Skip to main content

మే 2020 ద్వైపాక్షిక సంబంధాలు

రఫేల్ సరఫరాలో జాప్యం జరగదు: ఫ్రాన్స్
Current Affairs
భారత్‌కు 36 రఫేల్ జెట్ విమానాల సరఫరాలో ఎలాంటి జాప్యం జరగబోదని ఫ్రాన్స్ రాయబారి ఇమ్మానుయేల్ లినైన్ చెప్పారు. ఈ విషయంలో విధించిన గడువును తాము గౌరవిస్తామని అన్నారు. ఫ్రాన్స్ నుంచి రూ.58,000 కోట్లతో 36 రఫేల్ ఫైటర్ జెట్ విమానాల కొనుగోలుకు 2016 సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 36 రఫేల్ విమానాల్లో 30 విమానాలు ఫైటర్ జెట్లు, మరో ఆరు ట్రైనర్ జెట్లు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌మంత్రి 2019, అక్టోబర్ 8వ తేదీన మొదటి రఫేల్ విమానాన్ని ఫ్రాన్స్ నుంచి స్వీకరించారు. 2020, ఏప్రిల్‌లో మరో విమానాన్ని ఫ్రాన్స్ అందజేసిందని ఇమ్మానుయేల్ చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రఫేల్ విమానాల సరఫరాలో జాప్యం తప్పదని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.
ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలకు ఈయూ సాయం
అంఫన్ తుఫాన్‌తో తీవ్రంగా నష్టపోయిన ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను ఆదుకొనేందుకు యూరోపియన్ యూనియన్(ఈయూ) భారత్‌కు 5 లక్షల యూరోల సాయం ప్రకటించింది. తుఫానుతో పాటు కరోనాతో పోరాడుతున్న వైద్యరక్షణ కోసం తక్షణ సాయంగా 5 లక్షల కోట్లు యూరోలు అందిస్తున్నట్టు ఈయూ మే 22న తెలిపింది. తొలి విడతగా ఈ నిధులు విడుదల చేస్తున్నామని పేర్కొంది. అంఫన్ కారణంగా నష్టపోయిన బంగ్లాదేశ్‌కు కూడా సాయం ఈయూ అందించింది. బంగ్లాదేశ్‌లో ఎక్కువ నష్టం ఉండటంతో 11 లక్షల యూరోల సాయం ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సాయం
ఎప్పుడు : మే 22
ఎవరు : యూరోపియన్ యూనియన్(ఈయూ)
ఎందుకు : అంఫన్ తుఫానుతో పాటు కరోనాతో పోరాడుతున్న వైద్యరక్షణ కోసం తక్షణ సాయంగా

సరిహద్దుల్లో చైనా హెలికాప్టర్-డ్రోన్
సరిహద్దుల్లో భారత్‌తో పదేపదే కయ్యానికి కాలు దువ్వుతున్న డ్రాగన్ దేశం మరో అడుగు ముందుకువేయనుంది. పర్వత ప్రాంతాల్లో విధులు నిర్వహించేందుకు వీలుగా ఇటీవలే అభివృద్ధి చేసిన అత్యాధునిక హెలికాప్టర్-డ్రోన్‌ను త్వరలోనే టిబెట్‌లో భారత్ సరిహద్దుల్లో మోహరించనుంది. ఈ విషయాన్ని చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక పేర్కొంది.
గ్లోబల్ టైమ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. చైనా తయారీ మొట్టమొదటి ఈ హెలికాప్టర్-డ్రోన్‌ను 5,000 మీటర్ల నుంచి 6,700 మీటర్ల ఎత్తైన ప్రదేశాల నుంచి ఆపరేట్ చేయవచ్చు. 500 కిలోల వరకు బరువు మోస్తూ గంటకు 170 కిలోమీటర్ల వేగంతో ఐదు గంటలపాటు ఏకబిగిన ఎగరగలదు. ప్రభుత్వ ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా(ఎవిక్) గత వారమే దీనిని విజయవంతంగా ప్రయోగించి చూసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సరిహద్దుల్లో హెలికాప్టర్-డ్రోన్
ఎప్పుడు : మే 25
ఎవరు : చైనా
ఎక్కడ : టిబెట్‌లో భారత్ సరిహద్దుల్లో

భారత్ నుంచి చైనీయులు తరలింపు
కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో భారత్‌లో ఉంటున్న చైనీయులందరినీ ఖాళీ చేసి స్వదేశానికి తరలించాలని పొరుగుదేశం చైనా నిర్ణయించింది. కరోనా కాలంలో భారత్‌లో ఉన్న విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు కష్టాలు ఎదుర్కొంటున్నారని స్వదేశానికి వెళ్లాలని అనుకునేవారు ప్రత్యేక విమానాల్లో టికెట్లు బుక్ చేసుకోవాలని చైనా అధికార వెబ్‌సైట్‌లో మే 25న ఒక ప్రకటన వెలువడింది.
సరిహద్దుల్లో ఉద్రిక్తత
భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తూర్పు లద్దాఖ్‌లోని వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలకు రెండు దేశాలు సైనిక బలగాలను పెద్ద ఎత్తున తరలిస్తున్నాయి. గాల్వన్ లోయ, ప్యాంగ్యాంగ్ సొ ప్రాంతాలకు మరిన్ని బలగాలను తరలించామని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లోనే చైనా కూడా తాత్కాలిక నిర్మాణం చేపట్టడంతో పాటు, 2,500 మంది సైనికులను సిద్ధంగా ఉంచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ నుంచి చైనీయులు తరలింపు
ఎప్పుడు : మే 25
ఎవరు : చైనా
ఎందుకు : భారత్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో

నేపాల్ కొత్త మ్యాప్‌పై నిర్ణయం వాయిదా
లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర తమ దేశంలో భాగమేనని చూపుతూ అధికారికంగా దేశ చిత్రపటాన్ని మార్చేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రస్తుతానికి పార్లమెంట్లో ప్రవేశపెట్టకూడదని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిపాదిత బిల్లు మే 27న పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సి ఉండగా.. ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయం అవసరమని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి భావించడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. అన్ని పార్టీలు మద్దతిచ్చిన తరువాతనే ఈ విషయంలో ముందుకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు.
లిపులేఖ్, కాలాపానీ, లింపియధురలను నేపాల్‌లో అంతర్భాగమేనని చూపుతూ మే 18వ తేదీన నేపాల్ కొత్త పొలిటికల్ మ్యాప్‌ను విడుదల చేసింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. కృత్రిమంగా దేశ భూభాగాన్ని పెంచుకునే దుశ్చర్యలకు పాల్పడవద్దని ఘాటుగా నేపాల్‌ను హెచ్చరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: నేపాల్ కొత్త మ్యాప్‌పై నిర్ణయం వాయిదా
ఎప్పుడు: మే 27
ఎవరు: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి
ఎందుకు: నూతన మ్యాప్ విషయంలో దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయం అవసరమని

లిపులేఖ్, కాలాపానీలు మావే: నేపాల్
Current Affairs
లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాల కోసం భారత్, నేపాల్‌ల మధ్య కొనసాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. ఈ మూడు ప్రాంతాలూ తమవేననీ, రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా వాటిని భారత్ నుంచి తిరిగి పొందుతామని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ తెలిపారు. లిపులేఖ్, కాలాపానీ, లింపియధురలను నేపాల్ భూభాగంలో ఉన్నట్లు చూపించే కొత్త మ్యాప్‌కు ఆ దేశ కేబినెట్ మే 19న ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఓలీ పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. ‘నేపాల్‌కు చెందిన ఈ మూడు ప్రాంతాల్లోనూ సైన్యాన్ని మోహరించి భారత్ వివాదాస్పదంగా మార్చింది. నేపాలీలు అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంది. కాలాపానీలో 1962 నుంచి భారత సైన్యం ఉంది. గత పాలకులు ఈ అంశాన్ని లేవనెత్తడానికి వెనుకంజ వేశారు. వాటిని మేం తిరిగి పొందుతాం‘ అని తెలిపారు. ఈ మూడు ప్రాంతాలను తమకు అప్పగించాలని భారత్‌ను డిమాండ్ చేస్తూ అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంట్‌లో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టింది. కాలాపానీ, లిపులేఖ్‌లు తమవేనంటూ 2019, అక్టోబర్‌లో భారత్ మ్యాప్ విడుదల చేయడంతో ఈ వివాదం మొదలైంది.

థామస్ జెఫర్సన్ వర్సిటీతో భారత్ బయోటెక్ ఒప్పందం
కొవిడ్- 19 వ్యాధికి టీకా అభివృద్ధి చేసేందుకు యూఎస్‌ఏలోని ఫిలడెల్ఫియాలో ఉన్న థామస్ జెఫర్సన్ యూనివర్సిటీతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. క్రియారహిత రెబీస్ వెక్టార్ ప్లాట్‌ఫామ్ ను ఉపయోగించి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయనున్నట్లు భారత్ బయోటెక్ సీఈవో డాక్టర్ కృష్ణమోహన్ మే 20న తెలిపారు. తాజా ఒప్పందం ప్రకారం టీకాను అభివృద్ధి చేయటమే కాకుండా యూఎస్, ఐరోపా, జపాన్ తదితర దేశాల్లో విక్రయించే హక్కులు లభిస్తాయి. ప్రస్తుతం కరోనా టీకా అభివృద్ధికి జరుగుతున్న ప్రయత్నాల్లో 25 శాతం ఇప్పటికే అందుబాటులో ఉన్న టీకా ప్లాట్‌ఫామ్‌లను కేరియర్ లేదా వెక్టార్‌గా ఉపయోగించుకుంటున్నవి. దీనివల్ల త్వరితంగా టీకాను అభివృద్ధి చేయటానికి, మెరుగైన ఫలితాలు సాధించటానికి వీలు కలుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి:థామస్ జెఫర్సన్ యూనివర్సిటీతో ఒప్పందం
ఎప్పుడు:మే 20
ఎవరు: భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్
ఎందుకు: కొవిడ్- 19 వ్యాధికి టీకా అభివృద్ధి చేసేందుకు

పీవోకే ప్రాంతాల్లో ఐఎండీ వాతావరణ సూచనలు
Current Affairs
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్‌లలో మే 5 తేదీ నుంచి భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వాతావరణ సూచనలు జారీ చేయడం ప్రారంభించింది. గతంలో పలు కారణాల వల్ల ఈ ప్రాంతాల్లో ఐఎండీ వాతావరణ సూచనలు నిలిపివేసింది. ఈ విషయాన్ని జమ్మూకశ్మీర్‌లోని ప్రాంతీయ వాతావరణ విభాగం (ఆర్‌ఎండీ) హెడ్ కుల్‌దీప్ శ్రీవాత్సవ తెలిపారు. ఇదే విషయాన్ని ఐఎండీ డెరైక్టర్ జనరల్ ఎమ్.మహపాత్ర స్పష్టం చేస్తూ, ఆ ప్రాంతాలను జమ్మూకశ్మీర్ సబ్ డివిజన్‌లో భాగంగా పరిగణించనున్నట్లు తెలిపారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల పాకిస్తాన్ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ ఆదేశాలను తోసిపుచ్చిన భారత ప్రభుత్వం.. అవి తమభూభాగాలే అని, వాటిని ఎప్పటికీ తమ నుంచి వేరుచేయలేరని స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి:పీవోకే ప్రాంతాల్లో వాతావరణ సూచనలు
ఎప్పుడు: మే 5
ఎవరు: భారత వాతావరణ విభాగం (ఐఎండీ)

ఇండో-చైనా సరిహద్దులో ఉద్రిక్తత
భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తూర్పు లద్దాఖ్, ఉత్తర సిక్కింలోని నకూ లా పాస్ ప్రాంతాల్లో సరిహద్దుల వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఇరుదేశాలకు చెందిన సైనికులు గాయపడ్డారని భారత సైన్యాధికారులు మే 10న వెల్లడించారు. తొలి ఘటనలో.. మే 5న సాయంత్రం తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సరస్సు తీరం వెంబడి భారత్, చైనా దళాలకు చెందిన దాదాపు 200 మంది బాహాబాహీకి దిగడంతోపాటు, రెండు వైపులా ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. ఈ ఘర్షణలో ఎంతమంది భారతీయ సైనికులు గాయపడ్డారనే వివరాలను అధికారులు ఇవ్వలేదు. మరో ఘటనలో.. సిక్కింలోని నకూ లా పాస్ వద్ద ఇరుదేశాలకు చెందిన సుమారు 150 మంది సైనికులు బాహాబాహీకి దిగి పిడిగుద్దులతో ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. ఈ ఘటనలో 10 మంది భారతీయ సైనికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు.

ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ సిద్ధం : ఆర్మీ చీఫ్
ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ‘సమగ్ర యుద్ధ బృందాలు (ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్-ఐబీజీ)’ విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయని, కరోనా కారణంగా దీని అమలును కొంతకాలం వాయిదా వేశామని ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె తెలిపారు. యుద్ధ సామర్థ్యాలను పెంచుకునే దిశగా ప్రయోగాత్మకంగా పదాతి దళం, శతఘ్ని దళం, వైమానిక దళం, లాజిస్టిక్ యూనిట్స్‌లతో ‘ఐబీజీ’లను ఏర్పాటు చేశారు. సుమారు 5 వేల మంది సిబ్బంది ఉండే ప్రతీ ఐబీజీకి ఒక మేజర్ జనరల్ నేతృత్వం వహిస్తారు. ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొనేందుకు వారు సుశిక్షితులై ఉంటారు. ముఖ్యంగా పాక్, చైనా సరిహద్దుల్లో వీటిని మోహరించాలని ప్రణాళిక రచించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత పర్యటనకు ముందు ప్రయోగాత్మకంగా ఐబీజీల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు అరుణాచల్ ప్రదేశ్‌లో సైనిక విన్యాసాలు నిర్వహించారు.

లిపూలేఖ్ రహదారిపై నేపాల్ అభ్యంతరం
లిపూలేఖ్ ప్రాంతంలో భారత్ చేపట్టిన రోడ్డు నిర్మాణంపై నేపాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ... తమ దేశంలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వట్రాకు మే 11న నోటీసులు జారీ చేసింది. లిపూలేఖ్ తమ ఆధీనంలోని ప్రాంతమని పేర్కొంది. కాగా భారత్- చైనా సరిహద్దులో గల లిపూలేఖ్ వెంబడి భారత ప్రభుత్వం ఇటీవల రహదారి నిర్మాణం చేపట్టింది. ఇందుకు అభ్యంతరం తెలిపిన నేపాల్ ప్రభుత్వం సదరు ప్రాంతం తమ భూభాగానికి చెందినదే అని భారత్‌కు స్పష్టం చేసింది. ఈ విషయంపై స్పందించిన భారత్.. ‘‘లిపూలేఖ్ పూర్తిగా భారత అంతర్భాగం’’అని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఈ విషయంపై ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. లిపూలేఖ్ గురించి భారత్‌తో పాటు చైనాతో కూడా చర్చించాల్సి ఉందని నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యావాలి తెలిపారు.

సరిహద్దుల్లో చైనా మిలటరీ హెలికాప్టర్లు

భారత్, చైనాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పు లడాఖ్ ప్రాంతంలో చైనాకు చెందిన మిలటరీ హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం, సరిహద్దులు గుర్తించని ప్రాంతాలకు అతి దగ్గరగా ఎగరడం ఆందోళనకు కారణమైంది. ఇదే సమయంలో భారత సుఖోయ్-30 రకం విమానాలు అక్కడ చక్కర్లు కొట్టాయి. ఇటీవలే పాంగాంగ్ సరస్సు వద్ద భారత్, చైనా దేశాలకు చెందిన సుమారు 250 మంది సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే.

రక్తసిక్తమైన అఫ్గాన్

అఫ్గానిస్తాన్‌లో మే 12న కాబూల్ సహా మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడుల్లో 36 మంది మరణించారు. 80 మంది గాయపడ్డారు. కాబూల్‌లోని దస్తీబర్చీలో ఓ ప్రసూతి ఆస్పత్రిలోకి ప్రవేశించిన ముగ్గురు ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు.

వూహాన్‌లో అందరికీ పరీక్షలు

చైనాలోని వూహాన్‌లో నెల రోజుల తర్వాత మళ్లీ కరోనా కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నగరంలో నివసిస్తున్న ప్రజలందరికీ కరోనానిర్ధారణ పరీక్షలు చేయనుంది. 1.1కోట్ల మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు చైనా అధికారిక మీడియా తెలిపింది.

అమెరికాలో రోగులకు భారత్ మందులు
Current Affairs
అమెరికాలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులకు భారత్ పంపించిన యాంటీ మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ)ను ఇస్తున్నట్టుగా మెడికల్ పబ్లికేషన్ ఎండెడ్‌‌జ మే 2న వెల్లడించింది. అమెరికాలో కరోనా హాట్‌స్పాట్‌లలో ఒకటైన కనెక్టికట్‌లో క్లోరోక్విన్ ఔషధాన్ని ఎక్కువగా వాడుతున్నారు. కరోనాపై పోరాటంలో క్లోరోక్విన్ గేమ్ ఛేంజర్‌గా మారుతుందని గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాలో మరణాలు లక్షలోపు ఉండవచ్చునని ట్రంప్ అంచనా వేశారు.

రెమిడెస్‌విర్‌కు ఎఫ్‌డీఏ అనుమతి
వైరల్ ఇన్‌ఫెక్షన్‌లను నియంత్రించడానికి వాడే రెమిడెస్‌విర్ ఔషధాన్ని అత్యవసర సమయాల్లో కోవిడ్ రోగులకు ఇవ్వడానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్‌ను కూడా నియంత్రించడానికి ఈ మందు ఉపయోగపడుతుందని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది.

ఆ అధికారం పాకిస్తాన్‌కు లేదు : భారత్
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలన్న పాకిస్తాన్ సుప్రీంకోర్టు తీర్పుపై భారత ప్రభుత్వం మండిపడింది. భారత్‌లో భాగమైన గిల్గిట్ బాల్టిస్తాన్‌కు సంబంధించి తీర్పులు వెలువరించే హక్కు పాక్ సుప్రీం కోర్టుకు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత్ విదేశాంగ శాఖ అధికారికంగా పాక్ రాయబారికి దౌత్యపరమైన లేఖను అందజేసింది. అక్రమంగా ఆక్రమించిన కశ్మీర్‌లోని ప్రాంతాల్ని వెంటనే విడిచి వెళ్లాలని పాక్‌కు స్పష్టం చేసింది. గిల్గిట్ బాల్టిస్తాన్‌పై సర్వాధికారాలూ తమవేనని, దానిపై న్యాయపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం పాక్ సుప్రీం కోర్టుకు లేవని ఆ దేశ దౌత్యవేత్తకు మే 4న తేల్చిచెప్పింది.
గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో ఎన్నికలు జరిపేందుకు వీలుగా పాక్ ప్రభుత్వం 2018లో ఓ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని సమర్థిస్తూ పాక్ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీనీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్.. అధికారికంగా పాక్ దౌత్యవేత్తలకు తన నిరసన తెలిపింది. గిల్గిత్ బాల్టిస్తాన్‌లో ఇదివరకు ఎన్నికలు ఉండేవి కావు. దాన్ని చట్టబద్ధంగా చేజిక్కించుకోడానికి పాక్ కుటిలబుద్ధితో 2018లో ఓ చట్టం తీసుకురాగా అక్కడి సుప్రీంకోర్టు దానిపై రబ్బరు స్టాంపు వేసింది.
Published date : 23 May 2020 12:50PM

Photo Stories