Skip to main content

జులై 2019 ద్వైపాక్షిక సంబంధాలు

భారత్, పాక్‌లకు అమెరికా ఆయుధాలు
Current Affairs భారత్‌కు రూ.4,613 కోట్ల విలువైన ఆయుధాలను అమ్మేందుకు కూడా అమెరికా అంగీకరించింది. ఈ ఒప్పంద కింద బోయింగ్ సీ-17 గ్లోబ్‌మాస్టర్ సైనిక రవాణా విమానానికి కావాల్సిన పరికరాలు, సిబ్బందికి శిక్షణ, శిక్షణా పరికరాలను అమెరికా అందజేయనుంది. యుద్ధసమయాల్లో సైన్యాన్ని తరలించేందుకు, సహాయ చర్యలు చేపట్టేందుకు ఈ సీ-17 విమానాన్ని వినియోగిస్తున్నారు.
మరోవైపు పాకిస్తాన్‌కు రూ.860.75 కోట్ల ఆయుధాల అమ్మకాలకు సంబంధించిన ప్రతిపాదనకు అమెరికా ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు అమెరికా రక్షణ శాఖ జూలై 27న కాంగ్రెస్(పార్లమెంటు)కు తెలిపింది. ఈ ఒప్పందం కింద పాకిస్తాన్‌కు గతంలో అమ్మిన ఎఫ్-16 ఫైటర్‌జెట్లను 24 గంటల పాటు పర్యవేక్షిస్తామనీ, ఇందుకు 60 మంది కాంట్రాక్టర్లను నియమిస్తామని వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్, పాక్‌లకు ఆయుధాల విక్రయానికి ఆమోదం
ఎప్పుడు : జూలై 27
ఎవరు : అమెరికా

యూకే ఫోరం సదస్సులో కేంద్రమంత్రి అర్జున్
Current Affairs దేశరాజధాని న్యూఢిల్లీలో జూలై 19న జరిగిన ‘యూకే ఎలక్ట్రిక్ మొబిలిటీ ఫోరం-2019’ సదస్సులో కేంద్ర భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పారిస్ వాతావరణ ఒప్పందానికి అనుగుణంగా వాయు కాలుష్యాన్ని అరికట్టాలంటే విద్యుత్ వాహనాల వైపు దృష్టి సారించక తప్పదని అన్నారు. వాణిజ్య అవసరాల నిమిత్తం వినియోగించే ఎలక్టిక్ ్రవాహనాలకే రాయితీ వర్తిస్తుందని, వ్యక్తిగత వాహనాలకు ఇది వర్తించదని స్పష్టం చేశారు.
ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్టిక్ ్రవెహికిల్స్ ఇన్ ఇండియా (ఫేమ్) కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం రూ.10,000 కోట్ల మేర రాయితీ ఇస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూకే ఎలక్టిక్ ్రమొబిలిటీ ఫోరం-2019 సదస్సులో కేంద్ర మంత్రి
ఎప్పుడు : జూలై 19
ఎవరు : కేంద్ర భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్
ఎక్కడ : న్యూఢిల్లీ

యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌లో అమెరికా సలహాదారు
Current Affairs అమెరికాలోని వాషింగ్టన్‌లో జూలై 12న జరిగిన ఇండో-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం(యూఎస్‌ఐఎస్‌పీఎఫ్)లో అమెరికా సీనియర్ సలహాదారు జేర్డ్ కుష్నర్(ట్రంప్ అల్లుడు) ప్రసంగించారు. అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్న భారత్ వంటి దేశాలతో ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు అమెరికా దృష్టి పెట్టినట్లు ఈ సందర్భంగా కుష్నర్ అన్నారు. రెండు దేశాల్లోనూ దాదాపు ఒకే విధమైన విలువలను నమ్మే ప్రజలున్నారని, అందుకే వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేసుకునేందుకు ట్రంప్ యంత్రాంగం భారత్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌లో అమెరికా సలహాదారు
ఎప్పుడు : జూలై 12
ఎవరు : జేర్డ్ కుష్నర్
ఎక్కడ : వాషింగ్టన్, అమెరికా

కర్తార్‌పూర్ పై రెండో దఫా చర్చలు
సిక్కుల పవిత్ర యాత్రా స్థలాలైన పాకిస్తాన్‌లోని దర్బార్ సాహిబ్‌ను భారత్‌లోని డేరా బాబా నానక్ మందిరంతో కలిపే కర్తార్‌పూర్ కారిడార్‌పై రెండు దేశాల అధికారులు జూలై 14న వాఘా సరిహద్దుల్లోని పాక్ భూభాగంలో రెండో దఫా చర్చలు జరిపారు. కర్తార్‌పూర్ సాహిబ్ తీర్థయాత్రకు భగ్నం కలిగించేందుకు పాక్‌లోని కొందరు వ్యక్తులు, లేదా సంస్థలు ప్రయత్నించే అవకాశం ఉందని ఈ సందర్భంగా పాకిస్తాన్‌ను భారత్ హెచ్చరించింది. దీనిపై స్పందించిన పాక్..భారత వ్యతిరేక చర్యలను అనుమతించబోమని హామీ ఇచ్చింది. కారిడార్‌లో రావి నదిపై వంతెన నిర్మిస్తే అన్ని కాలాల్లోనూ యాత్రికులకు అనువుగా ఉంటుందని భారత్ ప్రతిపాదించగా, పాక్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కర్తార్‌పూర్ కారిడార్‌పై రెండో దఫా చర్చలు నిర్వహణ
ఎప్పుడు : జూలై 14
ఎవరు : భారత్, పాక్ దేశాల అధికారులు
ఎక్కడ : వాఘా సరిహద్దు, పాకిస్తాన్ భూభాగం

కుల్‌భూషణ్ మరణశిక్ష నిలిపివేత
భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ విధించిన మరణ శిక్షను నిలిపివేయాలని నెదర్లాండ్‌‌సలోని ద హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) పాకిస్తాన్‌ను ఆదేశించింది. జాధవ్‌కు విధించిన మరణ శిక్షను పాకిస్తాన్ సైనిక కోర్టు తప్పనిసరిగా పునఃసమీక్షించాలని, అప్పటివరకు జాధవ్ మరణ శిక్షను నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఐసీజే అధ్యక్షుడు, జడ్జి అబ్దుల్‌ఖవీ అహ్మద్ యూసఫ్ నేతృత్వంలోని 16 మంది న్యాయమూర్తుల ధర్మాసనం జూలై 17న తీర్పు వెలువరించింది.
ఐసీజే భారత్ తరపున ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. పాకిస్తాన్ సైనిక కోర్టుల విశ్వసనీయతను ఆయన ప్రశ్నించారు. జాధవ్‌ను కలిసేందుకు భారత అధికారులను అనుమతించకుండా ఇండియాకు ఉన్న రాయబార హక్కులకు పాక్ భంగం కలిగించిందన్న వాదనను 15 మంది న్యాయమూర్తులు అంగీకరించగా, ఒక్కరు మాత్రమే వ్యతిరేకించారు. మరోవైపు పాకిస్తాన్ తరపున బ్రిటన్‌కు చెందిన లాయర్ ఖురేషీ వాదనలు వినిపించారు. జాధవ్ కేసును వాదించేందుకు హరీష్ సాల్వే కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫీజు తీసుకున్నారు.
వియన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది..
జాధవ్‌ను నిర్బంధించిన విషయాన్ని భారత్‌కు పాక్ మూడు వారాలు ఆలస్యంగా తెలియజేయడం ద్వారా వియన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని తీర్పులో జడ్జి యూసఫ్ ప్రస్తావించారు. జాధవ్‌ను కలిసేందుకు తమ అధికారులను అనుమతించాల్సిందిగా అనేకసార్లు పాక్‌ను భారత్ కోరినా అందుకు ఆ దేశం అంగీకరించలేదన్న విషయం సుస్పష్టమవుతోందని పేర్కొన్నారు.
అసలేం జరిగింది?
  • 2016, మార్చి 3: 49 ఏళ్ల కుల్‌భూషణ్ జాధవ్‌ను అరెస్ట్ చేసిన పాక్ భద్రతా దళాలు.
  • మార్చి 24: భూషణ్ భారత గూఢచారి అనీ, ఆయనను బలూచిస్తాన్‌లో అరెస్టు చేశామని ప్రకటించిన పాక్.
  • మార్చి 26: పాక్ ఆరోపణను తోసిపుచ్చిన భారత్. ఆయన నౌకాదళ విశ్రాంత అధికారి అనీ, ఇరాన్‌లో వ్యాపారం చేసుకునే వారని ప్రకటన.
  • మార్చి 29: జాధవ్‌ను కలవడానికి రాయబారులను అనుమతించాలంటూ 16వ సారి పాక్‌ను కోరిన ఇండియా. అయినా ఒప్పుకోని పాకిస్తాన్.
  • 2017, ఏప్రిల్ 10: పాక్‌కు వ్యతిరేకంగా కుట్ర పన్నారంటూ కుల్‌భూషణ్‌కు మరణ శిక్ష విధించిన పాకిస్తాన్ సైనిక కోర్టు.
  • మే 8: పాక్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) ఆశ్రయించిన భారత్.
  • మే 9: మరణ శిక్ష అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చిన ఐసీజే.
  • మే 15: జాధవ్ కేసు విచారణలో ఐసీజేలో పరస్పరం ఆరోపణలు చేసుకున్న భారత్, పాక్.
  • మే 18: తాము తుది తీర్పు ఇచ్చేంత వరకు జాధవ్ మరణ శిక్షను వాయిదా వేయాలని పాక్‌ను ఆదేశించిన ఐసీజే.
  • జూన్ 22: పాకిస్తాన్ సైన్యాధిపతికి జాధవ్ క్షమాబిక్ష దరఖాస్తు చేసుకున్నారని సైనిక ప్రతినిధి వెల్లడి.
  • నవంబర్ 10: జాధవ్‌ను కలిసేందుకు ఆయన భార్యకు అనుమతి ఇచ్చిన పాకిస్తాన్.
  • డిసెంబర్ 25: జాధవ్‌ను కలిసిన ఆయన భార్య, తల్లి.
  • 2019, ఫిబ్రవరి 18: జాధవ్ కేసులో నాలుగు రోజులు బహిరంగ విచారణను ప్రారంభించిన ఐసీజే.
  • ఫిబ్రవరి 21: బహిరంగ విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్‌లో ఉంచిన ఐసీజే.
  • జులై 17: జాధవ్ మరణశిక్షపై పునఃమీక్ష జరపాలని, అంత వరకు శిక్ష అమలును నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు.
జాధవ్ స్వగ్రామం : మహారాష్ట్రలోని అనెవాది గ్రామానికి చెందిన కుల్‌భూషణ్ జాధవ్ చిన్నతనంలో పరేల్ గ్రామంలో పెరిగారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కుల్‌భూషణ్ జాధవ్ మరణశిక్ష నిలిపివేత
ఎప్పుడు : జూలై 17
ఎవరు : నెదర్లాండ్‌‌సలోని ద హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)
ఎందుకు : పాకిస్తాన్ సైనిక కోర్టు తప్పనిసరిగా పునఃసమీక్షించాలని

భారత్ టారిఫ్‌ల పెంపుపై డబ్ల్యూటీవోకు అమెరికా
Current Affairs భారత్ అమెరికా నుంచి దిగుమతి అవుతున్న బాదం, వాల్‌నట్స్ తదితర 28 రకాల ఉత్పత్తులపై టారిఫ్‌లను పెంచడంపై అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థను (డబ్ల్యూటీవో) ఆశ్రయించింది. భారత్ చర్య అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధంగా ఉందని అమెరికా ఆరోపించింది. భారత్ విధించిన అదనపు సుంకాలు 1994 నాటి ట్రేడ్, టారిఫ్‌ల సాధారణ ఒప్పందం (గాట్) కింద అమెరికాకు అందుతున్న ప్రయోజనాలను రద్దు చేయడం లేదా బలహీనపరచడం చేస్తున్నట్లు ఆరోపించింది. అలాగే, భారత్ రాయితీల షెడ్యూల్‌లో పేర్కొన్న దాని కంటే కూడా విధించిన సుంకాల రేట్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.
2018లో భారత్, ఇతర దేశాల నుంచి వచ్చే అల్యూమినియం, స్టీల్ ఉత్పత్తులపై సుంకాలను అమెరికా పెంచింది. దీంతోపాటు జీఎస్‌పీ కింద భారత్‌కు చెందిన కొన్ని ఉత్పత్తులకు ఇస్తున్న జీరో టారిఫ్ ప్రయోజనాన్ని కూడా 2019, మే నుంచి నిలిపేసింది. దీంతో భారత్ అమెరికా నుంచి దిగుమతి అవుతున్న 28 రకాల ఉత్పత్తులపై టారిఫ్‌లను జూలై నెల నుంచి పెంచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డబ్ల్యూటీవోను ఆశ్రయించిన అమెరికా
ఎప్పుడు : జూలై 4
ఎందుకు : భారత్ అమెరికా నుంచి దిగుమతి అవుతున్న బాదం, వాల్‌నట్స్ తదితర 28 రకాల ఉత్పత్తులపై టారిఫ్‌లను పెంచడంపై

జూలై 17న జాధవ్ కేసులో తీర్పు: ఐసీజే
పాకిస్తాన్ మరణ శిక్ష విధించిన భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్ కేసులో జూలై 17న తీర్పు వెల్లడించనున్నట్లు ద హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) జూలై 4న వెల్లడించింది. ఐసీజే అధ్యక్షుడు, న్యాయమూర్తి అబ్దుల్‌ఖవీ అహ్మద్ యూసఫ్ జాధవ్ కేసులో తీర్పును చదివి వినిపించనున్నారు. గూఢచర్యం, ఉగ్రవాదం నేరాలకు పాల్పడ్డాడంటూ పాకిస్తాన్ సైనిక కోర్టు జాధవ్‌కు 2017 ఏప్రిల్‌లో మరణ శిక్ష విధించింది. జాధవ్ గూఢచారి, ఉగ్రవాది కాదనీ భారత్ ఐసీజేను ఆశ్రయించింది. దీంతో తమ వద్ద కేసు విచారణ పూర్తయ్యే వరకు జాధవ్‌కు విధించిన మరణ శిక్ష అమలును నిలిపివేయాలంటూ ఐసీజే అప్పట్లో పాక్‌ను ఆదేశించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కుల్‌భూషణ్ జాధవ్ కేసులో జూలై 17న తీర్పు వెల్లడి
ఎప్పుడు : జూలై 4
ఎవరు : అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)

యూఏఈ విదేశాంగ మంత్రితో మోదీ భేటీ
యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. న్యూఢిల్లీలో జూలై 9న జరిగిన ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలను కొత్త పుంతలు తొక్కించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు నేతలు చర్చించారు. యూఏఈతో గత ఐదేళ్లలో ద్వైపాక్షిక సంబంధాలు బాగా మెరుగయ్యాయని మోదీ అన్నారు. ఈ సందర్భంగా తమ దేశంలో పర్యటించాల్సిందిగా ప్రధాని మోదీని బిన్ జాయెద్ ఆహ్వానించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్‌తో భేటీ
ఎప్పుడు : జూలై 9
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ

ఐఆర్‌ఎస్‌ఈడీ కార్యక్రమంలో రాజీవ్ కుమార్
దేశ రాజధాని న్యూఢిల్లీలో జూలై 10న జరిగిన భారత్-రష్యా రెండో వ్యూహాత్మక ఆర్థిక చర్చల కార్యక్రమం(ఐఆర్‌ఎస్‌ఈడీ)లో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ప్రసంగించారు. భారత్, రష్యా తమ మధ్య ద్వైపాక్షిక ఆర్థిక బంధాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే దిశగా కలసి పనిచేస్తున్నాయని రాజీవ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. వ్యవసాయ అభివృద్ధి, ఆగ్రో ప్రాసెసింగ్ రంగం, రవాణా సదుపాయాల అభివృద్ధి, టెక్నాలజీలు, చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలకు మద్దతు, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్, బ్యాంకింగ్, ఫైనాన్స్, పర్యాటకం తదితర విభాగాల్లో సహకారానికి అవకాశం ఉందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్-రష్యా రెండో వ్యూహాత్మక ఆర్థిక చర్చల కార్యక్రమం(ఐఆర్‌ఎస్‌ఈడీ)లో ప్రసంగం
ఎప్పుడు : జూలై 10
ఎవరు : నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్
ఎక్కడ : న్యూఢిల్లీ

జపాన్ ప్రధానితో మోదీ సమావేశం
Current Affairs జీ20 సదస్సు కోసం జూన్ 27న జపాన్‌లోని ఓసాకా చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని షింబో అబేతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ పటిష్టత కోసం, అవినీతిని నిర్మూలించడానికి రుణఎగవేతదారులపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరముందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వాణిజ్యం, డేటా ఫ్లో నియంత్రణ విషయంలో సరైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. జూన్ 28 నుంచి రెండ్రోజుల పాటు జీ20 సదస్సు జరగనుంది.
జపాన్ పర్యటనలో భాగంగా కోబే నగరంలో జూన్ 27న భారత సంతతి ప్రజలతోనూ మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావడంలో జపాన్ పాత్ర ఎంతో ఉందన్నారు. ఈరోజు ఇండియాలో ప్రతీచోట జపాన్ ప్రాజెక్టులు, పెట్టుబడులు ఉన్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో భారత మానవ వనరులు, నైపుణ్యంతో జపాన్ లబ్ధిపొందుతోందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జపాన్ ప్రధాని షింబో అబేతో సమావేశం
ఎప్పుడు : జూన్ 27
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఓసాకా, జపాన్

భారత్ నుంచి హజ్ కోటా పెంపు
భారత్ నుంచి ఏటా హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల సంఖ్యను 1.7 లక్షల నుంచి 2 లక్షలకు పెంచనున్నట్లు సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ తెలిపారు. జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న జీ-20 సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సల్మాన్ ఈ మేరకు హామీ ఇచ్చారు. మక్కాకు ఒంటరిగా వెళ్లే మహిళలను లాటరీ లేకుండానే వెళ్లేందుకు వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. పురుషుల్లేకుండానే ఒంటరిగా వెళ్లే మహిళలను 2018లో 1,300 మందిని అనుమతించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ నుంచి హజ్ కోటా పెంపు
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్

ట్రంప్-అబేలతో మోదీ త్రైపాక్షిక భేటీ
జపాన్‌లోని ఒసాకాలో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబేలతో ప్రధాని నరేంద్ర మోదీ త్రైపాక్షిక భేటీలో పాల్గొన్నారు. జూన్ 28 జరిగిన జపాన్-అమెరికా-ఇండియా(జయ్)గా వ్యవహరించే మూడు దేశాల భేటీలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానం, శాంతిస్థాపన కోసం తీసుకోవాల్సిన చర్యలపై మోదీ, ట్రంప్,అబేలు చర్చలు జరిపారు.
ట్రంప్ తో మోదీ..
జీ20 సదస్సు సందర్భంగా ట్రంప్‌తో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఇరాన్-అమెరికా వివాదం, భారత్‌లో 5జీ సాంకేతికతను ప్రవేశపెట్టడం సహా పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. మరోవైపు జపాన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్-జే-ఇన్, జర్మనీ ఛాన్స్ లర్ ఏంజెలా మెర్కల్, సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో వేర్వేరుగా సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ట్రంప్-అబేలతో మోదీ త్రైపాక్షిక భేటీ
ఎప్పుడు : జూన్ 28
ఎక్కడ : ఒసాకా, జపాన్

ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ సమావేశం
జపాన్‌లోని ఒసాకాలో జరిగిన జీ-20 సదస్సుకు హాజరయిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 29న సమావేశమయ్యారు. క్రీడలు, గనుల తవ్వకం, రక్షణ, తీర ప్రాంత భద్రత వంటి విషయాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఇరువురు అంగీకరించారు. మరోవైపు ఇండోనేసియా, బ్రెజిల్, టర్కీ, ఆస్ట్రేలియా, సింగపూర్, చిలీ దేశాల అధినేతలతో వేర్వేరుగా సమావేశమైన మోదీ వాణిజ్యం ఉగ్రవాదంపై పోరు, తీరప్రాంత భద్రత, రక్షణ సహా పలు అంశాలపై చర్చించారు. ఇండోనేసియా అధ్యక్షుడు జొకొ విడోడోతో మోదీ తొలిసారి అధికారికంగా సమావేశం అయ్యారు. ఈ భేటీలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, తీర భద్రత రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌తో సమావేశం
ఎప్పుడు : జూన్ 29
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఒసాకా, జపాన్

సియాల్‌కోట్‌లో భారతీయ సిక్కులను అనుమతి
పాకిస్థాన్‌లో పంజాబ్ ప్రావిన్స్ లోని సియాల్‌కోట్ జిల్లాలోగల 500 ఏళ్ల నాటి బాబే-దే-బెర్ గురుద్వారా దర్శనానికి జూలై 1 నుంచి భారతీయ సిక్కులకు అనుమతి లభించింది. ఈ మేరకు పంజాబ్ ప్రావిన్స్ గవర్నర్ ముహమ్మద్ సర్వార్ ప్రావిన్స్ అఖాఫ్ శాఖను ఆదేశించినట్లు స్థానిక మీడియా ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ జూలై 1న వెల్లడించింది. బాబే-దే-బెర్‌లోకి ఇంతకు ముందు భారతీయులకు అనుమతి లేదు. పాకిస్థాన్, యూరప్, కెనడా, అమెరికాలకు చెందిన సిక్కు యాత్రికులకు గురుద్వారాను సందర్శించేందుకు ఇప్పటికే అనుమతి ఉంది. భారత్‌తోపాటు పలు దేశాల్లో నివసిస్తున్న సిక్కులు పంజాబ్‌లోని వివిధ క్షేత్రాలను దర్శించుకునేందుకు వస్తుంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గురుద్వారా దర్శనానికి భారతీయ సిక్కులకు అనుమతి
ఎప్పుడు : జూలై 1
ఎవరు : పంజాబ్ ప్రావిన్స్ గవర్నర్ ముహమ్మద్ సర్వార్
ఎక్కడ : బాబే-దే-బెర్ గురుద్వారా, సియాల్‌కోట్ జిల్లా, పంజాబ్ ప్రావిన్స్, పాకిస్థాన్

భారత్‌కు నాటోతో సమాన హోదా
భారత్‌కు నాటోతో సమాన హోదా ఇచ్చేందుకు సంబంధించిన శాసనసభ నిబంధనకు అమెరికా సెనేట్ జూలై 2న ఆమోదం తెలిపింది. దీంతో అమెరికా నాటో మిత్రపక్ష దేశాలైన ఇజ్రాయిల్, దక్షిణ కొరియా దేశాల సరసన భారత్ నిలవనుంది. దీనివల్ల భారత్-అమెరికా దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించేందుకు అవకాశముంటుంది. హిందూ మహాసముద్రంలో భారత్-అమెరికాల మధ్య రక్షణ సహకారం మరింత పెరగడంతో పాటు, మానవతా సహాయం, ఉగ్రవాద నిర్మూలన, సముద్ర ప్రాంతంలో భద్రత వంటివి పెంపొందించడానికి ఈ చట్టం దోహదపడుతుంది. 2020 ఆర్థిక సంవత్సరానికి గాను జాతీయ రక్షణ అధికార చట్టం (ఎన్‌డీఏఏ) బిల్లులో భారత్‌కు నాటోతో సమాన హోదా ఇచ్చే ప్రతిపాదనను పొందుపరిచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌కు నాటోతో సమాన హోదా ఇచ్చేందుకు ఆమోదం
ఎప్పుడు : జూలై 2
ఎవరు : జూలై 2
ఎక్కడ : అమెరికా సెనేట్
Published date : 26 Jul 2019 04:22PM

Photo Stories