US Court: నిందితుడు రాణాను భారత్‌కు అప్పగించవచ్చు.. అమెరికా కోర్టు సంచ‌ల‌న తీర్పు

2008 నాటి ముంబై ఉగ్రవాద దాడుల కేసులో ప్రధాన నిందితుడైన తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణా విషయంలో అమెరికా కోర్టులో భారత అనుకూల తీర్పు వెలువడింది.

ఆయనను విచారణ నిమిత్తం భారత్‌కు అప్పగించవచ్చని అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టు ఆఫ్‌ అప్పీల్స్‌ స్పష్టం చేసింది. రాణాను భారత్‌కు అప్పగించేందుకు భారత్, అమెరికా దేశాల మధ్య అమల్లో ఉన్న నేరగాళ్ల అప్పగింత ఒప్పందం అనుమతి ఇస్తోందని తేల్చిచెబుతూ ఈ నెల 15వ తేదీన న్యాయస్తానం తీర్పు వెలువరించింది. 

ఈ ఒప్పందం కింద తనను భారత్‌కు అప్పగించడం సాధ్యం కాదంటూ రాణా చేసిన వాదనను న్యాయస్తానం తిరస్కరించింది. 2008 నవంబర్‌ 26వ తేదీన ముంబైలో 10 మంది పాకిస్తాన్‌ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు అమెరికన్‌ పౌరులు సహా మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ దాడులకు నిధులు సమకూర్చినట్లు పాకిస్తాన్‌ జాతీయుడైన తహవ్వుర్‌ రాణాపై పలు ఆరోపణలున్నాయి. ఉగ్రవాద దాడులకు ప్రధాన సూత్రధారి అయిన లష్కరే తోయిబా ఉగ్రవాది డేవిడ్‌ కోల్‌మన్‌ హెడ్లీతో ఇతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. ముంబై ఉగ్రవాద దాడుల కేసులో రాణా ప్రస్తుతం అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌ జైలులో ఉన్నాడు.

Israel Hamas war: ఇస్మాయిల్ హనియే హత్య వెనక ఉన్న‌ మతిపోయే ప్లాన్!!

రాణాను తమకు అప్పగించాలని భారత దర్యాప్తు సంస్థలు చాలా సంవత్సరాలుగా కోరుతున్నాయి.  అయితే, కోర్టు ఆఫ్‌ అప్పీల్స్‌ తీర్పుపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు అతడికి వెసులుబాటు ఉందని చెబుతున్నారు.

#Tags