ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 6 నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి ఏడాది తొలిరోజు పరీక్షకు 95.34 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఇంటర్ తొలిరోజు పరీక్షకు 95.34 శాతం హాజరు
మొదటి సంవత్సరం విద్యార్థులు 5,12,793 మందికి గాను తొలిరోజు 4,88,904 మంది హాజరయ్యారని ఇంటర్మీడియట్ బోర్డు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (సీవోఈ) జీవీ ప్రభాకర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 23,889 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేకపోయారని చెప్పారు. పరీక్షల్లో అక్రమాలకు సంబంధించి ముగ్గురు విద్యార్థులను డిబార్ చేసినట్లు వివరించారు. కాగా, మే 24వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ ఎంవీ శేషగిరిబాబు తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని బోర్డు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.