Skip to main content

ద్రవ్యం - బ్యాంకింగ్

ద్రవ్యం, బ్యాంకింగ్ విషయాన్ని నాలుగు అంచెలుగా చర్చించాల్సిన అవసరం ఉంది. మొదటి దశలో ద్రవ్యం, చలామణీ, ద్రవ్య సరఫరా మొదలైన విషయాలు; రెండో దశలో భారతీయ బ్యాంకుల వ్యవస్థ, నిర్మాణం, బ్యాంకింగేతర విత్త సంస్థల స్థితిగతులు, పనితీరు; మూడో అంచెలో బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు, వచ్చిన మార్పులు; నాలుగో అంచెలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ పరపతి విధానం, క్రమబద్ధీకరణలను పరిశీలిద్దాం..
మానవ కార్యకలాపాలన్నింటికీ కేంద్ర బిందువు ద్రవ్యం. ప్రస్తుతం ద్రవ్యం పాత్రలేని సమాజాన్ని ఊహించలేం. సమాజంలోని ప్రజలు తమ దైనందిన లావాదేవీల కోసం ద్రవ్యాన్ని ఉపయోగిస్తారు. మొత్తం మీద మానవుడి ఆవిష్కరణలన్నింటిలో ద్రవ్యం అత్యద్భుతమైందని చెప్పొచ్చు.
కొంత మంది ఆర్థిక శాస్త్రవేత్తలు ద్రవ్యాన్ని కనుక్కోవడం మానవ సమాజ నాగరికతా పరిణతిలో ఒక అద్భుతమైన ఆవిష్కరణగా పరిగణిస్తారు. మానవ జీవన గమనాన్నే మార్చేసిన ‘చక్రం’ ఆవిష్కరణ ఎంత శక్తిమంతమైందో.. ద్రవ్యం ఆవిష్కరణ కూడా అంతే బలీయమైందిగా భావిస్తారు. ఆధునిక ప్రపంచంలో ద్రవ్యం చేతిలో లేకుంటే మానవుడి జీవితం ఒక్క క్షణం కూడా గడవదు. అందుకే ‘ధనం మూలం ఇదమ్ జగత్’ అన్నారు.

ఉనికిలోకి వచ్చిన తీరు..
ఆదిమ సమాజాల్లో మానవుల మధ్య దైనందిన కార్యకలాపాల్లో తమ తక్షణ అవసరాల కోసం ఆదాన ప్రదానాలు, వినిమయ వ్యవహారాలు ‘వస్తు మార్పిడి’ పద్ధతి ద్వారా జరుగుతుండేవి. ఆ తర్వాత దాదాపు అయిదు వేల ఏళ్ల కిందట ధాన్యాలు, దినుసులు, పశువులు, గవ్వలు, ఆల్చిప్పలు, పూసలు, తోలు, బిళ్లల పరస్పర మార్పిడి ద్రవ్య రూపాన్ని సంతరించుకున్నట్లు ఒక వాదం వినిపిస్తోంది. అంటే.. వీటన్నింటినీ ద్రవ్యంగా పరిగణించడం మానవ జీవన గమనంలో ‘వస్తు మార్పిడి’ దశ నుంచి ఒక మెట్టు పైకి వచ్చినట్లేనని గమనించవచ్చు. మానవ నాగరికతా పురోగమనంలో అయిదు వేల ఏళ్ల క్రితమే ‘ద్రవ్యం’ అనే మాధ్యమాన్ని వస్తు మార్పిడి వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ప్రవేశపెట్టారని చరిత్రకారులు చెబుతారు. సామాజిక శాస్త్రవేత్త గ్రీబర్ ‘ద్రవ్యం’ వస్తు మార్పిడికి ప్రత్యామ్నాయంగా వచ్చిందనడంలో బలమైన ఆధారాలు కనిపించడం లేదని వాదించాడు.
ఏదేమైనా ద్రవ్యం చాలా శక్తిమంతమైన మాధ్యమంగా ప్రపంచ గమనాన్ని నిర్దేశిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు ‘ద్రవ్యం’ అంటే ఏమిటి? ఎలా నిర్వచించాలి?! ఆర్థికవేత్త క్రౌథర్ ప్రకారం.. ఏదైనా సాధనం మార్పిడికి మాధ్యమంగా ఉండి, వస్తువులు, వ్యవస్థల సేవలు లేదా చెల్లింపులకు ఉపయోగపడుతూ, ‘విలువ’ను కొలిచే కొలబద్ధగా కానీ, విలువను నిక్షిప్తం చేసుకోగలిగి భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేవిధంగా కానీ ఉంటే దాన్ని ‘ద్రవ్యం’గా నిర్వచించవచ్చు.

ద్రవ్యం విధులు
‘ద్రవ్యం’ నాలుగు స్పష్టమైన విధులను నిర్వర్తించగలిగే లక్షణాలు, సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఆ నాలుగు ముఖ్యమైన విధులను కిందివిధంగా పేర్కొనవచ్చు..
  1. మార్పిడి మాధ్యమం: వస్తువులు, సేవలు, కొనుగోలు, అమ్మకం.. ఎలాంటి మార్పిడికైనా తక్షణ ఆమోదం పొందగలిగిన సామర్థ్యం ద్రవ్యానికి ఉంది. వ్యక్తులు, వ్యవస్థలు, ఎల్లలు అడ్డం లేకుండా స్వేచ్ఛగా విశ్వవ్యాప్త ఆమోదం పొందగలిగిన సామర్థ్యం దీనికి ఉంది.
  2. విలువ కొలమానం: ఒక సామాన్య కొలమాన విలువగా ద్రవ్యం ఉపయోగపడుతుంది. మనం మార్కెట్‌లో ఏదైనా వస్తువు కొన్నప్పుడు దాని ధరను ద్రవ్య రూపంలో చెల్లిస్తాం. అంటే ఆ వస్తువు విలువ ద్రవ్యంగా చెల్లించే ధర అన్నమాట. ఆ వస్తువు విలువను ద్రవ్య రూపంలో లెక్కిస్తున్నాం. ఆర్థికవేత్తలు శాస్త్రబద్ధంగా ద్రవ్యాన్ని ‘పద్దుల కొలమాన మాత్రిక’గా నిర్వచిస్తారు. దూరాన్ని కిలోమీటర్లలో; సమయాన్ని సెకన్లు, నిమిషాలు, గంటలు; బరువును కిలోలలో కొలిచినట్లుగానే.. విలువ మార్పిడికి ‘తులనామాత్రిక’గా పద్దులు నిర్వహించడంలో ద్రవ్యం ఉపయోగపడుతుంది.
  3. విలువ నిక్షిప్తిక: మానవుడు తన డబ్బు, సంపదను ప్రస్తుత అవసరాలకే కాకుండా.. భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే విధంగా దాచుకోవడానికి ఇష్టపడతాడు. దీన్ని భూమి, ఇళ్లు, బంగారం.. ఇలా వివిధ ఆస్తి రూపాల్లో భద్రపరచుకుంటాడు. అయితే వీటన్నింటినీ ద్రవ్య రూపంలోకి మార్చుకుంటేనే మార్కెట్‌లో వివిధ వస్తువులను, వాహనాలను, టీవీలను లేదా స్మార్ట్ ఫోన్లను కొనుక్కోవడానికి వీలవుతుంది. అంటే ద్రవ్యానికి ఒక అద్భుతమైన ద్వంద్వ లక్షణ సహజత్వం ఏక కాలంలో ఉంటుందని గమనించాలి. అవి.. 1) తక్షణ చెల్లింపులు చేపట్టగలిగే సామర్థ్యం, 2) భవిష్యత్తు అవసరాల కోసం విలువను నిబిడీకృతం చేసుకున్న ‘విలువ నిక్షిప్తిక’గా వ్యవహరించగల సామర్థ్యాన్ని సంతరించుకోవడం. ఈ విలువను ఎన్ని రకాలుగానైనా రూపాంతరించుకొని, ఆకలి దప్పులను తీర్చుకోవడమే కాకుండా.. మానవ అవసరాలను తీర్చే శక్తి ఉండటం వల్లే సమాజంలో ద్రవ్యానికి అపారమైన విలువను ఆపాదించారు. అందుకే ద్రవ్యం విలువ నిక్షిప్తికగా సర్వకాలీన, సర్వ శక్తి సంపన్నమైన అజేయశక్తి రూపంగా, పెట్టుబడిదారీ సమాజానికి మూలస్తంభంగా నిలుస్తోంది.
  4. చెల్లింపుల ప్రమాణం: ద్రవ్యం తక్షణ లావాదేవీల్లోనే కాకుండా వాయిదాలతో కొంతకాలం తర్వాత చెల్లించే లేదా ఒక గడువు తర్వాత చెల్లించుకునే సౌలభ్యాన్ని కలుగజేస్తుంది. అంటే.. అందరికీ ఆమోదయోగ్యమైన ఒక ప్రమాణంగా అంగీకరించినందువల్ల ద్రవ్యాన్ని విలంబనా చెల్లింపుల ప్రమాణంగా నిర్వచించారు. ఈవిధంగా ఇది నాలుగో విధిని నిర్వర్తిస్తుంది.
ద్రవ్య చలామణి, సరఫరా
ద్రవ్య సరఫరాకు సంబంధించి ప్రతి దేశం తనకంటూ ఓ ప్రత్యేక పద్ధతిని రూపొందించుకుంటుంది. ప్రస్తుత ఆధునిక సమాజ అనుక్రమంలో ప్రపంచంలోని ప్రతి దేశం తమ ప్రజల ద్రవ్య అవసరాల కోసం ఒక కేంద్ర బ్యాంకును ఏర్పాటు చేసుకుంది. ఈ బ్యాంకు ఆ దేశ రాజ్యాంగ పరిధిలో పని చేయాల్సి ఉంటుంది. మన దేశంలో ‘భారతీయ రిజర్వ్ బ్యాంకు’ కేంద్ర బ్యాంకుగా వ్యవహరిస్తోంది. దేశ అవసరాలకు అనుగుణంగా, ద్రవ్య వ్యవస్థను, ద్రవ్య విధాన నీతిని ఇది పర్యవేక్షిస్తోంది. భారతదేశంలో రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగు ద్రవ్య సరఫరా కొలమానాలను నిర్వచించింది. అవి..
M1 = కరెన్సీ + డిమాండ్ డిపాజిట్లు + ఇతర డిపాజిట్లు. ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న ద్రవ్య రూపాన్ని కరెన్సీ అంటారు. ప్రజల దగ్గర ఉన్న నాణేలు, కాగితపు నోట్లు మొదలైనవి కరెన్సీ. డిమాండ్ డిపాజిట్లు అంటే ప్రజలు తమ స్వల్పకాలిక అవసరాల కోసం బ్యాంకుల్లో జమ చేసుకున్న డిపాజిట్ల సొమ్ము. M1ను ‘న్యారో మనీ’ అంటారు.
M2 = M1+ పోస్టాఫీసుల్లో ప్రజలు జమ చేసుకున్న పొదుపు ఖాతాలు.
M3 = M1 + ప్రజలు బ్యాంకుల్లో జమ చేసుకున్న కాల వ్యవధి డిపాజిట్లు (ఫిక్స్‌డ్ లేదా స్థిర డిపాజిట్లు). M3ని విస్తృత లేదా విశాల ద్రవ్యంగా పరిగణిస్తారు. దీన్నే బ్రాడ్ మనీ అంటాం.
ఇటీవల కాలంలో M4ను ప్రవేశపెట్టారు. M4 = M3 + పోస్టాఫీసుల్లో జమ అయిన మొత్తం ప్రజాధనం.
ఈ ద్రవ్యాంశికలను ద్రవ్యంలోని ముఖ్యమైన అంగాలుగా పరిగణించవచ్చు. ఇవి కాకుండా ప్రభుత్వ నియంత్రణలో తక్షణ అవసరాల కోసం కేవలం ప్రభుత్వాధిపత్యంలో మాత్రమే ఉండే ద్రవ్యాన్ని రిజర్వు ద్రవ్యం లేదా ప్రభుత్వ ద్రవ్యంగా నిర్వచించవచ్చు.
రిజర్వు మనీ (RM) = కరెన్సీ (C) + ఇతర డిపాజిట్లు (OD) + క్యాష్ రిజర్వులు (CR) లేదా నగదు నిల్వలు.
అంటే.. RM = C + OD + CR.
సామాన్య ద్రవ్య సిద్ధాంతం ప్రకారం - ద్రవ్య సరఫరాను.. ‘ద్రవ్య సరఫరా (M) నగదు నిల్వల (RM) పురోగమన ప్రమేయం’గా నిర్వచించవచ్చు. అంటే.. M అనేది RMకు ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటే M ↑ = f(RM) ↑. నగదు నిల్వల పరిమాణం పెరిగితే ద్రవ్య సరఫరా పెరుగుతుందని గమనించాలి. మన ప్రభుత్వం.. కోశాగారంలో లేదా టంకశాలలో సాధికారంగా ముద్రించే కరెన్సీని 'చట్టపర చెల్లింపు ద్రవ్యం', 'ఫియట్ మనీ' లేదా 'లీగల్ టెండర్'గా పరిగణిస్తాం. రూ. 2, 5, 10, 20, 50, 100, 500, 1000 ఏ నోటైనా దానిపై "I promise to pay the bearer the sum of ........ rupees' అని ఉంటుంది. దీన్నే ఫియట్ మనీ, లీగల్ టెండర్ లేదా చట్టపర చెల్లింపు ద్రవ్యంగా అర్థశాస్త్రంలో నిర్వచిస్తారు.

ద్రవ్య విధానం
చారిత్రకంగా చూస్తే.. 1930లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఆర్థిక వేత్తలు దీన్ని ‘మహా మాంద్యం’ (గ్రేట్ డిప్రెషన్)గా అభివర్ణించారు. ఈ మాంద్యం ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ మూలాలను నుంచి కుదిపేసిన తరుణంలో రెండు ఆర్థిక విధానాలు ఆవిర్భవించాయి. అవే ద్రవ్య విధానం(మానిటరీ పాలసీ), కోశ విధానం (ఫిస్కల్ పాలసీ). వీటికి ఆద్యుడు బ్రిటిష్ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్. ఈ రెండు విధానాలు ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. ధరల పెరుగుదల, డిమాండ్ తరుగుదల, ద్రవ్యోల్బణం, పెట్టుబడి ప్రోత్సాహకాలు, వివిధ రకాల పన్నుల పెంపు లేదా తగ్గింపు లాంటివన్నీ ఈ రెండు విధానాల పరిధిలోకి వస్తాయి.
ద్రవ్య విధానంలో రెండు అత్యంత ముఖ్యమైన సాధనాలు ఉంటాయి. అవి:
1. పరిమాణాత్మక పరపతి నియంత్రణ చర్యలు.
2. ఎంపిక చేసిన పరపతి నియంత్రణ చర్యలు.
ఈ రెండు పద్ధతులు కూడా బ్యాంకింగ్ ప్రక్రియలో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి.
ద్రవ్య సిద్ధాంతంలో.. ‘ద్రవ్య భాండారం’, ‘ద్రవ్య చలామణి’ అనే రెండు సూత్రాంశాలను పరిగణిస్తారు. ద్రవ్య భాండారం లేదా మనీస్టాక్ అనేది మార్కెట్‌లో ఒక సమతౌల్య ద్రవ్యరాశిని సూచిస్తుంది. ఇది ఒక నిశ్చల (స్టాటిక్) మాత్రిక. అంటే స్టాక్. కానీ ద్రవ్య చలామణి లేదా సరఫరా అనేది ఒక నిర్టిష్టమైన ద్రవ్యరాశిని సూచించే ప్రవర్తనా ప్రమేయం. వివిధ ఆదాయ, వడ్డీ స్థాయిలకు అనుగుణంగా కాల పరిమితికి లోబడి నిర్ణాయకంగా సూచించే ద్రవ్యరాశిని చలామణి ద్రవ్యంగా పేర్కొంటాం. డిమాండ్, సప్లయ్ శక్తుల ఆధారంగా నిర్ణయించే ద్రవ్యరాశినే సమతౌల్య ద్రవ్యరాశిగా నిర్వచిస్తాం.
మనదేశంలో ద్రవ్య సరఫరాను రిజర్వ్ బ్యాంకు విధానమే నిర్ణయిస్తుంది. ద్రవ్య సరఫరాలో ఒడుదొడుకులు ఉంటే వడ్డీ రేట్లను సవరించడం ద్వారా పెంచాలా, తగ్గించాలా అనే నిర్ణయం తీసుకుంటారు. ధరలు పెరుగుతున్న ద్రవ్యోల్బణ కాలంలో వడ్డీ రేట్లను పెంచడం ద్వారా ద్రవ్య సరఫరాను తగ్గించి మార్కెట్‌లోని ద్రవ్య చలామణిని నియంత్రిస్తారు. దీన్నే ‘కఠిన ద్రవ్య నీతి’ (టైట్‌మనీ పాలసీ) అంటారు. దీనికి విరుద్ధంగా వడ్డీరేట్లను తగ్గించి ద్రవ్య చలామణిని పెంచే దిశలో పయనించడాన్ని ‘సరళ ద్రవ్య నీతి’ లేదా ‘విస్తరణ ద్రవ్య సరఫరా విధానం’గా వ్యవహరిస్తారు. ఏ దేశంలోనైనా ద్రవ్య విధాన నీతి అనేది ఆ దేశ స్థూల ఆర్థిక విధానానికి అనుగుణంగా ఆ పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుంది. అంటే.. స్థూల ఆర్థిక విధానం దేశ అభివృద్ధి గమనాన్ని, సంపదను పెంపొందించుకునే మార్గంలో లక్ష్యాలను నిర్దేశిస్తే ద్రవ్య విధానం దానికి లోబడి పని చేయాల్సి ఉంటుంది.
ఎన్నో దేశాల్లో ఆచరిస్తున్న విధంగానే మనదేశంలోనూ స్థూల ఆర్థిక విధానం సంపూర్ణ ఉద్యోగిత, ధరల స్థిరీకరణ, సత్వర ఆర్థిక పురోగతి, విదేశీ వ్యాపార చెల్లింపుల సమతౌల్యం, సమధర్మ పంపిణీ (అన్ని వర్గాలకు సమాన ఆదాయ, సంపద పంపిణీ) లాంటి లక్ష్యాలను కలిగి ఉంది.

బ్యాంకింగ్ రంగం
ఖాతాదారుల నుంచి డబ్బు స్వీకరించి భద్రపరచడం, వారికి అవసరానికి డబ్బు ఇవ్వడం, స్వీకరించిన ధరావతులకు కాలానుగుణంగా వడ్డీలు చెల్లించడం, అప్పులు ఇవ్వడం (వారి స్తోమతను బట్టి), తీసుకున్న అప్పులకు వడ్డీ చెల్లించడం లేదా వసూలు చేయడం తదితర ద్రవ్య సంబంధ కార్యకలాపాలను నిర్వహించే వ్యవస్థను బ్యాంకింగ్ రంగంగా నిర్వచిస్తాం. బ్యాంకింగ్ వ్యవహారాలు నిర్వర్తించే సంస్థనే బ్యాంకుగా గుర్తిస్తాం. చెక్కులు, డ్రాఫ్టులు, ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు లేదా ఒక స్థలం నుంచి మరో స్థలానికి ద్రవ్య బదలాయింపులు నిర్వహించడం ద్వారా ఇంకా మరెన్నో ద్రవ్య లావాదేవీలకు బ్యాంకులు ఆలవాలంగా ఉంటాయి. ద్రవ్య సేవల పరిశ్రమగా బ్యాంకును పేర్కొనవచ్చు. బ్యాంకులు లేనికాలంలో సామాన్యుడి నగదు లావాదేవీలు, రుణ అవసరాలను స్థానిక వడ్డీ వ్యాపారులు తీరుస్తుండేవారు.
భారతదేశంలో మొదటి బ్యాంకును 1786లో ‘ది జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ పేరుతో నెలకొల్పారు. ఈస్ట్ ఇండియా కంపెనీ 1809లో ‘ది బ్యాంక్ ఆఫ్ బెంగాల్’ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఎన్నో ప్రెసిడెన్సీ బ్యాంకులు ఆవిర్భవించాయి. వీటన్నింటినీ బ్రిటిషర్లే నిర్వహించేవారు. స్వాతంత్య్రానంతరం 1949లో భారత ప్రభుత్వం బ్యాంకింగ్ క్రమబద్ధీకరణ చట్టాన్ని ప్రవేశపెట్టింది. 1965లో ఈ చట్టాన్ని సవరించింది. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు మొదటగా జాతీయ స్ఫూర్తితో 1953లో మొదలయ్యాయి. బ్రిటిష్ వారసత్వంగా వచ్చిన ఇంపీరియల్ బ్యాంక్‌ను.. ‘భారతీయ స్టేట్ బ్యాంక్’గా మార్చి జాతీయం చేశారు. ఇందిరా గాంధీ హయాంలో 14 ప్రైవేట్ వాణిజ్య బ్యాంకులను 1969 జూలై 19న జాతీయం చేశారు.
1980వ దశకం తర్వాత దశల వారీగా ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించాల్సిన ఆవశ్యకత ఉందనే, ప్రభుత్వం తన పరిధిని తగ్గించుకోవడం అవసరం అనే ప్రతిపాదనలు వచ్చాయి. నరసింహన్ కమిటీ సిఫారసుల మేరకు 1993లో సవరించిన బ్యాంకుల క్రమబద్ధీకరణ చట్టం అమలైంది. ఈ చట్టం ద్వారా మరిన్ని ప్రైవేట్ వాణిజ్య బ్యాంకులకు, పెట్టుబడులకు ద్వారాలు తెరిచినట్లైంది. ఈ దశను బ్యాంకింగ్ రంగంలో మూడో స్థాయి సంస్కరణగా చెప్పవచ్చు. ఇది విస్తృత స్థాయి స్థూల ఆర్థిక సరళీకరణ సంస్కరణల్లో భాగంగా గమనించవచ్చు. అంటే.. అన్ని రంగాలకు వర్తిస్తూ 1991-92ల్లో జరిగిన సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణలో భాగంగానే బ్యాంకింగ్ సంస్కరణలను అర్థం చేసుకోవాలి. ఈ దశలోనే బ్యాంకింగ్ రంగం సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకుంది. బ్యాంకింగ్ రంగాన్ని కంప్యూటర్లతో అనుసంధానిస్తూ ఆన్‌లైన్ నగదు బదిలీలను, ప్లాస్టిక్ మనీ (క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు)ని ప్రవేశపెట్టారు.
ప్రస్తుతం భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణాన్ని కింది విధంగా పేర్కొనవచ్చు.
1.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు: ఇందులో పబ్లిక్ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు ఉంటాయి. పబ్లిక్ రంగ బ్యాంకుల్లో ఎస్‌బీఐ, దాని అనుబంధ బ్యాంకులు, ఇతర జాతీయ బ్యాంకులు ఉంటాయి.
3. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్‌ఆర్‌బీలు)
4. విదేశీ బ్యాంకులు
5. షెడ్యూల్డ్ సహకార బ్యాంకులు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంకింగ్ వ్యవస్థకు అధిపతి కేంద్ర బ్యాంకు, భారతీయ రిజర్వ్ బ్యాంకు(ఆర్‌బీఐ) మన కేంద్ర బ్యాంకు. 1934 రిజర్వ్ బ్యాంక్ చట్టం ద్వారా 1935 ఏప్రిల్ 1న భారతీయ రిజర్వ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. మొట్టమొదట ఇది వాటాదారుల బ్యాంకుగా రూ. 5 కోట్ల మూలధనంతో ఏర్పాటైంది. 1949 జనవరి 1న ఆర్‌బీఐని జాతీయం చేశారు. ఆర్‌బీఐకి గవర్నర్, నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. వీరితో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ఒక ప్రభుత్వ ప్రతినిధి, ప్రభుత్వంతో ప్రతిపాదితమైన వివిధ రంగాలను ప్రతిబింబించే పది మంది ప్రతినిధులు, స్థానిక బోర్డులను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన డెరైక్టర్లు కలిసి సమగ్ర నిర్వహణ బాధ్యత పర్యవేక్షిస్తారు. ఈ స్థానిక బోర్డులు ముంబై, కోల్‌కతా, న్యూఢిల్లీ, చెన్నై ప్రధాన కేంద్రాలుగా పనిచేస్తాయి. ప్రస్తుత ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్.
ఆర్‌బీఐ లక్ష్యాలు- విధులు: కరెన్సీని క్రమబద్ధం చేయడం, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య స్థిరత్వాన్ని, సుస్థిరతను సాధించడం, పటిష్టమైన ద్రవ్య విధానాన్ని అమలు పరుస్తూ పరపతి నియంత్రణ చేయడం, దేశంలోని వాణిజ్య బ్యాంకులకు మార్గదర్శిగా వ్యవహరించడం, దేశవ్యాప్తంగా ఒకే రీతిలో పరపతి విధానాన్ని అమలు చేయడం ఆర్‌బీఐ ప్రధాన లక్ష్యాలు. దీంతోపాటు కరెన్సీ నోట్ల జారీ గుత్తాధిపత్యం కూడా ఆర్‌బీఐదే. ఇది 2, 5, 10, 20, 50, 100, 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను జారీచేస్తుంది. ఒక రూపాయి నోట్లను మాత్రం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది.
అలాగే రిజర్వ్‌బ్యాంక్ కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకరుగా, ప్రతినిధిగా, సలహాదారుగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వానికి బ్యాంకింగ్ సౌకర్యాలను కల్పిస్తుంది. ద్రవ్య విధానాన్ని రూపొందించడం, ప్రభుత్వానికి సలహా ఇవ్వడమే కాకుండా అమలుపరిచే బాధ్యతను ఆర్‌బీఐ నిర్వహిస్తుంది. దీంతోపాటు బ్యాంకులకు బ్యాంకుగా వ్యవహరిస్తుంది అంటే.. వాణిజ్య బ్యాంకుల కార్యకలాపాలను నియంత్రిస్తుంది, పర్యవేక్షిస్తుంది. వాణిజ్య బ్యాంకుల అంతిమ రుణదాతగా వ్యవహరిస్తుంది. విదేశీ మారకంగా ఉపయోగించే బంగారం నిల్వలను, విదేశీ మారక ద్రవ్య నిల్వలను కూడా ఆర్‌బీఐ పరిరక్షిస్తుంది. వీటితోపాటు బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి పరచడం, వ్యవసాయ పరపతిని ప్రోత్సహించడం, పారిశ్రామికాభివృద్ధికి పరపతిని అందించడం లాంటి అభివృద్ధిపరమైన విధులను కూడా భారతీయ రిజర్వ్‌బ్యాంక్ నిర్వహిస్తుంది.

షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు
వాణిజ్య బ్యాంకులు.. షెడ్యూల్‌లో ఉన్నవి, షెడ్యూల్డ్ కానివి అని రెండు రకాలు. రిజర్వు బ్యాంకు 1934వ చట్టంలోని రెండో షెడ్యూల్‌లో పేర్కొన్న బ్యాంకులు షెడ్యూల్డ్ బ్యాంకులు. ప్రైవేట్, పబ్లిక్ సెక్టారు బ్యాంకులు, విదేశీ బ్యాంకులు.. అన్నీ షెడ్యూల్డ్ బ్యాంకులుగానే పరిగణిస్తారు. కానీ సహకార బ్యాంకులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. సహకార బ్యాంకులు షెడ్యూల్డ్ బ్యాంకులు కావు. షెడ్యూల్‌లో లేని బ్యాంకులన్నీ షెడ్యూల్డేతర వాణిజ్య బ్యాంకులు.

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను (రీజినల్ రూరల్ బ్యాంక్స్) 1970లో స్థాపించారు. ఇవి వాణిజ్య బ్యాంకులు నిర్వహించే విధులన్నింటినీ నిర్వహిస్తాయి. వీటి కార్యకలాపాలు గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులన్నీ భారతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ నియంత్రణలో ఉంటాయి. ప్రస్తుతం విలీన ప్రక్రియలో భాగంగా 25 గ్రామీణ బ్యాంకులను పదింటికి కుదించారు. మొత్తం దేశంలో ప్రస్తుతం 56 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

విదేశీ బ్యాంకులు
భారతదేశంలో విదేశీ బ్యాంకులు కొత్తగా వచ్చినవి కావు. బ్రిటిషర్ల పాలనకాలంలోనే విదేశీ బ్యాంకుల పరంపర ప్రారంభమైంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత విదేశీ బ్యాంకుల కార్యకలాపాలు తగ్గించారు. 1950లలో విదేశీ బ్యాంకులను జాతీయం చేయడం ద్వారా వాటి కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. విదేశీ మారక క్రమబద్ధీకరణ చట్టం పరిధిలో పని చేస్తున్న విదేశీ బ్యాంకులకు స్వతహాగా తమ కార్యకలాపాలు నిర్వహించే స్వేచ్ఛను మన ప్రభుత్వం కల్పించలేదు. తర్వాత కాలంలో ప్రభుత్వం సరళీకరణ ప్రక్రియను చేపట్టి విదేశీ మారక క్రమబద్ధీకరణ చట్టాన్ని విదేశీ మారక నిర్వహణ చట్టంగా మార్చింది (ఫెరా చట్టం ఫెమాగా మారింది). ఆ చట్టంలో విదేశీ బ్యాంకులకు వెసులుబాటు కల్పించారు. ప్రపంచీకరణ తర్వాత విదేశీ బ్యాంకులకు భారత కార్యకలాపాల్లో ప్రాచుర్యం కల్పించారు. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో 34 విదేశీ బ్యాంకులు దాదాపు 320 శాఖలతో ప్రధాన పట్టణాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఏబీఎన్-ఆమ్రో బ్యాంక్, ఏఎన్‌జడ్ గ్రిండ్లేస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఎమిరేట్స్, బ్యాంక్ ఆఫ్ అబుదాబీ ప్రధానమైన విదేశీ బ్యాంకులు.

షెడ్యూల్డేతర బ్యాంకులు
1934లోని బ్యాంకింగ్ చట్టంలో రెండో షెడ్యూల్‌లో ప్రస్తావించని బ్యాంకులను షెడ్యూలేతర బ్యాంకులు అంటారు. వీటి ప్రాముఖ్యం అంతగా లేదు. అయితే షెడ్యూల్‌లో లేని బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులై కొన్ని లాభాపేక్ష కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. జాతీయ స్థాయిలో వీటికి పెద్దగా ప్రాధాన్యం లేదు. ఇవి స్థానిక వ్యాపార కార్యకలాపాలకే పరిమితమైనట్లుగా భావించవచ్చు.

సహకార బ్యాంకులు
ప్రభుత్వ ప్రోత్సాహంతో, కొంతభాగం మూలధన పెట్టుబడి చేకూర్చడంతో ఈ సహకార బ్యాంకులను స్థాపించారు. ఇవి లాభాపేక్ష లేకుండా సహకార సూత్రంపై ఆధారపడి పనిచేస్తాయి. సహకార బ్యాంకుల నిర్మాణం నాలుగు స్థాయిల్లో ఉంటుంది. కేంద్ర సహకార బ్యాంకు ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకుల ఆధ్వర్యంలో జిల్లా సహకార బ్యాంకులు విధులు నిర్వహిస్తాయి. జిల్లా సహకార బ్యాంకుల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లోని గ్రామ ప్రాథమిక సహకార సంఘాలు పనిచేస్తాయి.

బ్యాంకింగ్ రంగంలో ఉపయోగించే పదాలు
ద్రవ్య విధానం, బ్యాంకింగ్ రంగంలో తరచూ ఉపయోగించే కొన్ని సాంకేతిక పారిభాషిక పదాల గురించి తెలుసుకుందాం.
బ్యాంకు రేటు
రిజర్వ్ బ్యాంకు ఇతర బ్యాంకులకు రుణ సదుపాయం కోసం ఏర్పరిచే కనీస వడ్డీ రేటు. ప్రస్తుతం బ్యాంకు రేటు 7.75%గా ఉంది.
నగదు నిల్వల నిష్పత్తి (క్యాష్ రిజర్వ్ రేషియో)
బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన నిర్దిష్ట నిధుల మొత్తం. ఆర్‌బీఐ సీఆర్‌ఆర్‌ను పెంచితే బ్యాంకుల వద్ద ఉండే ద్రవ్యం తగ్గిపోతుంది. షెడ్యూల్డ్ బ్యాంకులు కొంత నిర్దిష్ట ద్రవ్యాన్ని తప్పనిసరిగా ఆర్‌బీఐ వద్ద ఉంచాలి. దీన్నే సీఆర్‌ఆర్ అంటారు. ప్రస్తుత సీఆర్‌ఆర్ 4 శాతంగా ఉంది. సీఆర్‌ఆర్, వడ్డీ రేట్లు మార్కెట్‌లో చలామణిలో ఉన్న ద్రవ్య ప్రవాహ వేగానికి అడ్డుకట్ట వేయడానికి లేదా గతిశీలత పెంచడానికి ఉపయోగపడతాయి.
స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో (ఎస్‌ఎల్‌ఆర్)
వాణిజ్య బ్యాంకులు తమ రోజూవారీ వ్యాపారంలో కాలానుగత రుణాలు, బంగారం, ధరావతులు లేదా సెక్యూరిటీస్.. అన్నీ ద్రవ్యత్వ సంపత్తిగా అంటే లిక్విడ్ అసెట్స్‌గా కలిగి ఉంటాయి. బిజినెస్ డే ముగిసే సరికి ప్రతి బ్యాంక్ .. దాని రోజు వారీ నికర డిమాండ్, రుణాలు ద్రవ్యత్వ సంపత్తికి కనీస అనుపాతంలో ఉండేలా చూసుకోవాలి. ఈ కనీస అనుపాత రాశినే చట్టపర ద్రవ్యత్వ రాశి నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్)గా నిర్వచిస్తారు. ప్రస్తుతం ఆర్‌బీఐ సూచించిన రాశి 21.5 శాతం. ఇది మారుతూ ఉండవచ్చు.
రెపో రేటు
వాణిజ్య బ్యాంకులకు ధరావతుల (సెక్యూరిటీస్) ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ స్వల్పకాలిక అప్పుగా ఇచ్చే మొత్తంపై వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటు అంటారు. ప్రస్తుతం ఇది 6.75 శాతంగా ఉంది. ఇది ఆర్‌బీఐ సూచనల ప్రకారం మారుతూ ఉంటుంది.
రివర్స్ రెపో రేటు
వాణిజ్య బ్యాంకుల నుంచి తీసుకొనే అప్పుపై ఆర్‌బీఐ చెల్లించే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటు అంటారు. వ్యవస్థలో అధిక ద్రవ్యం ఉన్నప్పుడు ఆర్‌బీఐ రివర్స్ రెపో రేటును పెంచి బ్యాంకులు తమ అనుత్పాదక ద్రవ్యాన్ని ఆర్‌బీఐ వద్ద డిపాజిట్ చేసేలా చేస్తుంది. ప్రస్తుతం ఇది 5.75 శాతంగా ఉంది. ఇది కూడా మారుతూ ఉంటుంది.
Published date : 24 Nov 2015 12:11PM

Photo Stories