Skip to main content

15వ ప్రవాసీ భారతీయ దివస్

దేశంలో ఏటా జనవరి 9ను ప్రవాసీ భారతీయ దివస్‌గా జరుపుకొంటారు. మహాత్మాగాంధీ 1915, జనవరి 9న దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన సంఘటనను పురస్కరించుకొని దీన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు.. భారతదేశ అభివృద్ధిలో పోషిస్తున్న పాత్రను గుర్తుచేసుకుంటారు. ఎల్.ఎం.సింఘ్వీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ప్రవాస భారతీయులపై అధ్యయనం చేసి.. కొన్ని సిఫార్సులు చేసింది. వాటి ఆధారంగా అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఏటా జనవరి 9న ప్రవాసీ భారతీయ దివస్ (పీబీడీ)ను జరపాలని నిర్ణయించారు. ఈ ఉత్సవాల సందర్భంగా వివిధ రంగాల్లో విశేష కృషిచేసిన వారికి ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారాలను అందజేస్తారు. 2015లో ప్రవాస భారతీయ ఉత్సవాలను గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహించారు. మహాత్మా గాంధీ భారత్‌కు తిరిగి వచ్చి వందేళ్లు అయిన సందర్భంగా వీటిని ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఉత్సవాలను రెండేళ్లకోసారి నిర్వహిస్తున్నారు.

15వ ప్రవాసీ భారతీయ దివస్ వేడుకలను 2019, జనవరి 21 నుంచి 23 వరకు వారణాసిలో నిర్వహించారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో, న్యూఢిల్లీలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రవాసీ భారతీయ ప్రతినిధులు పాల్గొనడానికి వీలుగా 15వ పీబీడీని జనవరి 9న కాకుండా.. జనవరి 21 నుంచి 23 తేదీల్లో నిర్వహించారు. దీని ఇతివృత్తం.. ‘‘నవ భారత నిర్మాణంలో ప్రవాసీ భారతీయుల పాత్ర’’. మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ జగన్నాథ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నార్వేకు చెందిన పార్లమెంటు సభ్యుడు హిమాంశు గులాటీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. జనవరి 21న యువ ప్రవాసీ భారతీయ దివస్‌ను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రపంచంలోనే అత్యధిక ప్రవాసీలు భారత్‌కు చెందిన వారే అని చెప్పారు. దాదాపు 31 మిలియన్ల మంది ప్రవాసీ భారతీయులున్నారని అన్నారు.

జనవరి 22న సీబీడీ ఉత్సవాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రవాసీ భారతీయులను భారతదేశ ప్రచారకర్తలుగా అభివర్ణించారు. చిప్ ఆధారిత ఈ-పాస్‌పోర్టుల్ని ప్రవేశపెట్టే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాని చెప్పారు. అన్ని దేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాలను త్వరలో పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్టులకు అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు. పాస్‌పోర్ట్, వీసాలకు సంబంధించిన నిబంధనలను మరింత సరళతరం చేస్తామని ప్రకటించారు. 15వ పీబీడీ ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జనవరి 23న పాల్గొన్నారు. 28 మంది ప్రవాస భారతీయులకు, రెండు సంస్థలకు మొత్తం 30 ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారాలను అందజేశారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్, నార్వే పార్లమెంటు సభ్యుడు హిమాంశు గులాటీ, దక్షిణాఫ్రికా దౌత్యవేత్త అనిల్ సూక్ లాల్, ఫ్లోరిడాలోని ప్రముఖ హృద్రోగ వైద్యుడు కిరణ్ పటేల్ తదితరులకు ఈ అవార్డులు లభించాయి. పురస్కారాలు అందుకున్న సంస్థలు-గయానా హిందూ ధార్మిక సభ, ఈజిప్ట్‌లోని ఇండియన్ కమ్యూనిటీ అసోసియేషన్.
Published date : 04 Mar 2019 02:58PM

Photo Stories