రాంతాల్లో గాలిలో నీటిఆవిరి ఎక్కువగా ఉంటుంది. పీఠభూమి ప్రాంతాల్లో తేమ(నీటిఆవిరి) తక్కువగా ఉంటుంది. శీతాకాలంలో ఉదయం, సాయంత్రం వేళల్లో నీటిఆవిరి అధికంగా ఉండటం వల్ల నీటిమంచు, పొగమంచు ఏర్పడతాయి.
మనం పీల్చే గాలి సహజ సంఘటనంలో ఉండటం లేదు. వాహనాలు, పరిశ్రమలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు విష వాయువులను వెలువరిస్తున్నాయి. బొగ్గును మండించటం, వంటచెరకు కాల్చడం తదితర చర్యల వల్ల కూడా అనేక విష వాయువులు గాలిలో చేరుతున్నాయి. ఇలా వాతావరణంలో చేరే వాటిలో కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్, ఫ్రియాన్, ఓజోన్, మీథేన్ లాంటి వాయువులు; ఫ్లైయాష్, మెర్క్యురీ, జింక్, క్రోమియం, కాడ్మియం తదితర లోహాలు ముఖ్యమైనవి.

వాతావరణ కాలుష్యం - పదాల వివరణ
కాలుష్యం: మానవ లేదా ప్రకృతి కార్యకలాపాల వల్ల విడుదలై, పరిసరాల మీద దుష్ర్పభావం చూపే పదార్థాన్ని కాలుష్యం అంటారు.
ఉదాహరణ: సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ లాంటి వాయువులు. లెడ్, మెర్క్యురీ తదితర లోహాలు. పుప్పొడి రేణువులు, దుమ్ము, ధూళి, రేడియోధార్మిక పదార్థాలు, పురుగు మందులు మొదలైనవి.
మలినం: ప్రకృతిలో సహజంగా లభించని, మానవ లేదా ప్రకృతి కార్యకలాపాల ద్వారా పరిసరాల్లోకి విడుదలైన పదార్థాన్నే మలినం అంటారు.
ఉదాహరణ: భోపాల్ దుర్ఘటనకు కారణమైన మిథైల్ ఐసోసయనేట్. ఢిల్లీ దుర్ఘటనకు కారణమైన పైరో సల్ఫ్యూరిక్ ఆమ్లం. హరిత గృహ ప్రభావానికి, ఓజోన్ పొర క్షీణతకు కారణమైన క్లోరోఫ్లోరో కార్బన్లు (ఫ్రియాన్‌లు). ఈ వాయువులు ప్రకృతిలో సహజసిద్ధంగా లభించవు. మానవ కార్యకలాపాల ద్వారా గాలిలో చేరాయి.
గ్రాహకం: కాలుష్య ప్రభావానికి గురయ్యే మాధ్యమాన్ని గ్రాహకం అంటారు. ఉదా: ఆటోమొబైల్ గ్యారేజిలో, రోడ్లపై వాహనాల నుంచి వెలువడే పొగ ద్వారా మన కళ్లు ఎర్రబారి మండుతాయి. ఈ సందర్భంలో కళ్లను గ్రాహకాలు అనవచ్చు.
సింక్: కాలుష్యాలతో చర్య జరిపే మాధ్యమాన్ని సింక్ అంటారు. ఉదాహరణకు అడవులు, సముద్రాలు కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకుని సింక్‌లుగా పనిచేస్తాయి.

వాతావరణ విభాగాలు
భూమిపై సుమారు 500 కి.మీ. వరకు వ్యాప్తి చెంది ఉన్న వాతావరణాన్ని నాలుగు భాగాలుగా విభజించవచ్చు. భూమి ఉపరితలం నుంచి పైకి పోయే కొద్దీ గాలి సాంద్రత, పీడనం, ఉష్ణోగ్రత తగ్గుతాయి. అందుకే ఎత్తయిన కొండ ప్రాంతాల్లో త్వరగా వంట చేయలేం. పర్వతారోహకులకు ఆక్సిజన్ సరిగా అందదు.
ట్రోపో ఆవరణం (0-11 కి.మీ), స్ట్రాటో ఆవరణం (11-50 కి.మీ.), మీసో ఆవరణం (50-85 కి.మీ.), థర్మో ఆవరణం (85-500 కి.మీ.) అనేవి వాతావరణంలోని పొరలు.
స్ట్రాటోస్పియర్‌లో ఓజోన్ పొర ఉంటుంది. ఇది సూర్యరశ్మిలోని చర్మ క్యాన్సర్‌ను కలిగించే అతినీలలోహిత కిరణాలను భూమికి చేరకుండా అడ్డుకుంటుంది. కానీ ఫ్రియాన్లు ఓజోన్ పొర క్షీణతకు కారణమవుతున్నాయి. స్ట్రాటో స్పియర్‌లోనే విమానాలు ప్రయాణిస్తాయి. అంతరిక్షం నుంచి భూమివైపు వేగంగా దూసుకొచ్చే ఉల్కలు మీసో ఆవరణంలో మండిపోతాయి. భూమి నుంచి ఉద్గారమైన రేడియో తరంగాలు థర్మోస్పియర్ ద్వారా తిరిగి భూమికి పరావర్తనం చెందుతాయి.
 
ప్రధాన వాయు కాలుష్యాలు
కార్బన్ మోనాక్సైడ్ (CO): ఇది విషపూరితమైంది. పెట్రోల్ లాంటి శిలాజ ఇంధనాలు తక్కువ గాలి(ఆక్సిజన్) సమక్షంలో అసంపూర్తిగా మండటం వల్ల ఇది వాతావరణంలోకి విడుదలవుతుంది. వాహనాలు, ఐరన్, స్టీల్ పరిశ్రమలు, ఘన వ్యర్థాల నుంచి కూడా ఇది విడుదలవుతుంది. కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చడం ప్రమాదకరం. ఇది హిమోగ్లోబిన్‌తో కార్బాక్సీ హీమోగ్లోబిన్‌ను ఏర్పర్చి రక్తంలో ఆక్సిజన్ సరఫరా కాకుండా చేస్తుంది. హిమోగ్లోబిన్‌తో ఆక్సిజన్ ఏర్పరిచే బంధం కంటే CO బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. వాతావరణంలో ఆమోదింపదగిన CO స్థాయి 7 పీపీఎం. దీని పరిమాణం ఎక్కువైతే దృష్టి కోల్పోవడం (10 పీపీఎం), తలనొప్పి (100 పీపీఎం), స్పృహ కోల్పోవడం (250 పీపీఎం), కోమాలోకి వెళ్లడం (750 పీపీఎం), తక్షణ మరణం (1000 పీపీఎం) లాంటి దుష్ర్పభావాలు తలెత్తుతాయి. కార్బన్ మోనాక్సైడ్‌కు నేల ప్రధానమైన సింక్. నేలలోని కొన్ని రకాల సూక్ష్మజీవులు వాతావరణంలోని COను తొలగిస్తాయి.
కార్బన్ డై ఆక్సైడ్ (CO2): ఇది విషపూరితం కాని కాలుష్యకారకం. శ్వాసక్రియ, శిలాజ ఇంధనాల దహనం, సిమెంట్ పరిశ్రమలు (సున్నపురాయిని కాల్చడం ద్వారా), మొక్కలు కుళ్లిపోవడం, అగ్నిపర్వతాల విస్ఫోటనం తదితర కారణాల వల్ల CO2 వాతావరణంలో కలుస్తుంది. అడవులను ప్రధాన కార్బన్ డై ఆక్సైడ్ సింక్‌లుగా పేర్కొనవచ్చు. సముద్రాలు కూడా కార్బన్ డై ఆక్సైడ్‌ను కరిగించుకొని కార్బొనేట్లు, బైకార్బొనేట్లను ఏర్పరుస్తూ మరో ప్రధాన సింక్‌లుగా పనిచేస్తాయి. సూర్యరశ్మి సమక్షంలో క్లోరోఫిల్ ఉన్న మొక్కలు కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించి పిండిపదార్థాలను తయారుచేసుకుంటాయి. ఇవి CO2స్థాయిని తగ్గిస్తాయి. హరిత గృహ ప్రభావం (భూగోళ తాపం) కలిగించే వాయువుల్లో కార్బన్ డై ఆక్సైడ్ ప్రధానమైంది.
ఇతరవాయువులు: నీటి ఆవిరి, ఫ్రియాన్లు, ఓజోన్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్.
సల్ఫర్ డై ఆక్సైడ్: ఇది ఘాటైన వాసన ఉన్న, రంగు లేని వాయువు. నేలబొగ్గును మండించటం (ఉదా: థర్మల్ పవర్ ప్లాంట్లు), పెట్రోలియం రిఫైనరీలు, అగ్నిపర్వతాలు, పైరైటిస్ ఖనిజాల (ఐరన్, కాపర్, జింక్ సల్ఫైడ్‌లు) భర్జనం, కుళ్లిన పదార్థాల నుంచి విడుదలైన హైడ్రోజన్ సల్ఫైడ్ ఆక్సీకరణం తదితర కారణాల వల్ల ఇది వాతావరణంలోకి చేరుతుంది. ఇది నైట్రోజన్ ఆక్సైడ్‌తో కలిసి ఆమ్ల వర్షానికి కారణమవుతుంది. ఆమ్ల వర్షాల వల్ల నేల pH తగ్గుతుంది. ఫలితంగా నేల నిస్సారమవుతుంది. పాలరాయి లేదా చలువరాయి/సున్నపురాయితో నిర్మించిన కట్టడాలకు సల్ఫర్ డై ఆక్సైడ్ వల్ల నష్టం వాటిల్లుతుంది. పాలరాతి కట్టడమైన తాజ్‌మహల్ పసుపు రంగులోకి మారడానికి మదురలోని చమురు శుద్ధి కర్మాగారం విడుదల చేసే సల్ఫర్ డై ఆక్సైడే కారణం. ఈ వాయువు ఊపిరితిత్తుల వ్యాధిని కలిగిస్తుంది. మొక్కల పెరుగుదలను క్షీణింపజేస్తుంది.
నైట్రోజన్ ఆక్సైడ్‌లు: నైట్రస్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్‌లు కాలుష్యాన్ని కలిగించే ప్రధాన నైట్రోజన్ ఆక్సైడ్‌లు. ఇవి గ్రీన్‌హౌస్ వాయువులు. నైట్రోజన్ ఆక్సైడ్ స్ట్రాటోస్పియర్‌లో కాంతి రసాయన చర్యల్లో పాల్గొని ఓజోన్ పొర క్షీణతకు కారణమవుతుంది. ఇది నేలలోని సూక్ష్మజీవుల వల్ల కూడా ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా గాలిలోని నైట్రోజన్, ఆక్సిజన్ ఒకదానితో మరొకటి చర్య జరపవు. కానీ మెరుపులు ఏర్పడినప్పుడు అధిక ఉష్ణోగ్రతల (1483 K కంటే అధికం) వద్ద ఈ రెండు వాయువులు చర్య జరపుతాయి. ఫలితంగా నైట్రోజన్ ఆక్సైడ్‌లు వాతావరణంలోకి విడుదలవుతాయి. నైట్రోజన్ డై ఆక్సైడ్ సూర్యరశ్మి సమక్షంలో విఘటనం చెంది చర్యాశీలత ఉన్న ఆక్సిజన్ పరమాణువును ఏర్పరుస్తుంది. ఇది బాష్పశీల హైడ్రోకార్బన్లు, పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ లాంటి సమ్మేళనాలతో కలిసి ‘కాంతి రసాయన స్మాగ్’కు కారణమవుతుంది.

క్లోరిన్ (Cl2): వాతావరణాన్ని కలుషితం చేస్తున్న వాయువుల్లో క్లోరిన్ ఒకటి. ఇది అతి తక్కువ పరిమాణంలో ప్లాస్టిక్ పరిశ్రమలు, నీటిని శుద్ధి చేసే ప్లాంట్ల నుంచి వాతావరణంలోకి విడుదలవుతోంది. కాగితం తయారీ పరిశ్రమల్లో కలప గుజ్జును విరంజనం చేయడంలో క్లోరిన్‌ను ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా కూడా క్లోరిన్ వాయువు వాతావరణంలోకి చేరుతోంది. క్లోరిన్ విషపూరిత, హానికర వాయువు. ఇది వాతావరణంలోని నీటి బిందువులతో కలిసి హైడ్రోక్లోరికామ్లం, హైపోక్లోరస్ ఆమ్లంగా మారుతుంది.

ఫ్రియాన్‌లు: వివిధ క్లోరో ఫ్లోరో కార్బన్లను సాధారణంగా ఫ్రియాన్లు అంటారు. వీటి ఆవిష్కరణతో శీతలీకరణ (రిఫ్రిజిరేషన్) పరిశ్రమ కొత్త పుంతలు తొక్కింది. రంగులేని, విషపూరితం కాని, మండే స్వభావం లేని ఈ ఫ్రియాన్‌లను ఎయిర్ కండిషనింగ్‌లో శీతలీకరణులుగానే కాకుండా ఏరోసోల్ చోదకాలు (ప్రొఫెల్లెంట్స్), డ్రైక్లీనింగ్‌లో ద్రావణిలు (సాల్వెంట్స్), నురుగు ఏర్పరిచే కారకాలు (ఫోమింగ్ ఏజెంట్స్), మంటలనార్పే పదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్ ప్యాకింగ్ పదార్థాలుగా వినియోగించారు. సర్జికల్ పరికరాలను క్రిమి రహితం (స్టెరిలైజేషన్) చేయడానికి ఉపయోగించడం వల్ల వీటిని పరిశ్రమలకు వరాలుగా భావించారు. కానీ ఇవి హరిత గృహ ప్రభావానికి, ఓజోన్ పొర క్షీణతకు కారణమవడం వల్ల వీటిని పర్యావరణానికి ‘శాపం’గా పరిగణిస్తూ నిషేధించారు. ఇవి ఇతర కాలుష్యాల మాదిరిగా కాకుండా చాలా స్థిరమైనవి. ఇవి ట్రోపోవరణంలో దాదాపు ఒక శతాబ్దానికిపైగా స్థిరంగా ఉంటాయి.

కణ స్వభావ పదార్థాలు (Particulate matter): సాధారణంగా 0.001 నుంచి 10 మి.మీ. పరిమాణం ఉన్న దుమ్ము, ధూళి కణాలు మాత్రమే గాలిలో తేలియాడుతూ కంటికి కనిపిస్తాయి. ఇంతకంటే తక్కువ పరిమాణం ఉన్నవి కంటికి కనిపించవు. ఇవి గాలిలో తెరలు తెరలుగా ఉంటాయి. వీటిలో ప్రధానమైనవి మసి (కార్బన్ కణాలు), లోహాలు, లోహ లవణాలు, సిమెంట్, ఫ్లై యాష్, ఖనిజాలు, హైడ్రోకార్బన్‌లు మొదలైనవి. లోహాల్లో ముఖ్యమైనవి లెడ్, మెర్క్యూరీ, క్రోమియం, ఆర్సెనిక్, జింక్, కాడ్మియం, నికెల్, ఐరన్. కణ స్వభావ పదార్థాలు శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, పక్షవాతానికి కారణమవుతున్నాయి.
వాహనాల ఇంధనం పెట్రోల్‌కు శబ్దం చేయకుండా సున్నితంగా మండటానికి ‘టెట్రా ఇథైల్ లెడ్’(టీఈఎల్) అనే సీసం (లెడ్) సమ్మేళన్నాన్ని కలిపేవారు. ప్రస్తుతం దీన్ని నిషేధించారు. దీనివల్ల వాతావరణంలోకి లెడ్ విడుదలై అనేక మానసిక రుగ్మతలను కలిగిస్తుందని గుర్తించారు. పట్టణాల్లో కాలుష్యం ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఎక్కువగా ఉండేది.

ఫ్లై యాష్: నేల బొగ్గును మండించినప్పుడు చివరగా మిగిలే బూడిదనే ‘ఫ్లై యాష్’ అంటారు. ఇది ప్రధానంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి విడుదలవుతోంది. కొంతవరకు దీన్ని ఇటుకల తయారీ, సిమెంట్ పరిశ్రమల్లో వాడుతున్నప్పటికీ.. మిగిలింది పర్యావరణానికి గుదిబండగా మారుతోంది. ఫ్లై యాష్‌లో ప్రధానంగా సిలికాన్ డై ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్‌లు ఉంటాయి. వీటితో పాటు కొద్ది పరిమాణంలో ఆర్సెనిక్, బెరీలియం, బోరాన్, క్రోమియం, కాడ్మియం, మెర్క్యూరీ, లెడ్, సెలీనియం లాంటి కొన్ని లోహాలుంటాయి. వీటిలో కొన్ని హానికరమైనవి.

పాలీ ఎరోమాటిక్ హైడ్రోకార్బన్‌లు: కోల్, పెట్రోలియం పదార్థాలను మండించడం (ఆక్సీకరించడం) వల్ల కర్బన రసాయన కణ స్వభావ పదార్థాలు వాతావరణంలోకి చేరుతున్నాయి. బెంజీన్, టోలీన్‌తోపాటు అధిక వలయ ఎరోమాటిక్ సమ్మేళనాలైన నాఫ్తలీన్, ఆంథ్రసీన్ లాంటివి గాలిలో చేరి ‘కేన్సర్’ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతున్నాయి.

స్మాగ్ (Smog)
moke + Fog → Smog
ప్రాథమికంగా పొగ, దుమ్ము-ధూళితో కూడిన మంచునే ‘స్మాగ్’గా వ్యవహరిస్తారు. స్మాగ్ రెండు రకాలు. అవి..
1. సాంప్రదాయిక స్మాగ్: దుమ్ము, సల్ఫర్ డై ఆక్సైడ్‌తో కూడిన మంచు.. పొగతో కలిసినప్పుడు సాంప్రదాయిక స్మాగ్ ఏర్పడుతుంది. నైట్రోజన్, సల్ఫర్ ఆక్సైడ్‌లు అధికంగా ఉన్న చల్లని తేమతో కూడిన పారిశ్రామిక ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీన్నే ‘రసాయన స్మాగ్’, ‘క్షయకరణ స్మాగ్’గా వ్యవహరిస్తారు. 1962లో మెట్టమొదట లండన్‌లో కనిపించిన ఈ స్మాగ్ దాదాపు ఐదు రోజులపాటు ఉండి అనేక మంది మరణానికి కారణమైంది.

2. కాంతి రసాయన స్మాగ్: ఈ రకమైన స్మాగ్ ప్రధానంగా వెచ్చని, పొడి వాతావరణంతోపాటు ధారాళంగా సూర్యరశ్మి ఉన్నప్పుడు ఏర్పడుతుంది. పొగ, దుమ్ము, ధూళితోపాటు, కాంతి రసాయన ఆక్సీకరణులు అధికంగా ఉన్న వాతావరణంలో ఇది ఏర్పడుతుంది.
ఈ కాంతి రసాయన స్మాగ్ ప్రధానంగా ఓజోన్, నైట్రిక్ ఆక్సైడ్ (NO), హైడ్రోకార్బన్లు, ఫార్మాల్డిహైడ్, ఎక్రైల్ ఆల్డిహైడ్ (ఎక్రోలిన్), పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ (పీఏఎన్) లాంటి సూర్యరశ్మి లేదా అతినీలలోహిత (UV) కాంతి సమక్షంలో స్వేచ్ఛా ప్రాతిపదికలు (ఫ్రీ ర్యాడికల్స్) ఉత్పత్తి చేసే సమ్మేళనాల చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది.

కాంతి రసాయన స్మాగ్ దుష్ర్పభావాలు
  • ఇందులో ఉండే ‘ఓజోన్’ శ్వాస సంబంధ వ్యాధులను కలిగిస్తుంది, రబ్బర్‌ను పెలుసుగా, త్వరగా పాడయ్యేట్లు చేస్తుంది. పంటలకు నష్టం కలుగజేస్తుంది. భూగోళ తాపానికి కారణమవుతుంది.
  • ఆల్డిహైడ్లు, హైడ్రోకార్బన్లు కళ్లలో మంటను కలిగిస్తాయి.
  • పీఏఎన్ ఊపిరితిత్తులతోపాటు గుండె, కళ్లకు హాని కలిగిస్తుంది. మొక్కల ఆకులు పాలిపోయేలా చేస్తుంది.
  • స్మాగ్‌తో దారులు మసకగా ఉండటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి.

ఆమ్ల వర్షం (యాసిడ్ రెయిన్)
నేలబొగ్గు, పెట్రోలియం లాంటి శిలాజ ఇంధనాల్లో కార్బన్‌తోపాటు సల్ఫర్, నైట్రోజన్ సమ్మేళనాలుంటాయి. వీటిని మండించినప్పుడు ప్రధానంగా కార్బన్ డై ఆక్సైడ్ (CO2) విడుదలవుతుంది. ఇది నీటిలో కరిగి బలహీన ఆమ్లమైన కార్బోనికామ్లాన్ని ఇస్తుంది. అందుకే స్వచ్ఛమైన నీటి pH (ఆమ్లత్వాన్ని కొలిచే పద్ధతి) విలువ ఏడు అయినప్పటికీ వర్షపునీటి pH 5 నుంచి 6 మధ్య ఉంటుంది (బలహీన ఆమ్ల అవధి). వర్షం pH విలువ ఇంతకంటే తగ్గితే దాన్ని ‘ఆమ్ల వర్షం’ అంటారు. సాధారణంగా శిలాజ ఇంధనాలను మండించినప్పుడు వెలువడే సల్ఫర్ ఆక్సైడ్‌లు, నైట్రోజన్ ఆక్సైడ్‌లు సూర్యరశ్మి సమక్షంలో వివిధ చర్యలకు లోనై వర్షపు నీటితో కలిసి సల్ఫ్యూరికామ్లం (H2SO4), నైట్రిక్ ఆమ్లం (HNO3)గా ఆమ్లవర్ష రూపంలో భూమిని చేరతాయి.

ఆమ్ల వర్షం దుష్ర్పభావాలు
  • చలువరాయి (మార్బుల్), సున్నపురాయి, స్లేట్ లాంటి పదార్థాలతో నిర్మించిన కట్టడాలు దెబ్బతింటాయి. తాజ్‌మహల్ పసుపు రంగులోకి మారడానికి చమురుశుద్ధి కర్మాగారాలు విడుదల చేసే సల్ఫర్, నైట్రోజన్‌ల డై ఆక్సైడ్‌లే ప్రధాన కారణం.
  • ఆమ్ల వర్షం సరస్సుల నీటిలోని జీవ జాలానికి నష్టం కలిగిస్తుంది.
  • లోహ నిర్మాణాలు త్వరగా క్షయం కావడానికి కారణమవుతుంది.
  • ఆమ్ల వర్షం నేలలు, శిలల్లోని సీసం (లెడ్), పాదరసం (మెర్క్యూరీ), రాగి (కాపర్), అల్యూమినియం లాంటి లోహ అయాన్‌లను జలాశయాల్లోకి చేర్చి వాటిని విషపూరితం చేస్తుంది.
  • ఆమ్ల వర్షం వల్ల నేలల సారం తగ్గుతుంది.
Published date : 19 Dec 2015 03:45PM

Photo Stories