Skip to main content

ప్రపంచగతిని మార్చిన వ్యాధులు - వివరాలు

జీవితం జీవితం కోసమే.. దానికోసం పోరాడాలి.. గెలిచేవరకూ పోరాటం చేయాలి. ఏ ప్రాణికి దీని నుంచి మినహాయింపులేదు. చరిత్ర తొలి నాళ్ల నుంచి నేటి వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది... అంటే చిన్న చేపను పెద్ద చేప మింగినట్టు కాదు. నేను మాత్రమే బతకాలనే స్వార్ధం విడనాడి అన్ని ప్రాణుల్ని బతకనివ్వాలి. తద్వారా విపత్తులు దరిచేరవు... నాడు మందు మాకులు లేని రోజుల్లో.. ప్లేగు, మశూచి, కలరా, ఫ్లూ వంటి భయానక రోగాలపై మానవాళి పోరాడి గెలిచింది. నేడు మరోసారి కరోనా సవాలు విసురుతోంది. ప్రపంచదేశాలను తలకిందులు చేస్తున్న ఈ మహమ్మారి వైద్యశాస్త్రాన్ని మరోసారి పరీక్షకు పెట్టింది. ‘కరోనా’ విజృంభణ నేపథ్యంలో చరిత్రలో ఎదురైన అత్యంత భయానక రోగాలు, వాటి పుట్టుపూర్వోత్తరాలు, అవి సృష్టించిన మారణహోమాలను, కారణాలను ఓసారి తిరగేద్దాం!
ప్లేగు
క్రీస్తుపూర్వం 430-427 మధ్య కాలంలో గ్రీకు రాజధాని ఏథెన్స్‌లో తొలిసారిగా విజృంభించింది. మూడేళ్ల వ్యవధిలోనే ఏథెన్స్ జనాభాలో మూడోవంతును తుడిచిపెట్టేసింది. క్రీస్తుశకం 165-180 కాలంలో ప్లేగు వ్యాధి రోమన్ సామ్రాజ్యాన్ని అతలాకుతలం చేసింది. ఇటలీ, గ్రీసు, ఆసియా మైనర్, ఈజిప్టు ప్రాంతాలకు శరవేగంగా వ్యాపించింది. దీని దెబ్బకు అప్పట్లో 5 కోట్ల మంది మరణించారు. రోమన్ ప్రాంతంలోనే క్రీస్తుశకం 251-266 కాలంలో మళ్లీ ప్లేగు విజృంభించింది. దీని దెబ్బకు రోజుకు సగటున ఐదువేల మరణాల వరకు సంభవించాయి. అప్పట్లోనే గ్రీకు వైద్యుడు గాలెన్ ప్లేగు వ్యాధి లక్షణాలను విపులంగా తన పుస్తకాల్లో వివరించాడు. తర్వాత క్రీస్తుశకం 541-542లో తూర్పురోమన్ రాజధాని కాన్‌స్టంటినోపుల్ ప్రాంతంలో మరోసారి ప్లేగు విజృంభించింది. ఇది పరిసర ప్రాంతాలకు శరవేగంగా విస్తరించడంతో ఏకంగా 2.5 కోట్ల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. యూరోప్ ప్రాంతంపై ప్లేగు వ్యాధి దాదాపు 225 ఏళ్ల పాటు తన ప్రతాపాన్ని కొనసాగింది. క్రీస్తుశకం 750 నాటికి ఇది తగ్గుముఖం పట్టింది. తిరిగి క్రీస్తుశకం 1347-51 కాలంలో యూరేసియా ప్రాంతంపై ప్లేగు మరింత బలంగా పంజా విసిరింది. దీని ధాటికి ఏకంగా 7.5 కోట్ల నుంచి 20 కోట్ల వరకు జనాలు ప్రాణాలు పోగొట్టుకున్నట్లు అంచనా. లండన్ నగరాన్ని సైతం 1665-66 కాలంలో ప్లేగు వణికించింది. ఏడాదిన్నర వ్యవధిలోనే లండన్‌లో దాదాపు లక్షకు పైగా - అంటే, అప్పటి జనాభాలో నాలుగోవంతు మరణాలు సంభవించాయి. ఆధునిక వైద్యం యాంటీ బయోటిక్ ఔషధాలను కనుగొన్నాక ప్లేగు అదుపులోకి వచ్చింది.

మశూచి
జపాన్‌లో మశూచి భారీ విలయమే సృష్టించింది. తొలిసారిగా క్రీస్తుశకం 735-737 కాలంలో విజృంభించిన మశూచి దాదాపు 10 లక్షల ప్రాణాలను కబళించింది. అప్పటి జపాన్ జనాభాలో దాదాపు నాలుగో వంతు కేవలం ఈ వ్యాధికే తుడిచిపెట్టుకుపోయింది. ఆ తర్వాత స్పానిష్ నావికులు 1492లో కరీబియన్ దీవుల్లో తొలిసారి అడుగుపెట్టినప్పుడు వారి ద్వారా మశూచి అక్కడి స్థానికులకు అంటుకుంది. ఇది శరవేగంగా వ్యాపించడంతో స్థానికులు పెద్దసంఖ్యలో మరణించారు. మశూచి వ్యాధి శతాబ్దాల తరబడి మానవాళిని వెంటాడింది. కొలంబస్ 1492లో హిస్పానియోలా దీవిలో అడుగుపెట్టినప్పుడు అక్కడి స్థానిక జనాలు దాదాపు 60 వేల వరకు ఉండేవాళ్లు. మశూచి దెబ్బకు 1548 నాటికి వారిలో కేవలం 500 మంది మాత్రమే మిగిలారు. ఆఫ్రికన్ బానిసల ద్వారా సోకిన మశూచి ధాటికి క్రీస్తుశకం 1520లో అజ్‌టెక్ సామ్రాజ్యమే కుప్పకూలింది. ఆ తర్వాత కూడా వివిధ కాలాల్లో నానా దేశాల్లో విజృంభించిన మశూచి ధాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5.6 కోట్ల మరణాలు సంభవించాయి. గడచిన శతాబ్దిలో మశూచి నివారణకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ వ్యాధి కనుమరుగైంది. మహమ్మారి వ్యాధుల్లో పూర్తిగా కనుమరుగైన వ్యాధి ఇప్పటి వరకు ఇదొక్కటే.

కలరా
కలరా మహమ్మారి తొలిసారి 1817లో విజృంభించింది. రష్యాలో మొదలైన ఈ మహమ్మారి శరవేగంగా ప్రపంచమంతటా విస్తరించింది. దాదాపు 150 ఏళ్ల వ్యవధిలో ఏడుసార్లు కలరా మహమ్మారి మానవాళిపై పంజా విసిరింది. కలరా నివారణకు వ్యాక్సిన్‌ను 1885లోనే తయారు చేసినా, ఆ తర్వాత కాలంలో కూడా కలరా మహమ్మారి విజృంభణ కొనసాగింది. కలరా కారణంగా 1817-1923 మధ్య కాలంలో దాదాపు 3.5 కోట్ల మంది మరణించారు. ఆ తర్వాత కూడా చాలా చోట్ల కలరా అడపా దడపా పంజా విసురుతూనే ఉంది. కలరా నివారణకు వ్యాక్సిన్లు, కలరా సోకినా నయం చేయడానికి తగిన మందులు ఇప్పుడు అందుబాటులో ఉండటం కారణంగా వైద్యులు దీనిని ఎప్పటికప్పుడు సమర్థంగానే అరికట్టగలుగుతున్నారు.

కలరా ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఉనికిలో ఉంటూనే ఉన్నా, వైద్యరంగం సాధించిన పురోగతి పుణ్యమా అని ఇది మహమ్మారి స్థాయిలోనైతే వ్యాపించడం లేదు.

నాటి పరిస్థితులు:
మందు మాకుల గురించి పెద్దగా పరిచయం లేని ఆదిమకాలంలో విజృంభించిన అంటు రోగాలపై అప్పటి మనుషులకు ఎలాంటి అవగాహన ఉండేది కాదు. అంతుచిక్కని రోగాలు ఎందుకు వస్తున్నాయో వారికి అర్థమయ్యే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఈ రోగాల ధాటికి మనుషులు భయకంపితులయ్యేవారు. అదంతా దేవుళ్ల ఆగ్రహంగా తలచేవారు. సూర్య చంద్రులతోపాటు.. ప్రక ృతిని ఆరాధించేవారు. అలాగని మనుషులు ఆ స్థాయిలోనే ఆగిపోలేదు. కాలగమనంలో ఆలోచన కలిగిన కొందరు నిమిత్తమాత్రంగా ఊరుకోలేక, అంతుచిక్కని రోగాలకు కారణాలను అన్వేషించడానికి ప్రయత్నించారు. కారణాలను తెలుసుకున్నాక, వాటి నివారణకూ ప్రయత్నించి, చాలా వ్యాధులను విజయవంతంగా కట్టడి చేయగలిగారు. తొలినాళ్లలో వ్యాధుల వ్యాప్తికి గల కారణాలను, నివారణ మార్గాలను కనుగొనడానికి శతాబ్దాలకు శతాబ్దాల కాలం పట్టింది. ఆధునిక వైద్య శాస్త్రం అందుబాటులోకి వచ్చాక పరిస్థితి చాలా వరకు మెరుగుపడింది. పురాతన కాలం నుంచి వెన్నాడుతున్న మహమ్మారి వ్యాధులను సునాయాసంగా ఎదుర్కోవడం సుసాధ్యమైంది. కొన్ని పురాతన రోగాలనైతే ఆధునిక వైద్యశాస్త్రం సమూలంగా రూపుమాప గలిగింది.

వైద్యరంగం కృషి
ఆధునిక వైద్యం పంతొమ్మిదో శతాబ్దంలో మొదలైంది. ర్యాబిస్, క్షయ, టైఫాయిడ్, ప్లేగు వంటి వ్యాధులకు తొలి వ్యాక్సిన్లను ఆ శతాబ్దిలోనే కనుగొన్నారు. గడచిన వందేళ్ల చరిత్రను చూసుకుంటే, 1918-20 సంవత్సరాల మధ్య విజృంభించిన స్పానిష్ ఫ్లూ భారీ స్థాయిలో జననష్టాన్ని కలిగించి, యావత్ ప్రపంచాన్నే గజగజలాడించింది. ఆ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ మహమ్మారి బారిన పడ్డారు. దీని బారిన పడిన వారిలో ఏకంగా 2 కోట్ల నుంచి 5 కోట్ల మంది వరకు మరణించి ఉంటారని అంచనా. ఆ తర్వాత 1957-58 కాలంలో వ్యాపించిన ఆసియన్ ఫ్లూ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 11 లక్షల ప్రాణాలను బలి తీసుకుంది. ఇక 1968లో విజృంభించిన హాంకాంగ్ ఫ్లూ కారణంగా సుమారు 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న ‘కరోనా’కు పదేళ్ల ముందే ‘స్వైన్ ఫ్లూ’ పంజా విసిరింది. దీని ధాటికి 2009-10లో దాదాపు 2 లక్షల మంది మరణించారు. వరుసగా వచ్చిపడ్డ ఈ మహమ్మారి వ్యాధులను ఆధునిక వైద్యరంగం రెట్టించిన సామర్థ్యంతో ఎదుర్కొంటూ వస్తోంది. వీటి గణాంకాలను పరిశీలిస్తే ఎప్పటికప్పుడు మరణాల సంఖ్య, మరణాల రేటు తగ్గుతూ రావడాన్ని గమనించవచ్చు. ఇది ఆధునిక వైద్యరంగం సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. తాజాగా ఒక వైపు కరోనా ఉధృతి ఇంకా సద్దుమణగక ముందే దీనిని అణచివేసే ఔషధాలను శాస్త్రవేత్తలు ఇప్పటికే తయారు చేశారు. అమెరికాలోని కైసర్ పర్మనెంటె ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు మార్చి 16న ఒక మహిళా వాలంటీర్‌కు ప్రయోగాత్మకంగా ఈ వ్యాక్సిన్‌ను ఇంజెక్ట్ చేశారు. కరోనా నియంత్రణకు తగిన ఔషధాలు, వ్యాక్సిన్ల తయారీ కోసం వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు తమ వంతు ప్రయోగాలను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ‘కరోనా’ నివారణకు, నియంత్రణకు తగిన ఔషధాలు జన సామాన్యానికి ఎంత త్వరగా అందుబాటులోకి వస్తే, అంత త్వరగా మానవాళికి ఊరట లభించగలదు.

చరిత్రగతిని మార్చిన మరికొన్ని వ్యాధులు...
యెల్లో ఫీవర్, కుష్టు, హెచ్‌ఐవీ-ఎయిడ్స్, సార్స్, స్వైన్ ఫ్లూ, ఎబోలా, మెర్స్ వంటి మరికొన్ని వ్యాధులను కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. పద్దెనిమిదో శతాబ్దిలో మొదలైన యెల్లో ఫీవర్ వివిధ దేశాలకు పాకి, దాదాపు 1.50 లక్షల మంది మరణాలకు కారణమైంది. పదకొండో శతాబ్దిలో మొదలైన కుష్టు అప్పట్లో త్వర త్వరగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేది. దీని వల్ల వెనువెంటనే సంభవించే మరణాలు తక్కువే. ప్రస్తుతం ఇది చాలా వరకు అదుపులోకి వచ్చింది. ఆధునిక కాలంలో 1981లో తొలిసారి వెలుగులోకి వచ్చిన హెచ్‌ఐవీ-ఎయిడ్స్ ఇప్పటికీ ఉనికిలో ఉంది. ఇప్పటి వరకు ఈ వ్యాధి కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.50 కోట్ల మరణాలు సంభవించాయి. ప్రస్తుత శతాబ్ది తొలి నాళ్లలో- 2002-03 కాలంలో చైనాలో ‘సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’ (సార్స్) వ్యాపించింది. ఈ వ్యాధి పదిహేడు దేశాలకు వ్యాపించగా, దాదాపు తొమ్మిదివేల మంది దీని బారిన పడ్డారు. అయితే, వైద్య నిపుణులు వెంటనే రంగంలోకి దిగి కృషిచేయడంతో మరణాల సంఖ్యను 774 వరకే పరిమితం చేయగలిగారు. తర్వాత 2015లో మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్) వ్యాపించింది. పశ్చిమాసియా దేశాల్లోని ఒంటెల ద్వారా వ్యాపించిన వైరస్ మనుషులకు సోకడంతో ఈ వ్యాధి మహమ్మారిలా మారింది. ఇప్పటికీ ఇది ఉనికిలో ఉంది. ఇప్పటి వరకు ఈ వ్యాధి కారణంగా 850 మంది మరణించారు. ‘సార్స్’, ‘మెర్స్’వ్యాధులకు కారణమైనవి కూడా వేర్వేరు రకాలకు చెందిన కరోనా వైరస్‌లే. కాంగోలోని ఎబోలా నది పరిసరాల నుంచి ఎబోలా వైరస్ 2014లో మనుషులకు సోకింది. ఇది 2016 వరకు వివిధ దేశాలకు వ్యాపించి భయోత్పాతాలకు దారితీసింది. ఈ వ్యాధి కారణంగా 1.13 లక్షల మంది మరణించారు.

వివిధ వ్యాధులు- అత్యధిక మరణాలు
ఇప్పటి వరకు చరిత్రలో అత్యధిక మరణాలకు దారి తీసిన మహమ్మారి స్పానిష్ ఫ్లూ (1918-20) మాత్రమే. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో వ్యాపించిన ఈ వ్యాధి యుద్ధం కంటే ఎక్కువగానే జనాలను వణికించింది. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల అంచనాలు స్పానిష్ ఫ్లూ కారణంగా 2.5 కోట్ల నుంచి 5.0 కోట్ల వరకు మరణాలు సంభవించాయని, నిజానికి దీని కారణంగా దాదాపు 10 కోట్లకు పైగానే మరణాలు సంభవించి ఉంటాయని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. నిజానికి ఈ వ్యాధి మొదలైన తొలి ఆరు నెలల్లోనే 2.5 కోట్ల మరణాలు సంభవించాయని కూడా వారు చెబుతున్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఇరు శిబిరాల్లోని దేశాలు స్పానిష్ ఫ్లూ కారణంగా తమ తమ దేశాల్లో సంభవించిన మరణాల లెక్కలను ప్రపంచానికి సరిగా వెల్లడించలేదనే వాదన కూడా ఉంది. 1957-58 మధ్యకాలంలో ఆసియన్ ఫ్లూ వ్యాపించడంతో దాదాపుగా 11 లక్షల మంది మరణించారు. ఆ తర్వాత 1968వ సంవత్సరంలో ప్రభలిన హాంకాంగ్ ఫ్లూ వల్ల దాదాపుగా 10 లక్షల మరణాలు సంభవించాయి. ఇక 2009-2010 మధ్య స్వైన్ ఫ్లూ వ్యాధితో 2 లక్షల మరణాలు సంభవించాయి. ఇక 2019-2020 మధ్య విస్తరిస్తోన్న కరోనా మూడో ప్రపంచయుద్ధంతో పోల్చబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 2, 2020 నాటికి 9,37,000 కరోనా కేసులు నమోదు కాగా, 47,000 మంది మరణించారు.

అసలు ఈ వైరస్‌లు ఎలా పుడుతున్నాయో తెలుసా?
వివిధ రకాల వైరస్‌ల వల్ల సంక్రమిస్తోన్న వ్యాధులను ఆంగ్లంలో ‘జూనాటిక్ డిసీసెస్’ లేదా ‘జూనోసెస్’ అని అంటారు. అంటే జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులని అర్థం. మానవులకు సంక్రమించే వ్యాధుల్లో 75 శాతం అంటువ్యాధులు కాగా, వాటిలో 60 శాతం జంతువుల నుంచి సంక్రమిస్తున్నవే. నేడు ప్రపంచ దేశాల ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న కోవిడ్ వైరస్ కూడా ఆ కోవకు చెందినదే. సార్స్ (సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) పునుగు పిల్లుల నుంచి రాగా, మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్), ఒంటెల వల్ల రాగా, ఎబోలా, బర్డ్ ఫ్లూలు ఇతర జంతువుల నుంచి వచ్చాయి.

వ్యవసాయ విస్తరణ లేదా పట్టణీకరణ లేదా మరే ఇతర కారణాల వల్ల జంతువులు, ఇతర వన్య ప్రాణులు జీవించే అడువులను నరికి వేయడం వల్ల జంతువుల ఆరోగ్యం క్షీణించి వైరస్‌ల బారిన పడుతున్నాయి. వాటిలో బలిష్టంగా రూపాంతరం చెంతుతోన్న పలు రకాల వైరస్‌లు వాటి నుంచి మనుషులకు సోకుతున్నాయి. అడవులను నరికివేయడం వల్ల పర్యావరణ పరిస్థితులు దెబ్బతినడంతోపాటు ఇలాంటి అనర్థాలు సంభవిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం విభాగం 2016లోనే ఓ నివేదికలో హెచ్చరించింది.

ఒక్క 2018లోనే చెట్లు నరికివేయడం వల్ల, కార్చిచ్చుల వల్ల 1.20 కోట్ల హెక్టార్ల అడవులు నశించాయని, బ్రెజిల్, ఇండోనేసియా, మలేసియా దేశాల్లో ఎక్కువ అడవులు నశించాయని ‘గ్లోబల్ వారెస్ట్ వాచ్’ ఓ నివేదికలో వెల్లడించింది. పట్టణీకరణలో భాగంగా అతి తక్కువ స్థలంలో జన సాంద్రత ఎక్కువగా ఉండడం, సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఒకరికి సోకిన వైరస్ ఇతరులకు వేగంగా వ్యాపిస్తోందని ఆ నివేదికలో ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. పర్యావరణ ఆరోగ్యం సరిగ్గా ఉన్నప్పుడే ప్రపంచ మానవాళి మనుగడ బాగుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆహార, వ్యవసాయ సంస్థ పిలుపునివ్వగా, ‘జంతువులు, అడవుల ఆరోగ్యంపైనే మానవుల ఆరోగ్యం ఆధారపడి ఉంది’ అని ‘ది సెంటర్ ఫర్ పీపుల్ అండ్ ఫారెస్ట్ ఇన్ బ్యాంగ్‌కాగ్’ వ్యాఖ్యానించింది. ఏదిఏమైనా వైరస్‌ల విజృంభణకు మానవ తప్పిదనమని స్పష్టం అవుతోంది. అంటే కరోనా రూపంలో ప్రకృతి ప్రతికారం తీర్చుకుంటోందన్నమాట. కాబట్టి మనం చేసిన తప్పులను మనమే సరిదిద్దుకుంటే మనుగడ సాధ్యమౌతుంది.
Published date : 02 Apr 2020 03:56PM

Photo Stories