CM Breakfast Scheme: అల్పాహారం.. అందని ద్రాక్షేనా?

మంచిర్యాల అర్బన్‌: ఉదయం ఖాళీ కడుపుతో పాఠశాలలకు వచ్చే విద్యార్థుల ఆకలి తీర్చి పాఠాలు నేర్పించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గత ప్రభుత్వం సీఎం బ్రేక్‌పాస్ట్‌ (అల్పాహార పథకం) ప్రారంభించింది. తర్వాత ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారింది.

ఆ తర్వాత కూడా పథకం ప్రారంభించిన పాఠశాలల్లో పథకం అమలు చేశా రు. వేసవి సెలవుల తర్వాత కూడా కొన్ని పాఠశాలల్లో పథకం అమలవుతోంది. అన్ని పాఠశాలల్లో అల్పాహారం అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో అందరికీ అల్పాహారం అందని ద్రాక్షగానే మారింది.

రెండు నెలలైనా నిర్ణయం తీసుకోని వైనం..

నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు దాటింది. అయినా సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ పథకం కొనసాగిస్తారా.. నిలిపివేస్తారా అన్నది తెలియడం లేదు. ప్రయోగాత్మకంగా ఎంపిక చేసి పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. ఆ పాఠశాలల్లో కూడా మొక్కుబడిగా కొనసాగుతోంది.

ప్రభుత్వం మాత్రం దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో మెజారిటీ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఖాళీ కడుపుతోనే పాఠశాలలకు వచ్చి పాఠాలు వింటున్నారు.

చదవండి: Govt Schools: ఇన్‌స్ట్రక్టర్ల నియామకమెప్పుడో!

జిల్లాలో 716 పాఠశాలలు..

జిల్లాలో 761 పాఠశాలలు ఉన్నాయి. గతేడాది దసరాకు ఒకరోజు ముందుగా జిల్లాలో నియోజకవర్గానికి ఒక పాఠశాలను ఎంపిక చేసి సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ పథకం ప్రారంభించారు. మంచిర్యాల నియోజకవర్గంలో న్యూగర్మిళ్ల, చెన్నూర్‌ నియోజకవర్గంలో మందమర్రి ఫిల్టర్‌బెడ్‌ ఎంపీపీఎస్‌, బెల్లంపల్లి నియోజకవర్గంలో 2 ఇంక్‌లైన్‌ ఎంపీపీఎస్‌లో పథకం ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత మరో 36 పాఠశాలల్లో అమల్లోకి తెచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

ప్రభుత్వం మారింది. దీంతో మెజారిటీ పాఠశాలల్లో డిసెంబర్‌ 2 నుంచి అల్పాహారం పథకానికి బ్రేక్‌ పడింది. తర్వాత బిల్లులు చెల్లించడంతో ముందుకు సాగుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినా కొనసాగింపు, అన్ని పాఠశాలల్లో అమలుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అల్పాహారం ఇలా..

పిల్లలో పోషకాహర లోపం నివారణ, హాజరు నమోదు పెంచడం కోసం ప్రభుత్వం అల్పాహార పథకం ప్రారంభించింది. ఇందుకు ఒక్కో విద్యార్థికి రూ.10.50 చొప్పున కేటాయించాలని నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు నిధుల మంజూరుపై స్పష్టత లేకుండా పోయింది. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు 45 నిముషాల ముందుగా అల్పాహారం అందించాల్సి ఉంటుంది.

సోమవారం ఇడ్లీ, సాంబారు లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ, మంగళవారం పూరి, ఆలుకుర్మా, లేదా టోమాటో బాత్‌, సాంబార్‌, బుధవారం ఉప్మా, సాంబారు లేదా బియ్యం రవ్వ కిచిడీ, చట్నీ, గురువారం చిరుధాన్యాల ఇడ్లీ, సాంబారు లేదా పొంగల్‌, సాంబారు, శుక్రవారం ఉగ్గని, అటుకలు, చిరుధాన్యాల ఇడ్లీ, చట్నీ, లేదా బియ్యం రవ్వ కిచిడీ, చట్నీ, శనివారం పొంగల్‌, సాంబారు లేదా కూరగాయల పులావ్‌, పెరుగు చట్నీ, ఆలుకుర్మా అందించాలి. ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేయకపోవటం.. కొన్నిచోట్ల పూరి, ఉంటే ఇడ్లీ లేదు. ఉప్మా,కి, చిడిలాంటితో సరిపెడుతున్నారు.

బకాయిలు విడుదల చేశాం..

గతే విద్యసంవత్సరంలో ప్రారంభమైన అల్పాహారం బిల్లులు ఇటీవలనే విడుదల చేశాం. ఈ విద్యసంవత్సరం సీఎం బ్రేక్‌పాస్ట్‌ అమలుపై ఎలాంటి ఆదేశాలు రాలేదు.

ఇప్పటికే కొనసాగుతున్న పాఠశాలల్లో పథకం కొనసాగిస్తున్నాం. అన్ని పాఠశాలల్లో అమలుకు ఆదేశాలు వస్తే అమలు చేస్తాం.
– యాదయ్య, డీఈవో
 

#Tags