Skip to main content

జీ-7, బ్రిక్స్ సదస్సులు

పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు పపంచ దేశాల మధ్య ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలపై అధిక ప్రభావం చూపే బ్రిక్స్, జీ-7 (ప్రస్తుతం) సదస్సులు, కొత్తగా ఏర్పాటైన న్యూడెవలప్‌మెంట్ బ్యాంకు వంటి అంశాలపై సమగ్ర అవగాహన తప్పనిసరి. అంతర్జాతీయ అంశాల్లో ఇండియా పాత్ర, ప్రభావాల కోణంలో ప్రిపరేషన్ సాగిస్తే చక్కని ఫలితాలు సాధించొచ్చు.
జీ-7
పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన ఆరు దేశాలు 1975లో జీ-6 కూటమిగా ఏర్పడ్డాయి. పశ్చిమ జర్మనీ, ఇటలీ, జపాన్, ఫ్రాన్స్, యునెటైడ్ కింగ్‌డమ్(యూకే), యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా(యూఎస్‌ఏ) దేశాలతో కూడిన జీ-6 తొలి సదస్సు ఫ్రాన్స్‌లో(1975 నవంబరు) జరిగింది. 1975లో కెనడా ఏడో సభ్యదేశంగా చేరడంతో జీ-7గా మారింది. 1998లో ఈ కూటమిలో రష్యా చేరికతో జీ-8గా అవతరించింది. క్రిమియా సంక్షోభం కారణంగా 2014, మార్చి 24న రష్యా జీ-8 నుంచి సస్పెండ్ అయింది. దీంతో ప్రస్తుతం ఈ కూటమి జీ-7గా మారింది. 2014, జూన్‌లో ఈ సదస్సు రష్యాలోని సోచి నగరంలో జరగాల్సి ఉంది. కాని రష్యా సస్పెండ్ కావడంతో మిగిలిన ఏడు దేశాలు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో సమావేశమయ్యాయి. ఈ సదస్సుల్లో ఐరోపా యూనియన్ (ఈయూ) కూడా పాల్గొంటుంది. ఈయూ ప్రధాన కార్యాలయం బ్రస్సెల్స్‌లోనే ఉంది. ఈ కూటమి ప్రతి ఏటా సమావేశమై ప్రపంచ ఆర్థిక విధానాలపై చర్చిస్తుంది.

41వ శిఖరాగ్ర సదస్సు:
జీ-7.. 41వ శిఖరాగ్ర సదస్సు 2015, జూన్ 7, 8 తేదీల్లో జర్మనీలోని క్రున్ నగరంలో జరిగింది. ఈ సదస్సులో కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలండే, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్, ఇటలీ ప్రధాని మతియో రెంజీ, జపాన్ ప్రధాని షింజో అబే, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఐరోపా కమిషన్ అధ్యక్షుడు జీన్ క్లాడ్ జంకర్, ఐరోపా కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్‌లు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఉక్రెయిన్ సంక్షోభం, వాతావరణ మార్పులు, తీవ్రవాదం, ఎబోలా వంటి వ్యాధుల నుంచి పొంచి ఉన్న ముప్పు తదితర అంశాలపై నేతలు చర్చించారు. వీటితో పాటు రష్యాపై విధించిన ఆంక్షలను కొనసాగించాలని నిర్ణయించారు. ఉక్రెయిన్‌పై రష్యా దౌర్జన్య వైఖరి కొనసాగిస్తే మరిన్ని ఆంక్షలు విధిస్తామని జీ-7 దేశాలు ఆ దేశాన్ని హెచ్చరించాయి.

వాతావరణ మార్పులు-విస్తృత చర్చ:
వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలను జీ-7 విస్తృతంగా చర్చించింది. ఈ శతాబ్దానికి శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని నిశ్చయించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కర్బనీకరణ నిర్మూలన జరగాలని నేతలు పిలుపునిచ్చారు. పెట్రోలు, బొగ్గు వంటి ఇంధనాల స్థానంలో సాంప్రదాయేతర ఇంధన వనరులైన సౌరశక్తి, పవనశక్తిలను పూర్తిస్థాయిలో వాడాలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా గ్రీన్‌హౌస్ వాయువులను తగ్గించాలని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్ పిలుపునిచ్చారు. ఈ ఏడాది చివర్లో ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు పారిస్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో జీ-7 సదస్సులో తీసుకున్న నిర్ణయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ శతాబ్దంలో భూతాపం పెరుగుదలను 2 డిగ్రీలకు పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి పేద దేశాలకు 100 బిలియన్ డాలర్ల సాయం అందించాలని జీ-7 దేశాలు నిర్ణయించాయి. వీటితో పాటు గ్రీసు ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ తీవ్రవాదం వంటి అంశాలపైన చ ర్చించారు. 42వ జీ-7 సదస్సు 2016 మే 26,27 తేదీల్లో జపాన్‌లోని షిమా నగరంలో జరుగుతుంది.

న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు
ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలకు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ దేశాలు ‘న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు(ఎన్‌డీబీ)’ను నెలకొల్పాయి. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు బ్రిక్స్ దేశాలతోపాటు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా రుణ సహాయాన్ని అందించనుంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని చైనాలోని షాంఘై నగరంలో ఏర్పాటు చేశారు. ఆఫ్రికన్ ప్రాంతీయ కేంద్రాన్ని దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్ బర్గ్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఈ బ్యాంకును 100 బిలియన్ డాలర్లతో ఏర్పాటు చేశారు. బ్యాంకు తొలి అధ్యక్షుడిగా భారతీయుడైన కెవీ కామత్ నియమితులయ్యారు. ఆయన ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. బ్యాంకు తన తొలి రుణాన్ని 2016 ఏప్రిల్‌లో ఇస్తుందని ఇటీవల ప్రకటించారు. ఈ రుణాన్ని చైనా కరెన్సీలో (రెన్‌మిన్‌బీ యువాన్) ఇవ్వనున్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఏర్పాటైన ఎన్‌డీబీ 2015,జులై 21న షాంఘైలో ప్రారంభమైంది. ఎన్‌డీబీ త్వరలో ప్రారంభం కానున్న ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు(ఏఐఐబీ)తో కలిసి పనిచేస్తుంది. ఏఐఐబీ ప్రధాన కార్యాలయం చైనా రాజధాని బీజింగ్‌లో ఏర్పాటు కానుంది.

బ్రిక్స్ సదస్సు
అమెరికాలోని గోల్డ్‌మన్ శాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకుకు చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త జిమ్. ఓ నీల్ 2001లో ‘బ్రిక్ ’ పదాన్ని ప్రవేశపెట్టారు. బ్రిక్స్ సభ్యదేశాలు బ్రెజిల్,రష్యా, ఇండియా, చైనా దేశాల ఆర్థిక వ్యవస్థలు కలిసి 2050 నాటికి జీ-7 దేశాల ఆర్థిక వ్యవస్థలను మించిపోతాయని గోల్డ్‌మన్ శాక్స్ సంస్థ అంచనా వేసింది. 2010లో దక్షిణాఫ్రికా చేరికతో ఈ కూటమి బ్రిక్స్‌గా మారింది. బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 42శాతాన్ని(300కోట్లు) కలిగి ఉన్నాయి.

బ్రిక్స్ సదస్సులు- వివరాలు:
  1. జూన్ 16, 2009- ఎకాతెరిన్ బర్గ్, రష్యా
  2. ఏప్రిల్ 15, 2015- బ్రెసీలియా, బ్రెజిల్
  3. ఏప్రిల్ 14, 2011- సాన్యా, చైనా
  4. మార్చి 29, 2012- న్యూఢిల్లీ, ఇండియా
  5. మార్చి 26,27, 2013-డర్బన్, దక్షిణాఫ్రికా
  6. జులై 15, 16, 2014-ఫోర్తలేజా, బ్రెజిల్
  7. జులై 8, 9, 2015 - ఉఫా, రష్యా
ఎనిమిదవ బ్రిక్స్ సదస్సు 2016లో న్యూఢిల్లీలో జరగనుంది.

నరేంద్ర మోదీ ప్రతిపాదిత సూత్రాలు
  1. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్య ప్రదర్మన
  2. రైల్వే పరిశోధనా కేంద్రం
  3. అత్యున్నత ఆడిటింగ్ సంస్థల మధ్య సహకారం.
  4. డిజిటల్ రంగంలో సహకారం.
  5. బ్రిక్స్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం.
  6. బ్రిక్స్ దేశాల్లోని రాష్ట్రాలు లేదా స్థానిక ప్రభుత్వాలతో ఏర్పాటైన వేదిక.
  7. పట్టణీకరణ రంగంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారం.
  8. బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా మండలి ఏర్పాటు. ఈ దేశాల మధ్య వార్షిక క్రీడోత్సవాలు.
  9. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు తొలి ప్రాజెక్టు శుద్ద ఇంధన రంగంలో
  10. బ్రిక్స్ చలన చిత్రోత్సవం.

7వ బ్రిక్స్ సదస్సు ద్వారా కంటెంజెంట్ రిజర్వ్ కరెన్సీ( సీఆర్‌ఏ) అమల్లోకి వచ్చింది. బ్రిక్స్ దేశాల్లో లిక్విడిటీలో సమస్యలు తలెత్తినప్పుడు సహకరించడానికి ఈ నిధి ఉపయోగపడనుంది. ఈ నిధిని 100 బిలియన్ డాలర్లతో ఏర్పాటు చేశారు. ఇందు కోసం చైనా అత్యధికంగా చైనా 41 బిలియన్ డాలర్లను సమకూర్చింది. భారత్, బ్రెజిల్, రష్యాలు 18 బిలియన్ డాలర్ల చొప్పున, ద క్షిణాఫ్రికా 5 డాలర్లను సమకూర్చాయి. ఈ నిధి 2015, జులై 30 నుంచి అందుబాటులోకి వచ్చింది.

సదస్సు - పాల్గొన్న దేశాల నేతలు
నరేంద్ర మోదీ - భారత ప్రధాన మంత్రి
వ్లాదిమర్ పుతిన్ - రష్యా అధ్యక్షుడు
జీ జిన్‌పింగ్ - చైనా అధ్యక్షుడు
జాకబ్ జుమా - దక్షిణాఫ్రికా అధ్యక్షుడు
దిల్మా రౌసెఫ్ - బ్రెజిల్ అధ్యక్షురాలు
7వ బ్రిక్స్ సదస్సు 2015 జులైలో రష్యాలోని ఉఫా నగరంలో జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికై 10 సూత్రాలను ప్రతిపాదించారు. వీటిని ఆయన ‘దస్ కదమ్- టెన్ స్టెప్స్ ఫర్ ది ప్యూచర్’ గా అభివర్ణించారు.

మాదిరి ప్రశ్నలు
1. ఐరోపా కమిషన్ ప్రస్తుత అధ్యక్షుడు జీన్ క్లాడ్ జంకర్ ఏ దేశానికి 18 ఏళ్ల పాటు ప్రధానిగా పనిచేశారు?
1) లక్సెమ్‌బర్గ్
2) నెదర్లాండ్
3) బెల్జియం
4) ఫిన్లాండ్
2. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు అధ్యక్షుడు కెవీ కామత్ ఏ బ్యాంకు చైర్మన్‌గా పనిచేశారు?
1) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) ఐసీఐసీఐ బ్యాంకు
3) యాక్సిస్ బ్యాంకు
4) కొటక్ మహీంద్రా బ్యాంకు
3. ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) ఎంత మూల ధనంతో ప్రారంభం కానుంది?
1) 100 బిలియన్ డాలర్లు
2) 150 బిలియన్ డాలర్లు
3) 200 బిలియన్ డాలర్లు
4) 250 బిలియన్ డాలర్లు
4. క్రిమియా 2014లో ఏ దేశం నుంచి వేరు పడింది?
1) జార్జియా
2) లాత్వియా
3) కజకిస్థాన్
4) ఉక్రెయిన్
5. ఐరోపా యూనియన్ ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది?
1) బెల్జియం
2) ఫ్రాన్స్
3) జర్మనీ
4) స్పెయిన్
6. ఏ నగరంలో జరిగిన బ్రిక్స్ సదస్సులో దక్షిణాఫ్రికా తొలిసారి పాల్గొంది?
1) ఎకాతెరిన్ బర్గ్
2) బ్రెసీలియా
3) సాన్యా
4) డర్బన్
7. భారతదేశం ఏ సంవత్సరంలో బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది?
1) 2009
2) 2010
3) 2011
4) 2012
8. ‘దస్ కదమ్’ ఏ సదస్సుకు సంబంధించింది?
1) జీ-7
2) ఎస్‌సీవో
3) బ్రిక్స్
4) జీ-20
9. కంటెంజెంట్ రిజర్వ్ కరెన్సీ (సీఆర్‌ఏ)కు అతి తక్కువ నిధులు ఏ దేశం సమకూరుస్తుంది?
1) భారత్
2) రష్యా
3) దక్షిణాఫ్రికా
4) బ్రెజిల్
10. ఏ దేశ కరెన్సీని రాండ్ అంటారు?
1) చైనా
2) బ్రెజిల్
3) రష్యా
4) దక్షిణాఫ్రికా

సమాధానాలు
1) 1 2) 2 3) 1 4) 4 5) 1
6) 3 7) 4 8) 3 9) 3 10) 4
Published date : 19 Sep 2015 12:06PM

Photo Stories