Top 10 Female Candidates In UPSC Civil Services: సివిల్స్లో సత్తా చాటిన శివంగులు.. టాప్-10లో ఆరుగురు అమ్మాయిలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ 2023 పరీక్ష తుది ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. మొత్తంగా 1,016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. వీరిలో ఐఏఎస్కు 180, ఐఎఫ్ఎస్కు 37, ఐపీఎస్కు 200 మంది ఎంపికయ్యారు. ఈ ఫలితాల్లో ఆరుగురు అమ్మాయిలు టాప్-10లో నిలిచి సత్తా చాటారు.
అనన్య రెడ్డి- 3వ ర్యాంకు
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2023 ఫలితాల్లో తెలంగాణకు చెందిన దోనూరు అనన్య రెడ్డి మూడో ర్యాంక్ సాధించారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అనన్య ఫస్ట్ అటెంప్ట్లోనే సత్తా చాటారు. అంత్రోపాలజీకి మాత్రమే కోచింగ్ తీసుకున్నానని, రోజుకు 12-14 గంటలు చదివేదానినని తెలిపారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో చిన్నతనంలోనే సివిల్స్ చదవాలని నిర్ణయించుకున్నట్లు అనన్య చెప్పారు.
రుహానీ- 5వ ర్యాంకు
గురుగ్రామ్కు చెందిన రుహానీకి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఐదో ర్యాంకు సాధించింది. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుండి BA (ఆనర్స్) ఎకనామిక్స్లో పట్టభద్రురాలైంది. అనంతరం IGNOU నుండి అదే సబ్జెక్ట్లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించింది. 2020లో నీతి అయోగ్లో మూడేళ్ల పాటు IES అధికారిగా పనిచేశారు.
సృష్టి దాబాస్-6వ ర్యాంకు
ఢిల్లీకి చెందిన సృష్టి దాబాస్ UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023లో ఆల్ ఇండియాలోనే 6వ ర్యాంకు సాధించింది. ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే జరిగింది. డిగ్రీ చదువుతున్నప్పటి నుంచే సివిల్స్కు ప్రిపేర్ అయ్యింది.
అన్మోల్ రాథోడ్- 7వ ర్యాంకు
జమ్మూకి చెందిన అన్మోల్ రాథోడ్ సివిల్ సర్వీస్ పరీక్షలో 7వ ర్యాంక్తో సత్తా చాటింది. గతేడాది జమ్మూ&కశ్మీర్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించింది. యూపీఎస్సీకి రెండుసార్లు ప్రయత్నించినా ఫలితం దక్కలేదని, మూడో ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్కు ఎంపికైనట్లు వివరించింది.
నౌషీన్- 9వ ర్యాంకు
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నౌషిన్ 9వ ర్యాంకును సాధించింది. గోరఖ్పూర్లో పాఠశాల విద్యను పూర్తి చేసి ఆ తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ను పూర్తి చేసింది. రెండేళ్లుగా సివిల్స్కు సిద్ధమవుతున్నానని,అయితే మూడో ప్రయత్నంలో సివిల్స్కు ఎంపికైనట్లు తెలిపింది.
ఐశ్వర్యం ప్రజాపతి- 10వ ర్యాంకు
ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్కు చెందిన ఐశ్వర్యం ప్రజాపతి తన రెండో ప్రయత్నంలో సివిల్స్ పరీక్షలో 10వ ర్యాంకును సాధించింది. యూపీలోని ఐశ్వర్యం రాణి లక్ష్మీబాయి సీనియర్ సెకండరీ స్కూల్లో హైస్కూల్, ఆ తర్వాత NIT ఉత్తరాఖండ్ నుంచి 2016-17లో బీటెక్ పూర్తి చేసింది. అనంతరం L&Tలో ఉద్యోగం సంపాదించింది. కానీ సివిల్స్ సాధించడమే లక్ష్యంగా ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిస్థాయిలో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యింది. చిన్నప్పటి నుంచే ఐఏఎస్ కావాలని కలలు కన్నానని, ఇప్పుడు సివిల్స్లో 10వ ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది.