Skip to main content

ప్రవేశిక - తాత్విక పునాదులు (Preamble - Philosophical Foundations)

ఏ ప్రజాస్వామ్య రాజ్యాంగమైనా సాధారణంగా ప్రవేశికతోనే ప్రారంభమవుతుంది. భారత రాజ్యాంగం కూడా ప్రవేశికతోనే మొదలైంది. ప్రవేశికకు బదులు పీఠిక, అవతారిక, ముందుమాట, ఉపోద్ఘాతం లాంటి పర్యాయ పదాలను వాడతారు. ప్రవేశికనే ఆంగ్లంలో ‘Preamble’ అంటారు. ప్రవేశిక రాజ్యాంగం లక్ష్యాలను, ఆదర్శాలను, మూలతత్వాన్ని సూచనప్రాయంగా తెలుపుతుంది. రాజ్యాంగాన్ని ఏ ఉన్నత ఆశయాలతో రచించారు, ఏ తరహా ప్రభుత్వాన్ని, ఎలాంటి సమాజాన్ని నిర్మించాలని భావించారు మొదలైన అంశాలను స్పష్టీకరిస్తూ రాజ్యాంగ నిర్మాతలు ముందుమాటగా తెలుపుతారు.
ప్రవేశిక-ఆధారం:
ప్రవేశిక ఉన్న మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. మన రాజ్యాంగంలో ప్రవేశిక భావాన్ని అమెరికా నుంచి గ్రహించినప్పటికీ, అందులోని లక్ష్యాలు, ఆధారాలకు డిసెంబర్ 13, 1946న రాజ్యాంగ పరిషత్ సమావేశంలో జవహర్‌లాల్ నెహ్రూ ప్రతిపాదించిన ‘ఆశయాల’ తీర్మానమే ప్రధాన ప్రాతిపదిక. ఫ్రెంచి రాజ్యాంగం నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, గణతంత్రం అనే అంశాలను గ్రహించారు. ఐక్య రాజ్య సమితి చార్టర్‌లోని ప్రవేశిక కూడా భారత రాజ్యాంగానికి ఆధారమని చెప్పవచ్చు. భారత రాజ్యాంగ ప్రవేశికకు నందన్ లాల్ బోస్ అనే శిల్పి నగిషీ చెక్కారు.

ప్రవేశిక-పదజాలం, భావాలు అర్థవివరణ
ప్రవేశికలో గొప్ప భావజాలాన్ని ప్రయోగించారు. ప్రతి పదానికి, భావానికి ఒక విశిష్ట అర్థాన్ని, పరమార్థాన్ని ఆపాదించవచ్చు. ‘భారత ప్రజలమైన మేము’ అని ప్రవేశిక ప్రారంభమవుతుంది. ప్రజలే రాజకీయాధికారానికి మూలం, ప్రజలే రాజ్యాంగాన్ని రచించుకున్నారని దీని అర్థం.

రాజకీయ స్వభావాన్ని తెలియజేసే పదాలు:
భారతదేశం ఏ తరహా రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుందో, దాని స్వభావం ఏమిటో స్పష్టంగా పేర్కొన్నారు.
సార్వభౌమత్వం (Sovereignty): సార్వభౌమత్వం అంటే సర్వోన్నత అధికారం అని అర్థం. భారతదేశం అంతర్గతంగా సర్వోన్నత అధికారాన్ని, బాహ్యంగా విదేశీ, దౌత్య విధానాల్లో స్వేచ్ఛ (External Independence and Internal Supremacy)ను కలిగి ఉంటుంది. ఏ బాహ్య శక్తీ మన విదేశాంగ విధానాన్ని నియంత్రించలేదు.
సామ్యవాదం (Socialist): ఈ పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చారు. సామ్యవాదం అంటే సమసమాజ స్థాపన. ప్రజల మధ్య ఆర్థిక అంతరాలను క్రమేణా తగ్గించడం. ఉత్పత్తి శక్తులను (Land, labour and capital) ప్రభుత్వం నియంత్రించడం ద్వారా సంపద కొద్ది మంది వ్యక్తుల చేతిలో కేంద్రీకృతం కాకుండా, సాధ్యమైనంత వరకు జాతీయం చేయడం. తద్వారా ప్రజలకు సమాన అవకాశాలతో పాటు వాటిని అందిపుచ్చుకోవడానికి అవసరమైన తోడ్పాటు అందిస్తారు.
సామ్యవాదానికి వివిధ రూపాలున్నాయి. కమ్యూనిజం, మావోయిజం, సిండికాలిజం, గిల్డ్ సోషలిజం, ఫెబియనిజం, స్టేట్ సోషలిజం మొదలైన రూపాలు వివిధ దేశాల్లో అమల్లో ఉన్నాయి. భారతదేశంలో ప్రజాస్వామ్యవాదం (Democratic Socialism) అమల్లో ఉంది. దీన్నే ‘రాజ్యాంగ సామ్యవాదం’ అంటారు. అంటే ఆర్థిక వ్యవస్థలో చట్టపరంగా నిర్దిష్ట పద్ధతిలో మార్పులు చేపడతారు. మన సామ్యవాదం గాంధీయిజం+మార్క్సిజంల మేలు కలయిక. కానీ గాంధీతత్వం వైపు కొంత మొగ్గు కనిపిస్తుంది. ప్రపంచీకరణ, ఆర్థిక ఉదారవాదం, ప్రైవేటీకరణ నేపథ్యంలో సామ్యవాదతత్వం మసక బారుతోందని చెప్పవచ్చు.
లౌకిక తత్వం (Secular): ఈ పదాన్ని కూడా 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చారు. లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయం లేని రాజ్యం. లౌకిక దేశాల్లో అధికార మతం, మత వివక్ష ఉండవు. మత విషయంలో పౌరులకు స్వేచ్ఛ, సమానత్వం ఉంటాయి. మతపరంగా ఎవరికి ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం లేదా నష్టం వాటిల్లదు. అధికార మతం ఉన్న రాజ్యాలను మతస్వామ్య రాజ్యం (Theocratic State) అంటారు.
ఉదా: పాకిస్తాన్, బంగ్లాదేశ్.
ప్రజాస్వామ్యం (Democracy): ప్రజాస్వామ్యం అంటే ప్రజలతో, ప్రజల కోసం, ప్రజల వల్ల ఏర్పాటు చేసిన ప్రభుత్వం. అంటే ప్రజలే పాలితులు, పాలకులని అబ్రహం లింకన్ నిర్వచించారు. భారత్‌లో పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అమల్లో ఉంది. ఎలాంటి వివక్ష లేకుండా కేవలం నిర్ణీత వయసున్న పౌరులందరికీ ఓటు హక్కు, ప్రభుత్వ పదవులకు పోటీ చేసే హక్కును కల్పించారు. పాలన చట్టపరంగా(Rule of law) జరుగుతుంది. చట్టబద్ధత లేకుండా ఏ చర్యా చెల్లుబాటు కాదు. సాధారణంగా ఏ వ్యక్తికీ ప్రత్యేక హోదా లేదా మినహాయింపు ఉండదు.
గణతంత్ర (Republic): ‘గణం’ అంటే ప్రజలు, తంత్రం అంటే పాలన. ఇది ప్రజాపాలన. వారసత్వ లేదా అధికార హోదాలు ఉండవు. భారత రాష్ర్టపతి, ఇతర ప్రజా పదవుల్లోని వ్యక్తులను నిర్ణీత కాలానికి ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. లేదా పరోక్షంగా ఎన్నికవుతారు. బ్రిటిష్ రాణి/రాజు తరహాలో వారసత్వ అధికారం ఉండదు.
సామాజిక ఆశయాలు (Social Objectives): ప్రవేశికలో కొన్ని ఉదాత్తమైన ఆశయాలను పొందుపరిచారు. రాజ్యాంగం ద్వారా వాటిని సాకారం చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు.

న్యాయం
న్యాయం అంటే ఒక సర్వోన్నతమైన సమతా భావన. అసమానతలు, వివక్షలు లేని ఆదర్శ సమాజాన్ని నిర్మించడం. రాజ్యాంగంలో మూడు రకాల న్యాయాలను ప్రస్తావించారు.
రాజకీయ న్యాయం (Political Justice): రాజ్య కార్యకలాపాల్లో పౌరులంతా ఎలాంటి వివక్ష లేకుండా పాల్గొనడమే రాజకీయ న్యాయం. సార్వజనీన ఓటు హక్కు, పోటీ చేసే హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, విజ్ఞాపన హక్కు మొదలైనవి రాజకీయ న్యాయ సాధనకు ప్రాతిపదికలుగా పేర్కొనవచ్చు.
సామాజిక న్యాయం (Social Justice): సమాజంలో పౌరులంతా సమానులే. జాతి, మత, కుల, లింగ, పుట్టుక అనే తేడాలు లేకుండా అందరికీ సమాన హోదాను, గౌరవాన్ని కల్పించడమే సామాజిక న్యాయం. అన్ని రకాల సామాజిక వివక్షలను రద్దు చేయడం, సామాజికంగా వెనుకబడిన వర్గాలు, కులాలు, తెగల అభ్యున్నతికి కృషి చేయడం ఇందులో భాగం.
ఆర్థిక న్యాయం (Economic Justice): ఆర్థిక అంతరాలను తగ్గించడం, సంపద ఉత్పత్తి, పంపిణీ, వృత్తి, ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు, పేదరిక నిర్మూలన, ఆకలి నుంచి విముక్తులను చేయడం.

ఉన్నత ఆదర్శాలు
స్వేచ్ఛ (Liberty):
నిజమైన ప్రజాస్వామ్య రాజ్య స్థాపనకు, ఉదాత్త నాగరిక, సామాజిక జీవనానికి స్వేచ్ఛాయుత వాతావరణం అవసరం. స్వేచ్ఛ అంటే నిర్హేతుకమైన పరిమితులు, నిర్భంధాలు లేకుండా వ్యక్తి పరిపూర్ణ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పించడం. ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, ఆరాధనలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛ ఉండాలి. ఉదా: లౌకిక రాజ్య స్థాపనకు పునాది మత స్వేచ్ఛ.
సమానత్వం (Equality): ప్రజాస్వామ్యంలో అతి ముఖ్య ఆదర్శం సమానత్వం. అంటే అన్ని రకాల అసమానతలను, వివక్షలను రద్దు చేసి, ప్రతి వ్యక్తి వికాసానికి అవసరమైన అవకాశాలను కల్పించడం.
సౌభ్రాతృత్వం (Fraternity): సౌభ్రాతృత్వం అంటే సోదర భావం అని అర్థం. పౌరుల మధ్య సంఘీభావం, పరస్పర గౌరవం ఉండాలి. అసమానతలు, వివక్షలు లేనప్పుడు పౌరుల మధ్య సోదరభావం వర్థిల్లుతుంది. సార్వజనీన సోదర భావాన్ని పెంపొందించే ఉద్దేశంతో సౌభ్రాతృత్వం అనే భావనను ప్రవేశికలో పొందుపరచాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రతిపాదించారు.
ఐక్యత, సమగ్రత (Unity & integrity): ఐక్యతా భావం దేశ ప్రజలు కలిసి ఉండేందుకు దోహదం చేస్తుంది. ఇది ఒక మానసిక ఉద్వేగం (Psychlological emotion). మతం, కులం, ప్రాంతం లాంటి సంకుచిత ఆలోచనలకు అతీతమైన ఆదర్శం. సమగ్రత అనే పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. సమగ్రత ప్రజల్లో జాతీయ దృక్ఫథాన్ని పెంపొందిస్తుంది.
సమగ్రతను చేర్చాల్సిన ఆవశ్యకత: 1970 తరువాత దేశంలో అనేక ప్రాంతాల్లో ప్రాంతీయవాదం, వేర్పాటువాదం తలెత్తాయి. దేశ సమగ్రతను దెబ్బతీసేలా మిలిటెంట్ పోరాటాలు జరిగాయి. ఈ నేపథ్యంలో సమగ్రత అనే పదాన్ని చేర్చాల్సిన పరిస్థితి అనివార్యమైంది.

ప్రవేశిక సవరణకు అతీతం కాదు
ఆర్టికల్ 368 ప్రకారం ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉందని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ప్రవేశిక రాజ్యాంగ మౌలిక నిర్మాణం అనే నిర్వచనం పరిధిలోకి వస్తుంది కాబట్టి దాని సారాంశం (Spirit) మార్చకుండా, ప్రాముఖ్యతను ద్విగుణీకృతం చేసేలా నిర్మాణాత్మకంగా సవరణలు చేయవచ్చని స్పష్టం చేసింది. అందువల్ల స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదం, లౌకికతత్వం, సమగ్రత అనే పదాలను చేర్చారు. ఇప్పటి వరకూ ఒకసారి మాత్రమే ప్రవేశికను సవరించారు.

ప్రవేశిక-పాఠ్యాంశం
‘భారత ప్రజలమైన మేము భారతదేశానికి సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకునేందుకు, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని; ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలో స్వాతంత్య్రాన్ని; అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తి గౌరవాన్నీ, జాతీయ సమైక్యతనూ, సమగ్రతనూ సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26వ తేదీన మా రాజ్యాంగ పరిషత్‌లో ఆమోదించి, శాసనంగా రూపొందించుకొన్న రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం’.

పవేశిక - విమర్శనాత్మక పరిశీలన
వివాదాలు - సుప్రీంకోర్టు తీర్పులు
రాజ్యాంగ సారాంశం మొత్తం ప్రవేశికలో నిక్షిప్తమై ఉంటుంది. ఇది రాజ్యాంగంలో అంతర్భాగమా, కాదా అనే అంశంపై సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పులను వెలువరించింది. 1960లో బెరుబారి వర్సెస్ యూనియన్ కేసులో సుప్రీంకోర్టు ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని పేర్కొంది. ఈ సందర్భంలో ప్రకరణ 143 ప్రకారం సలహా పూర్వక అభిప్రాయాన్ని చెప్పింది. కానీ 1973లో కేశవానంద భారతి కేసులో తీర్పునిస్తూ దీనికి పూర్తి భిన్నంగా.. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమేనని వ్యాఖ్యానించింది. 1995లో ఎల్‌ఐసీ ఆఫ్ ఇండియా కేసులో కూడా అత్యున్నత ధర్మాసనం ఇదే అభిప్రాయాన్ని పునరుద్ఘాటించింది.
రాజ్యాంగ పరిషత్‌లో ప్రవేశికపై ఓటింగ్ నిర్వహించినప్పుడు కూడా ‘ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం’ అని డాక్టర్ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఈ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు స్థిరీకరించింది.

ప్రవేశిక ప్రయోజనం
ప్రవేశిక రాజ్యాంగ ఆత్మ, హృదయం. ఇది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను తెలుసుకోవడానికి ఆధారం. ఇది రాజ్యాంగానికి సూక్ష్మరూపం (Constitution in Miniature). ఇందులో రాజ్యాంగ తాత్విక పునాదులు ఉన్నాయి.

ప్రయోజనాలు
  • ఇది రాజ్యాంగ ఆధారాలను తెలుపుతుంది.
  • రాజ్యాంగ ఆమోద తేదీని తెలుపుతుంది.
  • రాజ్యాంగాన్ని సక్రమంగా వ్యాఖ్యానించడానికి న్యాయస్థానాలకు చట్టపర సహాయకారిగా ఉపయోగపడుతుంది
విమర్శ
  • ప్రవేశికకు న్యాయ సంరక్షణ (Non-Justiciable) లేదు. ఇందులో పేర్కొన్న ఆశయాలను అమలు పరచకపోతే న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు.
  • ఇందులో పేర్కొన్న భావజాలానికి నిర్దిష్ట నిర్వచనాలు లేవు.
  • హక్కుల ప్రస్తావన లేదు.
  • శాసనాధికారాలకు ఇది ఆధారం కాదు.
  • సమకాలీన ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, ఆర్థిక సరళీకరణ నేపథ్యంలో ప్రవేశికలోని కొన్ని ఆదర్శాలు అమలుకు నోచుకోవట్లేదని చెప్పవచ్చు.
ప్రవేశిక - పరిశీలన
భారత రాజ్యాంగానికి హృదయం, ఆత్మగా పరిగణిస్తున్న ప్రవేశిక ప్రాముఖ్యంపై భిన్న అభిప్రాయాలున్నాయి. ప్రవేశికకు న్యాయ సంరక్షణ లేదు. అంటే ఇందులో పొందుపర్చిన ఆశయాలు, లక్ష్యాలు స్వతంత్రంగా అమల్లోకి రావు. వాటిని అమలుపరచాలని పౌరులు న్యాయస్థానాన్ని ఆశ్రయించలేరు. ఆ విధంగా న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయలేవు. కాబట్టి అత్యంత పవిత్రమైన ఈ ఆశయాలకు ఆచరణ లేదా అమలు చేయకపోవడం వల్ల వాటి సార్థకతపై తీవ్ర విమర్శ ఉంది. అయితే రాజ్యాంగంలోని ప్రకరణల భావం లేదా ఆచరణీయతపై సక్రమంగా వ్యాఖ్యానించడానికి ప్రవేశికలోని సారాంశాన్ని న్యాయస్థానాలు ప్రాతిపదికగా తీసుకుంటాయి. ప్రవేశికకు స్వతంత్రంగా ప్రాముఖ్యం లేకపోయినా, ఇందులోని ఆదర్శాలను అమలు చేస్తూ పార్లమెంటు చట్టం చేసినప్పుడు లేదా ఆ విధంగా చేసిన చట్టాలను అమలు చేయనప్పుడు, న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు.
ప్రవేశిక - సుప్రీంకోర్టు తీర్పులు వివాదం
సంవత్సరం సుప్రీంకోర్టు తీర్పు సారాంశం
ఎ.కె. గోపాలన్ కేసు 1950 ప్రవేశిక రాజ్యాంగ ప్రకరణల అర్థాన్ని, పరిధిని నియంత్రిస్తుంది.
బెరుబారి వర్సెస్ యూనియన్ కేసు 1960 ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు.
గోలక్‌నాథ్ కేసు 1967 ప్రవేశిక రాజ్యాంగ ఆదర్శాలకు, ఆశయాలకు సూక్ష్మ రూపం.
కేశవానంద భారతి కేసు 1973 ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమే. మౌలిక నిర్మాణం పరిధిలోకి వస్తుంది. పరిమితంగా సవరించవచ్చు.
ఎక్సెల్ వేర్ కేసు 1979 సామ్యవాదం పద నిర్వచనం.
నకారా కేసు 1983 సామ్యవాదం అనేది గాంధీయిజం, మార్క్సిజం కలయిక.
ఎస్.ఆర్.బొమ్మాయ్ కేసు 1994 లౌకికతత్వం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలోకి వస్తుంది.
ఎల్.ఐ.సి. ఆఫ్ ఇండియా 1995 ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమని పునరుద్ఘాటించింది.
అశోక్‌కుమార్ గుప్తా కేసు 1997 సామాజిక న్యాయం అనేది ప్రాథమిక హక్కు.
అరుణా రాయ్ కేసు 2002 విద్యా సంస్థల్లో మత విలువల బోధన లౌకికతత్వానికి వ్యతిరేకం కాదు.

ప్రవేశికపై ప్రముఖుల అభిప్రాయాలు
  • ప్రవేశిక అనేది భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజకీయ జాతకం (Political Horoscope) -కె.యం. మున్షీ
  • రాజ్యాంగంలో ప్రవేశిక అత్యంత పవిత్ర మైన భాగం. ఇది రాజ్యాంగ ఆత్మ. రాజ్యాంగానికి తాళంచెవి లాంటిది. - పండిట్ ఠాకూర్‌దాస్ భార్గవ
  • రాజ్యాంగానికి ప్రవేశిక ఒక గుర్తింపు పత్రం లాంటిది. - ఎం.ఎ. నాని పాల్కీవాలా
  • రాజ్యాంగానికి ప్రవేశిక కీలక సూచిక లాంటిది. అలాంటి సూచికలు సాధారణంగా పాశ్చాత్య రాజ్య వ్యవస్థలో ఉంటాయి. ఇది భారత రాజ్యాంగంలో ఉన్నందుకు నేను పులకించి గర్వపడుతున్నాను. - సర్ ఎర్నస్ట్ బార్కర్
  • ప్రవేశిక మన కలలు, ఆలోచనలకు రాజ్యాంగంలో వ్యక్తీకరించుకున్న అభిమతం. - అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
  • భారత రాజ్యాంగ ప్రవేశిక అమెరికా స్వతంత్ర ప్రకటన మాదిరిగానే రాజ్యాంగ ఆత్మ. రాజకీయ వ్యవస్థ స్వరూపం, పవిత్ర నిర్ణయాన్ని తెలియజేస్తుంది. విప్లవం తప్ప మరొకటి దీన్ని మార్చలేదు. - జస్టిస్ హిదయతుల్లా
  • ప్రవేశిక ఒక నిశ్చితమైన తీర్మానం, హామీ. - నెహ్రూ
  • రాజ్యాంగ ప్రాధాన్యాల లక్షణ సారం ప్రవేశిక. - మథోల్కర్
  • ప్రవేశిక అనేది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, లక్ష్యాలను తెలుసుకోవడానికి ఒక తాళంచెవి లాంటిది. - జె. డయ్యర్
  • ప్రవేశిక రాజ్యాంగానికి ఆధారం కాదు, అలాగే పరిమితి కాదు. - సుప్రీంకోర్టు
Published date : 06 Nov 2015 04:52PM

Photo Stories