Skip to main content

తెలంగాణ రాష్ర్ట ఖనిజ వనరులు

ఒక దేశ లేదా రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధి అనేది అక్కడ లభ్యమయ్యే ఖనిజ వనరులపై ఆధారపడి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం భిన్నమైన శిలలు, ఖనిజాలకు ప్రసిద్ధి చెందింది. అందువల్ల మన రాష్ట్రాన్ని ‘రత్నగర్భ’గా వ్యవహరిస్తారు. దేశంలో అత్యంత అరుదైన ఖనిజం ‘ఇంథనైట్’ను మొదటిసారిగా మన రాష్ట్రంలోనే గుర్తించారు.
భూపటలం నుంచి వెలికితీసే రెండు లేదా అంతకంటే ఎక్కువ రసాయనిక మూలకాలతో ఏర్పడే ముడి పదార్థాన్ని ‘ఖనిజం’ అంటారు. ఖనిజాలు సహజ సిద్ధంగా ఏర్పడతాయి. ఇవి పునరుద్ధరించలేని వనరులు. అందువల్ల వీటిని వివిధ ప్రణాళికా పద్ధతుల ద్వారా అభిలషణీయ రీతిలో వినియోగించుకోవాలి.
ఖనిజాలను ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:
లోహ ఖనిజాలు: తమ ద్వారా విద్యుత్‌ను ప్రసరింపజేసే ఖనిజాలను ‘లోహ ఖనిజాలు’ అంటారు.
ఉదా: ఇనుము, రాగి, వెండి, బంగారం, మాంగనీస్, జింక్, సీసం.
అలోహ ఖనిజాలు: తమ ద్వారా విద్యుత్‌ను ప్రసరింపజేయని ఖనిజాలను ‘అలోహ ఖనిజాలు’ అంటారు.
ఉదా: బెరైటీస్, జిప్సం, సున్నపురాయి, ఆస్‌బెస్టాస్, డోలమైట్, మైకా.
ఇంధన ఖనిజాలు: ఇంధనాలుగా ఉపయోగించే ఖనిజాలను ‘ఇంధన ఖనిజాలు’ అంటారు. వీటిలో శిలాజ ఇంధనాలు, అణు ఇంధనాలు అనే రెండు రకాల ఖనిజాలు ఉంటాయి.
1. శిలాజ ఇంధనాలు: మండించినప్పుడు శక్తిని విడుదల చేసే వాటిని ‘శిలాజ ఇంధనాలు’ అంటారు.
ఉదా: బొగ్గు, పెట్రోల్, డీజిల్.
2. అణు ఇంధనాలు: భార, అస్థిర కేంద్రకాలను కలిగి ఉండి, న్యూట్రాన్‌తో తాడనం చెందించినప్పుడు సమాన భారాలున్న రెండు కేంద్రకాలుగా విడిపోయి అత్యధిక శక్తిని విడుదల చేసే ఖనిజాలను ‘అణు ఇంధనాలు’ అంటారు.
ఉదా: థోరియం, యురేనియం.
  • దక్షిణ భారతదేశంలో బొగ్గు నిక్షేపాలు ఉన్న ఏకైక రాష్ట్రం - తెలంగాణ.
  • రంగారెడ్డి జిల్లాలోని తాండూర్‌లో నీలి సున్నపురాయి బండలు లభిస్తున్నాయి. వీటినే ‘షాబాద్ బండలు’గా వ్యవహరిస్తారు. వీటిని దక్షిణ భారతదేశంలో అత్యధికంగా గచ్చు కోసం ఉపయోగిస్తున్నారు.
  • కరీంనగర్ జిల్లాలో ప్రత్యేకత ఉన్న ‘టాన్ బ్రౌన్ గ్రానైట్’ నిల్వలు ఉన్నాయి. వీటిని ప్రైవేట్ రంగంలో పెద్ద మొత్తంలో ఎగుమతి చేస్తున్నారు.

ప్రధాన ఖనిజాలు

బొగ్గు (కోల్)
250 మిలియన్ ఏళ్ల కిందట జరిగిన ప్రకృతి ఉత్పాతాల వల్ల ‘గోండ్వానా బొగ్గు’ ఏర్పడింది. ఈ బొగ్గు తెలంగాణతో పాటు జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. గోండ్వానా బొగ్గు అత్యంత నాణ్యమైన ద్వితీయ శ్రేణి బొగ్గు. ఇది ‘బిట్యూమినస్’ రకానికి చెందింది.
  • తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు నిల్వలు ప్రధానంగా ‘ప్రాణహిత - గోదావరి’ లోయ ప్రాంతంలో అధికంగా ఉన్నాయి.
  • తెలంగాణలో బొగ్గు నిక్షేపాలు విస్తరించి ఉన్న జిల్లాలు - ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్.
  • బొగ్గు నిల్వలు అధికంగా ఉన్న జిల్లా - ఆదిలాబాద్ కాగా, బొగ్గును అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఖమ్మం.
  • దేశం మొత్తం మీద ఉన్న బొగ్గు నిల్వల్లో 20 శాతం మన రాష్ట్రంలోనే ఉన్నాయి.
  • 2013-14లో సింగరేణి సంస్థ ద్వారా ఉత్పత్తి చేసిన మొత్తం బొగ్గు 50.5 మిలియన్ టన్నులు. బొగ్గు ఆధారంగా వివిధ పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఇనుము - ఉక్కు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, సిమెంట్, రైల్వేస్, గృహ సంబంధ ఇంధన పరిశ్రమలు ముఖ్యమైనవి.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్: తెలంగాణ రాష్ట్రంలో విస్తరించి ఉన్న బొగ్గును సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) వెలికి తీస్తుంది. దీన్ని మొదట 1886లో ఒక ప్రైవేట్ బ్రిటిష్ కంపెనీ నెలకొల్పింది. 1920లో దీన్ని హైదరాబాద్ నిజాం కొనుగోలు చేశాడు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం దీన్ని జాతీయం చేసింది. ఈ సంస్థ భారత, తెలంగాణ ప్రభుత్వాల ఉమ్మడి కంపెనీ. తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఈ కంపెనీ ప్రస్తుతం 15 ఓపెన్ కాస్ట్ గనుల్లో, 35 భూగర్భ గనుల్లో తవ్వకాలు చేపడుతోంది. ఈ కంపెనీలో సుమారు 65,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. దీని ప్రధాన కార్యాలయం ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో ఉంది.

ఇనుము (ఐరన్)
నాణ్యత ఆధారంగా ఇనుప ఖనిజాన్ని నాలుగు రకాలుగా విభజించవచ్చు.
అవి: మాగ్నటైట్, హెమటైట్, లియోనైట్, సిడరైట్.
రాష్ట్రంలో ఇనుము అధిక మొత్తంలో హెమటైట్ రూపంలో, తక్కువ మొత్తంలో మాగ్నటైట్ రూపంలో లభిస్తోంది.
  • తెలంగాణలో ఇనుము విస్తరించి ఉన్న జిల్లాలు - ఖమ్మం (బయ్యారం, చెరువుపురం, నావపాడు, కొత్తగూడెం), ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్.
  • ఆదిలాబాద్ జిల్లాలోని బిత్వాల్, కల్లాడ, రస్తూరాబాద్, రోబాన్‌పల్లి, లక్సెట్టిపేట్ మొదలైన ప్రాంతాల్లో ‘మాగ్నటైట్’ రకానికి చెందిన ఇనుప ఖనిజం నిల్వలు ఉన్నాయి.
ఇనుము ఆధారిత పరిశ్రమలు: ఉక్కు, స్పాంజ్ ఐరన్, పిగ్ ఐరన్ మొదలైనవి.

బెరైటీస్ (ముగ్గురాయి)
తెలంగాణ రాష్ట్రంలో బెరైటీస్ (ముగ్గురాయి) ప్రధానంగా ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో విస్తరించి ఉంది. బెరైటీస్‌ను అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా - ఖమ్మం.
  • ఖమ్మం జిల్లాలో బెరైటీస్ గనులు విస్తరించి ఉన్న ప్రాంతాలు: రుద్రంకోట, వెంకటాయపాలెం, గోపాల్‌పూర్, బాలాపేట్, కోడంపూర్, చెరువుపురం.
  • మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తరించి ఉన్న ప్రాంతాలు: బొల్లారం, వీరభద్ర దుర్గం.
  • ముగ్గురాయి ఆధారిత పరిశ్రమలు: పెట్రోలియం వెలికితీత, రంగులు, టైర్లు, రబ్బరు వస్తువులు, పేపర్స్, రసాయనాల పరిశ్రమలు.
మాంగనీస్
  • ఇది ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉంది. ఈ జిల్లాలోని భీమసరి, అంతంపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి ప్రాంతాల్లో విస్తరించి ఉంది.
  • మాంగనీస్ ఆధారిత పరిశ్రమలు: సిమెంట్, కార్బైడ్, ఇనుము - ఉక్కు, సోడాయాష్, రసాయనాలు, చక్కెర, పేపర్, ఎరువులు, గాజు మొదలైనవి.
సున్నపురాయి
రాష్ట్రంలో బొగ్గు నిల్వల తర్వాత అధిక విస్తీర్ణంలో ఉన్న ఖనిజం సున్నపురాయి. ఇది ప్రధానంగా నల్లగొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో విస్తరించి ఉంది. దీన్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా నల్లగొండ.
  • సున్నపురాయిని సిమెంట్ పరిశ్రమలో ముడి ఖనిజంగా ఉపయోగిస్తారు.
  • తెలంగాణ రాష్ట్ర ఖనిజ వనరుల అభివృద్ధి సంస్థ ఆదిలాబాద్ జిల్లాలోని దేవపూర్ మైన్‌లో 210 హెక్టార్ల విస్తీర్ణంలో సున్నపురాయి నిల్వలను వెలికితీసింది.
గ్రానైట్
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో గ్రానైట్ నిక్షేపాలు విస్తరించి ఉన్నాయి.
  • గ్రానైట్ ఆధారిత పరిశ్రమలు: కటింగ్ అండ్ పాలిషింగ్ ఇండస్ట్రీస్, గృహాలంకరణ, స్మారక నిర్మాణాలు, ఫ్లోరింగ్ పరిశ్రమలు.
అమెథిస్ట్ క్వార్‌‌ట్జ
తెలంగాణ రాష్ట్రంలో మెదక్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో అమెథిస్ట్ క్వార్‌‌ట్జ నిక్షేపాలు విస్తరించి ఉన్నాయి. ఈ రకం రాళ్లను ఆభరణాల తయారీ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు.

బంకమట్టి (జంబాలాలు)
సూక్ష్మ రేణుయుతంగా ఉండే మెత్తని మట్టిని సాధారణంగా బంకమట్టి (జంబాలాలు) అంటారు. జంబాలాలు అనేవి అవక్షేప నిక్షేపాలు. కయొలిన్ (చైనా జంబాలం), అగ్ని సహన జంబాలం, బాల్ జంబాలం వీటిలో ముఖ్యమైన రకాలు. దీన్ని ప్రధానంగా పింగాణి సామగ్రి తయారీలో వాడతారు. దీంతోపాటు ఇటుకలు, పెంకులు, డ్రైనేజీ గొట్టాలు, సిమెంట్ తయారీలోనూ ఉపయోగిస్తారు.
  • బంకమట్టి (జంబాలాలు) విస్తరించి ఉన్న జిల్లాలు: ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్.
యురేనియం
నల్లగొండ జిల్లాలోని లంబపూర్, పెద్దగట్టు, బిట్రియాల్, కుప్పునూర్, ఆర్.వి. తండ మొదలైన ప్రాంతాల్లో సుమారు 1600 టన్నుల యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు అంచనా వేశారు. వీటి వెలికితీత కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మార్బుల్
మార్బుల్ నిక్షేపాలు ఎక్కువగా ఖమ్మం జిల్లాలో విస్తరించి ఉన్నాయి. వీటిని గృహాలంకరణ వస్తువుల తయారీలో, ఫ్లోరింగ్‌లో ఉపయోగిస్తారు. ప్రానెల్స్‌గానూ వాడతారు.

బంగారం
రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలోని కిన్నెరసాని, గోదావరి నదుల సంగమ ప్రాంతం; వరంగల్ జిల్లాలోని మంగపేట; మహబూబ్‌నగర్ జిల్లాలోని అత్కూర్, గద్వాల్ ప్రాంతాల్లో బంగారం నిల్వలు ఉన్నాయి.

వజ్రాలు
మహబూబ్‌నగర్ జిల్లాలోని బొల్లారం, అమర్‌గిరి, సోమశిల, మద్దె మడుగు ప్రాంతాల్లో డైమండ్ గనులు విస్తరించి ఉన్నాయి.

ఫెల్‌స్పార్
నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఈ నిక్షేపాలు ఉన్నాయి.
  • నల్లగొండ జిల్లాలో అత్యంత నాణ్యమైన ఫెల్‌స్పార్ ముడి ఖనిజం లభిస్తోంది.
  • ఫెల్‌స్పార్ ఆధారిత పరిశ్రమలు: సిరామిక్స్, గాజు, అబ్రాసిక్, ఎనామిల్, ఎలక్ట్రికల్, కొలిములు మొదలైనవి.
  • అత్యంత అరుదైన రేడియోధార్మిక ఖనిజమైన ‘ఇంథనైట్’ను దేశంలోనే తొలిసారిగా మహబూబ్‌నగర్ జిల్లాలోని ‘అక్కారం’ ప్రాంతంలో గుర్తించారు.
  • ఖమ్మం జిల్లాలో లభించే రేడియో ధార్మిక ఖనిజ మూలకాలు: కోరండం, గార్నెట్, గెలీనా, జిర్కోన్, కయోనైట్.
  • ఖమ్మం జిల్లాలో లభించే ఇతర ముఖ్యమైన ఖనిజ మూలకాలు: క్రోమైట్, డోలమైట్, రాగి, మైకా, గ్రాఫైట్.
  • క్వార్‌‌ట్జ నిక్షేపాలు మహబూబ్‌నగర్, నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.
  • కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో స్పియటైట్ నిల్వలు ఉన్నాయి.
Published date : 26 Oct 2015 05:42PM

Photo Stories