Skip to main content

JNTUH: ఎంసెట్‌కు బయో మెట్రిక్‌ తప్పనిసరి.. గుర్తింపు కార్డుగా వీటిని పరిగణిస్తారు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఇంజనీరింగ్, వైద్య, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ ఎంసెట్‌–2023 ఈ నెల 10వ తేదీ నుంచి మొదలవుతుంది.
JNTUH
ఎంసెట్‌కు బయో మెట్రిక్‌ తప్పనిసరి

ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం మే 8న‌ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. 10, 11 తేదీల్లో అగ్రి, మెడికల్‌ ఎంసెట్‌ జరుగుతుంది. 12 నుంచి 14 వరకూ ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ ఉంటుంది. రెండు సెషన్లుగా ఉండే ఈ పరీక్ష, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకూ ఒక విడత, మధ్యాహ్నం 3 నుంచి 6 వరకూ రెండో విడత జరుగుతుంది. 2 రాష్ట్రాల పరిధిలో ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ 2,05,405 మంది, అగ్రి, మె డికల్‌ ఎంసెట్‌ 1,15,361 మంది రాస్తున్నారు. తెలంగాణవ్యాప్తంగా 104, ఆంధ్రప్రదేశ్‌లో 33 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష జరిగే రోజుల్లో ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పించారు. ఇప్పటికే డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌ టికెట్లతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు రావాలని ఎంసెట్‌ కన్వీనర్‌ డీన్‌కుమార్‌ తెలిపారు. పరీక్ష రాసేవారికి జేఎన్‌టీయూహెచ్‌ కొన్ని సూచనలు చేసింది. 

చదవండి: ఎంసెట్‌ - న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్

బయోమెట్రిక్‌ తప్పనిసరి.. 

  • ఎంసెట్‌ రాసే విద్యార్థులకు బయోమెట్రిక్‌ తప్పనిసరి. ఈ కారణంగా చేతులకు గోరింటాకు, ఇతర డిజైన్లు వేసుకుంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. చేతులు శుభ్రంగా కడుక్కుంటే బయో మెట్రిక్‌ హాజరుకు ఇబ్బంది ఉండదు.  
  • ఉదయం పూట ఎంసెట్‌ పరీక్షకు హాజరయ్యే వారు 7.30కే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. మధ్యా హ్నం 3 గంటలకు జరిగే పరీక్షకు మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్షా కేంద్రానికి రావాలి. ఒక్క నిమిషం దాటినా పరీక్షకు అనుమతించరు. 
  • విద్యార్థులు బ్లాక్‌ లేదా బ్లూ పాయింట్‌ పెన్, హాల్‌ టికెట్, ఆన్‌లైన్‌లో అప్లై చేసిన అప్లికేషన్‌ (రిజర్వేషన్‌ కేటగిరీ కుల ధ్రువీకరణ) పత్రాలతో మాత్రమే పరీక్ష హాలులోకి రావాల్సి ఉంటుంది.  
  •  కాలుక్యులేటర్లు, మేథమెటికల్, లాగ్‌ టేబుల్స్, పేజీలు, సెల్‌ఫోన్లు, రిస్ట్‌ వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష హాలులోకి అనుమతించరు. కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ సమస్యలొస్తే ఇన్విజిలేటర్‌ దృష్టికి తేవాలి. అవసరమైన పక్షంలో వేరే కంప్యూటర్‌ అందిస్తారు.  
  • అభ్యర్థులు ఫొటో గుర్తింపు (జిరాక్స్‌ కాకుండా)తో పరీక్షకు హాజరవ్వాలి. కాలేజీ ఐడీ, ఆధార్, డ్రైవింగ్‌ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటర్‌ ఐడీని గుర్తింపు కార్డుగా పరిగణిస్తారు. అభ్యర్థులు హాల్‌ టిక్కెట్‌పై, ఆన్‌లైన్‌ ఫైల్‌ చేసిన అప్లికేషన్‌పై ఇన్విజిలేటర్‌ ఎదురుగా సంతకం చేయాలి. 

ప్రశాంతంగా ఎంసెట్‌ రాయండి 
ఎంసెట్‌ పరీక్షకోసం అన్ని ఏర్పాట్లూ చేశాం. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా, స్వేచ్ఛాయుత వాతావరణంలో పరీక్ష రాసేలా జాగ్రత్తలు తీసుకున్నాం. విద్యార్థులనే కాదు.. సిబ్బందినీ పరీక్ష హాలులోకి సెల్‌ఫోన్లు తేనివ్వకుండా ఆదేశాలు జారీ చేశాం.  
 – ప్రొఫెసర్‌ కట్టా నర్సింహారెడ్డి (జేఎన్‌టీయూహెచ్‌ వైస్‌ చాన్స్‌లర్‌)  

Published date : 09 May 2023 06:20PM

Photo Stories