Skip to main content

పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసిన సంస్థ?

పెగసస్‌.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఈ పేరు మార్మోగుతోంది. ఉగ్రవాదులు, నేరగాళ్ల పనిపట్టేందుకు తయారైనా సాఫ్ట్‌వేర్‌ ఇది.
కానీ భారత్‌లో మాత్రం ప్రతిపక్షాలు, విలేకరులపై దీని సాయంతో నిఘా పెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్పైవేర్‌కు సంబంధించిన వివరాలు ఇలా...

ఏమిటీ పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌?
పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇజ్రాయెల్‌కు చెందిన టెక్నాలజీ, సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ అభివృద్ధి చేసింది. స్మార్ట్‌ఫోన్ల నుంచి రహస్యంగా సమాచారం సేకరించేందుకు పనికొస్తుంది. ఈ మాల్‌వేర్‌ లేదా స్పైవేర్‌ ఉన్న స్మార్ట్‌ఫోన్ల మైక్రోఫోన్, కెమెరా నియంత్రణ ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. కావాలనుకుంటే ఈ–మెయిళ్లు, లొకేషన్‌ డేటాను కూడా సంపాదించొచ్చు. ఎన్‌క్రిప్టెడ్‌ (రహస్యమైన సంకేత భాషలోకి మార్చేసిన) ఆడియో ఫైళ్లను, మెసేజీలను (వాట్సాప్‌ లాంటివి) కూడా పెగసస్‌ ద్వారా వినొచ్చు, చదవొచ్చని యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ తయారుచేసే కాస్పర్‌స్కై నివేదిక చెబుతోంది.

ప్రభుత్వాలకు మాత్రమే..
2010లో ఏర్పాటైన ఎన్‌ఎస్‌వో గ్రూపు తెలిపిన వివరాల ప్రకారం... పెగసస్‌ ప్రోగ్రామ్‌ను ఎంపిక చేసిన కొన్ని ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలకు మాత్రమే విక్రయిస్తారు. ఉగ్రవాదం, నేరాల నిరోధమే లక్ష్యంగా తాము ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశామని ఈ సంస్థ చెబుతోంది. 2017లో దుబాయ్‌ మానవహక్కుల కార్యకర్త అహ్మద్‌ మన్సూర్‌ తొలిసారి ఈ పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ను గుర్తించారు. అప్పట్లో ఆయన స్మార్ట్‌ఫోన్‌ కూడా ఈ మాల్‌వేర్‌ బారినపడటంతో ఈ విషయం బయటకొచ్చింది. 2016 నుంచే ఆండ్రాయిడ్‌తో పాటు ఐఫోన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్లలో పనిచేస్తున్నట్లు గుర్తించారు.

ఏం చేయాలి?
స్మార్ట్‌ఫోన్‌లో పెగసస్‌ ఉన్నట్లు తెలిస్తే.. ఆ ఫోన్‌ను వదిలించుకోవడం మినహా వేరే మార్గం లేదని నిపుణులు చెబుతున్నారు.
Published date : 20 Jul 2021 06:14PM

Photo Stories