Skip to main content

భారతదేశం–వ్యవసాయ రంగం

  • అమెరికా, ఫ్రాన్స్, నార్వే, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ వంటి అభివృద్ధిచెందిన దేశాల్లో వ్యవసాయ రంగం వాటా సుమారు రెండు శాతం. ఈ రంగం రెండు శాతం మందికి ఉద్యోగితను కల్పిస్తోంది.
  • 2014–15లో భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో వ్యవసాయ రంగం 18 శాతం వాటాతో 48.9 శాతం ఉద్యోగితను కల్పించింది.
  • అందువల్ల మన దేశంలో వ్యవసాయాన్ని ప్రధాన రంగంగానేకాక ప్రజల జీవనాధార రంగంగా కూడా పేర్కొనొచ్చు.
  • మన దేశంలో వ్యవసాయ రంగం అతి పెద్ద అసంఘటిత రంగంగా 90 శాతం మంది (39. 7 కోట్ల మంది) శ్రామికులను కలిగి ఉంది.
  • వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువగా ఎగుమతి చేసే 13 దేశాల్లో భారత్‌ కూడా ఒకటి
  • పారిశ్రామిక, జాతీయాదాయ అభివృద్ధికి వ్యవసాయ రంగంతో అవినాభావ సంబంధం ఉంది. వ్యవసాయ రంగంలో ఒక శాతం వృద్ధి సాధిస్తే పారిశ్రామిక రంగంలో 0.5 శాతం, జాతీయాదాయంలో 0.7 శాతం వృద్ధి లభిస్తుంది.
  • మన దేశంలో 1940 తర్వాత పారిశ్రామిక రంగాన్ని ‘ప్రధాన ప్రేరణ శక్తి’(ప్రైమ్‌ మూవింగ్‌ ఫోర్స్‌)గా భావించినప్పటికీ మార్కెట్‌ శక్తులు విఫలం కావడంతో ఆ రంగం ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించలేకపోయింది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం 2002లో వ్యవసాయ రంగాన్ని ‘ప్రధాన ప్రేరణ శక్తి’గా ప్రకటించింది.
  • 2013–14లో ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 259 మిలియన్‌ టన్నులు కాగా రుతుపవనాలు అనుకూలంగా ఉండటంలో రికార్డు స్థాయిలో 263 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి జరిగింది.
  • 2014–15లో ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 261 మిలియన్‌ టన్నులు కాగా 252 మిలియన్‌ టన్నుల ఉత్పత్తే జరిగింది.
  • 2015–16లో ఉత్పత్తి లక్ష్యం 264 మిలియన్‌ టన్నులు కాగా 252.23 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి జరిగింది.
  • 2016–17లో ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 270.1 మిలియన్‌ టన్నులుగా నిర్ణయించారు.
  • వ్యవసాయ రంగం ఇప్పటికీ దాదాపు 66 శాతం రుతుపవనాలపైనే ఆధారపడి ఉంది. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తుల్లో ఒడిదొడుకులు సంభవిస్తున్నాయి.
  • మన దేశంలో వ్యవసాయ పంటల కాలాన్ని రెండు రకాలుగా పేర్కొంటారు. అవి.. 1. ఖరీఫ్‌ 2. రబీ.
  • జూలై నుంచి అక్టోబర్‌ వరకు నైరుతి రుతుపవనాల కాలాన్ని ఖరీఫ్‌గా పేర్కొంటారు. ఈ కాలంలో పండే ప్రధాన పంటలు వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ, సోయాచిక్కుడు, వేరుశెనగ, పత్తి మొదలైనవి.
  • అక్టోబర్‌ నుంచి మార్చి వరకు ఈశాన్య రుతుపవనాల కాలాన్ని రబీగా పేర్కొంటా రు. ఈ కాలంలో పండే ప్రధాన పంటలు గోధుమ, బార్లీ, ఓట్స్, అవిసె, ఆవాలు మొదలైనవి.
  • వ్యవసాయ గణనను 1970–71 నుంచి ఐదేళ్లకోసారి నిర్వహిస్తున్నారు. 2005–06లో 129 మిలియన్లు ఉన్న వ్యవసాయ కమతాలు 9వ వ్యవసాయ గణన(2010–11) నాటికి 138 మిలియన్లకు (6.61 శాతం) పెరిగాయి.
  • ఇదే కాలంలో సాగు విస్తీర్ణం 158.32 మిలియన్‌ హెక్టార్ల నుంచి 159.18 మిలియన్‌ హెక్టార్లకు (0.54 శాతం) పెరిగింది.
  • సగటు కమత పరిమాణం 1.23 హెక్టార్ల నుంచి 1.16 హెక్టార్లకు తగ్గింది. జనాభా పెరగడం వల్ల కమతాల విభజన, విఘటనతో వాటి పరిమాణం నానాటికీ తగ్గుతోంది.
  • రెండు హెక్టార్ల కన్నా తక్కువ భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతుల శాతం 84.97. మొ త్తం భూ విస్తీర్ణంలో వీరి వాటా 44.31 శాతం.
  • 10 హెక్టార్ల కన్నా ఎక్కువ భూమి ఉన్న రైతుల శాతం 0.73. మొత్తం భూమి విస్తీర్ణంలో వీరి వాటా 10.92 శాతం.
  • షెడ్యూల్డ్‌ కులాలు 12.40 శాతం, షెడ్యూల్డ్‌ తెగలు 8.71 శాతం వ్యవసాయ కమతాలను కలిగి ఉన్నారు.
  • దేశంలోని మొత్తం 137.76 మిలియన్ల కమతాల్లో ఉత్తరప్రదేశ్‌ 22.93 మిలియన్లతో ప్రథమ స్థానంలో ఉంది. 16.19 మిలియన్లతో బిహార్‌ రెండో స్థానంలో, మహారాష్ట్ర 13.70 మిలియన్లతో మూడో స్థానంలో ఉన్నాయి.
  • దేశంలో సాగయ్యే మొత్తం భూమి విస్తీర్ణం 159.18 మిలియన్‌ హెక్టార్లు. ఇందులో 21.14 మిలియన్‌ హెక్టార్లతో రాజస్థాన్‌ మొదటి స్థానంలో ఉండగా 19.84 మిలియన్‌ హెక్టార్లతో మహారాష్ట్ర రెండో స్థానంలో, 17.09 మిలియన్‌ హెక్టార్లతో ఉత్తరప్రదేశ్‌ మూడో స్థానాన్ని ఆక్రమించింది.
కమతాలు – రకాలు
కమతాలను మూడు రకాలుగా పేర్కొంటారు. అవి..
1. లాభసాటి కమతం
2. కుటుంబ కమతం
3. అభిలషణీయ కమతం

ఒక కుటుంబానికి సంతృప్తికర జీవన ప్రమాణాన్ని అందించడానికి అవసరమైన ఆదాయాన్నిచ్చే కమతాన్ని లాభసాటి కమతంగా పేర్కొంటారు.
సగటు కుటుంబానికి తగిన పని కల్పించే కమతాన్ని కుటుంబ కమతం అంటారు. దీనికి సంప్రదాయ యూనిట్‌గా నాగలిని పరిగణిస్తున్నారు.
ఒక కుటుంబానికి గరిష్టంగా ఉండాల్సిన కమతాన్ని అభిలషణీయ కమతం అంటారు.

వ్యవసాయ పరపతి
వ్యవసాయ పరపతిని మూడు రకాలుగా వర్గీకరించొచ్చు. అవి..
1. స్వల్ప కాలిక రుణాలు
2. మధ్య కాలిక రుణాలు
3. దీర్ఘకాలిక రుణాలు
  • తిరిగి చెల్లించాల్సిన కాల వ్యవధి 15 నెలల లోపు ఉండే రుణాలను స్వల్ప కాలిక రుణా లు అంటారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలు; కుటుంబ అవసరాల కోసం ఈ రుణాలు తీసుకుంటారు.
  • తిరిగి చెల్లించాల్సిన కాల వ్యవధి రెండు నుంచి ఐదేళ్ల వరకు ఉన్న రుణాలను మధ్య కాలిక రుణాలు అంటారు. భూమి పునరుద్ధరణ, వ్యవసాయ పనిముట్లు, పశువులు మొదలైనవాటి కోసం ఈ రుణాలు తీసుకుంటారు.
  • తిరిగి చెల్లించాల్సిన కాల వ్యవధి ఐదు నుంచి 15 ఏళ్ల వరకు ఉన్న రుణాలను దీర్ఘకాలిక రుణాలు అంటారు. ఖరీదైన వ్యవసాయ పనిముట్ల కొనుగోలు, పాత రుణాల చెల్లింపు, భూమి కొనుగోలు మొదలైనవాటి కోసం ఈ రుణాలు తీసుకుంటారు.

వ్యవసాయ పరపతికి ప్రధాన ఆధారాలను రెండు రకాలుగా పేర్కొనొచ్చు. అవి..

1. సంస్థాగతంకాని (ప్రైవేట్‌) పరపతి
2. సంస్థాపరమైన పరపతి

  • వడ్డీ వ్యాపారులు, భూస్వాములు, కమీషన్‌ ఏజెంట్లు మొదలైనవారు ఇచ్చే పరపతిని సంస్థాగతంకాని పరపతి అంటారు.
  • వాణిజ్య, సహకార బ్యాంకులు, ప్రభుత్వం అందించేది సంస్థాపరమైన పరపతి. దీన్ని ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను గణనీయంగా పెంచడం వ్యవసాయ పరపతి విధాన ప్రధానోద్దేశం.
  • మల్టీ ఏజెన్సీ నెట్‌వర్క్‌లో భాగమైన సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకుల ద్వారా రుణాలను పంపిణీ చేస్తూ వ్యవసాయ పరపతికి తగిన ప్రాముఖ్యత ఇస్తున్నారు.

నీటి పారుదల ప్రాజెక్టులను మూడు రకాలుగా పేర్కొనొచ్చు. అవి..
1. పెద్ద తరహా నీటి పారుదల ప్రాజెక్టులు: 10 వేల హెక్టార్లకు పైగా భూమికి నీరందించేవి.
2. మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టులు: 2,000 నుంచి 10,000 హెక్టార్ల భూమికి నీరందించేవి.
3. చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టులు: 2,000 హెక్టార్ల లోపు భూమికి నీరందించేవి.

హరిత విప్లవం

  • భూములకు నీటి పారుదల సౌకర్యాన్ని కల్పించి; యాంత్రీకరణను ప్రవేశపెట్టి; రసాయన ఎరువులను, క్రిమి సంహారక మందులను, సంకర జాతి వంగడాలను ఉపయోగించి స్వల్ప కాలంలో అధిక దిగుబడిని సాధించే వ్యవసాయ విధానాన్ని హరిత విప్లవం(గ్రీన్‌ రెవెల్యూషన్‌)గా పేర్కొనొచ్చు.
  • హరితవిప్లవం అనే పదాన్ని తొలిసారిగా(1968లో) విలియం గాడ్‌ ప్రయోగించాడు.
  • హరితవిప్లవం పితామహుడిగా నార్మన్‌ బోర్లాగ్‌ను పేర్కొంటారు.
  • భారతదేశ హరితవిప్లవ పితామహుడిగా ఎం.ఎస్‌.స్వామినాథన్‌ను పేర్కొంటారు.
  • ఈ విప్లవాన్ని రాక్‌ఫెల్లర్‌ ఫౌండేషన్‌ ఇతర దేశాలకు విస్తరింపజేసింది. ఈ మేరకు మెక్సికోలోని ఓ ప్రయోగశాలలో నార్మన్‌ బోర్లాగ్‌ నేతృత్వంలో విజయం సాధించిన మేలురకం మరుగుజ్జు గోధుమ విత్తనాలను స్ఫూర్తిగా తీసుకున్నారు.
  • భారత ప్రభుత్వం ఆ ప్రయోగశాల నుంచి గోధుమ విత్తనాలను దిగుమతి చేసుకొని పంజాబ్‌లో ప్రయోగాత్మకంగా పండించి దేశంలో హరితవిప్లవానికి నాంది పలికింది.
  • హరిత విప్లవాన్ని ఎక్కువగా పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌ రైతాంగం అమలుచేసి అధిక వ్యవసాయ ఉత్పత్తులు సాధించింది.
  • హరిత విప్లవ ప్రభావం వల్ల గోధుమల ఉత్పత్తి 11 మిలియన్‌ టన్నుల నుంచి 75 మిలియన్‌ టన్నులకు పెరిగింది.
  • సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకాన్ని(ఇంటెన్సివ్‌ అగ్రికల్చరల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రోగ్రామ్‌ఐఏడీపీని) ప్రభుత్వం 1961లో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఏడు జిల్లాల్లో ప్రవేశ పెట్టింది. దీన్ని ప్యాకేజ్‌ ప్రోగ్రామ్‌గా పేర్కొంటారు. తర్వాతి కాలంలో మరో 8 జిల్లాలకు విస్తరింపజేసి మంచి ఫలితాలు సాధించారు.
  • ప్యాకేజ్‌ ప్రోగ్రామ్‌ ముఖ్య ఉద్దేశం ఎంపిక చేసిన జిల్లాల్లో పరపతి సౌకర్యాల కల్పనతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం.
  • సాంద్ర వ్యవసాయ ప్రాంతాల పథకాన్ని(ఇంటెన్సివ్‌ అగ్రికల్చరల్‌ ఏరియా ప్రోగ్రామ్‌–ఐఏఏపీని) ప్రభుత్వం 1965లో ఫోర్డ్‌ ఫౌండేషన్‌ సిఫారసుల మేరకు 114 జిల్లాల్లో ప్రవేశపెట్టింది.
  • హరిత విప్లవంతో 1960 దశకంలో గోధుమలు, 1970 దశకంలో వరి ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. కానీ నూనె గింజలు, మొక్కజొన్న, బార్లీ వంటి కొన్ని పంటల విస్తీర్ణంలో ప్రతికూలతలు చోటుచేసుకున్నాయి. ఎరువులను, క్రిమిసంహారక మందులను విరివిగా వాడటం వల్ల భూసారం క్షీణించింది.
  • మేలు రకం వంగడాల వల్ల నీటి వాడకం పెరిగి వాటర్‌ టేబుల్‌ తగ్గింది.
  • 2006 జూన్‌ 3న భారత సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశంలో నాటి ప్రధాని మన్మోహన్‌రెండో హరిత విప్లవానికి పిలుపునిచ్చారు.
Published date : 06 Jan 2017 05:03PM

Photo Stories