Skip to main content

వ్యవసాయంలో స్వయంసమృద్ధితో ఆహార భద్రత!

-డా॥తమ్మా కోటిరెడ్డి,ప్రొఫెసర్,ఐబీఎస్ హైదరాబాద్.
యూపీఏ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆహార భద్రత బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. దేశంలోని మూడింట రెండొంతుల జనాభాకు సబ్సిడీపై ఆహార ధాన్యాలను సరఫరా చేసే లక్ష్యంతో ప్రవేశపెట్టిన బిల్లును గత వారం లోక్‌సభ ఆమోదించగా, సెప్టెంబరు 2న రాజ్యసభ ఆమోదించింది. దాదాపు 82 కోట్ల జనాభాకు లబ్ధి చేకూర్చే ఆహార భద్రత బిల్లు చట్టంగా మారేందుకు ఇక రాష్ట్రపతి ఆమోదం మాత్రమే పొందాల్సి ఉంది.

గత మూడేళ్లుగా దేశంలో ఆహార భద్రత, ఆర్థిక సంక్షోభం ప్రధాన చర్చనీయాంశాలుగా నిలిచాయి. నాణ్యతతో కూడిన, తగిన పరిమాణంలో ఆహార ఉత్పత్తులను చౌక ధరల వద్ద పేద ప్రజలకు అందించినప్పుడు వారిలో ఆహార, పౌష్టికాహార భద్రత పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల మంది ప్రజలు ఆహార భద్రతకు నోచుకోలేదని అంచనా. 2025 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లకు పైగా ఉండగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ రెట్టింపు కాగలదు. నీటికొరత, పర్యావరణ క్షీణత, వాతావరణ మార్పులు, అల్ప ఉత్పత్తి, ఉత్పాదకతలతో పాటు పెట్టుబడి సమస్యలను వ్యవసాయ రంగం ఎదుర్కోనుంది. ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) అంచనాల ప్రకారం 2010-12 మధ్య కాలంలో ప్రపంచంలో 87 కోట్ల మంది ప్రజలు దీర్ఘకాలంగా పౌష్టికాహార లోపంతో ఇబ్బందిపడ్డారు. వీరిలో 85.20 కోట్ల మంది ప్రజలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నివసిస్తున్నారు. మొత్తం అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రజల్లో వీరి వాటా 15 శాతం. మిగిలిన 1.80 కోట్ల మంది అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన వారు.

పేదరికం తాండవిస్తోంది:
భారత్‌లో పేదరిక సమస్య తీవ్రంగా ఉంది. 2010లో ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 32.7 శాతం మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువున నివసిస్తున్నారు. వీరు అంతర్జాతీయ పేదరిక రేఖ కొలమానమైన రోజుకు వినియోగ వ్యయం 1.25 డాలర్లకన్నా తక్కువగా ఉంది. ప్రపంచ బ్యాంకు అభిప్రాయంలో రోజుకు సగటున 2 డాలర్ల కంటే తక్కువ వ్యయం చేసే జనాభా 68.7 శాతం. 2010లో ఆక్స్‌ఫర్‌‌డ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్ నివేదిక ప్రకారం భారత్‌లోని ఎనిమిది రాష్ట్రాల్లోని పేదల సంఖ్య ఆఫ్రికా ఖండంలోని 26 అత్యంత పేద దేశాలలోని ఉమ్మడి పేదవారి సంఖ్య కంటే ఎక్కువ. 2013లో ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ప్రపంచంలోని మొత్తం పేద ప్రజల్లో 1/3వ వంతు భారత్‌లో నివసిస్తున్నారు. 1991 తర్వాత కాలంలో భారత్ ప్రవేశపెట్టిన సరళీకరణ ఆర్థిక విధానాలు దేశంలో ఆర్థిక అసమానతల తొలగింపులో విఫలమయ్యాయి. ఆర్థికవృద్ధి ఫలాలు పేద ప్రజలకు అందలేదు. ఇటీవలి యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పౌష్టికాహార లోపంతో ఇబ్బంది పడుతున్న ప్రతి ముగ్గురు శిశువులలో ఒకరు భారత్‌లో ఉన్నారు. ‘న్యూయార్‌‌క టైమ్స్’ అంచనా ప్రకారం భారత్‌లో 55 శాతం మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో ఇబ్బంది పడుతున్నారు. సబ్ సహారన్ ఆఫ్రికా దేశాలలో పౌష్టికాహార లోపంతో భాద పడుతున్న పిల్లల సంఖ్యకన్నా రెట్టింపు సంఖ్యలో భారత్‌లో ఉన్నట్లు సుప్రీంకోర్టుకు ఓ ప్రత్యేక కమిషన్ నివేదించింది. ప్రపంచబ్యాంకు అంచనా ప్రకారం సరైన బరువు లేకుండా జన్మించిన శిశువులు సబ్-సహారన్ ఆఫ్రికా దేశాలలో 24 శాతం కాగా భారత్‌లో వీరి వాటా 47 శాతం. వీరిలో 50 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు, 38 శాతం మంది పట్టణ ప్రాంతాలకు చెందినవారు. సరైన బరువు లేకుండా జన్మించిన శిశువులలో 48.9 శాతం బాలికలు, బాలుర శాతం 45.5. అంతర్జాతీయ ఆహార పరిశోధనా సంస్థ విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్ హంగర్ ఇండెక్స్) లో భారత్ 65వ స్థానంలో నిలిచింది. పౌష్టికాహార లోపం కారణంగా డయేరియా, మలేరియా, తట్టు లాంటి వ్యాధులు సంక్రమించి ఆరోగ్యం దెబ్బతింటోంది. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం భారత్‌లో ఐదేళ్లు నిండకముందే ఏటా 2.1 మిలియన్ల చిన్నారులు మృత్యువాతపడుతున్నారు.

ఆహార భద్రతా బిల్లు:
పౌష్టికాహార లోపాన్ని అధిగమిస్తూ పేదరిక నిర్మూలన ధ్యేయంగా భారత ప్రభుత్వం ఆహార భద్రతా బిల్లును ప్రతిపాదించింది. ఈ బిల్లును లోక్‌సభ ఆగస్టు 26వ తేదీన ఆమోదించగా, సెప్టెంబరు 2న రాజ్యసభ ఆమోదించింది. తద్వారా దేశంలో 82 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత చేకూరగలదని అంచనా. చౌకధరల దుకాణాల ద్వారా సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలను సంక్షేమ కార్యక్రమాల అమల్లో భాగంగా ప్రస్తుతం పంపిణీ చేస్తున్న విధానానికి చట్టబద్ధత ఏర్పడుతుంది. లక్షిత ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా 75 శాతం గ్రామీణ ప్రజలు, 50 శాతం పట్టణ ప్రజలు సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలను పొందుతారు. ప్రతి వ్యక్తికి నెలకు ఐదు కిలోల బియ్యం (కిలో రూ.3), గోధుమలు (కిలో రూ.2), తృణధాన్యాల (కిలో రూ.1)ను అందజేస్తారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ర్ట ప్రభుత్వాలు లబ్ధ్దిదారులను ఎంపిక చేస్తాయి. ఈ కార్యక్రమం పేద ప్రజలకు పరిమితం కాలేదు. దారిద్య్రరేఖ దిగువున నివసించే ప్రజలకు మూడు రెట్ల ప్రజలు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఇటీవలి ప్రణాళిక సంఘం అంచనా ప్రకారం 2011-12లో 21.9 శాతం మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువున నివసిస్తున్నారు. 2011-12లో భారత్‌లో పేదరిక అంచనాకు గ్రామీణ ప్రాంతాలలో తలసరి వినియోగ వ్యయం నెలకు రూ.816, పట్టణ ప్రాంతాలలో రూ. 1,000 ప్రాతిపదికగా తీసుకున్నారు.

62 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు అవసరం:
పస్తుతం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్న ఆహార ధాన్యాలకు సబ్సిడీ రూ.1.09 లక్షల కోట్లుగా అంచనా. ఆహార భద్రతా పథకం అమల్లో లేకపోయినప్పటికీ ప్రభుత్వానికి సబ్సిడీ భారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.13 లక్షల కోట్లుగా ఉండగలదని ఆహార మంత్రిత్వ శాఖ మంత్రి కె.వి. థామస్ అభిప్రాయపడ్డారు. మధ్యాహ్న భోజన పథకం, మహిళలు, శిశువులకు ఇస్తున్న అన్ని ప్రోత్సాహకాలతో పాటు ఆహార భద్రతా చట్టం అమల్లోకి వచ్చినపుడు మొత్తం ప్రభుత్వ సబ్సిడీ రూ. 1,25,000 కోట్లుగా ఉండగలదని అంచనా. ఈ కార్యక్రమం అమలుకు 62 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు అవసరమని భావించగా.. ప్రభుత్వ గోదాముల్లో ప్రస్తుతం 73 మిలియన్ టన్నుల నిల్వలున్నాయి. ఈ పథకం అమల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌కు 9.6 మిలియన్ టన్నులు, బీహార్‌కు 5.5 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు అవసరమవుతా యి. ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఆహార భద్రతా ఆర్డినెన్‌‌స ద్వారా ఈ పథకాన్ని ఇప్పటికే ప్రారంభించాయి.

ప్రముఖుల అభిప్రాయాలు:
ఇటీవల కాలంలో క్షీణిస్తున్న రూపాయి విలువ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాల వృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నప్పటికీ రాబోయే 12 మాసాలలో అమలుపరిచే ఆహార భద్రత చట్టంపై ఎలాంటి ప్రభావం ఉండదని కొంతమంది ప్రముఖులు అభిప్రాయపడ్డారు. దేశంలోని 82 కోట్లమంది ఈ పథకంలో లబ్ధ్దిదారులైనందున ఆహార ఉత్పత్తులపై వారి వినియోగ వ్యయం తగ్గినపుడు ఆహారేతర ఉత్పత్తులపై వినియోగ వ్యయం పెరుగుతుంది. ఈ చర్య వ్యవసాయేతర రంగాల అభివృద్ధికి దోహదపడుతుంది. ఆహార భద్రత చట్టం అమలు ప్రభావం దేశంలో ద్రవ్యలోటును పెంచగలదని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అధ్యక్షుడు గోపాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. అధిక వ్యయంతో కూడుకున్న ఈ చట్టం అమలు ద్రవ్యలోటుకు దారితీస్తున్న పరిస్థితుల్లో అర్హతగల లబ్ధ్దిదారుల ఎంపికపై దృష్టి సారించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చట్టం అమలు కారణంగా ద్రవ్యలోటు పెరిగే అవకాశం లేదని ఆర్థిక మంత్రి చిదంబరం ఆశాభావం వ్యక్తం చేశారు. ద్రవ్యలోటును జీడీపీలో 4.8 శాతంగా నిర్వహించగలమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రజాపంపిణీ వ్యవస్థ అమల్లోని లోపాలను సవరించి పారదర్శకత పెంపొందించినట్లయితే ప్రస్తుత సబ్సిడీ మొత్తం 25 నుంచి 30 శాతం మేరకు తగ్గుతుందని కొందరు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ‘మూడీస్’ అభిప్రాయంలో ఆహార సబ్సిడీలో భాగంగా ప్రభుత్వ వ్యయం గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుతం ఆహార సబ్సిడీ జీడీపీలో 0.8 శాతం కాగా ఆహార భద్రత చట్టం అమలుతో జీడీపీలో 1.2 శాతానికి పెరుగుతుంది. తద్వారా భారత ఆర్థిక పరిస్థితి క్లిష్టమవుతుందని సంస్థ అభిప్రాయపడుతుంది. పెట్టుబడికి సంబంధించి ‘మూడీస్’ భారత్‌కు ’'Baa3’ రేటింగ్ ఇచ్చింది. దీన్ని స్థిర, మధ్య శ్రేణిగా భావించవచ్చు. 2013-14లో ప్రభుత్వ ఫైనాన్స్‌పై ఆహార భద్రత చట్టం అమలు ప్రభావం తక్కువగా ఉన్నా, రాబోయే కాలంలో అధిక భారం పడగలదని మూడీస్ అభిప్రాయపడింది. పెరుగుతున్న సబ్సిడీ రాబోయే రోజుల్లో అధిక ద్రవ్యోల్బణ స్థితికి దారితీస్తుందని మూడీస్ అభిప్రాయపడింది.

ఆహార భద్రత-వ్యవసాయం:
1990వ దశకం మధ్య భాగంలో భారత్‌లో ఉత్పత్తి వృద్ధి తగ్గడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల సాపేక్ష ధరల్లో తగ్గుదల నమోదైంది. భారత్ అతిపెద్ద ఆహార భద్రతా వ్యవస్థను కలిగి ఉంది. ఇది ధాన్యం గింజలకే పరిమితమైంది. దేశంలో నాలుగు లక్షల చౌక ధరల దుకాణాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 1960వ దశకంలో దేశంలో ఆహార కొరత ఏర్పడిన సందర్భంలో ప్రభుత్వం ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు ఆహార ఉత్పత్తులను పంపిణీ చేసింది. తద్వారా కరువు పరిస్థితులను నివారించగలిగింది. ఆ తర్వాత 1970, 1980వ దశకంలో తలసరి ధాన్యాల లభ్యత పెరిగింది. 1997 వరకు ఆహార భద్రతా వ్యవస్థపై ప్రభుత్వ వ్యయం జీడీపీలో 0.5 శాతంగా ఉంది. ఇది తర్వాతి కాలంలో పెరిగింది. ఆహార భద్రత, పేదరిక నిర్మూలన లక్ష్యాల సాధనకు ప్రభుత్వం అవలంబించే పటిష్ట చర్యలు ప్రజల కొనుగోలు శక్తిని పెంచగలవు. తద్వారా వ్యవసాయ ఉత్పత్తులు స్థిరమైన డిమాండ్‌ను కలిగి ఉంటాయి.

సమస్యలు ఎదురుకాకపోవచ్చు:
పస్తుతం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) గోదాముల్లో ఆహార ధాన్యాల నిల్వలు అధికంగా ఉండటం వల్ల ఆహార భద్రత చట్టం అమలుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకపోవచ్చు. వివిధ కాలాల్లో ప్రభుత్వం ఆహార కొరత లాంటి సమస్యతో పాటు సేకరించిన, మిగులు ఆహార ధాన్యాల యాజమాన్యం (నిర్వహణ) విషయంలోనూ సమస్యలు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో సరిపడా ఆహార ధాన్యాల ఉత్పత్తికి చర్యలు తీసుకోవడంతో పాటు ఆహార ధాన్యాల పంపిణీ నెట్‌వర్క్‌ను కూడా మెరుగుపరచుకోవాలి.

భవిష్యత్తులో డిమాండ్:
12వ పంచవర్ష ప్రణాళికలో నిర్దేశించిన విధంగా 8 శాతం వృద్ధి లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆహార ధాన్యాల డిమాండ్, సప్లయ్‌లోని తేడాను నిశితంగా గమనించాలి. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో నాలుగు శాతం వృద్ధి సాధ్యమైనప్పుడే జీడీపీ వృద్ధి లక్ష్యమైన ఎనిమిది శాతాన్ని సాధించేందుకు మార్గం సుగమమవుతుంది. దేశంలో బియ్యం డిమాండ్ 2012లో 102.4 మిలియన్ టన్నులు. ఇది 2017 నాటికి 108.9 మిలియన్ టన్నులకు చేరనుంది. 2025 నాటికి 114.5 మిలియన్ టన్నులకు డిమాండ్ చేరుకోగలదని అంచనా.

  • గోధుమ డిమాండ్ 2012లో 56.8 మిలియన్ టన్నులు కాగా ఇది 2017 నాటికి 59.7 మిలియన్ టన్నులు. 2025 నాటికి 66.7 మిలియన్ టన్నులకు చేరుకోగలదని అంచనా.
  • పప్పు ధాన్యాల డిమాండ్ 2012లో 25.8 మిలియన్ టన్నులు. కాగా 2017 నాటికి ఇది 33.8 మిలియన్ టన్నులకు, 2025 నాటికి 52.2 మిలియన్ టన్నులకు చేరగలదని అంచనా.
సప్లయ్ కోణంలో విశ్లేషిస్తే:
సప్లయ్ వైపు పరిశీలించినప్పుడు ‘మిట్టల్’ అభిప్రాయంలో బియ్యం సప్లయ్ 2011లో 95 మిలియన్ టన్నులు కాగా 2021 నాటికి 106 మిలియన్ టన్నులు, 2026 నాటికి 111 మిలియన్ టన్నులకు చేరుకోగలదు.
  • గోధుమ సప్లయ్ 2011లో 80 మిలియన్ టన్నులు కాగా, 2021 నాటికి 92 మిలియన్ టన్నులకు, 2026 నాటికి 98 మిలియన్ టన్నులకు చేరుకోగలదని అంచనా.
  • పప్పు ధాన్యాల సప్లయ్ 2011లో 16 మిలియన్ టన్నులు. కాగా 2021 నాటికి 18 మిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా.
సప్లయ్, డిమాండ్‌ల మధ్య అంతరం పూడ్చాలి
మధ్య, దీర్ఘకాలిక వ్యవసాయ విధానంలో భాగంగా దేశంలో ఆహార ధాన్యాల సప్లయ్, డిమాండ్‌లో ఏర్పడుతున్న అంతరాన్ని పూడ్చడానికి పటిష్ట చర్యలు అత్యవసరం. రాబోయే కాలంలో అధిక దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో వ్యవసాయ రంగంలో సుస్థిర వృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరముంది. ఆహార ధాన్యాల అధిక ఉత్పత్తి జరిగిన సమయంలో వాటిని ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల్లో ఉపయోగించాలి. వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులతో పోల్చినపుడు ప్రభుత్వ రంగ పెట్టుబడుల వృద్ధి ధోరణి సంస్కరణల కాలంలో క్షీణించింది. ప్రభుత్వ రంగ పెట్టుబడుల పెంపుతో పాటు, నిరుపయోగంగా ఉన్న భూమిని వినియోగంలోకి తేవడం, చిన్న నీటి పారుదల సౌకర్యాలను పెంచడం, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వంటి చర్యల ద్వారా వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధిని సాధించవచ్చు. తద్వారా ఆహార భద్రత ఏర్పడుతుంది.
Published date : 05 Sep 2013 05:09PM

Photo Stories