Skip to main content

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్

భారత ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 3న ముంబయిలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించారు. ‘మానవ అభివృద్ధి కోసం సైన్‌‌స, టెక్నాలజీ’ అనే అంశంపై ఈ సదస్సు జరిగింది.ముంబయినగరంలో సైన్‌‌స కాంగ్రెస్‌ను 45 ఏళ్ల తర్వాత నిర్వహించారు. ఈ సమావేశంలో విశ్వ విద్యాలయాలకు మరింత స్వయం ప్రతిపత్తి కల్పించనున్నట్లు ప్రధాని తెలిపారు. పాఠశాలలకు డిజిటల్ కనెక్టివిటీ ప్రాథమిక హక్కుగా ఉండాలని, విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని మరింత పెరిగేలా చేయాలని ఆయన పేర్కొన్నారు. దేశంలో వ్యాపార వాణిజ్యాలతో పాటు పరిశోధనలకు కూడా సమ ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ స్పష్టం చేశారు. కార్పొరేట్లు సామాజిక బాధ్యతలో భాగంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను ఏటా జనవరిలో నిర్వహిస్తారు. గత 102 ఏళ్లుగా దీన్ని నిర్వహిస్తున్నారు. తొలి సైన్స్ కాంగ్రెస్‌ను 1914 జనవరిలో కోల్‌కతాలో నిర్వహించారు. 2013 జనవరిలో వందో సమావేశాన్ని కూడా కోల్‌కతా నగరంలోనే నిర్వహించారు. 101వ సైన్స్ కాంగ్రెస్ 2014లో జమ్ములో జరిగింది.

102వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ముంబయిలోని ముంబయి యూనివర్సిటీలో 2015 జనవరి 3 నుంచి 7 వరకు నిర్వహించారు. సైన్స్ కాంగ్రెస్‌లో ప్రధాని ప్రసంగిస్తూ.. దేశ పురోగతి, మానవాభివృద్ధి శాస్త్ర, సాంకేతిక రంగంతోనే ముడిపడి ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చైనాను ఉదహరిస్తూ.. ప్రపంచంలోనే చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రెండో స్థానాన్ని ఆక్రమించడం సమాంతరంగా జరిగాయని చెప్పారు. అంతరిక్ష రంగంలో భారత్ ఎంతో పురోగతి సాధించిందని శాస్త్రవేత్తలను కొనియాడారు. తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహంపైకి మంగళయాన్ ఉపగ్రహాన్ని పంపడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. హుద్‌హుద్ తుపాను సమయంలో కచ్చితమైన ముందుస్తు హెచ్చరికలతో వేలాది మంది జీవితాలను కాపాడగలిగామన్నారు. జాతీయ అభివృద్ధిలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానానికి కీలక పాత్ర కల్పించిన వ్యక్తి దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అని ప్రశంసించారు.

  • భారత ప్రధాని వివిధ దేశాల నుంచి వచ్చిన నోబెల్ బహుమతి గ్రహీతలను సత్కరించారు. వీరిలో 2009లో రసాయన శాస్త్రంలో నోబెల్ విజేత అడా యోనాథ్ (ఇజ్రాయెల్), 2013లో వైద్య శాస్త్రంలో నోబెల్ అందుకున్న ర్యాండీ షెక్‌మన్ (అమెరికా), 2001లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి విజేత కర్‌‌ట వత్‌రిచ్ (స్విట్జర్లాండ్), 2006లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనిస్ (బంగ్లాదేశ్), 2001లో వైద్యశాస్త్రంలో నోబెల్ అందుకున్న పౌల్ నర్‌‌స (ఇంగ్లండ్), 2005లో వైద్య శాస్త్రంలో నోబెల్ విజేత రాబెన్ వారెన్ (ఆస్ట్రేలియా) తదితరులున్నారు. 2014 ఫీల్డ్స్ మెడల్ విజేత మంజుల్ భార్గవను కూడా సన్మానించారు. గణిత శాస్త్రంలో అత్యున్నత ప్రతిభ కనబరిచినవారికి ఫీల్డ్స్ మెడల్ అందజేస్తారు.
  • కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ ముంబయిలోని బాంద్రా - కుర్లా కాంప్లెక్స్‌లోని ఎమ్‌ఎమ్‌ఆర్‌డీఏ మైదానంలో ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ పేరుతో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన ప్రదర్శనను ప్రారంభించారు. 102వ ఇండియన్ సైన్‌‌స కాంగ్రెస్‌లో భాగంగా దీన్ని నిర్వహించారు. ఇందులో ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలు అభివృద్ధి చేసిన ఉత్పత్తులు, పరిశోధన, అభివృద్ధిలో సాధించిన కీలక విజయాలను ప్రదర్శించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) వాటి విజయాలను ప్రదర్శించాయి. ఇస్రో రాకెట్లు, ఉపగ్రహ ట్రాన్‌‌సపాండర్లు, మంగళయాన్ నమూనాలను ప్రదర్శించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్‌‌చ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, డిపార్‌‌టమెంట్ ఆఫ్ ఎర్‌‌త సెన్సైస్ కూడా పాల్గొన్నాయి. ఓఎన్‌జీసీ సంస్థ అత్యాధునిక డ్రిల్లింగ్ పరిజ్ఞానాలను ప్రదర్శించింది. మొత్తం 250కి పైగా అగ్రశ్రేణి సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఇదే ప్రాంగణంలో భారత ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రదర్శనను కూడా ఏర్పాటు చేసింది.
  • 102వ సైన్స్ కాంగ్రెస్ రెండో రోజైన జనవరి 4న ‘సంస్కృతం ద్వారా ప్రాచీన భారతీయ విజ్ఞానం’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ‘భారతీయ ప్రాచీన సైన్స్ సిద్ధాంతాలు శతాబ్దాల అనుభవసారం, తర్కం ఆధారంగా రూపుదిద్దుకున్నాయి. భారతదేశ సంస్కృతం, పురాతన సైన్స్ ఆధారంగా జర్మన్లు కొత్త ఆవిష్కరణలు చేశారు. ఈ దిశగా మనం మరింత కృషి చేయాలి’ అని పేర్కొన్నారు.
  • ‘వేదాల్లో ప్రాచీన విమానయాన సాంకేతికత’ అంశంపై పైలట్ శిక్షణ కేంద్రం మాజీ ప్రిన్సిపాల్ కెప్టెన్ ఆనంద్ జె. బోడాస్ మాట్లాడారు.
  • భారత సైన్స్ కాంగ్రెస్‌ను పురస్కరించుకొని ముంబయిలో బాలల సైన్స్ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని జనవరి 4న భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రారంభించారు. ఇది 22వ బాలల సైన్స్ కాంగ్రెస్. వ్యాధులపై పోరు కోసం జన్యు ఇంజినీరింగ్ లాంటి పరిజ్ఞానం అవసరమని అబ్దుల్ కలాం పేర్కొన్నారు. ప్రముఖ బాలల హక్కుల కార్యకర్త, 2014 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి కూడా బాలలసైన్స్ కాంగ్రెస్‌లో మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థను రూపుమాపాలని పిలుపునిచ్చారు.
  • భారత సైన్స్ కాంగ్రెస్ మూడో రోజైన జనవరి 5న ‘అణుశక్తి - వర్తమానం - భవిష్యత్తు’ అంశంపై సదస్సు జరిగింది. దీనికి ప్రముఖ అణుశాస్త్రవేత్త అనిల్ కకోద్కర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వక్తలు అణువిద్యుత్ ఆవశ్యకతను వివరించారు. అణు విద్యుత్ విషయంలో పరిశోధన ఫలితాలను ప్రపంచ దేశాలు పంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం శిలాజ ఇంధనాలపై ఎక్కువగా ఆధారపడుతున్నామని, ఇవి ఎక్కువ కాలం అందుబాటులో ఉండవు కాబట్టి అణు విద్యుత్‌పై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ సదస్సులో బాబా అణు పరిశోధన కేంద్రం డెరైక్టర్ శేఖర్ బసు వైద్యం, వ్యవసాయం లాంటి అంశాల్లో అణు ఇంధన వినియోగంపై మాట్లాడారు.
  • ‘ఆరోగ్యం, అభివృద్ధి’ అనే అంశంపై జరిగిన మరో సదస్సులో నిపుణులు దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల పెద్ద సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యవంతులే ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి తోడ్పడగలరని పేర్కొన్నారు.
  • ‘గిరిజనుల ఆరోగ్య సమస్యలు’ అనే మరో అంశంపై జరిగిన సదస్సులో ప్రముఖ సామాజిక కార్యకర్త అభయ్ బంగ్ పాల్గొన్నారు. గిరిజనులకు సరైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించడం లేదని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో వారి ఆరోగ్య సమస్యలను పరిష్కరించవచ్చని పేర్కొన్నారు.
  • ‘జన్యుమార్పిడి పంటలు - వ్యవసాయంలో ఆధునిక బయోటెక్నాలజీ వినియోగం’ అంశంపై మరో సదస్సు జరిగింది. దీనికి భారత వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డెరైక్టర్ రాజేంద్ర సింగ్ పరోడా అధ్యక్షత వహించారు. పెరుగుతున్న జనాభా అవసరాల కోసం జన్యు మార్పిడి పంటలను ప్రోత్సహించాలని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
  • భారత సైన్స్ కాంగ్రెస్ నాలుగో రోజైన జనవరి 6న మారుతున్న వాతావరణ పరిస్థితులపై చర్చ జరిగింది. అభివృద్ధి, ప్రకృతి మధ్య సమతౌల్యం సాధించాల్సిన బాధ్యత సైన్‌‌సపై ఉందని నిపుణులు పేర్కొన్నారు. ప్రకృతి విపత్తులైన భూకంపాలు, వరదలు, సునామీలను నియంత్రించలేకపోయినా.. వాటివల్ల జరిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చని అభిప్రాయపడ్డారు.
  • ముంబయిలోని కలీనా క్యాంపస్‌లో ఐదురోజులపాటు జరిగిన 102వ భారత సైన్స్ కాంగ్రెస్‌కు 12,000లకు పైగా ప్రతినిధులు హాజరయ్యారు. దీనికి వివిధ దేశాల నుంచి సాంకేతిక నిపుణులు, రీసెర్‌‌చ విద్యార్థులు హాజరయ్యారు. ముంబయికి దేశ ఆర్థిక రాజధానిగానే కాకుండా సైన్స్ సిటీగానూ గుర్తింపు తేవాలనే లక్ష్యంతో దీన్ని నిర్వహించారు. ముంబయిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, బాబా అణు పరిశోధనా కేంద్రం (బార్‌‌క), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, టాటా మెమోరియల్ సెంటర్ లాంటి సంస్థలున్నాయి. ఇవన్నీ భారత సైన్‌‌స కాంగ్రెస్‌లో క్రియాశీలంగా పాలుపంచుకున్నాయి.
  • ఈ సైన్స్ కాంగ్రెస్‌లో వ్యవసాయం, అడవులు, పశువైద్య శాస్త్రం, ఆంథ్రోపాలజీ, రసాయన శాస్త్రం, ఇంజినీరింగ్, పర్యావరణం, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్, గణితం, వైద్యం, జీవశాస్త్రం, వృక్షశాస్త్రం, భౌతిక శాస్త్రం లాంటివాటిపై చర్చలు జరిగాయి.
  • రెండు రోజులపాటు మహిళా సైన్స్ కాంగ్రెస్‌ను కూడా నిర్వహించారు. జనవరి 7న 102వ భారత సైన్స్ కాంగ్రెస్ ముగింపు ఉత్సవం జరిగింది.
Published date : 12 Jan 2015 11:09AM

Photo Stories