Skip to main content

తెలంగాణలో జైనమత అభివృద్ధి

జైనంలో నాలుగు ప్రధాన సిద్ధాంతాలను 24వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు ప్రవేశపెట్టాడు. అవి.. అహింస, అసత్య, ఆస్తేయం (దొంగతనం చేయరాదు), అపరిగ్రహం (ఆస్తిపాస్తులు ఉండకూడదు). క్రీ.పూ. 6వ శతాబ్దంలో వర్థమానుడు బ్రహ్మచర్యం అనే అయిదో సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత ఇతడు మహావీరుడిగా మారాడు. వర్థమానుడు ఉత్తరభారతదేశంలో జైనమతాన్ని స్థాపించాడు. ఇది కుల వ్యవస్థ, యజ్ఞయాగాదులు, బలి, హింసలతో కూడిన వైదిక మతాన్ని ఖండించి, శాంతి, అహింస, సర్వసమానత్వాన్ని బోధించింది.
 ఇటీవల జరుగుతున్న పరిశోధనల ఆధారంగా అతి ప్రాచీన కాలం నుంచే తెలంగాణలో జైనమతం ఉన్నట్లు తెలుస్తోంది. మహావీరుడి తండ్రి కళింగరాజుకు మిత్రుడని, అతడి ఆహ్వానం మేరకు మహావీరుడు కళింగ రాజధాని బాదలపురం (నేటి భద్రాచలం) సందర్శించాడని, ఆ సందర్భంలోనే జైనమతం తెలంగాణలోకి ప్రవేశించిందని చరిత్రకారులు భావిస్తున్నారు. 10వ జైన తీర్థంకరుడైన సీతలనాథుడు భద్రాచలవాసిగా గుర్తించారు. అంటే మహావీరుడి కంటే కొన్ని వందల ఏళ్ల కిందటే తెలంగాణలో జైనమతం ఉందని విశ్లేషకుల అభిప్రాయం. మహావీరుడు భద్రాచలాన్ని సందర్శించినట్లుగా ‘ఎర్లీ హిస్టరీ ఆఫ్ దెక్కన్ అండ్ ప్రాబ్లమ్స్’ గ్రంథంలో ఆధారాలు ఉన్నాయి.

 నైనసేనుడు రాసిన ‘ధర్మామృతం’ కావ్యంలో, హరిసేనుడు రాసిన బృహత్‌కథాకోశం గ్రంథంలో తెలంగాణలో జైనం, బౌద్ధం రెండూ వ్యాప్తి చెందాయని పేర్కొన్నారు. క్రీ.పూ. 4వ శతాబ్దంలో మహాపద్మనందుడు (రెండో పరశురాముడిగా ప్రసిద్ధి) తెలంగాణ ప్రాంతాన్ని మగధ రాజ్యంలో విలీనం చేశాడు. ఇతడు జైన మతస్థుడు. భారతదేశాన్ని సందర్శించిన తొలి గ్రీకు రాయబారి. మెగస్తనీస్ తన రచనల్లో తెలంగాణ ప్రాంతంలో నగ్న జైన సన్యాసులను ఎంతో మందిని చూశానని పేర్కొన్నాడు. మెగస్తనీస్ గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించిన ‘మాక్ క్రిండాల్’ ద్వారా ఈ విషయం తెలిసింది.

 మహాపద్మనందుడు తెలంగాణలోని సీతలనాథుని విగ్రహాన్ని మగధకు తరలించాడు. తర్వాత కళింగరాజు ఖారవేలుడు పాటలీపుత్రంపై దండెత్తి సీతలనాథుని విగ్రహాన్ని తిరిగి తెచ్చి ఆయనకు జైన దేవాలయం నిర్మించాడని ‘ది హిస్టరీ అండ్ ఇన్‌స్క్రిప్షన్స్ ఆఫ్ ది శాతవాహనాస్’ గ్రంథంలో ఉంది.

తొలి శాతవాహనులు జైనమతాన్ని ఆదరించారు. శ్రీముఖుడు జైనమతాన్ని స్వీకరించినట్లుగా కాలకసూరి ‘తంత్ర’ అనే జైన గ్రంథంలో పేర్కొన్నాడు.
 తెలంగాణలో ముఖ్యమైన జైన కేంద్రాలు
 1. కొలనుపాక (నల్గొండ జిల్లా)
 2. మునులగుట్ట (కరీంనగర్)
 3. బోధన్ (నిజామాబాద్)
 తెలంగాణలో వేములవాడ, ముదిగొండ చాళుక్య రాజుల కాలంలో, తొలి కాకతీయుల కాలంలోనూ జైనమతం వర్థిల్లింది. వేములవాడ చాళుక్యులు జైన పండితులను పోషించారు. రాష్ట్రకూట రాజు మూడో కృష్ణుడి ఆస్థానానికి తెలంగాణ నుంచి కొంతమంది కవులు వలస వెళ్లారు. ‘శాంతిపురాణం’ గ్రంథాన్ని రచించిన ‘పొన్న’ మూడో కృష్ణుడి ఆస్థానంలో ఉన్నాడు. వేమలవాడ రాజైన రెండో హరికేసరి కన్నడంలో ప్రసిద్ధ కవి అయిన ‘పంప’ను పోషించాడు. ఇతడు రాష్ర్టకూట రాజు ధ్రువుడి ఆస్థానంలోకి వలస వెళ్లాడు. పంప కన్నడంలో జైనభారతం రచించాడు. తర్వాతి కాలంలో జైనమతం బాగా ప్రజాదరణ పొందింది. పటాన్‌చెరువులో 500 జైన బసదులు (జైన విశ్రాంతి మందిరాలు), విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలను హైదరాబాద్ మ్యూజియంలో భద్రపరిచారు. పశ్చిమ చాళుక్య రాజులు కూడా జైనమతాన్ని పోషించారు. బోధన్, కొనకొండ్ల జైన తీర్థాలుగా వర్థిల్లాయి. తొలి కాకతీయ రాజులు జైనమతాన్ని అవలంబించారు. హన్మకొండ జైనమతానికి కేంద్రమైంది. రుద్రుడి కాలం నుంచి జైనులకు వ్యతిరేకంగా ప్రచారం జరిగింది. చివరి కాకతీయ రాజైన రెండో ప్రతాపరుద్రుడు  హన్మకొండను జైనులకు కేంద్రంగా మార్చాడు. చివరికి ఇస్లాం మత వ్యాప్తితో తెలంగాణలో జైనం తన ఉనికిని  కోల్పోయింది.

బాహుబలి..
మహావీరుడి కంటే ముందే తెలంగాణలో జైన సిద్ధాంతాలు ప్రవేశించినట్లు మరికొన్ని ముఖ్య ఆధారాలు ఉన్నాయి. మొదటి తీర్థంకరుడైన వృషభనాథుడికి భరతుడు, బాహుబలి అనే ఇద్దరు కుమారులు ఉండేవారు. వీరిలో బాహుబలి పోతన నగరం (నేటి బోధన్, నిజామాబాద్ జిల్లా) రాజధానిగా ‘అస్మక’ రాజ్యాన్ని పాలించాడు. ఇక్కడ 525 ధనస్సుల ఎత్తు ఉన్న బాహుబలి విగ్రహం ఉండేదని, దట్టమైన అడవుల్లో ఉండటం వల్ల సామాన్యులెవరికీ దీన్ని దర్శించే భాగ్యం లభించేది కాదని, అందువల్ల శ్రావణబెళగొళలోని ఇంద్రగిరి పర్వతంపై బాహుబలి విగ్రహాన్ని ప్రతిష్టించానని చాళుక్యుల మంత్రి చాముండరాయుడు తాను వేయించిన శ్రావణబెళగొళ శాసనంలో పేర్కొన్నాడు. పంపకవి (కన్నడ ఆదికవి) కూడా బోధన్‌లోని బాహుబలి విగ్రహం గురించి ప్రస్తావించాడు. ఈ బాహుబలినే ‘గోమఠేశ్వరుడు’ అని పిలుస్తారు. కుమార వ్యాసుడు కూడా దీని గురించి వివరించాడు. ఈ విషయాల ఆధారంగా మొదటి తీర్థంకరుడి కాలంలోనే జైనమతం తెలంగాణలో ప్రవేశించిందని చెప్పవచ్చు. బోధన్ పరిసర ప్రాంతాల్లో జైనమతానికి సంబంధించిన శిథిలాలు అనేకం ఉన్నాయి.
Published date : 28 Sep 2015 03:14PM

Photo Stories