Skip to main content

గ్రూప్స్.. బంగారు గని భూగోళ శాస్త్రం

గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల్లో జనరల్ స్టడీస్ (పేపర్-1) అత్యంత కీలకమైంది.
జనరల్ స్టడీస్ పేపర్ లో ఎక్కువ మార్కులు సాధిస్తే విజయావకాశాలు అంతగా మెరుగౌతాయి. జనరల్ స్టడీస్‌లో ఉన్న అంశాల్లో భూగోళ శాస్త్రం అత్యంత కీలకమైన విభాగం. ఇటీవల కాలంలో పోటీ పెరగడంతో పాటు భూగోళ శాస్త్రం నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు వస్తున్నాయి.
  • గత గ్రూప్-1 జనరల్ స్టడీస్ (పేపర్-1)లో భూగోళ శాస్త్రం నుంచి 25-28 ప్రశ్నల వరకు అడిగారు. అదే గూప్-2లో(పేపర్-1) ఈ విభాగం నుంచి 20-25 ప్రశ్నల వరకు వచ్చాయి. దీన్ని బట్టి జనరల్ స్టడీస్‌లో భూగోళ శాస్త్రం ప్రాధాన్యత ఎక్కువని చెప్పొచ్చు. పరీక్షల్లో ఈ విభాగం నుంచి ప్రశ్నలను ఎక్కువగా అప్లికేషన్ రూపంలో అడుగుతున్నారు. కాబట్టి గ్రూప్స్‌కి ప్రిపేరయ్యే అభ్యర్థులు ప్రతి అంశాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని చదివితే ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు.
  • ఇతర సబ్జెక్టులతో పోల్చితే భూగోళ శాస్త్రం విస్తృతమైంది, విభిన్నమైంది. అందువల్ల విద్యార్థులు ఈ విభాగాన్ని కొన్ని ఉప-విభాగాలుగా విభజించుకుని చదవాలి. ప్రతి విభాగాన్ని చదివేటప్పుడు రాజకీయ, భౌతిక పటాలను అవగాహన చేసుకుంటూ చదివితే సబ్జెక్టు సులభంగా అర్థమవుతుంది.
  • భూగోళ శాస్త్రంలో ప్రధానంగా 3 విభాగాలు ఉన్నాయి.

  1. ప్రపంచ భూగోళ శాస్త్రం
  2. భారతదేశ భూగోళ శాస్త్రం
  3. ప్రాంతీయ భూగోళ శాస్త్రం (తెలంగాణా భూగోళ శాస్త్రం)
గత గ్రూప్-2 పరీక్షలో భారతదేశ భూగోళ శాస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ఇటీవల కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రంలో పోటీ పరీక్షల నిర్వహణకు నూతనంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో జరిగే పోటీ పరీక్షల్లో ‘తెలంగాణ భూగోళ శాస్త్రం’ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడగొచ్చు. ఎందుకంటే జనరల్ స్టడీస్ విభాగంలో దీన్ని ఒక ప్రధాన అంశంగా చేర్చే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఈ విభాగంపై ప్రత్యేక దృష్టి పెట్టి చదవాలి.

ప్రపంచ భూగోళ శాస్త్రం
ఇందులో ప్రధానంగా భూస్వరూప శాస్త్రం, శీతోష్ణస్థితి శాస్త్రం, ఖగోళ శాస్త్రం, మానవ భూగోళ శాస్త్రం, పర్యావరణ భూగోళ శాస్త్రం తదితర అంశాలు ఉన్నాయి. గతంలో వీటి నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి.
  • భూ స్వరూప శాస్త్రంలో శిలలు, పర్వతాలు, మైదానాలు, పీఠభూములు, వివిధ భూస్వరూపాలు (క్రమక్షయ, నిక్షేపణ భూస్వరూపాలు) నుంచి గతంలో ఎక్కువ ప్రశ్నలు అడిగారు.
    ఉదా:
    ఆఫ్రికాలో ఎత్తై పర్వతం పేరు? (2010 గ్రూప్-1, ప్రిలిమ్స్)
    1) కెమరూన్ పర్వతం
    2) కిలిమంజారో పర్వతం
    3) ఏల్గోన్ పర్వతం
    4) కెన్యా పర్వతం
    సమాధానం: 2

  • ఆస్ట్రేలియాలో ఎత్తై పర్వత శిఖరం? (2010 గ్రూప్-1 ప్రిలిమ్స్)
    1) ఒస్సా పర్వతం
    2) ఉడ్రాప్స్ పర్వతం
    3) బ్రూస్ పర్వతం
    4) కొసియుస్కో పర్వతం
    సమాధానం: 4

  • గ్రేట్ విక్టోరియా ఎడారి ఉండే ప్రదేశం? (2012, గ్రూప్-1 ప్రిలిమ్స్)
    1) యూకే
    2) ఆస్ట్రేలియా
    3) యూ.ఎస్.ఎ
    4) ఉగాండా
    సమాధానం: 2

  • టైగ్రిస్ నది ముఖ్యంగా ప్రవహించేది? (2010 గ్రూప్-2, పేపర్ 1)
    1) టెంబక్‌టూ
    2) ఇరాక్
    3) ఇరాన్
    4) టాంగాన్యికా
    సమాధానం: 2

  • సరస్సులను పూడ్చటం వల్ల ఏర్పడే మైదానాలు? (2008 గ్రూప్-2, పేపర్ 1)
    1) పెనిప్లైన్స్
    2) ఒండలి మైదానాలు
    3) వరద మైదానాలు
    4) కర్‌స్ట్ మైదానాలు
    సమాధానం: 4

    విద్యార్థులు ఈ అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడంతో పాటు ఖండాలకు సంబంధించిన సమాచారాన్ని చదవాలి. ఖండాల్లోని నదులు, పర్వతాలు, శిఖరాలు, పీఠభూములు తదితర అంశాలను చదవాలి. వీటిని చదివేటప్పుడు ప్రపంచంలోనే పొడవైనవి, ఎత్తై వంటి అంశాలను సంపూర్ణంగా చదవాలి.

శీతోష్ణస్థితి శాస్త్రం
ఇందులో శీతోష్ణస్థితి, ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, అవపాతం, పవనాలు, వాతావరణ పొరలు వంటివి ప్రధానాంశాలుగా ఉంటాయి.

గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు
  • గాలిలోని తేమను కొలిచేందుకు ఉపయోగించే సాధనం? (2008, గ్రూప్-2, పేపర్-1)
    1) థర్మా మీటరు
    2) బారోమీటరు
    3) హైడ్రోమీటరు
    4) హైగ్రో మీటరు
    సమాధానం: 4

  • కొన్ని ప్రాంతాల వాతావరణంలో అత్యంత వేగంతో ఎత్తుగా గిరగిర తిరుగు గాలి పంథాను ఏమంటారు? (2008, గ్రూప్-2, పేపర్-1)
    1) జెట్‌స్ట్రీమ్
    2) చక్రవాతం
    3) ప్రతి చక్రపాతం
    4) రుతుపవనాలు
    సమాధానం: 1

    మాదిరి ప్రశ్నలు
  • ప్రపంచ పవనాలకు సంబంధించినది?
    1) వ్యాపార పవనాలు
    2) పశ్చిమ పవనాలు
    3) పర్వత పవనాలు
    4) ధృవ తూర్పు పవనాలు
    సమాధానం: 3

  • నీటి ఆవిరి పెరిగితే పీడనం?
    1) పెరుగుతుంది
    2) తగ్గుతుంది
    3) మారదు
    4) పెరిగి తగ్గుతుంది
    సమాధానం: 2

ఖగోళ శాస్త్రం
ఈ విభాగంలో విశ్వం, సౌరకుటుంబం, అక్షాంశాలు, రేఖాంశాలు, స్థానిక చలనం, గ్రహణాలు, భూ అంతర్‌నిర్మాణం మొదలైన అంశాలను చదవాలి.

గతంలో వచ్చిన ప్రశ్నలు
  • భూమి వెలుపలి పొరను ఏమంటారు? (2008 గ్రూప్-1, ప్రిలిమ్స్)
    1) ప్రావారము
    2) కేంద్ర మండలం
    3) వక్షాభ
    4) భూపటలం
    సమాధానం: 4

  • మార్చి 21, సెప్టెంబరు 21 తేదీల్లో సూర్యుని కిరణాలు నేరుగా దేనిపై ప్రసరిస్తాయి? (2010 గ్రూప్-1, ప్రిలిమ్స్)
    1) ఎక్సో స్పియర్
    2) భూమధ్యరేఖ
    3) స్ట్రాటో స్పియర్
    4) మకరరేఖ
    సమాధానం: 2

  • అత్యధిక సహజ ఉపగ్రహాలు లేదా చంద్రులు కలిగి ఉన్నది?
    1) జుపిటర్
    2) మార్స్
    3) వీనస్
    4) శని
    సమాధానం: 1

    మాదిరి ప్రశ్నలు
  • కాస్మిక్ సంవత్సరం దీనికి ప్రమాణం?
    1) దూరం
    2) కాలం
    3) వేగం
    4) దిశ
    సమాధానం: 2

  • ఉత్తరార్ధగోళంలో పగటి సమయం ఎక్కువ ఉండే రోజు?
    1) డిసెంబరు, 22
    2) జూన్, 21
    3) మార్చి, 21
    4) సెప్టెంబరు, 22
    సమాధానం: 2

సముద్ర శాస్త్రం
మహాసముద్రాలు, వాటిలో ఉన్న అగాథాలు, సముద్రాల ఉనికి, పోటుపాటులు, ఉష్ణోగ్రత, లవణీయత, సముద్ర భూతల విస్తరణ మెదలైన అంశాలను ప్రధానంగా అధ్యయనం చేయాలి.
మానవ భూగోళ శాస్త్రంలో ప్రపంచ జనాభా, వివిధ ఖండాల్లోని జాతులు మొదలైన వాటిని అధ్యయనం చేయాలి.

భారతదేశ భూగోళ శాస్త్రం
ఇటీవల పోటీ పరీక్షల్లో దీని ప్రాధాన్యం పెరిగింది. భారతదేశ భూగోళ శాస్త్రం నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు.

గతంలో వచ్చిన ప్రశ్నలు
  • కృష్ణా నది పుట్టిన స్థలం? (2012 గ్రూప్-1, ప్రిలిమ్స్)
    1) కొడుగు
    2) మహాబలేశ్వరం
    3) త్రయంబకేశ్వరం
    4) చిక్క బల్లాపూర్
    సమాధానం: 2

  • ప్రపంచంలోని ఎత్తై పర్వతాల్లో ఒకటైన అన్నపూర్ణ ఎక్కడ ఉంది? (2010 గ్రూప్-1, ప్రిలిమ్స్)
    1) ఇండియా
    2) టిబెట్
    3) భూటాన్
    4) నేపాల్
    సమాధానం: 4

  • దేశంలో రెండో పెద్ద తీరరేఖ గల రాష్ట్రం? (2012 గ్రూప్-2, పేపర్-1)
    1) పశ్చిమ బెంగాల్
    2) తమిళనాడు
    3) కేరళ
    4) ఆంధ్రప్రదేశ్
    సమాధానం: 4

  • ఉత్తర భారతదేశంలో కాలువల వ్యవసాయం ఎక్కువగా జరగడానికి కారణం? (2011 గ్రూప్-2, పేపర్- 1)
    1) రంధ్రాన్విత నేలలు
    2) భూమి లోపల నీరు అధికంగా ఉండటం
    3) జీవ నదులు కాలువలకు భూమికగా ఉండటం
    4) జన సాంద్రత అధికంగా ఉండటం
    సమాధానం: 3

  • గురు శిఖరం ఉన్న రాష్ట్రం ఏది? (2011 గ్రూప్-2, పేపర్-1)
    1) రాజస్థాన్
    2) గుజరాత్
    3) మధ్య ప్రదేశ్
    4) మహరాష్ట్ర
    సమాధానం: 1

మాదిరి ప్రశ్నలు
  • 82½º తూర్పు రేఖాంశం వెళ్లని ప్రాంతం?
    1) ఒడిశా
    2) పాండిచ్చేరి
    3) ఆంధ్ర ప్రదేశ్
    4) పశ్చిమ బెంగాల్
    సమాధానం: 4

  • ‘బొమ్మిడిలా కనుమ’ ఏ రాష్ట్రంలో ఉంది?
    1) సిక్కిం
    2) అరుణాచల్ ప్రదేశ్
    3) హిమాచల్ ప్రదేశ్
    4) అసోం
    సమాధానం: 2

  • భారతదేశంలో మొట్టమొదటి అణువిద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
    1) కల్పకం
    2) కైగా
    3) నరోరా
    4)తారాపూర్
    సమాధానం: 4

  • రాజస్థాన్ ‘ఖేత్రి’ ఏ ఖనిజ సంపదకు ప్రసిద్ధి?
    1) సీసం
    2) జిప్సం
    3) రాగి
    4) జింక్
    సమాధానం: 3

తెలంగాణ భూగోళ శాస్త్రం
నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా భర్తీ చేసే ఉద్యోగాల్లో తెలంగాణ భూగోళ శాస్త్రం నుంచి 10 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

ప్రధానాంశాలు:
తెలంగాణ ఉనికి, నైసర్గిక స్వరూపం, శీతోష్ణస్థితి, నదీ వ్యవస్థ-నీటి పారుదల సౌకర్యాలు, ప్రధానంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, మృత్తికలు అటవీ విస్తరణ, వన్య ప్రాణుల సంరక్షణ, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, జనాభా, ఖనిజ సంపద, వ్యవసాయం-ఉత్పత్తులు, పరిశ్రమలు, 10 జిల్లాల సమగ్ర సమాచారం చదవాలి. గతంలో ఈ అంశాల నుంచి ప్రశ్నలు వచ్చాయి.
  • కేశోరామ్ సిమెంట్స్‌ను ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు? (2010, గ్రూప్-1 ప్రిలిమ్స్)
    1) కరీంనగర్
    2) విజయనగరం
    3) రంగారెడ్డి
    4) కడప
    సమాధానం: 1

  • జూరాల ప్రాజెక్టు ఉన్న జిల్లా? (2008, గ్రూప్-1 ప్రిలిమ్స్)
    1) మహబూబ్‌నగర్
    2) నల్లగొండ
    3) అదిలాబాద్
    4) నిజామాబాద్
    సమాధానం: 1

మాదిరి ప్రశ్నలు
  • తెలంగాణ రాష్ట్రంలో రాఖీ గుట్టలు విస్తరించి ఉన్న జిల్లా?
    1) మహబూబ్‌నగర్
    2) కరీంనగర్
    3) రంగారెడ్డి
    4) అదిలాబాద్
    సమాధానం: 2

  • కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది?
    1) ఖమ్మం
    2) మెదక్
    3) వరంగల్
    4) అదిలాబాద్
    సమాధానం: 4

  • ‘ఇంద్రావతి’ ఏ నదికి ఉపనది?
    1) నర్మద
    2) గోదావరి
    3) మహానది
    4) తుంగభద్ర
    సమాధానం: 2

  • యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు?
    1) అదిలాబాద్
    2) మహబూబ్‌నగర్
    3) నల్గొండ
    4) ఖమ్మం
    సమాధానం: 3

  • తెలంగాణలో అత్యధిక జన సాంద్రత కలిగిన జిల్లా?
    1) వరంగల్
    2) మహబూబ్‌నగర్
    3) హైదరాబాద్
    4) రంగారెడ్డి
    సమాధానం: 3
Published date : 15 Jul 2016 12:37PM

Photo Stories