JNTU Anantapur: జేఎన్టీయూ ప్రొఫెసర్ ప్రశాంతి పరిశోధనకు పేటెంట్
- మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో వాహనాల బ్రేక్ల రూపకల్పన
అనంతపురం: జేఎన్టీయూ (ఏ) క్యాంపస్ కళాశాల మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ జి.ప్రశాంతి పరిశోధనకు పేటెంట్ దక్కింది. ప్రొఫెసర్ జి.ప్రశాంతి, పరిశోధన విద్యార్థి ఎం.శివసూర్య సంయుక్తంగా ‘ఏ న్యూ మెథడ్ టు ఫ్యాబ్రికేట్ డిఫరెంట్ లేయర్డ్ ఎల్ 7075/ఎస్ఐసీ ఫంక్షనల్లీ గ్రేబ్డ్ మెటీరియల్స్ యూసింగ్ పవర్ మెటాలార్జీ టెక్నిక్’ అంశంపై చేసిన పరిశోధనకు గాను పేటెంట్ దక్కింది. ఈ పరిశోధన ముఖ్యంగా వాహనాల బ్రేక్ కాంటాక్ట్కి సంబంధించినది కావడం గమనార్హం. తక్కువ ఖర్చుతో ఎక్కువ మన్నిక వచ్చేలా అల్యూమినియం (ఏఎల్ 7075 )/ఎస్ఐసీ మెటీరియల్ను ఉపయోగించి పౌడర్ మెటలర్జీ ప్రోడక్ట్కు రూపకల్పన చేశారు. వివిధ రకాల మందమైన మెటీరియల్ను ఉపయోగించి బ్రేక్ కాంటాక్టు బలాన్ని పరీక్షించారు. వీటిలో 10 ఎం.ఎం. మందంతో గల బ్రేక్ సత్ఫలితాలను ఇచ్చింది. 2021, మార్చి నెలలో పేటెంట్కు దరఖాస్తు చేసుకోగా, ఈ నెల 14న పేటెంట్ గ్రాంట్ అయినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్బంగా ప్రొఫెసర్ జి. ప్రశాంతి కృషికి ప్రశంసలు దక్కాయి. ఆమెను జేఎన్టీయూ (ఏ) వీసీ డాక్టర్ జింకా రంగజనార్దన, రిజిస్ట్రార్ సి.శశిధర్, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ ఈ.కేశవరెడ్డి, ప్రొఫెసర్ పి.సుజాత, ప్రొఫెసర్ ఎన్.వివాలి, ప్రొపెసర్ ఎ.సురేష్బాబు, పాలకమండలి సభ్యుడు డాక్టర్ ఎం.రామశేఖరరెడ్డి, డాక్టర్ ఎస్.చంద్రమోహన్రెడ్డి తదితరులు అభినందించారు.
చదవండి: Lecturer Jobs: లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం