Skip to main content

Daily Current Affairs in Telugu: ఫిబ్ర‌వ‌రి 4, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu February 4th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

Centre vs Collegium : ఇబ్బందికరంగా కేంద్రం తీరు.. కొలీజియం సిఫార్సుల పెండింగ్‌పై సుప్రీం 
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా గత డిసెంబర్లో కొలీజియం సిఫార్సు చేసిన ఐదు పేర్లను త్వరలో ఆమోదించనున్నట్టు కేంద్రం పేర్కొంది. రాజస్తాన్, పట్నా, మణిపూర్‌ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్, జస్టిస్‌ సంజయ్‌కరోల్, జస్టిస్‌ పి.వి.సంజయ్‌ కుమార్‌తో పాటు పట్నా హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అష్నదుద్దీన్‌ అమానుల్లా, అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా వీరిలో ఉన్నారు. కొలీజియం సిఫార్సులను కేంద్రం పెండింగ్‌లో పె డుతున్న వైనంపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్, జస్టిస్‌ ఏఎస్‌ ఓకా ధర్మాసనానికి అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి ఫిబ్ర‌వ‌రి 3వ తేదీ ఈ మేరకు సమాచారమిచ్చారు. ‘‘ఆ ఐదు సిఫార్సులు గత డిసెంబర్‌ 13న చేసినవి. ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది’’ అని ధర్మాసనం గుర్తు చేయగా, ఆదివారానికల్లా నియామక ఉత్తర్వులు రావచ్చని బదులిచ్చారు. 

Supreme Court: సుప్రీం జడ్జీలుగా అలహాబాద్, గుజరాత్‌ హైకోర్టు సీజేలు
కోర్టులపై దాడి పరిపాటైంది: జస్టిస్‌ కౌల్‌ 
కొలీజియం సిఫార్సులను తొక్కిపడుతున్న తీరుపై ధర్మాసనం ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీల సిఫార్సు సంగతేమిటని ప్రశ్నించింది. అందుకు ఇంకాస్త సమయం పడుతుందని ఏజీ చెప్పగా మండిపడింది. ‘‘ఇది చాలా చాలా సీరియస్‌ అంశం. ఈ విషయంలో కేంద్రం వైఖరి మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతోంది. బదిలీ సిఫార్సులను కూడా పెండింగ్‌లో పెడితే మేమింకేం చేయాలని మీరు ఆశిస్తున్నట్టు? మీరు ఉత్తర్వులిచ్చే దాకా సదరు న్యాయమూర్తులు చేతులు ముడుచుకుని కూర్చోవాలా? మీరదే కోరుకుంటున్నారా?’’ అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. ‘‘ఈ విషయంలో మేం ఒక వైఖరికి వచ్చి అతి కఠినమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తున్నారు. అది అంతిమంగా అందరికీ చాలా అసౌకర్యంగా ఉంటుంది’’ అంటూ ఏజీని హెచ్చరించింది. ‘‘హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల్లో జాప్యాన్ని అస్సలు అనుమతించేది లేదు. ఎందుకంటే ఈ విషయంలో కేంద్రం పాత్ర అతి స్వల్పం. ఈ విషయమై ఎవరో మూడో శక్తి మాతో ఆటలాడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోం. మీ జాప్యం వల్ల న్యాయ, పాలనపరమైన విధులకు విఘాతం కలగడం అస్సలు ఆమోదనీయం కాదు’’ అంటూ మండిపడింది.

Supreme Court: వీఆర్‌ఎస్‌ తీసుకున్న ఉద్యోగుల‌కు నో పే స్కేల్‌ రివిజన్
‘‘హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి ఒక న్యాయమూర్తి పేరును కొలీజియం సిఫార్సు చేస్తే ఇప్పటిదాకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. మరో 19 రోజుల్లో ఆయన రిటైరవుతున్నారు. సీజే అవకుండానే రిటైరవాలని మీరు ఆశిస్తున్నట్టా?’’ అని నిలదీసింది. ఇది తమ దృష్టిలో ఉందని, అవసరమైన చర్యలు తీసుకుంటామని ఏజీ బదులిచ్చినా సంతృప్తి చెందలేదు. ‘‘కొలీజియం సిఫార్సులను ఒక్కోసారి రాత్రికి రాత్రే ఆమోదిస్తున్నారు. మరికొన్నిసార్లు విపరీతంగా జాప్యం చేస్తున్నారు’’ అంటూ తీవ్రంగా తప్పుబట్టింది. కొలీజియం పునరుద్ఘాటించిన పేర్లనూ పెండింగ్‌లో పెడుతున్నారని న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కోర్టులపై బయట తీవ్ర దాడికి పాల్పడుతున్నారని మరో న్యాయవాది ఆరోపించగా వీటికి అలవాటు పడిపోయామని జస్టిస్‌ కౌల్‌ ఆవేదన వెలిబుచ్చారు. విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేశారు.
కొలీజియం విషయమై కేంద్రానికి, న్యాయవ్యవస్థకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొనడం తెలిసిందే. కొలీజియం సిఫార్సులను కేంద్రం పెండింగ్‌లో పెట్టడం దాన్ని మరింత పెంచింది. తాజాగా అలహాబాద్, గుజరాత్‌ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ సారథ్యంలోని కొలీజియం జనవరి 31న సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులకు గాను ప్రస్తుతం 27 మందే ఉన్నారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (8-14 జనవరి 2023)

Railway: నిమిషానికి 2.25 లక్షల టికెట్లు అందించ‌నున్న‌ రైల్వే 
రైల్వే టికెట్‌ రిజర్వేషన్‌ సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న నిమిషానికి 25 వేల నుంచి 2.25 లక్షల టికెట్లకు పెంచేందుకు కృషి చేస్తున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. ఎంక్వైరీ విభాగం నిమిషానికి 40 వేల కాల్స్‌ తీసుకుంటుడగా, ఈ సామర్థ్యాన్ని 4 లక్షలకు పెంచుతామని ఫిబ్ర‌వ‌రి 3వ తేదీ మీడియాకు తెలిపారు. 2022–23లో కొత్తగా 4,500 కిలోమీటర్ల రైల్వే లైన్‌ (రోజుకు 12 కి.మీ.) వేయాలన్న లక్ష్యాన్ని సాధించాం. ఈ ఏడాది 7,000 కి.మీ. రైలు మార్గం నిర్మించనున్నాం’’ అన్నారు.

Vande Bharat Trains: అందుబాటులోకి మరో మూడు వందే భారత్‌ రైళ్లు

Guinness Record: గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులోకి బాబీ.. ఓ కురు వృద్ధ శునకం! 

పోర్చుగల్‌ వాసికి చెందిన బాబీ అనే కుక్క ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకంగా గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. రఫీరో డో అలెంటెజో జాతికి చెందిన ఈ కుక్క వయసు ఫిబ్రవరి 1 నాటికి 30 ఏళ్ల 226 రోజులు. ఆస్ట్రేలియాకు చెందిన బ్లూవై అనే కుక్క 29 ఏళ్ల 5 నెలలు జీవించి 1939లో చనిపోయింది. ఈ రికార్డును బాబీ తుడిచిపెట్టింది. పోర్చుగల్‌ ప్రభుత్వ పెట్‌ డేటాబేస్‌ ప్రకారం దాని వయస్సును నిర్ధారించారు. ఈ జాతి కుక్కల సరాసరి ఆయుర్దాయం 12–14 ఏళ్‌లు. బాబీ యజమానులు పోర్చుగల్‌లోని కాంకెయిరోస్‌ గ్రామానికి చెందిన కోస్టా కుటుంబం. ఈ కుటుంబంలోని లియోనెల్‌ కోస్టా అనే కుర్రాడికి 8 ఏళ్లుండగా బాబీ పుట్టింది. ఇంట్లో చాలా పెంపుడు కుక్కలుండటంతో కొన్నింటిని వదిలి పెట్టినా ఇది మాత్రం తప్పించుకుంది. ‘‘ఇంట్లో వాళ్లు తినేది ఏం పెట్టినా బాబీ తినేది. అనారోగ్య సమస్యల్లేకుండా హుషారుగా ప్రశాంతంగా ఉండేది. అదే దాని ఆయుష్షును పెంచి ఉంటుంది’ అంటారు కోస్టా. వయో భారంతో బాబీ ఇప్పుడు చురుగ్గా నడవలేకపోతోందట! చూపు కూడా తగ్గిందని కోస్టా చెప్పారు.

Tallest Man: ఎత్తు 7 అడుగుల 4 అంగుళాలు.. గిన్నిస్‌ రికార్డుకెక్కే చాన్స్‌
 
Olympics: పారిస్‌ ఒలంపిక్స్‌ను బహిష్కరించాల‌న్న పోలండ్‌ 
2024 పారిస్‌ ఒలంపిక్స్‌లో రష్యా, బెలారస్‌ల ప్రాతినిధ్యాన్ని అంగీకరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని పోలండ్‌ హెచ్చరించింది. రష్యా, బెలారస్‌లు ఒలంపిక్స్‌ పాల్గొనే పక్షంలో పోలండ్, లిథువేనియా, ఎస్టోనియా, లాట్వియా దేశాలు ఆ క్రీడలను బహిష్కరిస్తాయని పోలండ్‌ మంత్రి కమిల్‌ చెప్పారు. ఆ రెండు దేశాల క్రీడాకారులకు అవకాశమివ్వాలన్న అంతర్జాతీయ ఒలంపిక్‌ కమిటీ నిర్ణయాన్ని ఖండించారు. ఫిబ్ర‌వ‌రి 10న జరిగే ఐవోసీ భేటీలో ఈయూ, యూకే, అమెరికా, కెనడాలతోపాటు ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణను వ్యతిరేకించే 40 దేశాలు గ్రూపుగా ఏర్పడాలన్నారు. ఈ 40 దేశాలు గనుక బహిష్కరిస్తే ఒలంపిక్స్‌ నిర్వహణకు అర్థమే లేకుండా పోతుందని చెప్పారు. రష్యా పాల్గొంటే తాము ఒలంపిక్స్‌ను బహిష్కరిస్తామని ఉక్రెయిన్‌ ఇప్పటికే స్పష్టం చేసింది.

Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత నొవాక్ జకోవిచ్.. నాదల్ రికార్డు సమం
 
Ilhan Omar: అమెరికా హౌస్‌ విదేశీ వ్యవహారాల కమిటీ నుంచి ఇల్హాన్‌ ఒమర్‌ తొలగింపు
‘కశ్మీర్‌పై అమెరికా మరింత శ్రద్ధ పెట్టాలి’ అని వ్యాఖ్యానించి భారత్‌ ఆగ్రహానికి గురైన అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలు ఇల్హాన్‌ ఒమర్‌కు షాక్‌ తగిలింది. శక్తిమంతమైన హౌస్‌ విదేశీ వ్యవహారాల కమిటీ నుంచి ఆమెను తొలగించారు. డెమొక్రటిక్‌ సభ్యురాలైన ఒమర్‌ తీరుపై రిపబ్లికన్‌ సభ్యులు చాలా రోజులుగా మండిపడుతున్నారు. ఇజ్రాయెల్, యూదులకు వ్యతిరేకంగా ఇష్టారాజ్యంగా ప్రకటనలు చేసిన ఆమె విదేశీ వ్యవహారాల కమిటీలో ఉండడానికి అర్హురాలు కాదని వారు వాదిస్తూ వచ్చారు. ఓటింగ్‌ నిర్వహించగా కమిటీ నుంచి ఆమె తొలగింపుకు అనుకూలంగా 218 ఓట్లు, వ్యతిరేకంగా 211 ఓట్లు వచ్చాయి. కమిటీలో లేనంత మాత్రాన తన గళాన్ని ఎవరూ అణచివేయలేరని, తాను మరింతగా రాటుదేలుతానని ఒమర్‌ వ్యాఖ్యానించారు. ఆమె గతంలో పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లో పర్యటించారు. అప్పటి పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తో సమావేశమయ్యారు.

Queen Elizabeth: కరెన్సీ నోటుపై ఎలిజబెత్ రాణి ఫోటో తొలగింపు..
 
Spy Balloon: అమెరికా అణుస్థావరంపై చైనా బెలూన్‌ 
చైనాకు చెందిన నిఘా బెలూన్‌ అమెరికా గగనతలంపై, అదీ అణు స్థావరం వద్ద తచ్చాడటం కలకలం రేపింది. దీనిపై అమెరికా తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ చైనా పర్యటనను వాయిదా వేసుకున్నారు. మూడు బస్సుల పరిమాణంలో ఉన్న ఈ బెలూన్‌ కొన్ని రోజులుగా తమ గగనతలంలో అగుపిస్తోందని, అది ఫిబ్ర‌వరి 2వ తేదీ మోంటానాలో ప్రత్యక్షమైందని పెంటగాన్‌ పేర్కొంది. అది అత్యంత ఎత్తులో ఎగురుతున్నందున వాణిజ్య విమానాల రాకపోకలకు అంతరాయమేమీ లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో సున్నిత సమాచారం లీకవకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించింది. బెలూన్‌ను కూల్చేస్తే దాని శకలాల వల్ల ప్రజలకు హాని కలగవచ్చని ఆర్మీ భావిస్తోంది. అన్ని అంశాలను అధ్యక్షుడు బైడెన్‌కు వివరించినట్లు పెంటగాన్‌ ప్రకటించింది. అమెరికాలోని మూడు భూగర్భ అణు క్షిపణి కేంద్రాల్లో ఒకటి మోంటానాలోనే ఉంది. దాంతో ఈ పరిణామం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. చైనాతో చర్చల నిమిత్తం ఫిబ్ర‌వ‌రి 3వ తేదీ రాత్రి బయల్దేరాల్సిన విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ పర్యటన వాయిదా పడింది. వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించిన బెలూన్‌ దారి తప్పి అమెరికా గగనతలంలోకి ప్రవేశించిందని చైనా పేర్కొంది. ఈ అనుకోని పరిణామానికి చింతిస్తున్నట్టు చెప్పింది. ఈ వివరణతో అమెరికా సంతృప్తి చెందలేదు. ‘‘మా గగనతలంలోకి చైనా బెలూన్‌ రావడం మా సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే. చైనా చర్య ఆమోదయోగ్యం కాదు. ఈ సమయంలో బ్లింకెన్‌ పర్యటన సరికాదని భావిస్తున్నాం’’ అని అమెరికా అధికారి ఒకరన్నారు. పరిస్థితులు అనుకూలించాక బ్లింకెన్‌ చైనా పర్యటన ఉంటుందన్నారు.

Air Force: 2025లో అమెరికా, చైనా యుద్ధం!

Published date : 04 Feb 2023 06:18PM

Photo Stories