Skip to main content

నవంబర్ 2019 ద్వైపాక్షిక సంబంధాలు

పేటెంట్లపై భారత్, జపాన్ ఒప్పందం
Current Affairs
పేటెంట్ల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేసే విధంగా భారత్, జపాన్ పేటెంట్ కార్యాలయాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రయోగాత్మకంగా పరీక్షించే ఈ ఒప్పందం 3 ఏళ్లు అమల్లో ఉంటుంది. ద్వైపాక్షిక పేటెంట్ ప్రాసిక్యూషన్ హైవే (పీపీహెచ్) ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత కుదిరిన తొలి ఒప్పందం ఇదేనని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ నవంబర్ 21న తెలిపింది. మేకిన్ ఇండియా నినాదానికి ఊతమిచ్చేలా కంపెనీలు మరింతగా ఇన్వెస్ట్ చేసేందుకు, కొంగొత్త టెక్నాలజీల ఆవిష్కరణకు, ఉపాధి అవకాశాలకు ఈ ఒప్పందం ఉపయోగపడగలదని వివరించింది.
2014-15లో పేటెంట్ దరఖాస్తు పరిశీలనా వ్యవధి 72 నెలలుగా ఉండగా.. దాన్ని ప్రస్తుతం 36 నెలలకు కుదించారు. 2021 నాటికి దీన్ని 12-16 నెలలకు కుదించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వేగవంతమైన విధానం కింద 67 రోజుల్లోనే అనుమతులు లభించే అవకాశాలు ఉన్నాయి. 2014-15లో 6,000 పేటెంట్లు జారీ కాగా.. 2018-19 నాటికి ఇది 15,000కు చేరింది. ఈ ఏడాది ఇది 25,000కు చేరవచ్చని అంచనా.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పేటెంట్లపై భారత్, జపాన్ ఒప్పందం
ఎప్పుడు : నవంబర్ 21
ఎందుకు : పేటెంట్ల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు

ఈజిప్టు నుంచి 6వేల టన్నుల ఉల్లి దిగుమతి
దేశీయంగా ఉన్న కొరత, పెరుగుతున్న ధరను దృష్టిలో పెట్టుకుని ఈజిప్టు నుంచి 6వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోవాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దీనిని కిలో రూ.52-60 స్థాయిలో రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. సుమారు 1.2 లక్షల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోవాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈజిప్టు నుంచి మొదటి విడతగా 6,090 టన్నుల ఉల్లి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈజిప్టు నుంచి 6,090 టన్నుల ఉల్లి దిగుమతి
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : దేశీయంగా ఉన్న ఉల్లి కొరత నేపథ్యంలో

ఏపీ తీరంలో భారత్, అమెరికా సైనిక విన్యాసాలు
Current Affairs
భారత్, అమెరికా త్రివిధ దళాలు ‘టైగర్ ట్రయాంఫ్’ (పులి విజయం) పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, కాకినాడ సముద్రతీరంలో సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయి. 2019, నవంబర్ 14 నుంచి 8 రోజుల పాటు జరిగే ఈ విన్యాసాల్లో 500 మంది అమెరికన్ మెరైన్స్, సెయిలర్స్, ఎయిర్‌మెన్, భారత దేశపు త్రివిధ దళాలకు చెందిన 1,200 మంది పాల్గొనున్నారు. భారత్‌కు చెందిన ఐఎన్‌ఎస్ జలష్వా, ఐఎన్‌ఎస్ ఐరావత్‌తో పాటు అమెరికాకు చెందిన యూఎస్‌ఎస్ జర్మన్ టౌన్ యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో ఆకర్షణగా నిలవనున్నాయి.
భారత్, అమెరికా మధ్య సత్సంబంధాలు మెరుగుపడటంతో పాటు భద్రత, పరస్పర సహకారం, విపత్తుల వేళ పరస్పర తోడ్పాటు వంటి అంశాలను బలోపేతం చేసుకోవడమే ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నవంబర్ 14 నుంచి ‘టైగర్ ట్రయాంఫ్’ (పులి విజయం) పేరుతో సైనిక విన్యాసాలు
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : భారత్, అమెరికా త్రివిధ దళాలు
ఎక్కడ : విశాఖ, కాకినాడ సముద్రతీరం, ఆంధ్రప్రదేశ్

కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం
సిక్కుల పవిత్ర యాత్రా స్థలాలైన పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా, భారత్‌లోని గురుదాస్‌పూర్ డేరాబాబా నానక్ గురుద్వారాను కలిపే కర్తార్‌పూర్ కారిడార్ నవంబర్ 9న ప్రారంభమైంది. సరిహద్దులకు సమీపంలోని డేరాబాబానానక్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ, కర్తార్‌పూర్‌లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అకల్ తఖ్త్ జతేదార్ హర్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్, మాజీ క్రికెటర్, పంజాబ్ మాజీ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ తదితర 500 మంది ప్రముఖులతో కూడిన మొదటి యాత్రికుల బృందం ‘జాతా’ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆధునిక వసతులతో కూడిన యాత్రికుల భవనం ‘ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్’ను, సామూహిక వంటశాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘కారిడార్ విషయంలో భారత్ మనోభావాలను గౌరవించిన ఇమ్రాన్‌ఖాన్ మియాజీకి కృతజ్ఞతలు’ అని తెలిపారు. సిక్కు మత వ్యవస్థాపకుడు బాబా గురునానక్ 550వ జయంతి 2019, నవంబర్ 12న ఉన్న నేపథ్యంలో నవంబర్ 9న కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 9
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ఎక్కడ : డేరాబాబా నానక్, కర్తార్‌పూర్
ఎందుకు : సిక్కుల పవిత్ర యాత్రా స్థలాలైన కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా, గురుదాస్‌పూర్ డేరాబాబా నానక్ గురుద్వారాను కలిపేందుకు

భారత పర్యటనలో బ్రిటన్ యువరాజు
రెండురోజుల పర్యటన కోసం బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్ నవంబర్ 13న భారత్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనకు స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్‌లోని ఔషధీవనంలో ప్రిన్స్ ఛార్లెస్ మొక్కను నాటారు. అనంతరం గురుద్వారా బంగ్లా సాహిబ్‌ను సందర్శించారు. అక్కడి ప్రసాదం తయారీశాలకు వెళ్లి రోటీలు తయారు చేశారు. గురునానక్ 550వ జయంతి సమయంలో ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రిన్స్ ఛార్లెస్ అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌కు రావడం ఇది పదోసారి.

ప్రధాని మోదీతో జర్మనీ చాన్స్‌లర్ మెర్కెల్ భేటీ
Current Affairs
రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ నవంబర్ 1న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఉగ్రవాదం, రక్షణ, ఇంధనం, 5జీ, కృత్రిమ మేధ వంటి అంశాలపై ఇరువురు విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఉగ్రవాదం పీచమణచడానికి ఉమ్మడిగా పోరాటం సాగించాలని నిర్ణయించారు. అంతర్-ప్రభుత్వ సంప్రదింపుల (ఐజీసీ) భేటీకి మోదీ, మెర్కెల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఇరుదేశాలు అంతరిక్షం, పౌరవిమానయానం, విద్య, వైద్యం, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ వంటి 17 రంగాల్లో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భారత నగరాల్లో హరిత రవాణా వ్యవస్థల కోసం 100 కోట్ల యూరోల ఆర్థిక సాయాన్ని అందించడానికి జర్మనీ అంగీకరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఉగ్రవాదం, రక్షణ, ఇంధనం, 5జీ, కృత్రిమ మేధ వంటి అంశాలపై చర్చించేందుకు

కర్తార్‌పూర్‌కు పాస్‌పోర్ట్ అవసరం లేదు: ఇమ్రాన్‌ఖాన్
పాకిస్తాన్‌లోని పవిత్రస్థలం కర్తార్‌పూర్‌ను సందర్శించే భారత సిక్కు యాత్రికులకు పాస్‌పోర్టు అవసరం లేదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు. కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను సందర్శించే సిక్కులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలన్న నిబంధన కూడా లేదని, తగిన గుర్తింపు కార్డు ఉన్న వారంతా కర్తార్‌పూర్‌నకు రావచ్చని తెలిపారు.
సిక్కుల పవిత్ర యాత్రా స్థలాలైన పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా, భారత్‌లోని గురుదాస్‌పూర్ డేరాబాబా నానక్ గురుద్వారాను కర్తార్‌పూర్ కారిడార్ కలుపుతుంది. సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ 550వ జయంతిని (నవంబరు-12) పురస్కరించుకొని 2019, నవంబర్ 9న ఈ కారిడార్‌ను ప్రారంభించనున్నారు. పాక్‌లోని నారోవల్ జిల్లా రావి నది ఒడ్డున కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా ఉంది.

థాయ్‌లాండ్ పర్యటనకు ప్రధాని మోదీ
ఆసియా దేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందించే లక్ష్యంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడురోజుల థాయ్‌లాండ్ పర్యటనకు నవంబర్ 2న బయల్దేరారు. ఈ పర్యటనలో భాగంగా థాయ్‌లాండ్ ప్రధాని ప్రయూత్ చాన్-ఓ-చాతో మోదీ సమావేశం కానున్నారు. నవంబర్ 3న జరగనున్న ఈ భేటీలో వాణిజ్యం, తీర ప్రాంతాల భద్రత, అనుసంధానం వంటి అంశాల్లో సహకారం పెంపు వంటి అంశాలపై ప్రయూత్, మోదీ చర్చలు జరపనున్నారు. మరోవైపు 14వ తూర్పు ఆసియా సదస్సు, ఆసియన్ ఇండియా సదస్సులో మోదీ పాల్గొననున్నారు. అలాగే గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసే కార్యక్రమానికి హాజరవుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : థాయ్‌లాండ్ పర్యటనకు ప్రధాని మోదీ
ఎప్పుడు : నవంబర్ 2
ఎందుకు : ఆసియా దేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందించే లక్ష్యంతో

ఆసియాన్-ఇండియా సమావేశంలో మోదీ
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ సమీపంలోని నొంతబురిలో నవంబర్ 3న జరిగిన ఆసియాన్-ఇండియా 16వ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మోదీ ప్రసంగిస్తూ... ఆసియాన్‌తో సంబంధాలను మరింత విసృ్తతం చేసుకునేందుకు భారత్ సానుకూలంగా ఉందని తెలిపారు. ఆసియాన్‌లోని 10 దేశాలతో భూ, వాయు, సముద్ర అనుసంధానత పెంపు ద్వారా ప్రాంతీయ వాణిజ్యం, ఆర్థిక ప్రగతి గణనీయంగా మెరుగవుతాయన్నారు. డిజిటల్ అనుసంధానత కూడా చాలా కీలకమైందన్నారు. బ్యాంకాక్‌లో నవంబర్ 2న భారత సంతతి ప్రజలతోనూ మోదీ బేటీ అయ్యారు.
ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలి
భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలను మరింత విసృ్తతం చేసుకోవడంతోపాటు ఉగ్రవాదం వంటి పెను సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవాలని ఆసియాన్ నిర్ణయించిందని భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విజయ్ ఠాకూర్ సింగ్ తెలిపారు. దక్షిణ చైనా సముద్రం అంశాన్ని కూడా ఆసియాన్ చర్చించిందని తెలిపారు.
ఆసియాన్ గురించి..
ఆసియాన్(అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ - ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య) 1967 ఆగస్టు 8న ‘‘వన్ విజన్, వన్ ఐడెంటిటీ, వన్ కమ్యూనిటీ’’ అనే నినాదంతో ఏర్పడింది. పరస్పర సహకారంతో ప్రాంతీయంగా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధి సాధించడమే సమాఖ్య ముఖ్య ఉద్దేశం. ఆసియాన్ ప్రధాన కార్యాలయం ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఉంది. ఇందులో పది సభ్యదేశాలున్నాయి.
ఆసియాన్ సభ్యదేశాలు
ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, {బూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియాన్-ఇండియా 16వ శిఖరాగ్ర సమావేశం
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : ప్రధాని నరేంద్రమోదీ
ఎక్కడ : నొంతబురి, బ్యాంకాక్, థాయ్‌లాండ్

థాయ్‌లాండ్ ప్రధానితో మోదీ సమావేశం
థాయ్‌లాండ్ ప్రధాని ప్రయూత్ చాన్-ఓ-చాతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో నవంబర్ 3న జరిగిన ఈ భేటీలో రక్షణ పరిశ్రమల రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని విసృ్తతం చేసుకునేందుకు మోదీ, ప్రయూత్ అంగీకరించారు. బ్యాంకాక్ నుంచి గువాహటికి నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించాలని, థాయ్‌లాండ్‌లోని రణోంగ్ పోర్టుతో భారత్‌లోని కోల్‌కతా, చెన్నై, విశాఖ నౌకాశ్రయాల మధ్య అనుసంధానత పెంచాలని నిర్ణయించారు. వాణిజ్యం పెంపుపైనా ఇద్దరు నేతలు చర్చించారు. అనంతరం ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోతో కూడా ప్రధాని మోదీ భేటీ అయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : థాయ్‌లాండ్ ప్రధాని ప్రయూత్ చాన్-ఓ-చాతో సమావేశం
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : బ్యాంకాక్, థాయ్‌లాండ్

కాలాపానీ గ్రామం మాదే : నేపాల్
భారత ప్రభుత్వం 2019, నవంబర్ 2నవిడుదల చేసిన పటం(ఇండియా మ్యాప్)లో ‘కాలాపానీ’ గ్రామాన్ని భారత్‌లో ఉన్నట్లు చూపిందని, అయితే అది తమకు చెందినదంటూ నేపాల్ అభ్యంతరం లేవనెత్తింది. కాలాపానీ ప్రాంతం ఉత్తరాఖండ్‌లోని పితోరగఢ్ జిల్లాలో ఉన్నట్లు భారత మ్యాపులో కనిపించగా, ఆ ప్రాంతం తమ దేశంలోని దార్చులా జిల్లాకు చెందినదని నేపాల్ విదేశీ వ్యవహారాల శాఖ నవంబర్ 6న తెలిపింది. భారత ఎంబసీ అధికారులు దీనిపై ఇంకా స్పందించలేదు.
Published date : 27 Nov 2019 04:31PM

Photo Stories