B Tech Course : బీటెక్‌లో అక‌డెమిక్స్‌పై దృష్టితోపాటు లేటెస్ట్ టెక్నాల‌జీని, జాబ్ స్కిల్స్‌ను అందుకోవ‌డం ముఖ్యం..

బీటెక్‌.. నాలుగేళ్ల ఇంజనీరింగ్‌ కోర్సు! ఏటా లక్షల మంది ఎంట్రన్స్‌ టెస్ట్‌లలో ర్యాంకు సాధించి ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరుతుంటారు. మెచ్చిన కోర్సులో, నచ్చిన ఇన్‌స్టిట్యూట్‌లో అడుగుపెట్టడంతోనే స్వప్నం సాకారమైనట్లు భావిస్తే పొరపాటే! ఎందుకంటే..

నాలుగేళ్ల బీటెక్‌ కోర్సులో ఉత్తమంగా రాణిస్తేనే కంపెనీలు క్యాంపస్‌ ఆఫర్లు ఇస్తాయి. అందుకే కోర్సులో చేరిన విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచే అకడెమిక్‌ నైపుణ్యాలతోపాటు లేటెస్ట్‌ జాబ్‌ స్కిల్స్‌ పెంచుకోవడంపై దృష్టిపెట్టాలి. తాజాగా.. దేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో.. బీటెక్‌లో బెస్ట్‌గా రాణించేందుకు నిపుణుల సూచనలు, సలహాలు... 

ఎంట్రన్స్‌లో సాధించిన ర్యాంకు కార్డు.. గేట్‌ పాస్‌ లాంటిది. అది కాలేజీలో, కోర్సులో చేరడానికి అవకాశం కల్పిస్తుంది. కానీ.. ఆ తర్వాత పరిపూర్ణమైన ఇంజనీర్లుగా క్యాంపస్‌ నుంచి బయటకు రావాలంటే.. విద్యార్థులు మొదట్నుంచే నిర్దిష్ట ప్రణాళికలతో, క్రమశిక్షణతో అధ్యయనం కొనసాగించాలి అంటున్నారు నిపుణులు.

Job Mela: రేపు జాబ్‌మేళా.. జీతం నెలకు రూ.20 వేల వరకు

తొలిరోజు నుంచే
బీటెక్‌లో సీటు కోసం ఎంతో కష్టపడిన విద్యార్థులు.. కోర్సులో చేరాక మరింత పట్టుదలతో చదువు కొనసాగించాలి. ఎందుకంటే.. నేటి పోటీ ప్రపంచంలో వేగంగా మారుతున్న టెక్నాలజీ యువతకు ఎన్నో సవాళ్లు విసురుతోంది. అత్యుత్తమ ప్రతిభ చూపితేనే కోరుకున్న అవకాశాలు దక్కుతాయి. కాబట్టి బీటెక్‌లో చేరిన తొలిరోజు నుంచే విద్యార్థులు నిరంతరం తమను తాము తీర్చిదిద్దుకోవాలి. ముఖ్యంగా ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌ ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో వాటిపై దృష్టిపెట్టాలి. టెక్నాలజీ యుగంలో వస్తున్న మార్పులను వేగంగా పసిగట్టి, వాటిపై పట్టు సాధించాలి. అప్పుడే నాలుగేళ్ల తర్వాత సర్టిఫికెట్‌ చేతికందే సమయానికి బెస్ట్‌ ఇంజనీర్లుగా నిలుస్తారు.

ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌
బీటెక్‌లో చేరిన మొదటి సంవత్సరం విద్యార్థులు క్యాంపస్‌ వాతావరణానికి త్వరగా అలవాటుపడే ప్రయత్నం చేయాలి. ప్రధానంగా వివిధ రాష్ట్రా­లు, ప్రాంతాల విద్యార్థులు ప్రవేశాలు పొందే ఐఐటీలు, ఎన్‌ఐటీల క్యాంపస్‌లలో విభిన్న నేపథ్యాల విద్యార్థులతో కలిసిపోవాలి. రాష్ట్రాల స్థాయిలోని కళాశాలల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కొత్త వాతావరణంలో ఒత్తిడికి గురికాకుండా త్వరగా ఇమిyì పోయేందుకు కృషిచేయాలి. అందుకోసం కమ్యూనికేషన్‌ స్కిల్స్, ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌ పెంచుకోవాలి. అందరితో కలిసిమెలిసి ఉండేలా తమను తాము మలచుకోవాలి. కొత్త వాతావరణం, ఫ్రెషర్స్‌ అనే భావన నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడి అకడెమిక్స్‌పై ఫోకస్‌ చేయాలి.

Engineering Career: ఇంజనీరింగ్‌లో కోర్‌ బ్రాంచ్‌లకు పెరిగిన క్రేజ్‌.. తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తి

సిలబస్‌పై అవగాహన
నాలుగేళ్ల బీటెక్‌ ప్రోగ్రామ్‌లో..సెమిస్టర్‌ విధానం అమలవుతున్న విషయం తెలిసిందే. అంటే.. పరీక్షలకు పెద్దగా సమయం ఉండదు. తరగతులు ప్రారంభమైనప్పటి నుంచే ఏరోజు సబ్జెక్టు ఆరోజు పూర్తి చేస్తేనే సెమిస్టర్‌ ఎగ్జామ్స్‌కు సన్నద్ధత లభిస్తుంది. కాబట్టి విద్యార్థులు తొలుత నాలుగేళ్ల సిలబస్‌పై ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత మొదటి సంవత్సరం సబ్జెక్టులు, సిలబస్‌పై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టాలి. మొదటి సంవత్సరం సబ్జెక్ట్‌లు.. ఇంజనీరింగ్‌ కోర్సుకు పునాది వంటివి. వీటిపై పట్టు సాధిస్తేనే తర్వాత మూడేళ్లు అకడమిక్స్‌లో రాణించడం సులువవుతుంది. సబ్జెక్టులను అవగాహన చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే.. లెక్చరర్స్, ప్రొఫెసర్స్‌ సహాయం తీసుకోవడానికి వెనుకంజ వేయకూడదు. పలు ఇన్‌స్టిట్యూట్‌లు మెంటారింగ్‌ సెల్స్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. తరగతి గదిలో సందేహాలు నివృత్తి చేసుకోవడానికి బిడియపడే వి­ద్యార్థులకు ఇవి ఎంతో ఉపయుక్తమని చెప్పొచ్చు. 

రెండో ఏడాది నుంచి
రెండో ఏడాది నుంచి పూర్తిగా ప్రాక్టికాలిటికీ ప్రాధాన్యం ఇవ్వాలి. వాస్తవానికి ఇంజనీరింగ్‌లో సంబంధిత బ్రాంచ్‌ సబ్జెక్ట్‌ల బోధన రెండో ఏడాది నుంచే పూర్తి స్థాయిలో ప్రా­రంభమవుతుంది. కాబట్టి విద్యార్థులు తమ బ్రాంచ్‌కు సంబంధించిన సబ్జెక్ట్‌లు,వాటికి అవసరమైన క్షేత్ర నైపుణ్యాల­పై దృష్టి పెట్టాలి. రెండో ఏడాది నుంచి సబ్జెక్టులను లోతు­గా అన్ని కోణాల్లో అధ్యయనం చేయడం ప్రారంభించాలి. అందుకోసం మూక్స్, ఎన్‌పీటీఈఎల్‌ వంటి ఆన్‌లైన్‌ విధానాలతోపాటు ప్రొఫెసర్స్‌ రాసిన ప్రామాణిక పుస్తకాలను చదవాలి. ముఖ్యంగా ప్రతి అంశాన్ని వాస్తవ పరిస్థితులతో అనుసంధానిస్తూ అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి.

Engineering Admissions 2024: ఇంజినీరింగ్‌ అడ్మిషన్లు ప్రారంభం

ఇంటర్న్‌షిప్స్‌
ప్రస్తుత పరిస్థితుల్లో ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా రియల్‌ టైమ్‌ నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. అందుకోసం కనీసం రెండు లేదా మూడు ఇంటర్న్‌షిప్స్‌ పూర్తి చేయడం ఎంతో మేలు చేస్తుంది. ఈ మేరకు ఏఐసీటీఈ కూడా మార్గదర్శకాలు జారీ చేసింది. కాబట్టి ఇంజనీరింగ్‌ విద్యార్థులు రెండో ఏడాది చివరి నుంచే ఇంటర్న్‌షిప్స్‌ సాధించే విధంగా ప్రయత్నాలు సాగించాలి. ఇందుకోసం క్యాంపస్‌లోని ఇండస్ట్రీ ఇంటరాక్షన్‌ సెల్, ఆయా సంస్థల్లో పని చేస్తున్న సీనియర్ల సహకారం తీసుకోవాలి. ఇలా ఇంటర్న్‌షిప్‌ చేయడం ద్వారా తాజా పరిస్థితులపై అవగాహన వస్తుంది. దీంతో జాబ్‌ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకోవచ్చు.

మూడో ఏడాది.. లక్ష్యం
మూడో ఏడాది నుంచి తమ భవిష్యత్తు లక్ష్యాల సాధన దిశగా అడుగులు వేయాలి. ఉన్నత విద్య కోసం గేట్, క్యాట్‌ వంటి పరీక్షల ప్రిపరేషన్‌కు శ్రీకారం చుట్టాలి. అదే విధంగా క్యాంపస్‌ ఆఫర్స్‌ పొందాలనే లక్ష్యం ఉన్న విద్యార్థులు దానికి అనుగుణంగా సన్నద్ధ మవ్వాలి. ప్రస్తుతం జాబ్‌ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న నైపుణ్యాలు పెంచుకోవాలి. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ప్రక్రియపై అవగాహన పెంచకోవాలి. అందుకుతగ్గట్టు కొత్త నైపుణ్యాలు, సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ అందిపుచ్చుకునే మార్గాలను అన్వేషించాలి.

M Tech Admissions: హెచ్‌సీయూలో ఎంటెక్‌ స్పాట్‌ రౌండ్‌ అడ్మిషన్లు

ప్రాజెక్ట్‌ వర్క్‌.. రియల్‌గా
నాలుగేళ్ల ఇంజనీరింగ్‌ కోర్సులో అత్యంత కీలకమైంది.. ప్రాజెక్ట్‌ వర్క్‌. నాలుగో ఏడాదిలో ప్రాజెక్ట్‌ వర్క్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. రియల్‌ టైమ్‌ ప్రాజెక్ట్‌ వర్క్‌ చేసేందుకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఫేక్‌ ప్రాజెక్ట్‌ వర్క్స్‌ వైపు దృష్టి సారిస్తే.. భవిష్యత్తులో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పడంలో తడబాటు ఎదురవుతుందని గుర్తించాలి. 

ప్రాక్టికాలిటీ, అప్లికేషన్‌ అప్రోచ్‌
ఇంజనీరింగ్‌ విద్యార్థులు.. ప్రాక్టికాలిటీ, అప్లికేషన్‌ అప్రోచ్‌ను అనుసరించాలి. ఇందుకోసం ల్యాబ్‌ వర్క్‌ను శ్రద్ధగా చేయాలి. ప్రాక్టికల్స్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. పుస్తకాలకే పరిమితమైతే పరీక్షల్లో ఎక్కువ మార్కులు స్కోర్‌ చేయొచ్చేమోకానీ.. రియల్‌ టైం నైపుణ్యాలు మాత్రం లభించవు. రియల్‌ టైమ్‌ నాలెడ్జ్‌ పెంచుకునే ప్రయత్నం చేయాలి. క్లాస్‌ రూమ్‌ లెర్నింగ్‌కే పరిమితం కాకుండా.. ఇండస్ట్రీ వాస్తవ పరిస్థితులను ఆకళింపు చేసుకుంటూ నైపుణ్యాలు పెంచుకోవాలి.అప్పుడే కోర్సు పూర్తయ్యే సమయానికి సమర్థవంతమైన ఇంజనీర్లుగా, జాబ్‌ మార్కెట్లో అవకాశాలు అందుకోవడంలోనూ ముందంజలో నిలిచే ఆస్కారం లభిస్తుంది.

DSC 2024: డీఎస్సీపై స్టేకు నిరాకరణ.. పరీక్షల్లో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు

సర్టిఫికేషన్స్‌.. సమర్థవంతంగా
ప్రస్తుతం జాబ్‌ మార్కెట్‌లో ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌ పేరిట ఆటోమేషన్, మెషిన్‌ లెర్నింగ్, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, రోబోటిక్స్, 3–డి డిజైన్‌ ప్రింటింగ్, క్లౌడ్‌ కంప్యూటింగ్, సైబర్‌ సెక్యూరిటీ స్కిల్స్‌కు ప్రాధా­న్యం పెరుగుతోంది. కంపెనీలు తమ కార్యకలాపాల నిర్వహణలో నిత్యం కొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతున్నాయి. వీటిని కొన్ని సందర్భాల్లో కరిక్యులంలో భాగంగా అభ్యసించే వీలుండదు. ఇలాంటి లేటెస్ట్‌ టెక్నాలజీకి సంబంధించి సర్టిఫికేషన్‌ కోర్సు­లు పూర్తిచేయడం లాభిస్తుంది. తద్వారా భవిష్యత్తులో జాబ్‌ మార్కెట్‌లో ముందంజలో నిలిచే వీలుంటుంది. 

మూక్స్‌తో లేటెస్ట్‌ టెక్నాలజీ
నేటి ఇంటర్నెట్‌ యుగంలో ఇంజనీరింగ్‌ విద్యార్థులకు వరం.. మూక్స్‌(మాసివ్‌లీ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సెస్‌). అంతర్జాతీయంగా పలు ప్రముఖ యూనివర్సిటీలు ఆయా అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ విధానంలో కోర్సులను అందిస్తున్నా­యి. ఇంజనీరింగ్‌ విద్యార్థులు మూక్స్‌ ద్వారా తమ సబ్జెక్టులతోపాటు లేటెస్ట్‌ టెక్నాలజీపైనా అవగాహన పెంచుకోవచ్చు. మన దేశంలోనూ ఎన్‌పీటీఈఎల్‌ ద్వారా ప్రముఖ ప్రొఫెసర్స్‌ బోధించే పాఠాల­ను ఆన్‌లైన్‌లో వినే అవకాశముంది. వీటిల్లో విద్యార్థులకు ఉపయోగపడే వర్చువల్‌ ల్యాబ్స్‌ సౌకర్యం సైతం లభిస్తుంది.

Group 2 Exam Postponed: గ్రూప్‌–2 వాయిదాకు ప్రభుత్వం సానుకూలం

పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌
విద్యార్థులు కాలేజీలో ఉన్నప్పుడే వ్యక్తిత్వ లక్షణాలు మెరుగుపరచుకోవాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్‌ స్కిల్స్, లాంగ్వేజ్‌ స్కిల్స్, టీమ్‌ వర్కింగ్‌ వంటి నైపుణ్యాలు పెంచుకోవాలి. కాలేజ్‌లో నిర్వహించే సెమినార్లకు హాజరవడం, తోటి విద్యార్థులతో గ్రూ­ప్‌ డిస్కషన్స్‌ వంటి వాటిలో ఉత్సాహంగా పాల్గొనాలి. అదే విధంగా కాలేజ్‌లో జరిగే కల్చరల్‌ యాక్టివిటీస్‌లోనూ భాగస్వాములయ్యే విధంగా వ్యవహరించాలి. ఫలితంగా వ్యక్తిత్వ వికాసం పొందొచ్చు.

స్వీయ అధ్యయనం
బీటెక్‌ విద్యార్థులు సెల్ఫ్‌ లెర్నింగ్‌ అలవాటు చేసుకోవాలి. దీనికోసం ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న అన్నిరకాల వనరులను ఉపయోగించుకోవచ్చు. లైబ్రరీ, డిజిటల్‌ లైబ్రరీలను వినియోగించుకోవాలి. తద్వారా తమ కోర్‌ సబ్జెక్ట్‌లకు సంబంధించి తాజా పరిణామాలపై అవగాహన పొందాలి. అదే విధంగా రియల్‌ టైమ్‌ ప్రాబ్లమ్స్, వాటికి ఆ రంగంలోని నిపుణులు కనుగొన్న పరిష్కారాలను అధ్యయనం చేయాలి. ఇందుకోసం రీసెర్చ్‌ జర్నల్స్, రీసెర్చ్‌ పేపర్స్‌ను చదవడం అలవర్చుకోవాలి. 

లక్ష్యంపై స్పష్టత
బీటెక్‌లో చేరిన విద్యార్థుల్లో కొందరు కోర్సు పూర్తికాగానే కొలువులో చేరాలనుకుంటున్నారు. మరికొందరు ఉన్నత విద్యను లక్ష్యంగా చేసుకుంటున్నారు. కాబట్టి ఇంజనీరింగ్‌ విద్యార్థులు తమ భవిష్యత్‌ లక్ష్యంపై స్పష్టతతో ముందుకు సాగాలి. ట్రెండ్‌ కంటే అభిరుచికి ప్రాధాన్యమివ్వడమే శ్రేయస్కరం అనేది నిపుణుల అభిప్రాయం. విదేశాల్లో ఎంఎస్‌ కోసమైతే రెండో సంవత్సరంలోనే టోఫెల్‌ను, మూడో ఏడాదిలోపు జీఆర్‌ఈకి హాజరవ్వాలి. ఎంటెక్, ఎంబీఏ కోసం ‘గేట్‌’ లేదా ‘క్యాట్‌’ పరీక్షలకు కూడా మూడో ఏడాది నుంచే ప్రిపరేషన్‌ ప్రారంభించాలి. 

Mecon Limited : మెకాన్‌ లిమిటెడ్‌లో ఫుల్‌టైం ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఉద్యోగాలు.. వీరే అర్హులు!

#Tags