Skip to main content

ఏపీపీఎస్సీ గూప్స్ నూతన సిలబస్..ప్రిపరేషన్ శైలి

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1, 2, 3, 4.. ఇలా కేటగిరీ ఏదైనా.. నోటిఫికేషన్ కోసం వేచి చూస్తూ.. నిరుద్యోగులు ఏళ్ల తరబడి ప్రిపరేషన్ సాగిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో ‘గ్రూప్స్’ సిలబస్‌లో భారీ మార్పులు చేస్తూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకుంది! గ్రూప్-1, 2లో పరీక్ష విధానంతోపాటు నూతన సిలబస్‌ను సిద్ధం చేసింది. దాంతో.. ఒకవైపు నోటిఫికేషన్ల కోసం ఎదరుచూస్తూ ఏళ్ల తరబడి చదువుతూ.. శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థుల్లో సిలబస్ భారంగా ఉందనే ఆందోళన నెలకొంది! మరోవైపు సిలబస్ ప్రకటనతో సరిపెట్టి... నోటిఫికేషన్‌లు అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న వైనంపై గ్రూప్స్ అభ్యర్థుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2 కొత్త సిలబస్ పెనుభారంగా మారిన పరిస్థితి.. ప్రిపరేషన్ శైలిని మార్చుకుంటూ.. అభ్యర్థులు ఎలా నెట్టుకురావాలో తెలిపే విశ్లేషణాత్మక కథనం...

‘గ్రూప్-1 తాజా సిలబస్‌ను పరిశీలిస్తే.. సివిల్స్ తరహాలో రూపొందించినట్లు స్పష్టమవుతోంది. గ్రూప్-1 ప్రిలిమ్స్, మెయిన్స్ సిలబస్‌ను పెంచడంతోపాటు, కొత్త పేపర్లను చేర్చడం వల్ల అభ్యర్థులకు ప్రిపరేషన్ పరంగా పెనుభారంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే పరిస్థితి గ్రూప్-2లో కూడా ఉంది. దాంతో అభ్యర్థులు ఆయా అంశాలను ప్రాథమిక భావనలు మొదలు సమకాలీన అంశాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగాలని నిపుణులు సూచిస్తున్నారు. స్థూలంగా చెప్పాలంటే.. కొత్త సిలబస్ భారం అనేది నిస్సందేహం.

సిలబస్ మార్పు.. రెండోసారి
వాస్తవానికి.. తెలుగు రాష్ట్రాల పునర్విభజన తర్వాత ఏపీపీఎస్సీ 2016లో గ్రూప్-1, 2లకు కొత్త సిలబస్ రూపొందించింది. అప్పటినుంచి అభ్యర్థులు తదుపరి నోటిఫికేషన్లను దృష్టిలో పెట్టుకుని ఆ సిలబస్‌నే అనుసరిస్తూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ఏడాది క్రితం యూపీఎస్‌సీ అన్ని రాష్ట్రాల సర్వీస్ కమిషన్లతో నిర్వహించిన సమావేశంలో.. జాతీయ స్థాయిలో ఉమ్మడి సిలబస్ విధానం అనుసరిస్తే బాగుంటుందని తీర్మానించింది. 70 శాతం జాతీయ స్థాయి అంశాలు.. 30 శాతం అంశాలు ఆయా స్థానిక ప్రాంత పరిస్థితులకు సంబంధించినవిగా ఉండాలని సిఫార్సు చేసింది. దీనికి అనుగుణంగానే తాజా సిలబస్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే గ్రూప్స్‌పై ఆశలు పెట్టుకొని చదివే గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు సివిల్స్ స్థాయి విస్తృత సిలబస్‌ను ఆకళింపు చేసుకోవడం కష్టసాధ్యమంటున్నారు. ఫలితంగా గ్రూప్స్ ఉద్యోగాలు సైతం సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే పట్టణ ప్రాంత అభ్యర్థులు, ఇంగ్లిష్‌పై పట్టున్న వారికే దక్కే అవకాశముందనే వాదన వినిపిస్తోంది.

గ్రూప్-1 ప్రిలిమ్స్.. రెండు పేపర్లు :
ఇప్పటి వరకు గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో ఒకే పేపర్ 150 మార్కులకు ఉండేది. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంశాలు ఉండేవి. కానీ కొత్త సిలబస్ ప్రకారం.. జనరల్ స్టడీస్ ఒక పేపర్, జనరల్ ఆప్టిట్యూడ్ పేరుతో మరో పేపరు.. ఇలా రెండు పేపర్లుగా విభజించారు. ఒక్కో పేపర్‌కు 120మార్కులు చొప్పున మొత్తం 240 మార్కులకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. జనరల్ ఆప్టిట్యూడ్ పేపర్ మన విద్యార్థులకు అదనపు భారం. ఇందులోని సైకలాజికల్ ఎబిలిటీస్ పూర్తిగా కొత్త అంశం. ప్రిలిమ్స్‌లో రెండో పేపర్‌పై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

గ్రూప్-1 మెయిన్స్.. ఏడు పేపర్లు
గ్రూప్-1 మెయిన్స్‌లో సిలబస్‌లో భారీ మార్పులు జరిగాయనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు గ్రూప్-1 అర్హత పరీక్ష ఇంగ్లిష్‌తోపాటు.. అయిదు పేపర్లుగా ఉండేది. తాజా పరీక్ష విధానం ప్రకారం మెయిన్స్ పరీక్షలో మొత్తం ఏడు పేపర్లు ఉంటాయి. కొత్తగా అర్హత పరీక్షగా ఇంగ్లితోపాటు తెలుగును కూడా చేర్చారు. అంటే.. రెండు లాంగ్వేజ్ పేపర్లు(ఇంగ్లిష్, తెలుగు)తోపాటు ఐదు కంపల్సరీ పేపర్లు రాయాల్సి ఉంటుంది. ఈ మార్పును చూస్తుంటే.. సివిల్స్ తరహాలో ఇంగ్లిష్, రీజనల్ లాంగ్వేజ్ పేపర్ల విధానాన్ని అనుసరించినట్లు స్పష్టమవుతోందని సబ్జెక్ట్ నిపుణులు అంటున్నారు.

జనరల్ ఇంగ్లిష్ :
గ్రూప్1 మెయిన్స్‌లో జనరల్ ఇంగ్లిష్ అర్హత పేపర్‌గా అమలవుతున్న విషయం తెలిసిందే. సిలబస్ మార్పులో భాగంగా ఎస్సే, లెటర్ రైటింగ్, ప్రెస్ రిలీజ్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, రైటింగ్ ఆన్ విజువల్ ఇన్ఫర్మేషన్, ఫార్మల్ స్పీచ్, ప్రెసిస్ రైటింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్, ఇంగ్లిష్ గ్రామర్, ట్రాన్స్‌లేషన్ తదితర పది విభాగాలను పేర్కొని ఒక్కో విభాగానికి నిర్దిష్టంగా మార్కులు కేటాయించారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని.. అభ్యర్థులు బేసిక్ గ్రామర్ నైపుణ్యాలతోపాటు, ఇంగ్లిష్ దినపత్రికలు, వాటిలో వచ్చే వ్యాసాలు, పత్రికా ప్రకటనలను చదవడం మేలు చేస్తుంది. అర్హత పరీక్ష అని అభ్యర్థులు దీన్ని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఇందులో అర్హత మార్కులు సాధించకుంటే.. తప్పనిసరి పేపర్లను పరిగణనలోకి తీసుకోరనే విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలి.

కొత్తగా.. తెలుగు పేపర్
గ్రూప్-1 సిలబస్‌లో కొత్తగా తెలుగు పేపర్‌ను చేర్చడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దీన్ని కూడా అర్హత పేపర్‌గానే పేర్కొన్నారు. తెలుగు సిలబస్‌లోనూ 13 అంశాలను చేర్చారు. అవి.. ఎస్సే; పొయెటిక్ థాట్,ప్రెసిస్ రైటింగ్, కాంప్రహెన్షన్, ఫార్మల్ స్పీచ్, మీడియా స్టేట్‌మెంట్ రూపొందించడం; లెటర్ రైటింగ్, డిబేట్ రైటింగ్, అప్లికేషన్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, డైలాగ్ రైటింగ్/డైలాగ్ స్కిల్స్, ట్రాన్స్‌లేషన్, తెలుగు వ్యాకరణం అంశాలున్నాయి. అభ్యర్థుల్లో తెలుగు భాషపై ఉన్న పట్టును పరిశీలించడంతోపాటు.. విధి నిర్వహణ పరంగా పలు అంశాలకు సంబంధించి నివేదికలు, ప్రకటనలు రూపొందించడంలో ఉన్న పరిజ్ఞానాన్ని తెలుసుకునే ఉద్దేశంతో ఈ పేపర్‌ను చేర్చారు. ఈ పేపర్ విషయంలో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు దీనిపై దృష్టిపెట్టని అభ్యర్థులు.. సరైన మెటీరియల్ లభ్యత లేక ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఇది కూడా సివిల్స్‌కు ప్రిపరేషన్ సాగిస్తున్న అభ్యర్థులకు కలిసొచ్చే అంశంగా నిపుణులు పేర్కొంటున్నారు. సివిల్స్‌లో ఉండే రీజనల్ లాంగ్వేజ్ తరహాలో ఈ పేపర్‌ను పరిగణించొచ్చని వారంటున్నారు. గ్రూప్స్‌నే లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులు దినపత్రికలను చదవడం, తెలుగు వ్యాకరణంపై పట్టు సాధించేందుకు కృషి చేయాలని సూచిస్తున్నారు.

పేపర్-1 (జనరల్ ఎస్సే) :
పేపర్-1ను జనరల్ ఎస్సేగా యథాతథంగా పేర్కొన్నారు. ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్, సామాజిక-రాజకీయ అంశాలు; సామాజిక-ఆర్థిక అంశాలు; సామాజిక-పర్యావరణ అంశాలు; సంస్కృతి-చరిత్ర సంబంధిత అంశాలు; సామాజిక అవగాహనకు సంబంధించిన అంశాలు; ప్రస్తుతం ప్రభావితం చేస్తున్న అంశాలు(రిఫ్లెక్టివ్ ఇష్యూస్) అని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ పేపర్‌ను మూడు సెక్షన్లుగా 150 మార్కులకు నిర్వహించనున్నారు. ఒక్కో సెక్షన్ నుంచి తప్పనిసరిగా ఒక ఎస్సే చొప్పున మొత్తం మూడు ఎస్సేలు రాయాల్సి ఉంటుంది. ఒక్కో ఎస్సేకు గరిష్ట పద పరిమితి 800 పదాలు.

పేపర్-2 (హిస్టరీ, జాగ్రఫీ) :
గ్రూప్-1 మెయిన్స్ సిలబస్‌లో ప్రధానంగా చెప్పాల్సిన మార్పు.. రెండో పేపర్. ఇందులో హిస్టరీ, జాగ్రఫీ విభాగాలను చేర్చారు. గతంలో పాలిటీ ఉన్న స్థానంలో జాగ్రఫీని చేర్చడం గమనార్హం. మొదటి సెక్షన్‌లో భారత చరిత్ర-సంస్కృతి; రెండో సెక్షన్‌లో ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి; మూడో సెక్షన్‌లో భారత, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రం. విద్యార్థులు సాంస్కృతిక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్యకత నెలకొంది. అదే విధంగా స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు, ఉద్యమకారుల గురించి ప్రత్యేకంగా చదవాల్సి ఉంటుంది. స్వాతంత్య్రం తర్వాత కాలంలో విదేశీ విధానం, ఆర్థిక విధానం వంటి కొత్త అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి.. నిర్దిష్టంగా ప్రాచీన, మధ్యయుగ, ఆధునికాంధ్ర చరిత్ర, ఆంధ్రా ప్రాంతంలో జాతీయోద్యమం, ఆంధ్రప్రదేశ్ విభజన వరకు అంశాలను పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు సిలబస్‌ను ఆసాంతం పరిశీలించి.. ప్రతిఅంశంపై ప్రాథమిక భావనలపై అవగాహన పెంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి 2014 తర్వాత నుంచి చోటుచేసుకున్న పరిణామాలను ఔపోసన పట్టాలి. మూడో సెక్షన్‌గా పేర్కొన్న జాగ్రఫీ విషయంలో ముఖ్యమైన వనరులు, మౌలిక సదుపాయాలు, జనాభా, వ్యవసాయం, అడవులు-జంతువులు, పర్యావరణ అంశాలపై పట్టు సాధించాలి.

పేపర్-3 (భారత రాజ్యాంగం.. ప్రత్యేక పేపర్‌గా) :
గ్రూప్-1 మెయిన్స్ సిలబస్‌లో మరో ప్రధాన మార్పు... పాలిటీ, రాజ్యాంగం, పరిపాలన, చట్టం, విలువలు పేరుతో ప్రత్యేకంగా మూడో పేపర్‌ను రూపొందించడం. వాస్తవానికి ఇప్పటి వరకు పేపర్-2లోనే భారత రాజ్యాంగం ఒక విభాగంగా ఉండేది. కొత్త సిలబస్‌లో భారత రాజ్యాంగాన్ని.. ప్రత్యేకంగా ఒక పేపర్‌గా రూపొందించడం.. అందులో కోర్ పాలిటీ అంశాలతోపాటు పబ్లిక్ సర్వీస్‌లో విలువలు, కార్మిక చట్టాలు, సైబర్ చట్టాలు, ట్యాక్స్ చట్టాలు వంటి కొత్త అంశాలను చేర్చారు. ఈ పేపర్‌లో సెక్షన్ సీలోని ఎథిక్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ , నాలెడ్జ్ ఆఫ్ లాను కొత్తగా చదవాల్సి ఉంటుంది. ఈ విభాగంలో అంశాలన్నీ కొత్తవే. సిలబస్ విస్తృతంగా ఉంది. ఇది ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులకు పెను భారంగా మారనుంది అభ్యర్థులకు పరిపాలన పరమైన అంశాలపై అవగాహన, తాజా చట్టాలపై అవగాహనను లోతుగా తెలుసుకోవడం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

పేపర్-4 (భారత్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి) :
ఈ పేపర్‌కు సంబంధించి అధిక శాతం సమకాలీన అంశాలను చేర్చారని చెప్పొచ్చు. మొత్తం 12 యూనిట్లు ఉన్న ఈ పేపర్‌లో అధిక శాతం సమకాలీన పరిస్థితులకు సంబంధించిన అంశాలే ఉన్నాయి. ఉదాహరణకు.. మొదటి యూనిట్‌లో వృద్ధి రేటులో అస్థిరత, వ్యవసాయం-ఉత్పత్తి రంగాల్లో తక్కువ వృద్ధి రేటు, రూపాయి విలువ క్షీణత, ఎన్‌పీఏ(నిరర్థక ఆస్తుల)ల పెరుగుదల, ప్రస్తుత ఏడాది బడ్జెట్ వంటి అంశాలను పేర్కొన్నారు. దీన్నిబట్టి కోర్ కంటే తాజా ఆర్థిక పరిస్థితులపై అభ్యర్థుల అవగాహనను పరీక్షించడం ఉద్దేశంగా కనిపిస్తోంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి.. అమలవుతున్న సంక్షేమ పథకాలు, కొత్త ప్రాజెక్ట్‌లు వంటివాటిని స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి అభ్యర్థులు సమకాలీన ఆర్థిక అంశాలపై పట్టు సాధించాలని నిపుణులు సూచిస్తున్నారు. నిరంతరం దినపత్రికలు చదువుతూ అప్‌డేట్ అవుతూ ప్రిపరేషన్ సాగిస్తేనే ఇందులో రాణించే అవకాశముంది.

పేపర్-5 (సైన్స్ అండ్ టెక్నాలజీ) :
సైన్స్ అండ్ టెక్నాలజీ అని పేర్కొన్నప్పటికీ.. అధిక శాతం పర్యావరణ అంశాలకు ప్రాధాన్యం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు ఇటీవల కాలంలో ఈ రంగంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలు, ఇస్రో, డీఆర్‌డీఓ ప్రయోగాలు, శక్తి వనరులు, పర్యావరణ సుస్థిరత అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి.

గ్రూప్-2లో మార్పులు...
ఏపీపీఎస్సీ గ్రూప్-2 సర్వీసెస్‌కు సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్ విధానంలో పేపర్లు, మార్కుల పరంగా ఎలాంటి మార్పులు లేకపోయినప్పటికీ.. ఆయా విభాగాలకు సంబంధించి నిర్దేశించిన సిలబస్ అంశాల్లో మార్పులు జరిగాయి.

స్క్రీనింగ్ టెస్ట్ :
గత నోటిఫికేషన్‌లో స్క్రీనింగ్ టెస్ట్‌ను జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేరుతో 150 మార్కులకు నిర్వహించారు. అప్పుడు కేవలం మూడు విభాగాలు (కరెంట్ అఫైర్స్; కాన్‌స్టిట్యూషన్, ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా) గానే పరీక్ష ఉంది. కానీ... కొత్త సిలబస్ ప్రకారం.. స్క్రీనింగ్ టెస్ట్‌ను మూడు సెక్షన్లుగా మార్పు చేశారు. సెక్షన్-ఎను జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ; సెక్షన్-బి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, భారత రాజ్యాంగం; సెక్షన్-సిని ప్లానింగ్ అండ్ ఎకానమీగా నిర్దిష్టంగా పేర్కొన్నారు. వీటిలో కరెంట్ అఫైర్స్, ప్లానింగ్ అండ్ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యంగా అంశాలను నిర్దేశించారు.

గ్రూప్-2 మెయిన్స్ :
గ్రూప్-2 మెయిన్ ఎగ్జామినేషన్ గతంలో మాదిరిగానే మూడు పేపర్లుగా.. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు చొప్పున 450 మార్కులకు నిర్వహించనున్నారు. అయితే వీటిలోనూ సిలబస్ పరంగా మార్పులు చేశారు.
పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీపై పరీక్ష ఉంటుంది.
పేపర్-2: ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర; భారత రాజ్యాంగం అంశాలు పొందుపరిచారు.
పేపర్-3: ప్లానింగ్ అండ్ ఎకానమీలో.. భారత, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి ప్రణాళికలు, కోర్ ఎకానమీ సంబంధిత అంశాలు పొందుపరచారు. ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించి బడ్జెట్ వనరులు-పరిమితులు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని షరతులను పూర్తిచేయడం-ఈ విషయంలో కేంద్ర సహకారం-సమస్యలు; ప్రాజెక్ట్ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అసిస్టెన్స్ వంటి అంశాలను ప్రత్యేకంగా కొత్తగా చేర్చారు.

సిలబస్ పరిశీలన..
రానున్న నోటిఫికేషన్ల పరీక్షలు కొత్త సిలబస్ ప్రకారమే జరగనున్నాయి. అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ ప్రిపరేషన్ శైలి పరంగా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. సిలబస్ ఆసాంతం అవగాహన చేసుకుని.. పాత సిలబస్ ప్రకారం ఇప్పటి వరకు చదివిన అంశాలు, కొత్త సిలబస్‌లో వాటికి కల్పిస్తున్న వెయిటేజీని గమనించాలి. దీనికి అనుగుణంగా కొత్త సిలబస్‌లో ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిన అంశాలను గుర్తించి వాటి కోసం ప్రత్యేక సమయం కేటాయించాలి. గ్రూప్-1, గ్రూప్-2 సిలబస్‌లను పరిగణనలోకి తీసుకుంటే.. దాదాపు 80 శాతం అంశాలు ఒకే మాదిరిగా ఉన్నాయి. అభ్యర్థులు గ్రూప్-1 ఓరియెంటేషన్‌తో.. డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో దీర్ఘకాలిక ప్రిపరేషన్‌తో ముందుకు సాగితే గ్రూప్-2 సిలబస్‌పైనా పట్టు సాధించే అవకాశం ఉంది. ఆయా అంశాలను చదివేటప్పుడు వాటిని సమకాలీన అంశాలతోనూ సమన్వయం చేసుకుంటూ డిస్క్రిప్టివ్ విధానంలో ప్రిపరేషన్ సాగిస్తే.. కోర్ సబ్జెక్ట్ నైపుణ్యంతోపాటు సమకాలీన పరిస్థితుల్లో అన్వయించే నైపుణ్యం లభిస్తుంది.

గ్రూప్-2 పరీక్ష విధానం :
మొదటి దశ: స్క్రీనింగ్ టెస్ట్
పేపర్ అంశం మార్కులు
ఎ. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ.
బి. ఆంధ్రప్రదేశ్ సామాజిక,సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం.
సి. ఆర్థిక వ్యవస్థ ప్రణాళికలు 150
రెండో దశ: మెయిన్స్
పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150
పేపర్-2
సెక్షన్-1:
ఆంధ్రప్రదేశ్‌లోని సామాజిక, సాంస్కృతిక చరిత్ర
 
సెక్షన్-2:
భారత రాజ్యాంగం
150
పేపర్-3 ప్రణాళికలు ఆర్థిక వ్యవస్థ 150
మొత్తం మెయిన్స్ మార్కులు 450

గ్రూప్-1 కొత్త విధానం :
గ్రూప్-1 కొత్త విధానంలోనూ మూడంచెల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. అవి.. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ. అయితే పేపర్లు, అంశాల మార్పు, చేర్పులతో కొత్తగా రూపొందించిన విధానంలో గ్రూప్-1 పరీక్ష విషయంలో ఆయా పేపర్లు, అంశాలు, మార్కుల వివరాలు..

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్..
పేపర్ అంశం మార్కులు
పేపర్-1 జనరల్ స్టడీస్
సెక్షన్-ఎ:
హిస్టరీ అండ్ కల్చర్;
సెక్షన్-బి: రాజ్యాంగం, పాలిటీ, సామాజిక న్యాయం
అంతర్జాతీయ సంబంధాలు
సెక్షన్-సి: ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ,
ప్రణాళికలు
సెక్షన్-డి: జాగ్రఫీ
120
పేపర్-2 జనరల్ ఆప్టిట్యూడ్ 120
మొత్తం మార్కులు 240

మెయిన్ ఎగ్జామినేషన్ :
ఇంగ్లిష్: 150 మార్కులు.
తెలుగు: 150 మార్కులు.
పేపర్ అంశం మార్కులు
పేపర్-1 జనరల్ ఎస్సే 150
పేపర్-2 హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ 150
పేపర్-3 పాలిటీ, కాన్‌స్టిట్యూషన్, గవర్నెన్స్, లా, ఎథిక్స్ 150
పేపర్-4 భారత, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి 150
పేపర్-5 సైన్స్ అండ్ టెక్నాలజీ 150

మెయిన్ ఎగ్జామినేషన్ తర్వాత 75 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది.
గమనిక: ఇంగ్లిష్, తెలుగు పేపర్ల మార్కులను తుది మార్కుల్లో కలపరు. కానీ వీటిలో కనీస అర్హత మార్కులు సాధిస్తేనే మెయిన్స్‌లో పేర్కొన్న పేపర్లను మూల్యాంకనకు పరిగణనలోకి తీసుకుంటారు.
Published date : 31 Dec 2018 09:10PM

Photo Stories