Skip to main content

బ్యాం‘కింగ్’ కొలువుల ఎంపిక విధానం, ప్రిపరేషన్ గెడైన్స్..

ఆకర్షణీయమైన వేతనాలు.. సుస్థిరమైన కెరీర్.. ఎదిగేందుకు అపార అవకాశాలు.. తక్కువ వడ్డీకే సులువైన గృహ, వాహన రుణ సదుపాయం..
ఇలా ఎన్నో సౌకర్యాలు బ్యాంకింగ్ రంగంలో పనిచేసే ఉద్యోగుల సొంతం! ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఏటా నియామకాలు చేపడుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్, పీవో (ప్రొబేషనరీ ఆఫీసర్లు) వంటివి క్రేజీ కొలువులు!! వీటితోపాటు మార్కెటింగ్, టెక్నికల్, బిజినెస్ డెవలప్‌మెంట్, ఆపరేషన్స్, హెచ్‌ఆర్, లా ఆఫీసర్లు, చార్టర్డ్ అకౌంటెంట్స్, అగ్రికల్చరల్ ఆఫీసర్లు, ఐటీ ఆఫీసర్లు వంటి స్పెషలిస్ట్ ఆఫీసర్(ఎస్‌వో) ఉద్యోగాలను సైతం భర్తీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో..బ్యాంకింగ్ రంగంలో కొలువులు.. ఎంపిక విధానాలు.. పరీక్షల తీరుతెన్నులు.. సిలబస్ విశ్లేషణ.. ప్రిపరేషన్ గురించి తెలుసుకుందాం..!

ఎస్‌బీఐ ఎంపిక ప్రక్రియ :
దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ. క్లర్క్, పీవో పోస్టుల భర్తీకి ఏటా నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఏదైనా డిగ్రీ అర్హతతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. పీవో ఎంపిక ప్రక్రియలో భాగంగా.. ప్రిలిమ్స్, మెయిన్, గ్రూప్ ఎక్స్‌ర్‌సైజ్/ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ప్రిలిమ్స్‌లో ప్రతిభ చూపిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి.. మెయిన్ రాసేందుకు అనుమతిస్తారు. మెయిన్‌లో కటాఫ్ సాధించిన వారిని గ్రూప్ ఎక్స్‌ర్‌సైజ్/ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.
ప్రిలిమ్స్ :
ఎస్‌బీఐ పీవో ఎంపిక ప్రక్రియలో తొలి దశ అయిన ప్రిలిమ్స్ పరీక్ష 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఇందులో మొత్తం మూడు సెక్షన్‌లు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రశ్నలు30 ప్రశ్నలు-30మార్కులకు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 35 ప్రశ్నలు-35మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ 35ప్రశ్నలు-35మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. ఒక్కో సెక్షన్‌కు 20 నిమిషాల సమయం కేటాయించారు. ప్రిలిమ్స్‌లో సాధించిన మార్కుల ఆధారంగా కేటగిరీల వారీగా మెరిట్ లిస్ట్ తయారు చేసి.. అలా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను మెయిన్‌కు ఎంపిక చేస్తారు.
  • ఎస్‌బీఐ మెయిన్ ఎగ్జామినేషన్‌లో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్‌లైన్ పరీక్షతోపాటు 50 మార్కులకు 30 నిమిషాల్లో రాసే విధంగా డిస్క్రిప్టివ్ టెస్ట్(లెటర్ రైటింగ్, జనరల్ ఎస్సే) ఉంటుంది. ఇందులో నిర్ణీత మార్కులు సాధించిన వారికి తర్వాతి దశ గ్రూప్ ఎక్స్‌ర్‌సైజ్, ఇంటర్వ్యూలు ఉంటాయి. మెయిన్ పరీక్ష, డిస్క్రిప్టివ్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. మెయిన్ పరీక్ష, డిస్క్రిప్టివ్ టెస్ట్ రెండింటిలో 250 మార్కులకు సాధించిన స్కోరును 75కు, గ్రూప్ ఎక్సర్‌సెజైస్, ఇంటర్వ్యూల్లో 50 మార్కులకు వచ్చిన స్కోరును 25 మార్కులకు కుదించి.. ఫైనల్ కటాఫ్ స్కోరు నిర్దేశిస్తారు. మొత్తంగా 100 మార్కులకు సాధించిన స్కోరు ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
ఎస్‌బీఐ మెయిన్ పరీక్ష విధానం :
సెక్షన్ ప్రశ్నలు మార్కులు సమయం (నిమిషాలు)
రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 45 60 60
డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ 35 60 45
జనరల్/ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్ 40 40 35
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 35 40 40
మొత్తం 155 200 3 గంటలు

ఎస్‌బీఐ క్లర్క్ పరీక్ష :
  • ఎస్‌బీఐ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత ఏదైనా డిగ్రీ. ఈ పోస్టుల భర్తీకి రెండంచెల ఎంపిక ప్రక్రియ చేపడుతుంది. తొలి దశలో ప్రిలిమ్స్ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తుంది. ప్రిలిమ్స్‌లో ప్రతిభ చూపిన అభ్యర్థులను మెయిన్‌కు ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ పరీక్ష 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఇందులో మొత్తం మూడు సెక్షన్‌లు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు-30మార్కులకు, న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. ఒక్కో సెక్షన్‌కు 20 నిమిషాల సమయం కేటాయించారు. నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది. ప్రిలిమ్స్‌లో సాధించిన మార్కుల ఆధారంగా కేటగిరీల వారీగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను మెయిన్‌కు ఎంపిక చేస్తారు.
  • క్లర్క్ మెయిన్ పరీక్ష కూడా ఆన్‌లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో 200 మార్కులకు జరుగుతుంది. ఇందులో మొత్తం నాలుగు సెక్షన్‌లు.. జనరల్ అవేర్‌నెస్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులకు; జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు-40 మార్కులకు; క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-50 మార్కులకు; రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-60 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్‌లో సాధించిన స్కోర్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
ఐబీపీఎస్ కొలువుల ఎంపిక ప్రక్రియ ఇలా.. :
ఐబీపీఎస్.. ఎస్‌బీఐ గ్రూప్ మినహా దేశంలోని జాతీయ బ్యాంకులన్నింటిలో క్లర్క్, ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో), స్పెషలిస్ట్ ఆఫీసర్(ఎస్‌వో) పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపడుతోంది. ఐబీపీఎస్‌ను ప్రారంభించకముందు బ్యాంకులు సొంతంగా ఉద్యోగ నియామకాలు చేపట్టేవి. దీంతో అభ్యర్థులు ఒక్కో బ్యాంకుకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకుల రిక్రూట్‌మెంట్ అంతా ఐబీపీఎస్ ద్వారానే జరుగుతోంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (ఆర్‌ఆర్‌బీ)ల్లోని ఉద్యోగాల భర్తీ సైతం ఐబీపీఎస్ చేపడుతోంది.

ఐబీపీఎస్ భర్తీ చేసే కొలువులు :
  • క్లర్క్
  • మేనేజ్‌మెంట్ ట్రైనీ/పీవో
  • ఆర్‌ఆర్‌బీ (అసిస్టెంట్స్, ఆఫీసర్లు: స్కేల్-1, 2, 3)
  • స్పెషలిస్ట్ ఆఫీసర్.

ఐబీపీఎస్.. క్లర్క్, పీవో :

ఐబీపీఎస్ చేపట్టే నియామకాల్లో అత్యంత క్రేజీ ఉద్యోగాలు.. క్లర్క్, పీవో. జాతీయ బ్యాంకుల్లో, ఆర్‌ఆర్‌బీల్లో క్లర్క్, పీవో కొలువుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్లు ఇస్తుంది. రెండింటికీ పరీక్ష విధానం, ఎంపిక ప్రక్రియ దాదాపు ఒకేవిధంగా ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ.. ఇలా మూడు దశల్లో జరుగుతుంది. పీవో, ఆపై స్థాయి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. క్లర్క్/అసిస్టెంట్ ఉద్యోగాలకు మెయిన్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక జరుగుతుంది. ఐబీపీఎస్ మాదిరిగానే ఎస్‌బీఐ కూడా పీవో, క్లర్క్ స్థాయి ఉద్యోగాలకు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది.

ప్రిలిమ్స్ దాటితేనే..
ఐబీపీఎస్, ఎస్‌బీఐ చేపట్టే పీవో, క్లర్క్ ఉద్యోగాల భర్తీలో మొదట ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది. ఇందులో గట్టెక్కితేనే తదుపరి దశకు అర్హత సాధిస్తారు. ప్రిలిమ్స్ పరీక్ష వ్యవధి ఒక గంట. ప్రిలిమ్స్‌లో అభ్యర్థుల వడపోత ప్రక్రియ జరుగుతుంది.

ప్రిలిమినరీ పరీక్ష విధానం :
విభాగం ప్రశ్నలు మార్కులు
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 30
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 35
రీజనింగ్ ఎబిలిటీ 35 35
మొత్తం 100 100

ఆర్‌ఆర్‌బీ ప్రిలిమ్స్ :
ఆర్‌ఆర్‌బీ ప్రిలిమ్స్ పరీక్ష కాస్త భిన్నంగా ఉంటుంది. ఇందులో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ/క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాలుంటాయి. ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నల చొప్పున మొత్తం 80 ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 45 నిమిషాలు. ఇక్కడ సెక్షన్‌వైజ్ కటాఫ్ మార్కులుండవు.

మెయిన్ స్వరూపం :
  • ఐబీపీఎస్ పీవో మెయిన్ పరీక్షలో సబ్జెక్టుల వారీగా ప్రత్యేక సమయం ఉంటుంది. అంటే.. అభ్యర్థి సదరు సెక్షన్‌కు కేటాయించిన సమయంలోనే ఆయా ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి.
  • ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ మెయిన్ పరీక్షలో సెక్షన్‌వైజ్‌గా సమయం కేటాయించలేదు.
  • ఎస్‌బీఐ మెయిన్ పరీక్ష స్వరూపం కూడా ఇలానే ఉంటుంది. కానీ సెక్షన్లు, వాటికి కేటాయించే సమయాలు, కాఠిన్యత స్థాయిలో తేడాలుంటాయి.
సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు సమయం
రీజనింగ్ 50 50 40 ని.
క్వాంటిటేటివ్‌ఎబిలిటీ 50 50 40 ని.
జనరల్ అవేర్‌నెస్ 40 40 20 ని.
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 40 30 ని.
కంప్యూటర్ లాంగ్వేజ్ 20 20 10 ని.
మొత్తం 200 200 140 ని.

తుది ఎంపిక :

ఆఫీసర్ స్కేల్-1/పీవో పోస్టుల భర్తీలో మెయిన్ స్కోర్ ఆధారంగా కామన్ ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు. మెయిన్, కామన్ ఇంటర్వ్యూల్లో ప్రతిభను బట్టి తుది ఎంపిక ఉంటుంది. క్లర్క్/అసిస్టెంట్ పోస్టులకు మెయిన్ మార్కుల ఆధారంగానే ఎంపిక జరుగుతుంది. ఇంటర్వ్యూలు ఉండవు.

ఐబీపీఎస్.. స్పెషలిస్ట్ ఆఫీసర్ :
  • బ్యాంకులకు ఐటీ ఆఫీసర్లు, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్లు, రాజభాష అధికారి, లా ఆఫీసర్లు, హెచ్‌ఆర్ ఆఫీసర్లు, మార్కెటింగ్ ఆఫీసర్లు వంటి ప్రత్యేక నిపుణుల అవసరం ఉంటుంది. ఆయా పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ ఎస్‌వో నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. సంబంధిత అర్హతలున్న వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఐటీ ఆఫీసర్ పోస్టులకు కంప్యూటర్ సైన్స్‌/కంప్యూటర్ అప్లికేషన్స్‌/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్‌/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ డిగ్రీ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్ ఉండాలి.
  • అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్(స్కేల్1) పోస్టులకు అగ్రికల్చర్/హార్టికల్చర్/యానిమల్ హస్బెండరీ/వెటర్నరీ సైన్స్‌/ఫిషరీ సైన్స్‌/ఫుడ్ సైన్స్‌/ఫుడ్ టెక్నాలజీ/డెయిరీ టెక్నాలజీ/సంబంధిత సబ్జెక్టుల్లో నాలుగేళ్ల డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • రాజభాష అధికారి పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. హిందీలో పీజీతోపాటు డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదవాలి. లేదా సంస్కృతంలో పీజీతోపాటు డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టులు చదివుండాలి. లా ఆఫీసర్ పోస్టులకు పోటీ పడాలంటే.. ‘లా డిగ్రీ’ తోపాటు బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకొని ఉండాలి.
  • హెచ్‌ఆర్ పోస్టులకు పర్సనల్ మేనేజ్‌మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్‌/హెచ్‌ఆర్/ హెచ్‌ఆర్‌డీ/సోషల్ వర్క్/ లేబర్ లా సబ్జెక్టుల్లో పీజీ లేదా డిప్లొమా ఉత్తీర్ణులైన వారు అర్హులు.
  • మార్కెటింగ్ ఆఫీసర్ల పోస్టులకు సదరు స్పెషలైజేషన్‌తో పీజీ స్థాయి కోర్సులు చేసిన వారు అర్హులు.

ఎంపిక ప్రక్రియ :
ఆన్‌లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్షలో రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్‌ తదితర అంశాలపై ప్రశ్నలుంటాయి. లాఆఫీసర్లు, రాజభాష అధికారి పోస్టులకు మాత్రం క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కు బదులు జనరల్ అవేర్‌నెస్ ఉంటుంది. ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నల చొప్పున మొత్తం 200 ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. నెగిటివ్ మార్కులుంటాయి. సెక్షన్‌వైజ్ కటాఫ్ కూడా ఉంటుంది.

బ్యాంకింగ్ డిప్లొమా కోర్సులు :
బ్యాంకులు గత కొన్నేళ్లుగా నియామక ప్రక్రియలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయి. ప్రైవేటు విద్యాసంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని.. బ్యాంకింగ్ కార్యకలాపాలపై పీజీ డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి. 9నెలల నుంచి ఏడాది వరకు శిక్షణ ఇచ్చి.. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులను మాత్రమే పీవోలుగా నియమించుకుంటున్నాయి. గతంలో కేవలం ప్రైవేటు బ్యాంకులు మాత్రమే ఈ తరహా నియామక ప్రక్రియను చేపట్టేవి. ప్రస్తుతం పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు సైతం పీజీ డిప్లొమా కోర్సుల ద్వారా శిక్షణకు మొగ్గు చూపుతున్నాయి.

నియామక ప్రక్రియ :

  • ఆన్‌లైన్ పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్స్,ఇంటర్వ్యూలు నిర్వహించి.. పీజీ డిప్లొమా కోర్సుకు ఎంపిక చేస్తున్నాయి. కోర్సుకు అయ్యే ఫీజు చెల్లించాల్సిన బాధ్యత అభ్యర్థులదే. బ్యాంకులు రుణ సదుపాయాన్ని కల్పిస్తాయి. ఈ మొత్తాన్ని ఉద్యోగంలో చేరాక చెల్లించొచ్చు.
  • ప్రభుత్వ, ప్రైవేటు, ఫారెన్ బ్యాంకులు ఐఐఎంలు, ఐఐటీలు, ఇతర ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు నిర్వహించి స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్‌ను నియమించుకుంటున్నాయి.
  • బ్యాంకుల్లో మిడిల్ లెవల్ మేనేజ్‌మెంట్, స్పెషలైజ్డ్ కేటగిరీల్లో ఉద్యోగాలు కోరుకునేవారికి పలు ఇన్‌స్టిట్యూట్‌లు పీజీ స్థాయిలోనే కోర్సులు అందిస్తున్నాయి. ఆయా కోర్సులు, స్పెషలైజేషన్స్ ఆధారంగా కోర్సు పూర్తికాగానే కొలువులు ఖాయం చేసుకోవచ్చు.
  • ఆర్‌బీఐ, బ్యాంకులు కలిసి ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్-పుణె, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ వంటి వాటికి బ్యాంకింగ్ స్పెషలైజ్డ్ కోర్సులను అందించడంలో పేరుంది.
ప్రిపరేషన్.. పటిష్టంగా.. దాదాపు అన్ని బ్యాంకింగ్ పరీక్షలకు ఒకే సిలబస్ ఉంటుంది. ఇతర పరీక్షలతో పోలిస్తే.. బ్యాంకింగ్ పరీక్షల్లో వేగానికి, కచ్చితత్వానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి స్పీడ్‌గా గణించే నేర్పును అలవర్చుకోవాలి.

ఉమ్మడి సబ్జెక్టులు :
దాదాపు అన్ని బ్యాంకింగ్ పరీక్షల్లో ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్(న్యూమరికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్), రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ (బ్యాంకింగ్ స్పెషల్ రిఫరెన్స్‌తో), కంప్యూటర్ నాలెడ్జ్ కామన్‌గా కనిపిస్తాయి.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ :
ఈ విభాగంలో ప్రశ్నలన్నీ ప్రధానంగా హైస్కూల్ స్థాయి మ్యాథమెటిక్స్‌పై ఉంటాయి. అర్థమెటిక్‌కు సంబంధించి పర్సంటేజ్, యావరేజెస్, రేషియో-ప్రపోర్షన్, ప్రాఫిట్-లాస్, సింపుల్-కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్-వర్క్, టైమ్-డిస్టెన్స్‌, పర్ముటేషన్స్‌-కాంబినేషన్స్‌, ప్రాబబిలిటీ, మిక్షర్ అండ్ అలిగేషన్స్, పార్టనర్ షిప్ విభాగాలు కీలకం. సింప్లిఫికేషన్స్‌కు బోడ్‌మస్ రూల్స్‌ను అనుసరించి ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సంఖ్యల వర్గాలు, ఘనాలు గుర్తించుకోవాలి. ఫలితంగా సింప్లిఫికేషన్‌‌స సులువు అవుతాయి.

డేటా అనాలసిస్ :
డేటా ఇంటర్‌ప్రెటేషన్, టేబుల్స్, డయాగ్రమ్స్, నంబర్ డేటా, లైన్ గ్రాఫ్, బార్ గ్రాఫ్ తదితర గ్రాఫ్ ఆధారిత డేటాల్లోని సమాచారాన్ని క్రోడీకరించే విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఈ విభాగం ఎక్కువగా పర్సంటేజెస్, యావరేజెస్, రేషియోల మిళితంగా ఉంటుంది. కాబట్టి అర్థమెటిక్ అంశాలు కీలకం.

రీజనింగ్ :
అభ్యర్థుల అనలిటికల్ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగం.. రీజనింగ్. అభ్యర్థుల విజయాన్ని తారుమారు చేసేది ఈ విభాగమే. ఇటీవల పరీక్షల్లో హై లెవల్ రీజనింగ్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. అజంప్షన్‌‌స, ఆర్గ్యుమెంట్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కోడింగ్, డీ-కోడింగ్, అనలిటికల్ పజిల్స్, క్రిటికల్ రీజనింగ్ బాగా ప్రాక్టీస్ చేయాలి. మరీ ముఖ్యంగా అనలిటికల్ రీజనింగ్, సిలాయిజమ్స్, ఇన్ ఈక్వాలిటీస్, ఇన్‌పుట్ అవుట్‌పుట్, డేటా సఫిషియెన్సీల నుంచే ఎక్కువ ప్రశ్నలు ఎదురవుతాయి. పీవో పరీక్షల్లో కాఠిన్యత స్థాయి ఎక్కువగా ఉంటుంది.

ఇంగ్లిష్ లాంగ్వేజ్ :

ఇందులో వొకాబులరీ, రీడింగ్ కాంప్రెహెన్షన్, గ్రామర్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. సినానిమ్స్,ఆంటోనమ్స్, సెంటెన్స్ కరెక్షన్,వొక్యాబులరీ, సెంటెన్స్ రీ అరేంజ్‌మెంట్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ఇంగ్లిష్ విభాగంలో కేవలం గ్రామర్‌కే పరిమితం కాకుండా..జనరల్ ఇంగ్లిష్ నైపుణ్యాలు పెంచుకోవాలి. ఇంగ్లిష్‌లో మంచి మార్కుల కోసం వొక్యాబులరీ ఉపయోగపడుతుంది. అలాగే గ్రామర్‌పై పట్టు ఉంటేనే సెంటెన్స్ కరెక్షన్ చేయగలం.

జనరల్ అవేర్‌నెస్ :

ఈ విభాగంలో బ్యాంకింగ్ రంగంలోని తాజా పరిణామాలు, విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కేవైసీ, అంబుడ్స్‌మన్, ఆర్‌బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్, ఆర్థిక సంబంధ సంస్థల అధిపతులు, సెబీ చైర్మన్, ఐఆర్‌డీఏ అధిపతి మొదలైనవి తెలుసుకోవాలి. నీతి ఆయోగ్, దాని చైర్మన్, డిప్యూటీ చైర్మన్, సభ్యులు తదితర వివరాలు తెలుసుకోవాలి. బ్యాంకింగ్ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, విధులు, బ్యాంకులకు సంబంధించిన కొత్త విధానాలు, కోర్ బ్యాంకింగ్‌కు సంబంధించిన చట్టాలు, విధానాలు, రిజర్వ్ బ్యాంకు విధులు వంటి వాటిపై అవగాహన అవసరం. జనరల్ అవేర్‌నెస్‌లో కరెంట్ అఫైర్స్, స్టాక్ జనరల్ నాలెడ్జ్ పరంగా ఆర్థిక సంబంధ వ్యవహారాల(ఎకానమీ, ప్రభుత్వ పథకాలు)కు ప్రాధాన్యం ఇవ్వాలి.

కంప్యూటర్ నాలెడ్జ్ :

ఈ విభాగానికి సంబంధించి ప్రధానంగా కంప్యూటర్ ఆపరేషన్ సిస్టమ్స్, నెట్‌వర్క్, లేయర్స్, కంప్యూటర్ స్ట్రక్చర్, ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీ బోర్డ్ షాట్ కట్స్, ఎంఎస్ ఆఫీస్ ఫంక్షనింగ్, షార్ట్‌కట్స్,కంప్యూటర్ హార్డ్‌వేర్ సంబంధిత అంశాల(సీపీయూ, మానిటర్, హార్డ్ డిస్క్..) గురించి తెలుసుకోవాలి.

బ్యాంకుల నియామకాలు.. బహువిధాలు
  • ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ బ్యాంకులన్నింటిలో కలిపి మొత్తం 13.5 లక్షల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నట్లు అంచనా. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్)చేపడుతోంది. ఎస్‌బీఐ మాత్రం క్లర్క్, పీవో, స్పెషలిస్ట్ ఆఫీసర్ వంటి కొలువులకు సొంతంగానే నియామకాలు జరుపుతోంది.
  • ప్రైవేటు బ్యాంకులు.. కొన్ని పోస్టులకు రాత పరీక్షలు, మరికొన్ని పోస్టులకు రాత పరీక్షతోపాటు ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తున్నాయి.
  • పెద్ద బ్యాంకులు మిడిల్ లెవల్ మేనేజ్‌మెంట్ పోస్టులను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)లు వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో ప్లేస్‌మెంట్స్ ద్వారా భర్తీ చేస్తున్నాయి.
  • ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ మహీంద్ర లాంటి బ్యాంకులు డీమ్డ్ యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకొని.. పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ ద్వారా శిక్షణ ఇచ్చి.. ఆ తర్వాతే నియామకం ఖరారు చేస్తున్నాయి.
  • ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఐడీబీఐ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు సైతం పీజీ డిప్లొమా కోర్సుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి.
Published date : 14 Dec 2019 12:17PM

Photo Stories