Skip to main content

గ్రూప్-1 ముసాయిదా సిలబస్... పరీక్ష విధానంలో మార్పులు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ).. లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఎంతో ఆశగా ఎదురుచూసే గ్రూప్-1 పరీక్ష విధానంతోపాటు సిలబస్‌లో అనూహ్య మార్పులకు రంగం సిద్ధం చేసింది.
ఈ దిశగా గ్రూప్-1 సిలబస్ ముసాయిదాను ఇటీవల కమిషన్ వెబ్‌సైట్లో పొందుపరిచింది. ఆగస్టు 3లోగా పోస్టు ద్వారా సూచనలు, సలహాలను పంపొచ్చని పేర్కొంది. అయితే ఈ ముసాయిదా సిలబస్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లతోపాటు మెయిన్స్‌లోనూ సిలబస్ భారీగా పెంచడంపై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక గ్రూప్ 1 పోస్టులు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, సగటు అభ్యర్థులకు అందని ద్రాక్షగా మారే ఆస్కారముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ తాజాగా విడుదలచేసిన గ్రూప్-1 ముసాయిదా పరీక్ష విధానం, సిలబస్ గురించి తెలుసుకుందాం...?

ప్రిలిమ్స్ :
ప్రస్తుత విధానం:
గ్రూప్-1 ప్రిలిమ్స్ (స్క్రీనింగ్ టెస్ట్)ను 150 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఒకే పేపర్‌గా నిర్వహిస్తున్నారు. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేరుతో నిర్వహించే ఈ పరీక్షలో కరెంట్ అఫైర్స్; వరల్డ్, ఇండియా, ఏపీ జాగ్రఫీ; ఇండియన్ హిస్టరీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఏపీ పునర్‌వ్యవస్థీకరణ; డేటా అనాలసిస్; లాజికల్ రీజనింగ్ వంటి మొత్తం 14 అంశాల నుంచి ప్రశ్నలు అడిగేవారు.

ముసాయిదా విధానం:
ప్రతిపాదిత నూతన విధానంలో ప్రిలిమ్స్ రెండు పేపర్లుగా ఉండనుంది. ప్రస్తుతం ఉన్న జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్‌ను రెండుగా విడగొట్టి.. జనరల్ స్టడీస్ పేపర్‌ను 120 మార్కులకు; జనరల్ ఆప్టిట్యూడ్ పేపర్‌ను 120 మార్కులకు నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్‌లో కొత్త విధానం పరంగా మరో కీలక మార్పు.. విభాగాల వారీగా మార్కుల కేటాయింపు. జనరల్ స్టడీస్ పేపర్‌ను హిస్టరీ, కల్చర్; కాన్‌స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్; ఇండియా, ఏపీ ఎకానమీ, ప్లానింగ్; జాగ్రఫీ.. ఇలా నాలుగు విభాగాలుగా విభజించి... ఒక్కో విభాగానికి 30 మార్కుల చొప్పున కేటాయించారు. అలాగే ప్రిలిమ్స్ పేపర్ 2 జనరల్ ఆప్టిట్యూడ్‌లో జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్‌కు 60 మార్కులు; సైన్స్ అండ్ టెక్నాలజీకి 30 మార్కులు; కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్‌కు 30 మార్కులు కేటాయించారు. ప్రతి విభాగంలోనూ సిలబస్ విస్తృతంగా ఉంది. ప్రిలిమ్స్‌లో ఇంతటి భారీ స్థాయిలో సిలబస్‌ను ప్రవేశ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

మెయిన్స్‌లో ఏడు పేపర్లు :
గ్రూప్ 1 మెయిన్స్ పాత విధానంలో ఇంగ్లిష్ పేపర్‌తో కలిపి మొత్తం 6 పేపర్లు ఉండేవి. ఇప్పుడు కొత్తగా తెలుగు పేపర్‌ను చేర్చడంతో మెయిన్స్ పేపర్ల సంఖ్య ఏడుకు పెరిగింది. తెలుగు, ఇంగ్లిష్ పేపర్లలో విభాగాల వారీగా మార్కులు కేటాయించారు. అయితే ఈ రెండింటిని కేవలం అర్హత పేపర్లుగానే పరిగణిస్తారు.

ఇంగ్లిష్ :
ఈ పేపర్ 150 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు.

విభాగాల వారీగా వెయిటేజీ

అంశం

మార్కులు

ఎస్సే

20

లెటర్ రైటింగ్

10

ప్రెస్ రిలీజ్/అప్పీల్

10

రిపోర్ట్ రైటింగ్

15

రైటింగ్ ఆన్ విజువల్ ఇన్ఫర్మేషన్

15

ఫార్మల్ స్పీచ్

15

ప్రెసిస్ రైటింగ్

15

రీడింగ్ కాంప్రెహెన్షన్

15

ఇంగ్లిష్ గ్రామర్

20

ట్రాన్స్‌లేషన్

15

తెలుగు

అంశం

మార్కులు

ఎస్సే

20

టు ఎలాబరేట్ ది థాట్ ఆఫ్ పోయెటిక్/వెర్స్

10

ప్రెసిస్ రైటింగ్

10

కాంప్రెహెన్షన్

10

ఫార్మల్ స్పీచ్

10

మీడియా పబ్లిసిటీ కోసం

స్టేట్‌మెంట్‌ల తయారీ

10

లెటర్ రైటింగ్

10

డిబేట్ రైటింగ్

10

అప్లికేషన్ రైటింగ్

10

రిపోర్ట్ రైటింగ్

10

డైలాగ్ రైటింగ్

10

ట్రాన్స్‌లేషన్

10

తెలుగు వ్యాకరణం

20


పేపర్-1
ప్రస్తుత విధానం:

ప్రస్తుత విధానం ప్రకారం మూడు విభాగాల నుంచి మూడు ఎస్సేలు రాయాలి. ఒక్కో ఎస్సేకు 50 మార్కులు కేటాయించారు. సెక్షన్-1లో క్రైసిస్ మేనేజ్‌మెంట్, సోషియల్, ఎకనామిక్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్, అనాలసిస్ అండ్ సొల్యూషన్స్, కన్‌ఫ్లిక్ట్ రెజుల్యూషన్, డెసిషన్ మేకింగ్, ఎకలాజికల్ ఇంటెలిజెన్స్ ఉంటే... రెండో సెక్షన్‌లో కరెంట్ ఈవెంట్స్, పాలసీస్, స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంశాలను పొందుపరిచారు. మూడో విభాగంలో కరెంట్ ఈవెంట్స్, పాలసీస్, స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.

ముసాయిదా విధానం :
కొత్తగా ప్రతిపాదించిన సిలబస్‌లో వర్తమాన వ్యవహారాలు; సామాజిక, రాజకీయ అంశాలు; సామాజిక ఆర్థిక అంశాలు; సామాజిక పర్యావరణ అంశాలు; సంస్కృతి, చారిత్రక అంశాలు; పౌర స్పృహకు సంబంధించిన అంశాలు; మననశీల (రిఫ్లెక్టివ్) అంశాలను పేర్కొన్నారు. వీటినుంచి మూడు సెక్షన్లలో ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థి ఒక్కో దాన్నుంచి ఒక ఎస్సే రాయాలి. ప్రతి ఎస్సేను దాదాపు 800 పదాల్లో రాయాల్సి ఉంటుంది. మొత్తం మార్కులు 150.

పేపర్-2 :
ప్రస్తుత విధానం :
ప్రస్తుతం పేపర్ 2లో భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం (20వ శతాబ్దంపై ప్రత్యేక దృష్టితో); ఆంధ్రప్రదేశ్ సాంఘిక, సాంస్కృతిక చరిత్ర; భారత రాజ్యాంగ పరిశీలన విభాగాలు ఉన్నాయి. మొత్తం మార్కులు 150.

ముసాయిదా విధానం :
మెయిన్స్ పేపర్-2లో భారతదేశ చరిత్ర, సంస్కృతి; ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి; భారతదేశ, ఆంధ్రపదేశ్ భౌగోళిక అంశాలు ఉన్నాయి.
మొత్తం మార్కులు 150.

పేపర్-3 :
ప్రస్తుత విధానం :
ప్రస్తుత ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పేపర్ 3లో భారత్‌లో ప్రణాళికలు; ఆర్థిక వ్యవస్థ; స్వాతంత్య్రానంతరం ఏపీలో భూ సంస్కరణలు, సామాజిక మార్పులు; ఏపీ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి, బలాలు, బలహీనతలు అంశాలు ఉన్నాయి. మొత్తం మార్కులు 150.

ముసాయిదా విధానం :
తాజాగా ప్రకటించిన ముసాయిదా విధానంలో పేపర్-3లో ఇండియన్ పాలిటీ, కాన్‌స్టిట్యూషన్; గవర్నెన్స్; లా అండ్ ఎథిక్స్ అంశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ పేపర్‌లో కొత్తగా చేర్చిన హ్యుమాన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లా ఇన్ ఇండియా అంశాలు పూర్తిగా కొత్తవి. ప్రస్తుతం ఎథిక్స్ అంశాలు సివిల్స్ సిలబస్‌లో ఉన్నాయి. వీటి సిలబస్ విస్తృతంగా ఉండటం గమనార్హం. మొత్తం మార్కులు 150.

పేపర్-4 :
ప్రస్తుత విధానం :
ప్రస్తుత విధానంలో పేపర్-4 సిలబస్‌లో భారత అభివృద్ధిలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర; వృక్ష, జంతు వనరులు; వ్యాధులు; జెనిటిక్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ; టీకాలు; ఆవరణ, సహజ వనరులు; పర్యావరణ సమస్యలు ఉన్నాయి. మొత్తం మార్కులు 150.

ముసాయిదా విధానం :
తాజాగా ప్రకటించిన ముసాయిదా విధానంలో పేపర్-4లో ‘ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా అండ్ అంధ్రప్రదేశ్’ను సిలబస్‌గా పేర్కొన్నారు. ఈ పేపర్‌లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పారిశ్రామిక విధానం, మౌలిక వసతులు, పెట్టుబడి విధానాలు, వనరుల సమీకరణ, సమ్మిళత వృద్ధి తదితర అంశాలను ప్రత్యేకంగా పొందుపరిచారు. గతంలో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ సిలబస్‌లో ప్రణాళికలు, భూసంస్కరణలు, సామాజిక మార్పులు తదితర అంశాలకు ప్రాధాన్యం ఉండేది. కానీ, ఈసారి ఎకానమీ సిలబస్‌ను బాగా విస్తరించారు. దాంతో ఇప్పటివరకూ గ్రూప్-1 కోచింగ్ తీసుకుంటూ, ప్రిపేర్ అవుతూ వస్తున్న విద్యార్థులు... తమ ప్రిపరేషన్ ధోరణిని మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇది ఒకరకంగా అభ్యర్థులపై అధికభారమేనని నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తం మార్కులు 150.

పేపర్-5 :
ప్రస్తుత విధానం:
ప్రస్తుత విధానంలో పేపర్-5లో డేటా అప్రిసియేషన్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్; క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ ప్రాబ్లం సాల్వింగ్ పరిధిలో డేటా అనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ ఆఫ్ డయాగ్రామాటిక్ డేటా; లాజికల్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ ప్యాసేజ్ అనాలసిస్ సిలబస్‌లో కీలకాంశాలుగా ఉన్నాయి. మొత్తం మార్కులు 150.

ముసాయిదా విధానం :
సైన్స్ అండ్ టెక్నాలజీగా పేర్కొన్న పేపర్- 5లో టెక్నాలజీ, ఇన్నోవేషన్; ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఈ-గవర్న్‌నెన్స్ ఇన్ ఇండియా, సైబర్ నేరాలు; భారత అంతరిక్ష కార్యక్రమం; డీఆర్‌డీవో; భారత శక్తి అవసరాలు, వివిధ రకాల శక్తి వనరులు; అభివృద్ధి- పర్యావరణం; పర్యావరణ చట్టాలు; బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ , వ్యాధులు, మేధో సంపత్తి హక్కులు తదితర కీలక అంశాలతో సిలబస్ అత్యంత విస్తృతంగా ఉంది. మొత్తం మార్కులు 150.

భిన్నాభిప్రాయాలు...
ఏపీపీఎస్సీ ముసాయిదా సిలబస్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రిలిమ్స్ పేపర్-2లో కొత్తగా చేర్చిన భావోద్వేగ ప్రజ్ఞ, సహానుభూతి, నిర్ణయం తీసుకొనే సామర్థ్యం, సామాజిక ప్రజ్ఞ వంటి అంశాల పట్ల అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎందుకంటే... ప్రస్తుతం ఆయా అంశాలకు మార్కెట్లో పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేవు. కాబట్టి అభ్యర్థులు కోచింగ్ సెంటర్లను ఆశ్రయించక తప్పని పరిస్థితులు తలెత్తుతాయి. ఇది ఆర్థికంగా అభ్యర్థులను ఇబ్బంది పెట్టే అంశమే. దీంతోపాటు మెయిన్స్‌లోనూ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీకి సంబంధించి సిలబస్‌లో పేర్కొన్న కొత్త అంశాలు; అలాగే ఎథిక్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్, బేసిక్ నాలెడ్జ్ లా ఇన్ ఇండియా వంటి అంశాలకు ప్రిపరేషన్ కోసం మెటీరియల్, కోచింగ్ పరంగా అభ్యర్థులు ఎన్నో వ్యయ ప్రయాసలను ఎదుర్కోవాల్సి ఉంటుందనే వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా మొత్తం గ్రూప్-1 పరీక్ష విధానం, విస్తృత సిలబస్ అంశాలు సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే పట్టణ ప్రాంత అభ్యర్థులకు అనుకూలంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాంతో గ్రూప్-1 పోస్టులు కోరుకునే గ్రామీణ ప్రాంత పేద విద్యార్థుల ఆశలపై కొత్త విధానం నీళ్లు చల్లేవిధంగా ఉందంటున్నారు.

నిపుణుల సలహాలు..
  1. ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రతిపాదిత సిలబస్ గతంతో పోల్చితే విస్తృతంగా ఉంది కాబట్టి, ఔత్సాహికులు తాజా సిలబస్‌ను ఆసాంతం అధ్యయనం చేయాలి. పూర్తిగా విశ్లేషించాలి. తద్వారా తుది సిలబస్ పరంగా ఒక అవగాహనకు రావొచ్చు.
  2. గతంతో పోల్చితే సిలబస్ పరిధి బాగా పెరిగింది. కొత్తగా చేర్చిన ఏ అంశాల నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయో ఇప్పుడే చెప్పలేం! కాబట్టి అభ్యర్థులు సాధ్యమైనంత ముందుగా ప్రిపరేషన్ ప్రారంభించి సిలబస్ ఆశాంతం లోతుగా చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి.
  3. సిలబస్ తీరును పరిశీలిస్తే కాన్సెప్ట్యువల్ ఆధారితంగా అనిపిస్తోంది. కాబట్టి అభ్యర్థులు ఆయా అంశాల్లో పూర్తిస్థాయి విషయావగాహన పెంపొందించుకోవాలి.
  4. కొత్త సిలబస్‌లో పేర్కొన్న ఉద్వేగ ప్రజ్ఞ, సహానుభూతి, ఒత్తిడిని తట్టుకోగలగడం, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సృజనాత్మక ఆలోచన, సాంఘిక ప్రజ్ఞ వంటి అంశాలపై దృష్టిసారించాలి.
రాష్ట్ర అంశాలకు తగిన ప్రాధాన్యమివ్వాలి...
ఏపీపీఎస్సీ తాజాగా అందుబాటులోకి తెచ్చిన గ్రూప్ 1 సిలబస్ ముసాయిదాను పరిశీలిస్తే.. సిలబస్ పరిధి అనూహ్యంగా పెరిగిందని చెప్పొచ్చు. దీంతోపాటు సిలబస్‌లో చేర్చిన ఉద్వేగ ప్రజ్ఞ, సహానుభూతి, సాంఘిక ప్రజ్ఞ, సృజనాత్మక ఆలోచన, ఇంటర్ పర్సనల్ స్కిల్ వంటి అంశాలు గ్రామీణ విద్యార్థులకు ఇబ్బంది కలిగించేవిగా భావించొచ్చు. ఆయా అంశాలకు సరైన పుస్తకాలు అందుబాటులో లేకపోవడంతో కోచింగ్ సెంటర్లను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది గ్రూప్-1 అభ్యర్థులను ఆర్థికంగా ఇబ్బంది పెట్టే అంశమే! అయితే ఆయా అంశాలు పాలనలో మెరుగైన పనితీరును ప్రదర్శించేందుకు దోహదపడే అవకాశముంది. కానీ, ఇక్కడొచ్చే సమస్య ఏమిటంటే.. ఆయా అంశాల్లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు ఒకే కచ్చితమైన సమాధానం ఉండదు. అలాంటప్పుడు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే ఆస్కారముంది. సిలబస్‌లో కాలానుగుణంగా మార్పులు చేయటాన్ని తప్పుబట్టలేం! కానీ, ఆయా మార్పులు హేతుబద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. తాజాగా ప్రకటించిన సిలబస్‌లోని లేబర్ లా, సివిల్ లా, సైబర్ లా, ట్యాక్స్ లా వంటి అంశాలు అహేతుకంగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రిలిమినరీ పరీక్షలోని రెండు పేపర్లలో అంతర్జాతీయ అంశాలను ప్రస్తావించారు. సిలబస్ పరంగా దీన్ని పునరుక్తిగా చెప్పొచ్చు. ఎకానమీ విషయానికి వస్తే... తాజాగా జాతీయ ఆదాయం టాపిక్‌ను సిలబస్ నుంచి తొలగించారు. దీంతోపాటు ఎకానమీ సిలబస్‌ను బాగా విస్తృతం చేశారు. అదే విధంగా ఎకానమీలో సిద్ధాంతాలు, థియరీ పోర్షన్‌ను మరింత తగ్గించి.. సమకాలీన అంశాలకు ప్రాధాన్యం పెంచాలి. తాజా ముసాయిదా సిలబస్.. సివిల్స్ విద్యార్థులకు అనుకూలమనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. గ్రూప్-1 సర్వీస్ ప్రధానంగా రాష్ట్ర స్థాయి పరీక్ష కాబట్టి రాష్ట్ర అంశాలకు తగిన వెయిటేజీ ఇవ్వడం ఉత్తమం.
- బి.కృష్ణారెడ్డి, పోటీ పరీక్షల శిక్షణ నిపుణులు.
Published date : 02 Aug 2018 05:13PM

Photo Stories