Hostel Students Rally : హాస్టల్ భోజనంపై విద్యార్థుల ఆగ్రహం.. కలెక్టరేట్ ఎదుట ధర్నా!
కర్నూలు: ఒక రోజు.. రెండు రోజులు కాదు.. నెల రోజులుగా వారికి పురుగుల అన్నమే దిక్కవుతోంది. కుళ్లిన వంకాయలు, టమాటాలతో చేసిన సాంబారు, మజ్జిగ తప్ప.. ఇతర కూరలు ఉండటం లేదు. ఎన్నిరోజులు ఓర్చుకున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఆకలితో ఉండలేక శుక్రవారం సిల్వర్జూబ్లీ హాస్టల్ విద్యార్థినీ, విద్యార్థులు రోడ్డెక్కారు. కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు. కలెక్టర్ బయటకు వచ్చి తమ సమస్యలు వినాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ఖాళీ ప్లేట్లతో భారీ ధర్నా నిర్వహించారు.
Education Department : విద్యారంగంలో ఉన్న సమస్యలపై పరిష్కరించేందుకు పలు సూచనలు..
ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. సిల్వర్ సెట్ రాసి మంచి ర్యాంకుతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కళాశాలలో చేరితే ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. కళాశాల హాస్టల్లో 700 మంది ఉండగా.. ఇందులో 200 విద్యార్థులు, 500 మంది విద్యార్థినులు రోజూ ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పురుగుల అన్నం, నీళ్ల సాంబారు, మజ్జిగ తప్ప మరో భోజనం తమకు పెట్టడం లేదన్నారు. అదేమని అడిగితే ప్రిన్సిపాల్, వార్డెన్లు సమాధానం చెప్పడం లేదన్నారు.
నిర్వహణ అస్తవ్యస్తం
డిగ్రీ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు చెల్లిస్తున్న మెస్చార్జీలు క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోకి వెళ్తున్నాయి. ఇదే సమయంలో ఫైనల్ ఇయర్ విద్యార్థుల మెస్చార్జీలు మాత్రమే సిల్వర్జూబ్లీ కళాశాల ఖాతాలో జమ అవుతున్నాయి. ఈ క్రమంలో కళాశాల ఖాతాలో జమ అయిన మొత్తంతో విద్యార్థులు, విద్యార్థినుల హాస్టళ్లలో భోజనంతోపాటు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఇబ్బందిగా మారింది. కళాశాల నిర్వహణకు క్లస్టర్ యూనివర్సిటీ నిధులను సమకూర్చడం లేదు.
దీంతో ఫైనల్ ఇయర్ విద్యార్థులు చెల్లిస్తున్న ఫీజులతోనే మొత్తం మూడు సంవత్సరాల విద్యార్థుల హాస్టళ్ల నిర్వహణ జరగాలి. మరోవైపు ఒక్కో విద్యార్థికి మెస్చార్జీల కోసం నెలకు రూ.430 చెల్లిస్తారు. ఈ మొత్తంతో పెరిగిన నిత్యావసరాలు కొనుగోలు చేసి మూడు పూటలా భోజనం పెట్టేందుకు నిర్వాహకులకు ఇబ్బందిగా ఉంది. ఇందులో అధిక శాతం బియ్యం కొనుగోలుకే చెల్లించాల్సి వస్తోంది. కూరగాయలు, నూనెలు, ఇతర వస్తువులను కొను గోలు చేయడానికి డబ్బు సరిపోవడంలేదు.