Skip to main content

గ్రూప్-2లో విజయానికి మార్గం

ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఆశావహులకు శుభవార్త. ఏపీపీఎస్సీ ఎగ్జిక్యూటివ్లో 442 నాన్ ఎగ్జిక్యూటివ్‌లో 540 కలిపి మొత్తం 982 గ్రూప్-2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు 5 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ రావడం, 2017 జూన్ 2 లోపు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారిని స్థానికులుగా పరిగణిస్తుండటం, నాన్‌లోకల్ కేటగిరీలో తెలంగాణ వారు దరఖాస్తు చేసే అవకాశం ఉండటంతో ఈ సారి పోటీ తీవ్రంగా ఉంటుంది. కాబట్టి వచ్చిన సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే నిరంతర సమగ్ర అధ్యయనం తప్పనిసరి. ఈ నేపథ్యంలో పేపర్లు, సెక్షన్లవారీగా గ్రూప్-2లోవిజయానికి సలహాలు, సూచనలు మీకోసం...
స్క్రీనింగ్ టెస్ట్ స్వరూపం
మొత్తం మార్కులు - 150; సెక్షన్లు-3; ఒక్కో సెక్షన్‌కు 50 మార్కులు.
సెక్షన్-1 : రాజకీయ, ఆర్థిక, సాంఘిక, శాస్త్ర సాంకేతిక రంగాలు, కళలు, క్రీడలు, సంస్కృతి, పరిపాలన పరంగా జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యమున్న అంశాలు.
సెక్షన్-2 : భారత రాజ్యాంగం- సమాఖ్యవాదం, ప్రాథమిక హక్కులు- విధులు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష, స్థానిక ప్రభుత్వం, ఆదేశిక సూత్రాలు, కేంద్ర-రాష్ట్ర శాసన నిర్మాణం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పాలన, శాసనపరమైన సంబంధాలు, షెడ్యూల్డ్ - గిరిజన ప్రాంత పరిపాలన.
సెక్షన్-3 : మధ్యయుగ భారత్‌లో ఆర్థిక వ్యవస్థ, స్వాతంత్య్రం పూర్వం భారత ఆర్థిక వ్యవస్థ, స్వతంత్ర భారత దేశంలో అభివృద్ధి ప్రణాళికలు, ఆర్థిక, పారిశ్రామిక విధానాలు. పారిశ్రామిక సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల శ్రామిక విధానాలు, భారత్‌లో వ్యవసాయం, హరిత విప్లవం పాత్ర. ప్రాంతాలు-సామాజిక వర్గాల మధ్య ఆర్థిక అసమానతలు.

స్క్రీనింగ్ టెస్ట్‌లో మెరవండిలా..
స్క్రీనింగ్ టెస్ట్‌లో విజయం సాధిస్తే సగం విజయం మీ సొంతమైనట్లే. మెయిన్ పరీక్ష రాసేందుకు ఇందులో అర్హత తప్పనిసరి. 2017 ఫిబ్రవరి 26న జరిగే ఈ పరీక్షకు మూడున్నర నెలల సమయం ఉంది. కాబట్టి ఇచ్చిన సిలబస్‌ను అధ్యయనం చేసి ప్రణాళికాబద్ధంగా చదవాలి. ఈ ప్రిపరేషన్ మెయిన్స్ పరీక్షక ఉపయోగపడేలా ఉండాలి.
  • ఆయా సబ్జెక్ట్‌లను, టాపిక్‌లను చదివేటప్పుడే స్క్రీనింగ్ టెస్ట్‌కు అవసరమైన రీతిలో షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి.
  • అన్ని టాపిక్స్ ముఖ్యాంశాలను రెండు నెలల్లో పూర్తి చేసుకోవాలి.
  • స్క్రీనింగ్ టెస్ట్ కోసం ప్రత్యేక సమయం కేటాయించాల్సిన అవసరం లేని విధంగా సమయ ప్రణాళిక పాటించాలి.
  • చదవడం పూర్తయిన తర్వాత స్క్రీనింగ్ పరీక్షకు వారం పది రోజుల ముందు ప్రాక్టీస్ టెస్ట్‌లకు కొంత సమయం కేటాయించాలి.
  • అప్పటికే రూపొందించుకున్న షార్ట్ నోట్స్, రెడీ రెకనర్స్, సాల్వ్‌డ్ పేపర్స్‌ను కూడా ప్రాక్టీస్ చేయడం ఉపయుక్తంగా ఉంటుంది.
  • కరెంట్ అఫైర్స్ అంశాలకు కొంత అధిక ప్రాధాన్యం ఇవ్వడం మేలు. ఎందుకంటే.. స్క్రీనింగ్ టెస్ట్‌కు మొత్తం మూడు సెక్షన్లుగా నిర్దేశించిన సిలబస్‌లో మొదటి సెక్షన్‌లో పూర్తిగా కరెంట్ అఫైర్స్‌ను చేర్చారు.
  • రెండు, మూడు సెక్షన్లలో పేర్కొన్న భారత రాజ్యాంగం, భారత ఆర్థికాభివృద్ధి పరంగా అభ్యర్థులు సంబంధిత సిలబస్‌కు మాత్రమే పరిమితం కావాలి.

పేపర్-1: జీఎస్‌ను జయించాలంటే
  • గ్రూప్-2 జీఎస్ (పేపర్-1)లో మొత్తం 12 అంశాలుఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజనానంతర పరిణామాలు అనే యూనిట్‌లో విభజన జరిగిన తీరు, దానివల్ల సామాజిక, సాంస్కృతిక, పరిపాలన, ఆర్థిక, న్యాయపరమైన సమస్యలు చేర్చడంతోపాటు క్యాపిటల్ సిటీ నిర్మాణం, పదో షెడ్యూల్‌లోని ఉమ్మడి సంస్థల విభజన, ఉద్యోగుల విభజన, స్థానికత, వ్యాపార- పారిశ్రామిక రంగాలపై విభజన ప్రభావం, విభజన తర్వాత మౌలిక సదుపాయాల కల్పనలో ఎదురవుతున్న సవాళ్లు - అవకాశాలు, ఆర్థిక వనరులపై విభజన ప్రభావం, సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక, భౌగోళికంగా విభజన ప్రభావం, నదీ జల వాటాలు-వివాదాలు, ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014ను కూడా పొందుపర్చింది. సిలబస్‌ను పరిశీలిస్తూ... అభ్యర్థులు నిర్దిష్ట వ్యూహంతో ప్రిపరేషన్ కొనసాగించాలి.

కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం
  • అభ్యర్థులు కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
  • అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ కరెంట్ అఫైర్స్ పేరుతో రెండు అంశాలను చేర్చారు.
  • మరో టాపిక్‌గా జనరల్ సైన్స్ నిత్య జీవితంలో దాని ప్రభావం, ఎస్ అండ్ టీ, ఐటీలో సమకాలీన పరిణామాలు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ మూడూ వేర్వేరుగా కనిపిస్తున్నప్పటికీ మొత్తం కరెంట్ అఫైర్స్ పరిధిలోకి వస్తాయని నిపుణుల అభిప్రాయం.
  • పరీక్ష జరిగే తేదీకి ఒక నెల ముందు నుంచి అంతకుముందు సంవత్సర కాలంలో జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ స్థాయిలో జరిగిన ముఖ్య పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి.
  • అంతర్జాతీయంగా జరిగిన సదస్సులు, సమావేశాలు, తీర్మానాలు, లక్ష్యాల గురించి తెలుసుకోవాలి.
  • ఇటీవల నిర్వహించిన బ్రిక్స్ సమావేశం, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వం తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.
  • సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి గత రెండేళ్ల కాలంలో భారత అంతరిక్ష ప్రయోగాలు, రక్షణ క్షిపణులు-ప్రయోగాలు గురించి తెలుసుకోవాలి.
  • జనరల్ సైన్స్‌కు సంబంధించి ధ్వని, కాంతి, అయస్కాంతత్వం, విద్యుత్, ఉష్ణం, యాంత్రికశాస్త్రం, గ్రహాలు, ఆధునిక భౌతికశాస్త్రం ఆయా అంశాలకు సంబంధించి శాస్త్రవేత్తలు, ఆవిష్కరణలు, నోబెల్ అవార్డు గ్రహీతలు గురించి తెలుసుకోవాలి. రసాయన శాస్త్రంలో లోహాలు, వాటి మిశ్రమాలు, ఆమ్లాలు, క్షారాలు, జడవాయువులు, నీరు, ఎరువులు, గాజు, రూపాంతరత, ప్లాస్టిక్ పదార్థాలు, సిమెంట్, వాయువులపై అవగాహన పెంచుకోవాలి. తద్వారా కోర్ సైన్స్‌లో సులువుగా రాణించొచ్చు.

హిస్టరీ
సిలబస్‌లో భారత జాతీయోద్యమం, ఆధునిక భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర అని పేర్కొన్నారు. ప్రాచీన భారత చరిత్ర నుంచి భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర వరకు అన్ని ముఖ్య ఘట్టాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. స్వాతంత్య్రోద్యమ కాలంలోని ముఖ్య ఒడంబడికలు, చట్టాలు, మొఘల్ సామ్రాజ్యం ముఖ్య అంశాలను చదవాలి.

పాలిటీ
ఏపీపీఎస్‌సీ కొత్త సిలబస్‌లో పాలిటీని.. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, రాజ్యాంగపరమైన అంశాలు, పబ్లిక్ పాలసీ, సంస్కరణలు, ఈ-గవర్నెన్స్ విధానాలు అని పేర్కొన్నారు. అభ్యర్థులు భారత రాజ్యాంగం - అధికరణలు - ప్రకరణలు- సవరణలు గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం. సవరణల విషయంలో సమకాలీన పరిణామాలు - రాజ్యాంగంలో అందుకు సంబంధించిన అధికరణలను బేరీజు వేసుకుంటూ.. ప్రిపరేషన్ సాగించాలి. తాజాగా న్యాయ వ్యవస్థ - శాసన వ్యవస్థ మధ్య తరచుగా సంభవిస్తున్న ఘర్షణాత్మక పరిస్థితులు (ఉదా: న్యాయమూర్తుల నియామకంలో జాప్యం, కొలీజియం వ్యవస్థ విషయంలో తలెత్తిన వివాదం తదితర) గురించి అధ్యయనం చేయాలి.

భారత ఆర్థికాభివృద్ధి
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారత్‌లో ఆర్ధిక అభివృద్ధి. పంచవర్ష ప్రణాళికలు- లక్ష్యాలు, అమలు తీరు - ఫలితం - ప్రభావం వంటివి తెలుసుకోవాలి. అంతేకాకుండా 1991లో ఆర్థిక సంస్కరణల గురించి ప్రధానంగా దృష్టి పెట్టాలి.

జాగ్రఫీ
ఆంధ్రప్రదేశ్, భారత భౌగోళిక శాస్త్రాలు రెండింటిపై పట్టు సాధించాలి. దేశంలో ముఖ్య నదులు, లోయ ప్రాంతాలు, పర్వతాలు, నదీ పరీవాహక ప్రాంతాలు - పంటలు గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించి మొత్తం 13 జిల్లాల స్వరూపంపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఆయా జిల్లాల్లో ముఖ్య పంటలు, చారిత్రక భౌగోళిక ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఆయా జిల్లాల్లో పంటలు పండే ప్రాంతాలు, ఓడ రేవులు, అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాల గురించి తెలుసుకోవాలి.

విపత్తు నిర్వహణ
విపత్తు నిర్వహణపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలి. విపత్తులకు కారణాలు, నివారణకు తీసుకుంటున్న చర్యలు, ఇటీవల సంభవించిన తుఫాన్లు, భూకంపాలు - వాటి ప్రభావాల గురించి తెలుసుకోవాలి. విపత్తు నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన సంస్థలు (నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తదితర) వాటి విధులపై అవగాహన తప్పనిసరి. అభ్యర్థులు దృష్టి పెట్టాల్సిన మరో అంశం పర్యావరణ పరిరక్షణ- సుస్థిరాభివృద్ధి మార్గాలు. ఉదాహరణకు రెన్యువబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ తదితర అంశాలు. వీటితోపాటు పర్యావరణ కాలుష్య కారకాలు - నివారణ చర్యలు - ఆయా పర్యావరణ సూచీలపై అవగాహన ఉండాలి.

డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ మెంటల్ ఎబిలిటీ
అభ్యర్థుల్లోని లాజికల్ థింకింగ్, మ్యాథమెటికల్ స్కిల్స్‌ను పరీక్షించే విభాగం ఇది. ఇందులో రాణించాలంటే.. నంబర్ సిరీస్; కోడింగ్ - డీ కోడింగ్; సీటింగ్ అరేంజ్‌మెంట్; ర్యాంకులు- అమరిక; అక్షరాలు- అక్షర క్రమంలో వాటి స్థానాలు; జంబుల్డ్ సెంటెన్సెస్ 1-100 వరకు ప్రధాన సంఖ్యలు; స్క్వేర్ రూట్; క్యూబ్ రూట్‌లు; వెన్ డయాగ్రమ్స్; నంబర్, వర్డ్ ఎనాలజీ; దిక్కులు; రక్త సంబంధాలు; కాలం-దూరం; పని-కాలం; లాభం - నష్టం; శాతాలు; సగటులు;స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నల కోసం విశ్లేషణ సామర్థ్యం పెంచుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనానంతర పరిణామాలు
  • కమల్‌నాథన్ కమిటీ సిఫార్సులు
  • రాజధాని నిర్మాణం చేపట్టిన ప్రాంతం ప్రాముఖ్యత
  • రాజధాని నిర్మాణానికి రూపొందించిన బడ్జెట్ అంచనాలు
  • తెలంగాణ రాష్ట్రంతో నెలకొన్న నదీ జల వివాదాలు. బ్రిజేష్ ట్రిబ్యునల్ పనితీరు, ఉత్తర్వులు - ఆదేశాలు గురించి తెలుసుకోవాలి.
  • ఉమ్మడి సంస్థలు (ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పదో షెడ్యూల్ సంస్థలు) విషయంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితి, వివాదాలకు కారణమవుతున్న పరిస్థితులు గురించి తెలుసుకోవాలి.
  • ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత రూపొందించిన పలు విధానాలు (ఐటీ పాలసీ, ఎకనామిక్ పాలసీ) గురించి గణాంక సహిత సమాచారంతో సిద్ధంగా ఉండాలి.
  • ప్రజా సంక్షేమ పథకాలు వాటి అమలు తీరు- లోపాలు - లక్ష్యాలపై అవగాహన తప్పనిసరి.
పేపర్-2లోని హిస్టరీ, కాన్‌స్టిట్యూషన్; పేపర్-3లోని ఎకానమీ అంశాలన్నీ కూడా జీఎస్ సిలబస్‌లో పేర్కొన్నారు. కాబట్టి అభ్యర్థులు పేపర్-1 ప్రిపరేషన్ సాగిస్తున్నప్పుడే.. పేపర్-2, పేపర్-3 సిలబస్‌లను బేరీజు వేసుకుంటూ చదవాలి. ఎకానమీ, పాలిటీ సబ్జెక్ట్‌ల పరంగా పలు సమకాలీన అంశాలను కంపేరిటివ్ అప్రోచ్‌తో అధ్యయనం చేయాలి.

రిఫరెన్స్ బుక్స్
  • ఎన్‌సీఈఆర్‌టీ ఆరు నుంచి పన్నెండో తరగతి పుస్తకాలు
  • తెలుగు అకాడమీ డిగ్రీ పుస్తకాలు, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్‌యూనివర్సిటీ పుస్తకాలు.
  • ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే
  • నేషనల్ శాంపుల్ సర్వే
  • స్టాండర్డ్ జీకే మెటీరియల్

పేపర్-2:
ఏపీ హిస్టరీపై ప్రత్యేక దృష్టి
  • పేపర్-2లో ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్రగా పేర్కొన్నారు. మొత్తం 150 మార్కులకు ఉండే పేపర్-2లో సెక్షన్-1గా ఏపీ హిస్టరీని పేర్కొని.. దీనికి 75 మార్కులు కేటాయించారు. ఇందులో మొత్తం ఐదు యూనిట్లుగా సిలబస్‌ను వర్గీకరించారు.
  • అలాగే సెక్షన్-2గా 75 మార్కులతో భారత రాజ్యాంగం - సమీక్ష పేరుతో పాలిటీ ఉంది. మొత్తం ఐదు యూనిట్లు ఉన్నాయి.

ఏపీ హిస్టరీ: ప్రిపరేషన్ వ్యూహాలు
ఐదు యూనిట్లలో మూడో యూనిట్ నుంచి ఆంధ్ర ప్రాంతంలో యూరోపియన్ల వర్తకం, ఆంధ్ర ప్రాంతంలో 1857 సిపాయిల తిరుగుబాటు, బ్రిటిష్ పాలన ఆవిర్భావం, సామాజిక, సాంస్కృతిక చైతన్యం, జస్టిస్ పార్టీ ఆవిర్భావం, ఆత్మగౌరవ ఉద్యమాలు, 1857 నుంచి 1947 వరకు ఆంధ్ర ప్రాంతంలో జాతీయోద్యమాలు, కమ్యూనిస్ట్‌లు, సోషలిస్ట్‌ల పాత్ర, జమీందారీ వ్యతిరేక, కిసాన్ వ్యతిరేక ఉద్యమాలు, నేషనలిస్ట్ పార్టీ అభివృద్ధి వంటివి చేర్చారు.
  • నాలుగో యూనిట్‌లో ఆంధ్ర ఉద్యమం,ఆంధ్ర మహాసభల పాత్ర, ప్రముఖ నేతలు, 1953లో ఆంధ్ర రాష్ట్ర అవతరణకు దారితీసిన సంఘటనలు, ఆంధ్ర ఉద్యమంలో పత్రికా మాధ్యమాల పాత్ర ప్రధానాంశాలుగా ఉన్నాయి.
  • చివరి యూనిట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులు, విశాలాంధ్ర మహాసభ, రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటు- సిఫార్సులు, పెద్దమనుషుల ఒప్పందం, 1956 నుంచి 2014 వరకు ముఖ్యమైన సామాజిక, సాంస్కృతిక సంఘటనలను సిలబస్‌లో పేర్కొన్నారు. ఐదు యూనిట్లలో.. మూడో యూనిట్ నుంచి ఆధునిక చరిత్రకు ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.
  • భారత జాతీయోద్యమంపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఆంధ్ర ప్రాంత ఉద్యమాలకు సంబంధించి ఆంధ్ర మహాసభల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు గురించి తెలుసుకోవడమే కాకుండా.. వారి ఆధ్వర్యంలో జరిగిన సభలు, సమావేశాలు గురించి అవగాహన ఏర్పరచుకోవాలి. అదేవిధంగా సామాజిక అభివృద్ధి దిశగా చేసిన ఉద్యమాలు (ఉదా: బాల్య వివాహ నిరోధం, తెలుగు మాధ్యమంలో బోధన, అంటరానితనం నిర్మూలన) వంటి వాటి గురించి తెలుసుకోవాలి.
  • విశాలాంధ్ర ఉద్యమానికి సంబంధించి రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం, పెద్దమనుషుల ఒప్పందంలోని కీలక ఘట్టాలు తెలుసుకోవాలి.
  • ఆంధ్రప్రదేశ్ ప్రాచీన చరిత్రకు సంబంధించి అభ్యర్థులు మొదటి రెండు యూనిట్లను బాగా అధ్యయనం చేయాలి.
  • శాతవాహనుల కాలం నుంచి తూర్పు చాళుక్యుల వరకూ.. అన్ని రాజ వంశాల హయాంలోని ముఖ్య ఘట్టాలు, కళలు, సాహిత్యాభివృద్ధికి చేసిన కృషి, ముఖ్యమైన నిర్మాణాలు -వాటి విశిష్టత (ఉదా: బౌద్ధ స్థూపాలు) గురించి పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి.
  • సిలబస్‌లో రెండో యూనిట్ ప్రకారం- 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం మధ్యలో ఆంధ్ర దేశాన్ని పాలించిన పలు రాజులు, రాజ్య వంశాలు, వాటి విశిష్టత తెలుసుకోవాలి.
  • చరిత్రకు సంబంధించి ముఖ్య ఘట్టాలు, పరిణామాలు, వ్యక్తుల గురించి చదివేటప్పుడు నేపథ్యం గురించి కూడా అవగాహన ఏర్పరచుకోవాలి. ఆన్సర్ టు కొశ్చన్ మాదిరిగా కాకుండా ఒక పరిణామానికి సంబంధించి దారితీసిన పరిస్థితులు, పర్యవసానాలు, కీలకపాత్ర వహించిన ముఖ్య వ్యక్తులు.. ఇలా అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి.

రిఫరెన్స్ బుక్స్
  • ఎన్‌సీఈఆర్‌టీ 6 నుంచి 12వ తరగతి పుస్తకాలు
  • బ్యాచిలర్ డిగ్రీ స్థాయి హిస్టరీ, పాలిటీ పుస్తకాలు
  • శ్రీకృష్ణ కమిటీ నివేదిక

పాలిటీ (పేపర్-2, సెక్షన్-2)
  • భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు; ప్రవేశిక; ప్రాథమిక విధులు; ప్రాథమిక హక్కులు; ఆదేశిక సూత్రాలు; భారత సమాఖ్య; విశిష్ట లక్షణాలు; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన; శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ పాత్రలపై లోతుగా అధ్యయనం చేయాలి.
  • పంచాయతీరాజ్ వ్యవస్థ; 73,74 రాజ్యాంగ సవరణలు-ప్రాముఖ్యత వంటి అంశాలపై దృష్టి సారించాలి. దీనికోసం డిగ్రీ ఫైనలియర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పుస్తకాలు చదవాలి.
  • కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో అవసరమైన సంస్కరణలు, ఆయా కమిషన్ల సిఫార్సులు (ఉదా: రాజ్‌మన్నార్ కమిటీ, సర్కారియా కమిషన్ తదితర) అధ్యయనం చేయాలి.
  • రాజ్యాంగబద్ధ సంస్థలు (యూపీఎస్‌సీ, కాగ్, ఫైనాన్స్ కమిషన్) గురించి, వాటి పనితీరు, వాటి ఏర్పాటు గురించి తెలుసుకోవాలి.
  • జాతీయ, ప్రాంతీయ పార్టీలు, ప్రభుత్వాల ఏర్పాటుపై ప్రభావం గురించి చదవాలి.
  • ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అంశం.. చిన్న రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్. దీనివల్ల కలిగే లాభనష్టాల గురించి తెలుసుకోవాలి.
  • ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు నుంచి సిఫార్సుల వరకు.. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తీరు వరకు పూర్తి పరిజ్ఞానం అవసరం.
  • ఆయా రాజ్యాంగ పదవులు (రాష్ట్రపతి, గవర్నర్), నియామకం తీరుతెన్నులు, పాలన ఆ హోదాల ప్రభావం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
  • తాజాగా రాజ్యాంగ సవరణల ద్వారా రూపొందిన కొత్త చట్టాలపై అవగాహన కూడా మేలు చేస్తుంది.

పేపర్-3
ఇండియా అండ్ ఏపీ ఎకానమీ
గ్రూప్-2 పరంగా అభ్యర్థులు కొంత ఆందోళనకు గురయ్యే సబ్జెక్ట్ ఎకానమీ. దీన్ని పేపర్-3 గా పేర్కొన్నారు.
  • పేపర్-3ని రెండు సెక్షన్లు (ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ ఎకానమీ; ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ)గా వర్గీకరించారు. ఒక్కో సెక్షన్‌కు కేటాయించిన మార్కులు 75. మొత్తం 150 మార్కులకు ఈ పేపర్-3 ఉంటుంది.
  • సెక్షన్-1గా భావించే ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ ఎకానమీ విషయంలో అభ్యర్థులు సిలబస్ పరిధిని గమనిస్తూ ప్రిపరేషన్ సాగించాలి.
  • భారత్‌లో పంచవర్ష ప్రణాళికలు- వాటి లక్ష్యాలు- ఫలితాలు - వైఫల్యాల గురించి అధ్యయనం చేయాలి.
  • 1991 ఆర్థిక సంస్కరణల గురించి, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి.
  • భారత ఆర్థిక వ్యవస్థ పరంగా తాజా పరిణామాలు (ఉదా: ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటు, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు) గురించి పూర్తిగా అధ్యయనం చేయాలి.
  • ఆర్థిక విధానాల కోణంలో 1956 నుంచి అమలు చేసిన పారిశ్రామిక విధానాలు, ఆర్‌బీఐ ఏర్పాటు - విధి విధానాలు, నూతన విదేశీ వాణిజ్య విధానం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి తెలుసుకోవాలి.
  • సహజ వనరుల లభ్యత, ఆర్థికాభివృద్ధి దిశగా అవి దోహదపడుతున్న తీరుపై అధ్యయనం చేయాలి.
  • కోర్ ఎకానమీకి సంబంధించి ద్రవ్యం, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్‌ల నిర్వచనాలు - సిద్ధాంతాలు తెలుసుకోవాలి.
  • జాతీయాదాయ భావనలు, జీడీపీ, తలసరి ఆదాయం వంటి బేసిక్ కాన్సెప్ట్‌లపై పూర్తి అవగాహన అవసరం.
  • వీటికితోడు ఆర్థిక రంగంలో తాజా పరిణామాల గురించి కూడా అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత నెలకొంది.
  • పార్లమెంట్ ఆమోదం పొందిన జీఎస్‌టీ బిల్లు, దాని నేపథ్యం, తీరుతెన్నులు తెలుసుకోవాలి.
  • 2011 జనగణనపై అవగాహన మరింత మేలు చేస్తుంది.
  • ఇండియన్ ఎకానమీ పరంగా అభ్యర్థులు మరింత పట్టు సాధించేందుకు ఆర్థిక సంఘం సిఫార్సులు, తాజా బడ్జెట్ గణాంకాలు, సహజ వనరుల లభ్యత వాటి వల్ల లభిస్తున్న ఆదాయం- జీడీపీలో వాటి వాటా వంటి అంశాలను లోతుగా అధ్యయనం చేయాలి.

రిఫరెన్స్ బుక్స్
ఎన్‌సీఈఆర్‌టీ హైస్కూల్ స్థాయి పుస్తకాలు.
బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఎకానమీ పాఠ్యపుస్తకాలు
2011 జనాభా గణాంకాలు
2014-15, 2015-16 ఏపీ బడ్జెట్ సమగ్ర అధ్యయనం
తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాలు

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ (పేపర్-3; సెక్షన్-2)
ఏపీపీఎస్‌సీ కొత్త సిలబస్ నేపథ్యంలో అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన విభాగం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ.
మొత్తం ఐదు యూనిట్లుగా సిలబస్‌ను వర్గీకరించిన ఈ సెక్షన్‌లో రాణించాలంటే.. సహజ వనరుల లభ్యత మొదలు సామాజిక ఆర్థిక సంక్షేమ పథకాల వరకు అన్నిటి నీ అధ్యయనం చేయాలి.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వనరులు, అవి లభించే ప్రాంతాలు, పంటలు, దిగుబడి కారకాలు గురించి తెలుసుకోవాలి.
  • ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో పంచవర్ష ప్రణాళికల అమలు తీరుతెన్నులను అధ్యయనం చేయాలి.
  • ప్రజా పంపిణీ వ్యవస్థ - లక్ష్యాలు - లోపాలు - అధిగమించే మార్గాల గురించి అవగాహన ఉండాలి.
  • కుటీర పరిశ్రమల అభివృద్ధి వాటి ద్వారా కలిగే సామాజిక ఆర్థిక అభివృద్ధి, సహకార సంస్థల పాత్రపై అవగాహన పొందాలి.
  • వీటితోపాటు తాజాగా సమకాలీన అంశాలతో సమ్మిళితమైన అంశాలపైన అధ్యయనం కూడా ఎంతో అవసరం.
  • విద్యుత్, రవాణా-కమ్యూనికేషన్, పర్యాటక రంగం, ఇన్ఫర్మేషన్ రంగం వంటి సేవా రంగానికి చెందిన సంస్థల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయడంతోపాటు ఇటీవల కాలంలో వాటి పనితీరుపై అవగాహన ఏర్పరచుకోవాలి.
  • ఎకానమీలో పట్టు సాధించడం కోసం అభ్యర్థులు మానవాభివృద్ధి సూచీల్లోని వివిధ ఇండికేటర్స్ పరిశీలించాలి.
  • రాష్ట్రంలో లింగ నిష్పత్తి, ఉద్యోగిత రేటు, నిరుద్యోగం పెరగడానికి కారణాలు అధ్యయనం చేయాలి.
  • కేవలం గణాంకాల సేకరణకే పరిమితం కాకుండా.. సంబంధిత పథకాలు, విధానాలతో అన్వయం చేస్తూ ప్రిపరేషన్ సాగించడం ఎంతో మేలు చేస్తుంది.
  • రాష్ట్ర ఆర్థిక సర్వే గణాంకాలు, కేంద్ర ఆర్థిక సర్వే గణాంకాల్లో రాష్ట్రాల వారీగా పేర్కొన్న గణాంకాలు సేకరించి ఔపోసన పట్టాలి.
Published date : 09 Nov 2016 04:39PM

Photo Stories