B Vinod Kumar: ఉత్తర తెలంగాణలో సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ క్యాంపస్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని గ్రామీణ, అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వరంగల్‌ లేదా కరీంనగర్‌లో హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం శాటిలైట్‌ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ బి.వినోద్‌ కుమార్‌ కోరారు.

ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు జూలై 4న‌ ఆయన లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని గ్రామీణ, పట్టణ ప్రాంతాల నడుమ విద్యాపరమైన అంతరాలను తొలగించాలన్నారు. పాండిచ్చేరి సెంట్రల్‌ యూనివర్సిటీ, నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ, నల్సార్, వంటి కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల తరహాలో యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో తెలంగాణ విద్యార్థులకు స్థానిక కోటా ప్రవేశ పెట్టాలని విజ్ఞప్తిచేశారు.

చదవండి: HCUకు అంతర్జాతీయ ర్యాంకు

జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) లో వెనుకబడిన జిల్లాలకు చెందిన విద్యార్థులకు డిప్రివేషన్‌ పాయింట్లు కేటాయించిన తరహాలో యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లోనూ స్థానికులకు ఇవ్వాలన్నారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (క్యూయెట్‌), యూజీసీ నెట్, జేఆర్‌ఎఫ్‌ పరీక్షలను మాతృభాషలో నిర్వహించాలని వినోద్‌ పేర్కొన్నారు. 

#Tags