Skip to main content

బేటీ బచావో- బేటీ పఢావో

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2015 జనవరి 22న హర్యానాలోని పానిపట్‌లో ‘బేటీ బచావో, బేటీ పఢావో (కుమార్తెను కాపాడండి, కుమార్తెను చదివించండి)’ అనే పథకాన్ని ప్రారంభించారు.
బాలబాలికల నిష్పత్తి అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో హర్యానా ఒకటి. భారతదేశంలో బాల బాలికల నిష్పత్తి 1000 : 919 ఉండగా, హర్యానాలో 1000 : 834 మాత్రమే ఉంది.

లింగ వివక్షత అంతం చేయడం, బాలికా సంక్షేమం ఈ పథకం ముఖ్య లక్ష్యాలు. ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఆడ శిశువులను తల్లి గర్భంలోనే చంపేసే విష సంస్కృతిని మానసిక వ్యాధిగా ప్రధాని పేర్కొన్నారు. భ్రూణహత్యలు, లింగవివక్షతకు వ్యతిరేకంగా సభికులతో ప్రధాని ప్రతిజ్ఞ చేయించారు. ఈ పథకాన్ని దేశంలో 100 జిల్లాల్లో అమలు చేయనున్నారు. వీటిలో 12 జిల్లాలు హర్యానాలోనే ఉన్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు మేనకా గాంధీ, రవిశంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ, జె.పి. నద్దా; హర్యానా గవర్నర్ కప్తాన్‌సింగ్ సోలంకీ, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా రోజూ 2,000 ఆడశిశువుల భ్రూణహత్యలు జరుగుతున్నాయని కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకా గాంధీ తెలిపారు. హర్యానాలోని 70 గ్రామాల్లో గత కొన్నేళ్లుగా ఒక్క ఆడ శిశువు కూడా జన్మించలేదన్నారు. ఈ పథకాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ సంయుక్తంగా నిర్వహిస్తాయి. బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ఈ పథకానికి ప్రచారకర్తగా వ్యవహరిస్తారు.

బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమం కింద బాలికలకు ఆర్థిక స్వావలంబన కల్పించే సుకన్య సమృద్ధియోజనను కూడా ప్రధాని అదే వేదికపై ప్రారంభించారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పదేళ్లలోపు ఈ పథకం కింద బ్యాంకుల్లో లేదా పోస్టాఫీసుల్లో కనీసం వేయి రూపాయల డిపాజిట్‌తో ఖాతా ప్రారంభించవచ్చు. ఈ ఖాతాలో జమచేసే సొమ్ముపై ఏటా 9.1 శాతం వడ్డీతో పాటు, ఆదాయపు పన్ను రాయితీ లభిస్తుంది. ఈ అకౌంట్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా * 1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాతే ఉన్నత చదువుల కోసం ఖాతాలోంచి సగం డబ్బును తీసుకోవచ్చు. బాల్య వివాహాలను అరికట్టే ఉద్దేశంతో 18 ఏళ్ల వరకు విత్‌డ్రాయల్‌ను అనుమతించరు. ప్రారంభించిన నాటి నుంచి 21 ఏళ్ల పాటు లేదా ఆ బాలిక వివాహమయ్యేంత వరకూ సుకన్య సమృద్ధి అకౌంట్ క్రియాశీలంగా ఉంటుంది.
Published date : 28 Jan 2015 11:16AM

Photo Stories